breaking news
Ad - Sakshi_Home_Sticky
-
'కమలం టార్గెట్' రెండంకెల బలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండంకెల (డబుల్ డిజిట్) ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని కమలదళం ఉవ్విళ్లూరుతోంది. 17 ఎంపీ సీట్లకు గాను 10 నుంచి 12 స్థానాలు గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్రంలో అత్యధిక లోక్సభా స్థానాల్లో గెలుపొందిన పార్టీగా రికార్డు సృష్టించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీని, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో వెనక్కి నెట్టేలా ఫలితాలు రాబట్టాలని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఆ రెండు పార్టీల కంటే ముందుగా ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారాన్ని ముగించుకున్న బీజేపీ అదే దూకుడుతో ముందుకెళ్లాలని భావిస్తోంది. అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమాల్లో జాతీయ స్థాయి నేతలు పాల్గొనేలా వ్యూహరచన చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రేకెత్తిస్తోన్న కమలదళం, అగ్రనేతల పర్యటనలతో ప్రచార పర్వాన్ని మరింత వేడెక్కించే ప్రయత్నాల్లో ఉంది. మోదీ మ్యాజిక్పైనే ఆశలు రాష్ట్రంలో గత రెండు నెలల్లో ఐదు సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఓ విడత ప్రచారం పూర్తి చేయడంతో రాష్ట్ర పార్టీకి ఊపు వచ్చింది. మిగతా పార్టీల కంటే ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐదు రోజులు ఐదు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే రాష్ట్రంలో తొలివిడత ప్రచారాన్ని పూర్తిచేశారు. గత పదేళ్ల పాలనలో కేంద్రంలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతితో పాటు, గతంతో పోల్చితే వివిధ వర్గాల అభ్యున్నతి కోసం పెద్దయెత్తున అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరించారు. గత పదేళ్లలో తెలంగాణకు వివిధ పథకాల ద్వారా కేంద్రం చేకూర్చిన లబ్ధి, వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన నిధులు తదితరాలు వెల్లడించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీపై ప్రజల్లో సానుకూలత పెరిగిందని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి లభిస్తున్న మద్దతు, వరుసగా మూడోసారి మోదీ ప్రధాని అవుతారనే అభిప్రాయం.. తెలంగాణలోనూ గట్టిగా పనిచేస్తుందని, పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు సాధించి పెడుతుందని జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. పార్టీపరంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వివిధ సర్వేల్లో పార్టీకి ప్రజల్లో మద్దతు పెరిగిందని, మెజారిటీ ఎంపీ సీట్లలో గెలుపొందుతామని ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్యాచరణ వేగవంతం డబుల్ డిజిట్ లక్ష్య సాధనకు ఇప్పటికే ప్రాథమిక కసరత్తును పూర్తిచేసిన బీజేపీ.. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికల అమలును వేగవంతం చేసింది. వివిధ సామాజిక వర్గాలను కలుసుకునేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపడుతోంది. జిల్లాలు, పార్లమెంట్ నియోజక వర్గాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల స్థాయిలో వివిధ కుల సంఘాలతో సమ్మేళనాలు, యువత, మహిళలు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా వివిధ వర్గాల వారితో ఎక్కడికక్కడ వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లను పలుమార్లు కలవడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతల పర్యటనల సందర్భంగా మాత్రమే పెద్ద బహిరంగ సభలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. మిగతా ఎన్నికల ప్రచారమంతా ఇంటింటికీ వెళ్లడం, స్వయంగా ఓటర్లను కలవడం, కార్నర్ మీటింగ్లు లాంటి ఔట్ రీచ్ కార్యక్రమాల ద్వారా నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇంటింటి ప్రచారంలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం, ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్, పార్టీ జెండా, ఓటర్లకు ఎంపీ అభ్యర్థి విజ్ఞప్తి పత్రం (అప్పీల్) లాంటివి అందజేస్తున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో రెండోవిడత, వచ్చేనెల 9,10,11 తేదీల్లో మూడోవిడత ప్రచారాన్ని పూర్తిచేయనున్నారు. 4, 6, 8 తేదీల్లో మోదీ పర్యటన రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మే 4, 6, 8 తేదీల్లో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపేలా ఆయన పర్యటన ఉంటుందని సమాచారం. ఇందులో భాగంగా విమానాశ్రయానికి సమీపంలోని ఓ ఇండోర్ స్టేడియంలో ఐటీ వృత్తి నిపుణులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమై ఓ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. అదే విధంగా ఓటర్లలో యాభై శాతం మంది దాకా మహిళలు ఉండడంతో వీరిని ఆకట్టుకునేలా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మోదీతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయించింది. నల్లగొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్; ఖమ్మం ఎంపీ సీట్లలో ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేసేలా జనగామలో లేదా అక్కడికి దగ్గరలో మోదీ పాల్గొనేలా ఓ సభ నిర్వహించాలని భావిస్తోంది. అదేవిధంగా హైదరాబాద్లో లేదా నగర శివార్లలో జరిపే భారీ బహిరంగ సభతో తెలంగాణలో మోదీ ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నట్టు సమాచారం. రేపు రాష్ట్రానికి అమిత్ షా బీజేపీ అగ్రనేత అమిత్ షా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 11.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సిద్దిపేట చేరుకుంటారు. డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు సభ ఉంటుంది. అనంతరం 1.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని రెండున్నర గంటలపాటు అక్కడ ఉంటారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులతో సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి భువనేశ్వర్కు వెళ్తారు. -
మా మతం ఎవరినీ తక్కువగా చూడదు
శ్రీనగర్: ముస్లింలు చొరబాటుదారులు, తల్లులు, అక్కాచెల్లెళ్ల బంగారం, మంగళసూత్రాలను కాంగ్రెస్ దోచుకోవాలని చూస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి నేలబారు మాటలు మాట్లాడటం శోచనీయమన్నారు. ‘‘ ఇతర మతాలను కించపరచాలని మా మతం అస్సలు బోధించదు. హిందూ మహిళల మంగళసూత్రాలను ఏ ఒక్క ముస్లిం కూడా దోచుకోడు. అందరినీ సమానంగా చూడాలని ఇస్లాం ప్రభోదిస్తోంది. మేం నమ్మే మా మతం అన్ని మతాలకూ గౌరవం ఇవ్వాలనే చెబుతోంది. హిందూ తల్లి, సోదరి మంగళసూత్రాలను ముస్లిం దోచాడని నేను ఎక్కడా వినలేదు. అలా ఒకవేళ ఎక్కడైనా జరిగి ఉంటే అతను ముస్లిమే కాదు. అతను ఇస్లాంను సరిగా అర్థంచేసుకోలేదని అర్థం’’ అని అన్నారు. మంగళవారం రాజసాŠథ్న్లోని బాంసవాడా పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఫరూక్ మాట్లాడారు. ‘‘ ఒకరిని చంపితే మానవత్వాన్ని చంపేసినట్లేనని ఇస్లాం బోధనల్లో ఉంది. నేనూ ముస్లింనే. హిందువులను ద్వేషించాలని ఖురాన్లో ఎక్కడా లేదు. సిక్కులు, ముస్లింలను ఎంతగా ప్రేమిస్తానో హిందువుల పట్ల అంతే ప్రేమతో వ్యవహరిస్తా. ఇతర మతాల వాళ్లు అభివృద్ధిలోకి వస్తే వారితోపాటే మనమూ వృద్ధిలోకి వస్తాం. అప్పుడే దేశమే అభివృద్ధిపథంలో ముందుకెళ్తుంది’’ అని అన్నారు. బీజేపీ 2047 విజన్పై ఫరూక్ ఆరోపణలు గుప్పించారు. ‘‘ విజన్ 2047పై బీజేపీ ఎప్పుడూ వల్లెవేస్తోంది. 2047ను ఎందుకు పట్టుకుని వేలాడుతున్నారు?. అప్పటికల్లా దేశంలో పారదర్శకమైన ఎన్నికలు అనేవే లేకుండా చేయడం బీజేపీ ఉద్దేశం. అధికారాన్ని హస్తగతం చేసుకుని నచ్చినట్లు దేశాన్ని ఏలాలని భావిస్తోంది. రష్యాలో పుతిన్లాగా మోదీని బతికున్నంతకాలం ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ ఆశపడుతోంది’ అని ఫరూక్ వ్యాఖ్యానించారు. ‘‘ ముస్లింల పట్ల బీజేపీ వైఖరిని తెల్సుకోండి. ఆ తర్వాత ఆ పార్టీకి మద్దతు అవసరమా లేదా అని ఆలోచించండి’ అని కశ్మీర్ ప్రాంత పార్టీల నేతలను హెచ్చరించారు. -
వేలం వద్దు.. మేమే కేటాయిస్తాం.. మీ తీర్పును సవరించండి
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని 12 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. వేలం విధానంలో కాకుండా తామే కేటాయింపులు జరుపుతామని కోర్టుకు తెలిపింది. వేలం ద్వారా మాత్రమే కేటాయింపులు జరపాలంటూ ఇచ్చిన గత తీర్పును సవరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలాల ధర్మాసనం ఎదుట కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అభ్యర్థించారు. ఈ అంశంపై తక్షణం విచారణ చేపట్టాలని కోరారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్(ముందు వచ్చిన వారికే ప్రాధాన్యత) పద్ధతిలో యూపీఏ హయాంలో ఏ.రాజా టెలికం మంత్రిగా ఉన్నపుడు 2జీ స్పెక్ట్రమ్కు సంబంధించి కంపెనీలకు ఇచ్చిన 122 లైసెన్సులను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే. కొన్ని సందర్భాల్లో వేలంలో కాకుండా ప్రభుత్వమే కేటాయింపులు జరపాలని ఆశిస్తోందని, అందుకే పాత తీర్పును సవరించాలని అటార్నీ జనరల్ సోమవారం కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని, వివరాలను ఈ–మెయిల్లో పంపాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. అయితే తీర్పును సవరించాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. నాటి తీర్పు సమంజసంగానే ఉందని, సవరణ అనవసరమని ఆయన వాదించారు. ఆనాడు యూపీఏ సర్కార్కు వ్యతిరేకంగా 2జీ స్పెక్ట్రమ్పై ప్రజా ప్రయోజనా వ్యాజ్యం దాఖలుచేసిన ఎన్జీవో సంస్థ తరఫున ఆనాడు ప్రశాంత్భూషణే వాదించారు. కేటాయింపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని మన్మోహన్ ప్రభుత్వంలో నాటి కమ్యూనికేషన్స్, ఐటీ సహాయ మంత్రి కపిల్సిబల్ 2011లో వాదించారు. అయితే ఈ కేసులో ఎ.రాజా, డీఎంకే నాయకురాలు కనిమొళిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ 2017 డిసెంబర్ 21న ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరిచింది. ఈ తీర్పును సవాల్చేస్తూ సీబీఐ 2018 మార్చి 20న హైకోర్టును ఆశ్రయించింది. అక్రమ కేటాయింపుల వల్ల కేంద్ర ఖజానాకు రూ.30,984 కోట్ల నష్టం వాటిల్లిందని వాదించింది. వేలం విధానంలో జరగని కేటాయింపుల లైసెన్స్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. -
కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా విన్నా నేరమే
జైపూర్/రాయ్పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్పై మరోసారి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో ప్రజలు వారి మత విశ్వాసాలు పాటించడం చాలా కష్టమని, కనీసం హునుమాన్ చాలీసా వినడం కూడా పెద్ద నేరం అవుతుందని అన్నారు. మంగళవారం రాజస్తాన్లోని టోంక్, ఛత్తీస్గఢ్లోని శక్తి, ధామ్తారీ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇటీవల హనుమాన్ చాలీసా వింటున్న ఓ దుకాణదారుడిని దారుణంగా కొట్టారని గుర్తుచేశారు. రాజస్తాన్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్లు విసిరారని చెప్పారు. రాళ్లు విసిరినవారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి రక్షణ కల్పించారని, రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలపై ఆంక్షలు విధించారని మండిపడ్డారు. రాజస్తాన్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజల మత విశ్వాసాలను ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారని చెప్పారు. ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా హనుమాన్ చాలీసా పఠించవచ్చని, శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవచ్చని, ఇది బీజేపీ గ్యారంటీ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. రిజర్వేషన్లపై ఇదే నా గ్యారంటీ ‘‘మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో కోత విధించి, ముస్లింలకు కట్టబెట్టే పనికి శ్రీకారం చుట్టింది. 2004 నుంచి 2010 దాకా ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లను అమలు చేసేందుకు నాలుగుసార్లు గట్టిగా ప్రయతి్నంచింది. కానీ, చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో కాంగ్రెస్ ఉద్దేశం నెరవేరలేదు. 2011లో దేశవ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లను అమల్లోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సాగించిన కుట్రలు ఫలించలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కొల్లగొట్టి, మరో వర్గానికి ప్రయోజనం కల్పించాలని చూశారు. భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను కాంగ్రెస్ ఏనాడూ గౌరవించలేదు. దళితులు, వెనుకబడిన గిరిజనులకు కల్పించిన రిజర్వేషన్లను విభజించి, ముస్లింలకు ఇచ్చేస్తామని బహిరంగంగా ప్రకటించే ధైర్యం కాంగ్రెస్కు ఉందా? కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల నుంచి దొంగిలించి, ముస్లింలకు ఇచ్చిన కోటాను బీజేపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ల గడువు 2020లో ముగిసిపోగా, మేము మరో పదేళ్లు పొడిగించాం. దళితులకు, వెనుకబడిన గిరిజనులకు రిజర్వేషన్లు ఎప్పటికీ అంతం కాబోవని నేను గ్యారంటీ ఇస్తున్నా. మతం పేరిట ఎవరైనా రిజర్వేషన్లను విభజించాలని చూస్తే సహించే ప్రసక్తే లేదు. రాజ్యాంగాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. రాజ్యాంగానికి విధేయుడిగా నడుచుకుంటున్నా. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ను ఆరాధిస్తున్నా’’ నక్సలిజం, మావోయిజాన్ని అంతం చేస్తాం ‘‘ఛత్తీస్గఢ్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి హింసను ప్రోత్సహించింది. కాంగ్రెస్కు, అభివృద్ధికి పొత్తు పొసగదు. అవి రెండూ కలిసి ముందుకు సాగలేవు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి, హింస పెరిగిపోతాయి. ఈశాన్య రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు నక్సలైట్ల హింసాకాండ విపరీతంగా పెరిగింది. హింసాకాండలో ఒకవైపు జనం మరణిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకున్నారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అవినీతి, మావోయిస్టు హింసాకాండ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో నక్సలిజాన్ని, మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నా’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు’’ కాంగ్రెస్ వస్తే ప్రజల సొమ్ముపై ఎక్స్–రే ‘‘దేశంలో వనరులపై మొదటి హక్కు మైనార్టీలకే ఉందని కాంగ్రెస్ పాలనలో ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అన్నారు. ఇది యాదృచ్చికం కాదు. బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ సిద్ధాంతం. ప్రజల ఆస్తులను, కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకొని, కొందరు ఎంపిక చేసిన వ్యక్తులకు పంపిణీ చేయాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతోంది. కాంగ్రెస్తోపాటు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలను బయటపెడుతున్నందుకే ఆ పార్టీ నాయకులు నన్ను దూషిస్తున్నారు. నిజం మాట్లాడితే వారు భయపడుతున్నారు. వారి రహస్య ఎజెండాలను బహిర్గతం చేస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను నమ్ముకుంది. అందుకే రాజ్యాంగాన్ని కూడా లెక్కచేయకుండా వ్యవహరిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులను, సొమ్ములను ఎక్స్–రే తీస్తామని కాంగ్రెస్ యువరాజు చెబుతున్నారు. అంటే ప్రజలు తమ దగ్గరున్న డబ్బులు, బంగారాన్ని పెట్టెలో దాచి, గోడల్లో రహస్యంగా భద్రపరిచినా కాంగ్రెస్ నాయకులు ఎక్స్–రే ద్వారా కనిపెట్టి, స్వాధీనం చేసుకుంటారు. తర్వాత ఎంపిక చేసిన వ్యక్తులకు ఆ సొమ్ము పంపిణీ చేస్తారు. కాంగ్రెస్ చెబుతున్న సంపద పునఃపంపిణీ వెనుక ఉన్న అసలైన అర్థం ఇదే’’ దేశాన్ని విభజించే కుతంత్రమే ‘‘కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని మతం పేరిట ముక్కలు చేసింది. స్వాతంత్య్రం వచ్చాక మొదటిరోజు నుంచే బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల ప్రజలు అధికారంలో భాగస్వాములు కావడాన్ని ఆ పార్టీ జీరి్ణంచుకోలేకపోతోంది. మరో నాటకానికి తెరతీసింది. దేశాన్ని విభిజించే కుట్రలకు పాల్పడుతోంది. దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా మార్చాలని ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ఎంపీ డిమాండ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు గోవాలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయొద్దని అంటున్నారు. ఇది ముమ్మాటికీ దేశాన్ని విభజించే కుతంత్రమే. రాజ్యాంగాన్ని అమలు చేయొద్దనడం రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ను అవమానించినట్లు కాదా? తమపై రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దడానికి ప్రయతి్నస్తున్నారంటూ గతంలో జమ్మూకశ్మీర్లో కొందరు వ్యక్తులు గగ్గోలు పెడుతుండేవారు. మీరు(ప్రజలు) బీజేపీని ఆదరించాక ఆ వ్యక్తుల నోళ్లు మూతపడ్డాయి. జమ్మూకశ్మీర్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారతదేశం కాంగ్రెస్ను తిరస్కరించింది. అందుకే దేశాన్ని చిన్నచిన్న దేశాలుగా, దీవులుగా విడగొట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ నేడు గోవాలో రాజ్యాంగం అమలును అంగీకరించడం లేదు. రేపు దేశమంతటా అమలు చేయొద్దని చెప్పడం ఖాయం. దేశ అభివృద్ధి పట్ల కాంగ్రెస్కు ఒక విజన్ లేదు. పేదల సంక్షేమం గురించి ఆ పార్టీకి ఏబీసీడీ కూడా తెలియదు. ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది. బీజేపీ సంగతి పక్కన పెట్టండి. సాక్షాత్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దిగొచ్చినా సరే రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు’’ -
ఒడిశాలో బీజేపీ ఎన్నికల ప్రచారం.. రంగంలోకి 40 మంది స్టార్ క్యాంపెయినర్లు
లోక్సభ ఎన్నికల్లో 400పై చీలుకు స్థానాల్లో గెలిచే లక్ష్యంగా బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రత్యర్ధి గెలుపు అవకాశాల్ని మలుపు తిప్పేలా ఎన్నికల వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగా ఒడిశా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారంలో 40 మంది స్టార్క్యాంపెయినర్లను రంగంలోకి దించింది. వారిలో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , హోంమంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. వీరితో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు ఈ జాబితాలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించిన లేఖలో పేర్కొంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, ఒడియా నటులు అనుభవ్ మొహంతి, శ్రీతమ్ దాస్, హరిహర్ మహపాత్ర, పింకీ ప్రధాన్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఒడిశాలో మే 13 నుంచి నాలుగు దశల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019