breaking news
Ad - Sakshi_Home_Sticky
-
Rajampet Lok Sabha: లోకల్ లీడర్ vs గెస్ట్ పొలిటిషన్
అన్నమయ్య: రాజంపేట లోక్సభకు అరుదైనపోరు ఆవిర్భవించింది. ఆరుదశాబ్దాల తర్వాత ఏక సామాజికవర్గం మధ్య లోక్సభ ఎన్నికల రణరంగానికి రాజంపేట వేదికగా మారింది. ఈ లోక్సభపై రాష్ట్రం దృష్టి సారించింది. కారణం కూటమి అభ్యర్థిగా, బీజెపీ నుంచి ఉమ్మడిరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పోటీచేస్తుండగా, ఈ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీ అయిన పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి బరిలోకి దిగారు. ఇప్పటి వరకు రాజంపేట లోక్సభకు బలిజ,రెడ్డి సామాజికవర్గాలకు చెందిన అభ్యర్థుల మధ్య పోటీ కొనసాగుతూ వచ్చింది. ఈ సారి ఇద్దరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే లోక్సభ ఎన్నికబరిలో ఉండటంతో అరుదైన పోరుగా రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. 1957 నుంచి... రాజంపేట లోక్సభ ఆవిర్భవించిన తర్వాత 1957 నుంచి 2019 వరకు 16 సార్లు జరిగిన ఎన్నికల్లో మొదటి రెండు, చివరి రెండుసార్లు మినహా మొత్తం 12 సార్లు కాపు (బలిజ)లే దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలో ప్రధాన అభ్యర్థులుగా ఇద్దరు ఓకే సామాజికవర్గానికి వారు తలపడి 62 సంవత్సరాలు అయింది. 1962 తర్వాత.. 2019 ఎన్నికల్లో బలిజ సామాజికవర్గానికి చెందిన ఆదికేశవులనాయుడు సతీమణి సత్యప్రభతో వైఎస్సార్సీపీ అభ్యర్థి మిథున్రెడ్డి తలపడి గెలుపొందారు. 2014లోనూ బీజెపీ అభ్యర్థి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై పోటీ చేసి గెలుపొందడం విశేషం. 1962 తర్వాత ఒకే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థుల మధ్య పోరు 2024 ఎన్నికల్లో ఆవిష్కృతంకావడంతో రాజంపేట లోక్సభ స్థానం ప్రత్యేకతను సంతరించుకుంది. బహుశా రాష్ట్రంలో కూడా రెండు ప్రధాన పార్టీల నుంచి ఒకే సామాజికవర్గం వారు పోటీ పడిన సందర్భం ఎక్కడా ఉండకపోవచ్చు. 9 సార్లు కాపుల మధ్యే పోరు రాజంపేట లోక్సభ ఏర్పడిన 1957 నుంచి 2019 వరకు ఎన్నికల చరిత్రలోకి వెళితే...ఇప్పటికి 16సార్లు ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో 1957లో టీవీఎన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కాగా , 1962లో ఇండింపెండెట్గా సీవీఎల్రెడ్డి చేతిలో టీవీఎల్ఎన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమిపాలయ్యారు. అంటే 1962లో ఇద్దరు ఒకే సామాజికవర్గ అభ్యర్థుల మధ్య పోరు జరిగింది. తర్వాత ఈ వర్గానికి మధ్య ఇప్పటి వరకు పోరు జరగలేదు. 1967లో బలిజ సామాజికవర్గానికి చెందిన పార్థసారధి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో ఆయనపై సీఎల్ఎన్రెడ్డి స్వతంత్య్రఅభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1971లో కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి పోటీ చేసిన పార్థసారధిపై,ఎన్సీవో పార్టీ అభ్యర్ధిగా యశోదరెడ్డి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1977లో మూడోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్థసారధి, బీఎల్డీ అభ్యర్ధి తిమ్మారెడ్డి పై పోటీ చేసి గెలుపొందారు. 1980లో నాలుగోసారి పార్థసారధి కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా పోటీచేశారు. ఈ సారి బలిజ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ (యు) అభ్యర్థిగా ఆర్,సభాపతిపై పోటీ చేసి గెలుపొందారు. బలిజసామాజికవర్గానికి చెందిన 1984లో పాలకొండ్రాయుడు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి సాయిప్రతాప్ గెలుపొందారు. 1989లో సాయిప్రతాప్, టీడీపీ నుంచి పోటీ చేసిన సీ.రామచంద్రయ్యపై గెలుపొందారు. 1991లో సాయిప్రతాప్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా, పాలకొండ్రాయుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1996లో సాయిప్రతాప్ కాంగ్రెస్ అభ్యర్థిగా , టీడీపీ అభ్యర్థి పోతురాజు ప్రతాప్పై పోటీ చేసి గెలుపొందారు. 1998లో టీడీపీ అభ్యర్థి గునిపాటిరామయ్యపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1999లో గునిపాటి గెలుపొందారు. అంటే 1977 నుంచి 2004 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికల్లో బలిజసామాజికవర్గం అభ్యర్థుల మధ్య పోటీ సాగింది. నాలుగుసార్లే... 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సాయిప్రతాప్ టీడీపీ అభ్యర్థి రమేష్రెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. 2014లో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ పీవీ మిథున్రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి ,బీజెపీ అభ్యర్థి పురందేశ్వరిపై గెలుపొందారు. 2019లో మిథున్రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై పోటీ చేసి గెలుపొందారు. అంటే మొత్తం 67 నుంచి జరిగిన ఎన్నికల్లో నాలుగుసార్లు రెడ్డి, బలిజ అభ్యర్ధుల మధ్య పోటీ జరగ్గా , మిగతా అన్నిసార్లు బలిజ,బలిజల మధ్యే ఎన్నికల పోరు కొనసాగింది. లోక్సభ స్వరూపమిలా.. ఏపీలోని 25 లోక్సభ నియోజకవర్గాల్లో రాజంపేట ఒకటి. ఈ నియోజకవర్గ పరిధి ఆధారంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటుచేశారు. ఇందులో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పుంగనూరు నియోజకవర్గం జిల్లాకేంద్రానికి దగ్గరగా ఉండటానికి చిత్తూరు జిల్లాలో కలిపారు. ► మిథున్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి మధ్య పోరు... రాజంపేట సిట్టింగ్ ఎంపీ పీవీ మిథున్రెడ్డి, మాజీ సీఎం నలారి కిరణ్కుమార్రెడ్డి మధ్య పోరు సాగుతోంది.1962లో జరిగిన ఎన్నికల్లో తప్ప ఇప్పటి వరకు రెడ్డి, రెడ్డి మధ్య జరగని పోరు ఈ సారి ఎన్నికల్లో ఆవిష్కృతం కావడంతో రాజంపేట పార్లమెంట్ పోరు అరుదైన ఘట్టంగా మారిందని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
నల్లారి వారి నయా డ్రామా.. కమలం పువ్వు చెవిలో పెట్టుకుని..
ఆయన యాక్సిడెంటల్గా ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ను నట్టేట ముంచి చెయ్యి వదిలేసి వెళ్ళిపోయారు. సొంతంగా పార్టీ పెట్టుకుని విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురయ్యారు. తర్వాత మూడేళ్ళకు మళ్ళా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్లో ఉంటే భవిష్యత్ లేదని భావించి గత ఏడాది కమలం గూటికి చేరుకున్నారు. తాజా ఎన్నికల్లో ఏపీలో ఎంపీగా బరిలో దిగారు. ఆ నాయకుడు ఎవరో ఈ పాటికి మీకు అర్థం అయ్యే ఉంటుంది. ఆయన రాజకీయాలు ఎలా సాగాయో పరిశీలిద్దాం 1989లో చిత్తూరు జిల్లా వాయల్పాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి ఎన్నికవ్వడం ద్వారా నల్లారి కిరణ్కుమార్రెడ్డి రాజకీయ ప్రయాణం మొదలైంది. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్గా అవకాశం లభించింది. ఐదేళ్ళ పాటు వైఎస్ నమ్మినబంటుగా ఉంటూ అసెంబ్లీలో చీఫ్ విప్గా కొనసాగారు. 2009లో డాక్టర్ వైఎస్ రెండోసారి సీఎం అయ్యాక అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు. రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో ఆర్థిక మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రి పదవి వరించింది. రోశయ్య సీఎంగా ఉన్నకాలంలోనే అసెంబ్లీ స్పీకర్ పదవిలో ఉంటూనే..ఢిల్లీకి పదే పదే తిరిగి కాంగ్రెస్ హైకమాండ్ను బుట్టలో వేసుకున్నారు కిరణ్కుమార్రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో 2010 నవంబర్లో రోశయ్య స్థానంలో కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. తెలంగాణ ఉద్యమం పీక్స్కు చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అయితే విభజనను అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ..ఆఖరి బాల్ తన దగ్గర ఉందంటూ తెలంగాణ ప్రజల్ని బెదిరిస్తూ..ఆంధ్ర ప్రజల్ని నమ్మిస్తూ..2014లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాడి కిందపారేసి కాంగ్రెస్ను వదిలి వెళ్ళిపోయారు. ఢిల్లీకి..హైదరాబాద్కు పదే పదే తిరిగి కాంగ్రెస్ పెద్దలకు ఏవేవో చెప్పి వారిని నమ్మించి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. నమ్మి రాష్ట్రాన్ని అప్పగించిన పార్టీని రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత నట్టేట ముంచి సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. చివరి వరకు పదవిని అంటిపెట్టుకుని ఉన్న కిరణ్కుమార్రెడ్డికి కూడా ఏపీ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. జై సమైక్యాంధ్ర పార్టీకి ఏ నియోజకవర్గంలోనూ డిపాజిట్లు దక్కలేదు. ఆఖరుకు కిరణ్కుమార్రెడ్డి, ఆయన తమ్ముడు కూడా ఘోరంగా ఓడిపోయారు. అటు కాంగ్రెస్ పార్టీని..ఇటు ఆంధ్ర ప్రజల్ని మోసం చేసిన కిరణ్కుమార్రెడ్డి 2014 ఎన్నికల తర్వాత కొన్నాళ్ళ పాటు సైలెంట్గా ఉండిపోయారు. ఇలాగే సైలెంట్గా ఉండిపోతే రాజకీయ భవిష్యత్కు చేతులారా సమాధి కట్టుకోవడమే అవుతుందని భావించి సైకిల్ ఎక్కాలా? మళ్ళీ చేయి పట్టుకుని నడవాలా అని కొన్నాళ్ళ పాటు తర్జన భర్జన పడ్డారు. చివరికి 2018 జులైలో తన సొంత పార్టీని రద్దు చేసుకుని.. రాహుల్ గాంధీ సమక్షంలో మరోసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాని 2019 ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేయడానికి సాహసించలేకపోయారు. కాంగ్రెస్లో అసలు ఉన్నారా ? లేరా? అన్నట్లుగా కొనసాగి గత ఏడాది ఏప్రిల్లో రెండోసారి హస్తానికి హ్యాండిచ్చి భారతీయ జనతాపార్టీలో చేరిపోయారు. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్లో ఉన్నా.. ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నా..2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నల్లారి కిరణ్కుమార్రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్కు వ్యతిరేకంగానే ఉన్నారు. వైఎస్ జగన్పై అక్రమ కేసులు పెట్టించడంలో కాంగ్రెస్ హైకమాండ్కు, చంద్రబాబుకు కిరణ్కుమార్ పూర్తిగా సహకరించారు. తెలుగుదేశంలో చేరకపోయినా.. పచ్చ మందకు అడుగడుగునా సహకరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు టీడీపీ కూటమిలో బీజేపీ చేరడంతో రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేస్తున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో తనకంటూ ఓట్ బ్యాంక్ను ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ను ఛీత్కరించడంతో పాటు.. చివరి వరకు మోసపు మాటలతో కాలం గడిపిన కిరణ్కుమార్రెడ్డిని కూడా ఛీ కొట్టారు. అందుకే గత ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడ్డారు. తాజా ఎన్నికల్లో మూడు పార్టీలు జట్టు కట్టడంతో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయడానికి కిరణ్కుమార్ రెడీ అయ్యారు. కాని రాజంపేటలో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కుటుంబానికి చెందిన పెద్దిరెడ్డి మిధున్రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచి ప్రజాదరణతో, వైఎస్ జగన్ ఆశీస్సులతో మూడోసారి మిధున్రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారాన్ని అనుభవించి.. కాంగ్రెస్ను భూ స్థాపితం చేసి.. ఇప్పుడు కమలం పువ్వును చెవిలో పెట్టుకుని ప్రజా సేవకుడిలా పోజు పెట్టి రాజంపేటలో పోటీ చేస్తే కిరణ్ కుమార్రెడ్డిని ప్రజలు నమ్ముతారా? -
చంద్రబాబు ఎత్తులకు తెలుగు తమ్ముళ్లు తుస్!!
సాక్షి రాయచోటి: తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఆవిర్భావం నుంచి అండగా ఉంటున్న వారికి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు దాపురించాయి. ‘కష్టకాలంలో అండగా ఉన్నారు...అన్ని విధాల ఆదుకోవడంతోపాటు టికెట్ కూడా మీకే’ అంటూ ఊసరవెళ్లి మాటలతో పార్టీ పెద్దలు బురిడీ కొట్టించారు. పొత్తుల మాయో...లేక బాబు జిత్తులో...డబ్బుల మూటలు తీసుకురాలేరనో గానీ... ఆది నుంచి ఉన్న వారికి టికెట్ల కేటాయింపులో శృంగభంగం తప్పలేదు. జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల కొత్త అభ్యర్థులను తెరమీదికి తేవడంతో గరంగరంగా ఉన్న ‘దేశం’ శ్రేణులకు తాజాగా రాజంపేట పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఎమ్మెల్యే అభ్యర్థుల్లోనూ అలజడి ప్రారంభమైంది. అన్నమయ్య జిల్లాలో అధికంగా ముస్లిం మైనార్టీ వర్గాలు ఉన్న నేపధ్యంలో ఎన్నికల్లో దెబ్బ తగులుతుందన్న ఆందోళన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది. ‘సుగవాసి’ కుటుంబానికి ఎగనామం రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కుమారులు సుగవాసి బాలసుబ్రమణ్యం, సుగవాసి ప్రసాద్బాబు టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సుగవాసి బాలసుబ్రమణ్యంకు రాజంపేట పార్లమెంటు సీటు కేటాయించినట్లు అంతర్గతంగా చెప్పడంతో ఆయన రెండు నెలలుగా అనునిత్యం తిరుగుతున్నారు. పార్లమెంటు అభ్యర్థిగా తనను బలపరచాలని జిల్లాలో తిరుగుతూ...మరోవైపు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో రాజంపేట పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి అప్పజెప్పడంతో కాపు సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే సుగవాసి వర్గీయులు సంబంధిత పార్టీ కార్యాలయాల వద్ద టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా తొలగించారు. మదనపల్లె, రాయచోటిలోనూ అంతర్గత పోరు జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లోనూ టీడీపీ అంతర్గతపోరుతో సతమతమవుతోంది. మదనపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా షాజహాన్బాషాను ప్రకటించడంతో అప్పటి నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న దొమ్మలపాటి రమేష్ కినుక వహించారు. మరోవైపు రాయచోటిలో ఇదివరకే మండిపల్లికి టికెట్ కేటాయించినా.. అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా ఇక్కడి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే రమేష్కుమార్రెడ్డి స్తబ్దుగా ఉండిపోయారు. రాజంపేట టికెట్పై ప్రతిష్ఠంభన కొత్త, పాత అనే తేడా లేకుండా పార్టీకి పనిచేసిన వారికి సంబంధం లేకుండా టిక్కెట్లు అధిష్టానం కేటాయించడంపై శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజంపేట టీడీపీ టిక్కెట్కు సంబంధించి కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయులుకు చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి లేదా సుగవాసి కుటుంబానికి సంబంధించిన బాలసుబ్రమణ్యంకు కేటాయిస్తారని చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు జనసేనకు టిక్కెట్ కేటాయిస్తారని ప్రచారం జోరందుకోవడంతో నియోజకవర్గ టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. కోడూరులో నైరాశ్యం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి కాకుండా రైల్వేకోడూరు టికెట్ను జనసేనకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీలో నైరాశ్యం అలుముకుంది. ముందే గ్రూపు రాజకీయాలతో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో జనసేనకు టిక్కెట్ కేటాయించడంతో టీడీపీలో అనిశ్చితి నెలకొంది. పైగా నియోజకవర్గ ఇన్చార్జ్ రూపానందరెడ్డి సూచించిన అభ్యర్థికి కాకుండా కొత్త అభ్యర్థికి టిక్కెట్ కేటాయించడంతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. చంద్రబాబు జిత్తులకు బలైన మరో నేత, పారిశ్రామికి వేత్త గంటా నరహరి.. గంటా నరహరి టీడీపీ తరఫున ముందుగా రాజంపేట లోక్సభ స్థానం టికెట్ ఆశించారు. ఈ క్రమంలో పట్టణంలో అన్న క్యాంటీన్ ను సొంత డబ్బుతో నిర్వహించారు. తాజాగా రాజంపేట లోక్సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్ అయినా వచ్చేస్తుందని గంటా నరహరి ఆశించారు. అయితే ఎమ్మెల్యే టికెట్ కూడా వేరే అభ్యర్థికి ఖరారైందని తెలిసి చివరికి మూడు రోజుల క్రితం వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్థం కోసం ఎవరినైనా బలి చేస్తారనే విషయం మరోసారి గంటా విషయంలో బహిర్గతమైందని రాజకీయపరిశీలకులు అంటున్నారు. ఇవి చదవండి: కూటమిలో వేరు కుంపట్లు -
బీజేపీలో చేరిన నల్లారి కిరణ్కుమార్రెడ్డి
ఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో శుక్రవారం కీలక నేతల సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు పలువురు జాతీయ నేతలు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తదితరులు.. కిరణ్కుమార్రెడ్డిని అధికారికంగా బీజేపీలోకి ఆహ్వానించారు. కొద్దిరోజుల క్రితమే ఆయన కాంగ్రెస్కు అధికారికంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ను వీడతానని ఏనాడూ అనుకోలేదు: కిరణ్కుమార్రెడ్డి బీజేపీలో చేరిన కిరణ్కుమార్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం తీరుపై అసంతృప్తి వెల్లగక్కారాయన. 1952 నుంచి మా కుటుంబం కాంగ్రెస్లోనే ఉంది. కానీ, కాంగ్రెస్ను వీడతానని ఏనాడూ అనుకోలేదు. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు నిర్ణయం వల్ల ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్కు పవర్ మాత్రమే కావాలి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో.. హైకమాండ్ తెలుసుకోలేకపోతోంది. ఎవర్నీ సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటుంది. చేసిన తప్పేంటన్నది కూడా కాంగ్రెస్ తెలుసుకోవడం లేదు. ఓటముల నుంచి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోవడం లేదు. కాంగ్రెస్లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారన్నారు కిరణ్కుమార్రెడ్డి. అందుకే కాంగ్రెస్ను వీడినట్లు ప్రకటించారాయన. ఇక మోదీ, అమిత్ షా డైరెక్షన్ బాగుందని కితాబిచ్చారు. అందుకే బీజేపీలోకి చేరాను అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీలో చేర్చుకున్నందుకు ధన్యవాదాలు. నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేస్తా. బిజెపి నాయకుల శ్రమతో పార్టీ ఎంతో ఎదిగింది. అవినీతికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలతో పార్టీ పెరిగింది అంటూ కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. అంతకు ముందు కిరణ్ కుమార్రెడ్డి చేరికను స్వాగతించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఏపీలో ఇక బీజేపీ బ్యాటింగ్ జోరందుకుంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్పై వ్యాఖ్యలు సరికావు:గిడుగు రుద్రరాజు బీజేపీలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. నచ్చిన పార్టీలోకి నాయకులు వెళ్ళవచ్చు.. కానీ వెళ్లేప్పుడు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్లో అధికారాన్ని ఎంజాయ్ చేశారని.. ఇప్పుడు పార్టీపై బురదజల్లే వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియాగాంధీలపై వ్యాఖ్యలు చెయ్యడం సరికాదన్నారు. ఏపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొననప్పుడే ఆయనను తమ పార్టీ నుంచి తొలగించామని తెలిపారు. సీబీఐ, ఈడీ కేసులకు బయపడి బీజేపీలో చేరారా ? అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్కు బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీలో చేరారని నిలదీశారు. ఎందుకు ఆ పార్టీకి ఆకర్షితులయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూడున్నర సంవత్సరాలు ముఖ్య మంత్రిగా పదవి అనుభవించి ఇప్పుడు ఏ ప్రయోజనాల ఆశించి ఆ పార్టీ లో చేరారో చెప్పాలన్నారు. #WATCH | "I had never imagined that I'll have to leave Congress...There is a saying- 'My king is very intelligent, he doesn't think on his own, doesn't listens to anyone's advice', "says former Congress leader Kiran Kumar Reddy on joining BJP in Delhi. pic.twitter.com/8s43F09WxK — ANI (@ANI) April 7, 2023 #WATCH | Kiran Kumar Reddy, who served as the CM of united Andhra Pradesh, joins Bharatiya Janata Party in Delhi pic.twitter.com/WrlGjG5Uwr — ANI (@ANI) April 7, 2023 గతంలో ఉమ్మడి ఏపీలో కిరణ్కుమార్రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. వైఎస్సార్ హయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్గా, అసెంబ్లీ స్పీకర్గానూ ఆయన పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు(2010 నుంచి 2014 వరకు). విభజన బిల్లుకు వ్యతిరేకిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేసి.. ఆపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు కొనసాగారు. ఆ సమయంలో కాంగ్రెస్కు రాజీనామా చేసి.. జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని రద్దు చేస్తూ.. 2018లో తిరిగి కాంగ్రెస్లో చేరారాయన. చివరకు సుదీర్ఘకాలం కొనసాగిన పార్టీకి బై బై చెబుతూ.. బీజేపీకిలోకి చేరిపోయారు. -
కాంగ్రెస్కు మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి రాజీనామా
సాక్షి, అమరావతి: సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపారు. బీజేపీలోకి కిరణ్కుమార్రెడ్డి చేరనున్నట్లు సమాచారం. కాగా, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేశారు. తండ్రి అమర్నాథ్ రెడ్డి మరణంతో తొలిసారిగా 1989 ఎన్నికల్లో వయల్పాడు (వాల్మీకిపురం) నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2004లోనూ ఇదే స్థానం నుంచి నెగ్గారు. వైఎస్సార్కు సన్నిహితుడిగా పేరున్న కిరణ్కుమార్రెడ్డి.. 2009లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. వైఎస్సార్ ప్రభుత్వంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్గా, అసెంబ్లీ స్పీకర్గానూ ఆయన పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయ పరిస్థితుల్లో.. ఆంధ్రప్రదేశ్కి 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు(2010 నుంచి 2014 వరకు). ఈయన హయాంలోనే మీ సేవా, రాజీవ్ యువకిరణాలు, ఎస్సీ/ఎస్టీ సబ్ప్లాన్, బంగారు తల్లి, మన బియ్యం, అమ్మ హస్తం, చిత్తూరు జల పథకం లాంటివి వచ్చాయి. విభజన బిల్లుకు వ్యతిరేకిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేసి.. ఆపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు కొనసాగారు. కాంగ్రెస్కు రాజీనామా చేసి.. జై సమైక్యాంధ్ర పేరుతో సొంత పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీని రద్దు చేస్తూ.. 2018లో తిరిగి కాంగ్రెస్లో చేరారాయన. అప్పటి నుంచి కాంగ్రెస్లో ఉండి.. మౌనంగా ఉండిపోయారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్తామన్న బీజేపీ హామీ మేరకు ఆయన చేరనున్నట్లు తెలుస్తోంది. చదవండి: వెలుగు చూస్తున్న ‘మార్గదర్శి’ అక్రమాలు.. నలుగురు అరెస్ట్
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019