breaking news
-
దేశ భవిష్యత్తుకు దిక్సూచి!
ప్రపంచ మేధావి, ఆలోచనాపరుడు, తత్వవేత్త, భారత రాజ్యాంగ నిర్మాణ కర్త డా‘‘ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతి ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని నింపుతున్న ఒక చారిత్రక ఉత్సవం. అంబేడ్కర్ నిరంతర అధ్యయనం, విశ్లేషణ, తర్కం, హేతు వాదం, మానవతావాదం; ఆర్థిక,సాంఘిక, రాజకీయవాదాలు; బౌద్ధ విప్లవ ప్రస్థానం... ఆయన విస్తృతినీ, వ్యాప్తినీ, ప్రాపంచిక తాత్విక దృక్పథాన్నీ మనకు సాక్షాత్కరింప జేస్తున్నాయి. ఆయన ఒక వాల్టేర్ లాగా, రూసో లాగా ప్రపంచానికి ఒక నూతన దర్శనాన్ని అందించారు. ఆయన వ్యక్తిత్వంలో విద్యా జ్ఞానం, పరిశోధన, నైతికత, విమోచన కలిసి నడుస్తాయి. ఆయన బహుభాషా నిష్ణాతులు. మరాఠా భాష ఎంత బలంగా వచ్చో ఇంగ్లీషు, జర్మనీ కూడా అంతే నిశితంగా వచ్చు. ఆయన ఒక భాషా నిఘంటువు. ఆయన విద్యాభ్యాసంలో ఒక యుద్ధ ప్రక్రియ ఉంది. ఆయన ఆర్థిక శాస్త్ర నిపుణులు. అంబేడ్కర్ అపారమైన జ్ఞాపక శక్తి కలవారు. రాజ్యాంగ సభ డిబేట్స్లో కొన్ని వందల అంశాలు చూడకుండా చెప్పగలిగే వారు. ఆయన వాక్చాతుర్యా నికీ, వాదనా పటిమకూ, విషయ పరిజ్ఞానానికీ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజాజీ వంటి వారు అచ్చెరువొందేవారు. అంబేడ్కర్ సున్నితమైన హాస్య చతురుడు. చక్కని చిరునవ్వుతో ఆయన కళ్ళు మెరుస్తూ ఉండేవి. ఆయన చూపుడు వేలు ప్రపంచానికి ఓ ప్రశ్నోపనిషత్తు వంటిది. అంబేడ్కర్ 1913లో న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా, పరిశోధకుడిగా ‘బ్రిటిష్ ఇండియాలో ప్రొవెన్షియల్ ఫైనాన్స్ పరిణామం’ అనే థీసిస్ రాసి ఎందరి మెప్పునో పొందారు. 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ పట్టా పుచ్చు కోవడం కోసం రాత్రింబవళ్లు శరీరం శుష్కించే వరకూ చదివారు. విద్య పట్ల అంబేడ్కర్ దృక్పథాన్ని గమనిస్తే ఆయన విద్య అంటే కేవలం అక్షరాస్యత అనో, చదువనో అనుకోలేదని స్పష్టమ వుతుంది. విద్య మనిషిని సంపూర్ణంగా మార్చగలిగే సాధనమ న్నది అంబేడ్కర్ నమ్మకం. ఈ విషయంలో ఆయనపై బౌద్ధ ధర్మ ప్రభావం ఉన్నట్లు అనిపిస్తుంది. బుద్ధుడి బోధనలు, తాత్విక చింతన కేంద్రంగానే అంబేడ్కర్ విద్యను అభ్యసించారు. విద్య పర మార్థం ప్రజ్ఞ, కరుణ, సమత అనీ, ఈ త్రిగుణాలు పెంపొందించినప్పుడే విద్యకు పరిపూర్ణత చేకూరుతుందనీ అంబేడ్కర్ భావించారు. సమాజంలో విద్య ద్వారా చైతన్యం వస్తుందన్న ఉద్దేశంతో ఆయన విద్యా వ్యాప్తి కోసం 1945 నుంచి ఒక ఉద్యమం ప్రారంభించారు. ‘పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, అనేక విద్యాలయాలు, కళాశాలల ఏర్పాటుకు కృషి చేశారు. జ్ఞానం, కరుణ అనేవి తాను స్థాపించిన సొసైటీ ప్రధాన లక్ష్యా లుగా పేర్కొన్న అంబేడ్కర్ ‘హక్కుల సాధన కోసం చదువుకోండి! సంఘటితం కండి! పోరాడండి! మీపైన మీరు విశ్వాసం పెంచుకోండి! ఏ రకంగా కూడా మనకు ఓటమి ఉండదు. ఇది విజయం కోసం చేస్తున్న పోరాటం, స్వేచ్ఛ కోసం సాగిస్తోన్న యుద్ధం, ఈ యుద్ధం మనం కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగిపొందడానికి చేస్తున్నది’ అని ఉద్బోధించారు. సామాజిక మార్పు పోరాటాల ద్వారా, పోరాటాలు విజ్ఞానం ద్వారా, విజ్ఞానం విద్య ద్వారా అందుతాయన్నది అంబేడ్కర్ మార్గం. అలాగే దళితులు చదువు కోవడం ద్వారా సంప్రదాయ వృత్తుల్లో స్థిరపడే అవకాశం ఉండదనీ, తద్వారా తమ తరతరాల కులవృత్తులు చేస్తున్నందువల్ల ఎదురవుతున్న చిన్నచూపు తప్పుతుందనీ అంబేడ్కర్ ఆలోచన. అంబేడ్కర్ మనుస్మృతి భావజాలానికి ప్రత్యామ్నాయంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన పాండిత్యం, విజ్ఞత, మానవతా దృష్టి, బౌద్ధనీతి, సమ సమాజ భావన, భారత రాజ్యాంగంలో సముచితంగా సమన్వయించబడ్డాయి. అంబేడ్క ర్లో కుల నిర్మూలనా భావం, దార్శనికత, అహింసాతత్వం, భారతదేశాన్ని రక్తపాతం లేని దేశంగా సృష్టించగలిగింది. రాజ్యాంగంలో స్త్రీలందరికీ చదువుకునే హక్కు ఇవ్వటం ద్వారానూ, అçస్పృశ్యులందరికీ రిజర్వేషన్ కల్పించడం ద్వారానూ, శూద్రులందరికీ హక్కులు కల్పించడం ద్వారానూ ఆయన సమ సమాజ నిర్మాణానికి పునాదులు వేశారు. అంబేడ్కర్ విద్యా విప్లవంతో పాటు రాజకీయోద్యమాన్నీ నడిపారు. 1936 ఆగస్టులో దళిత జాతుల సముద్ధరణకు ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ’(ఐఎల్పీ)ని ఆయన స్థాపించారు. ఈ పార్టీ బొంబాయిలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన పది హేను సీట్లలో పదమూడింటిని కైవసం చేసుకుంది. జనరల్ సీట్లను కూడా రెండింటిని కైవసం చేసుకుంది. ఆయన ‘లేబర్’ అనే పదానికి ‘అణగదొక్కబడిన’ అనే అర్థాన్ని రూపొందించారు. ఆర్థికంగా, సాంఘికంగా అణగదొక్కబడిన వారందరినీ ఈ పార్టీ లోనికి తేవడానికి ప్రయత్నించారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును బట్టి ఆ పార్టీ దళితులకు ప్రాతినిధ్యం వహించడం లేదని డా‘‘ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆ పార్టీని విస్తృత పరచాలనే ఉద్దేశ్యంతో అంబేడ్కర్ 1942 జూలైలో ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్సీఎఫ్) ను స్థాపించారు. ఆ సందర్భంగా దళితుల సాంఘిక, ఆర్థిక హక్కు లను సాధించడానికి వారికి రాజకీయ అధికారం కావాలని ప్రబోధించారు. 1962లో విడుదల చేసిన ప్రణాళికలో ఆయన తన వామ పక్షాల భావాలను ప్రకటించారు. భారతీయుడైన ప్రతివాడూ ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రాలను పొందాలని నొక్కి వక్కాణించారు. ప్రతి మనిషికీ నిర్భయంతో కూడిన స్వేచ్ఛను సాధించడం ప్రభుత్వ బాధ్యత అని ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రణాళిక అణగదొక్కబడ్డ వారి సాంఘిక సమానత్వాన్ని నొక్కి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బీమా పథకాన్ని తప్పనిసరిగా అమలు జరపాలని కోరారు. ఏఐఎస్సీఎఫ్ నుండి రిపబ్లికన్ పార్టీ వరకు నడిచిన దారిలో దళితుల కోసం ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానతల కోసం తన శక్తిని ధారపోశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను పార్టీగా ప్రకటించక ముందే ఆయన పరి నిర్వాణం చెందారు. ఈ విధంగా అంబేడ్కర్ సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా, తాత్వికంగా, భారతీయ సమాజాన్ని పునః నిర్మించటానికి కృషి చేశారు. ఆయన ప్రపంచ మానవునిగా ఎదిగారు, ప్రపంచ తత్వవేత్తలలో ఒకరిగా నిలిచారు. భారతదేశానికి ఎనలేని కీర్తి తెచ్చారు. ఆయన నిర్మించిన రాజ్యాంగమే మన దేశ భవి ష్యత్తుకు దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 (నేడు డా‘‘ బీఆర్ అంబేడ్కర్ జయంతి) -
రాజ్యాంగ స్ఫూర్తికి ప్రమాదం
ఎన్నికల వేళ దేశంలో అధికార–ప్రతిపక్ష కూటములు పోటాపోటీగా ప్రకటనలు చేస్తూ తమ విధానాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో అధికార బీజేపీ ఏకంగా బలమైన ప్రతిపక్ష నాయకులపై కేసులు బనాయించి జైళ్లలోనూ పెడుతోంది. ఇందుకు కేజ్రీవాల్ అరెస్ట్ ఉదంతంతాజా ఉదాహరణ. దీనిపై ప్రతిపక్ష కూటమి భగ్గుమంటోంది. బీజేపీ ఈ సారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దుచేసినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని వారు అంటున్నారు. ఉత్తరప్రదేశ్తో సహా దేశంలో అనేక చోట్ల దళితులపై జరుగుతున్న దాడులూ, కర్నాటక బీజేపీ నాయకుడు అనంత కుమార్ హెగ్డే ‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం’ అని ప్రకటించడం వంటివన్నీ చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. ప్రతిపక్షాల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కేంద్రం అరెస్టు చేసింది. ఎన్నికల ముందు ఇలా ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం గురించి ప్రపంచ దేశాలు విస్తుబోయాయి. ఇది కేవలం రాజకీయ కక్షతో చేసిన అరెస్టేనని ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా, జపాన్లు వ్యాఖ్యానించటం గమనార్హం. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఢిల్లీ ర్యాలీలో మాట్లాడుతూ ‘దళితులు, గిరిజనులు, వెనకబడిన వర్గాలకు మేలు చేయబట్టే నా మీద బీజేపీ దాడులకు దిగింద’ని వక్కాణించారు. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీ వాల్ ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగిన సభలో మాట్లాడుతూ... నిర్విరామ విద్యుత్ సరఫరా, పేదలకు ఉచిత విద్యుత్తు, ప్రభుత్వ బడులు బలోపేతం, మొహల్లా క్లినిక్లు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, రైతులకు కనీస మద్దతు ధర, ఢిల్లీకి రాష్ట్ర హోదా వంటి అనేక హామీలతో కేజ్రీవాల్ జైలు నుంచి ఒక లేఖ పంపినట్టు ప్రకటించారు. ఇటువంటి హామీలను బీజేపీ ప్రభుత్వం ఇవ్వగలదా అని ప్రశ్నించారు. బీజేపీ 400 సీట్లు వస్తాయని బీరాలు పలుకుతుందనీ, 180 సీట్లన్నా తెచ్చుకోగలదా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుతంత్రంలో భాగంగా ఈ ఎన్నికలు జరుగుతున్నా యని, మాట్లాడే స్వేచ్ఛను కాలరాయడం, నియంతృత్వ రాజ్యాన్ని తీసుకురావడం, ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు పరచడం వంటివి బీజేపీ వ్యూహమనీ ఆయన అన్నారు. నియంతలను గద్దె దించటం ఎలాగో ప్రజలకు తెలుసనీ పేర్కొన్నారు. నిజానికి బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల మీద... ముఖ్యంగా తమిళనాడు సామాజిక సాంస్కృతిక అస్తిత్వం మీద దాడిచేస్తోంది. కులాంతర వివాహాలకు రక్షణ కల్పించడం, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం మీద బీజేపీ అసహనంగా ఉంది. సనాతన ధర్మాన్ని నిరాకరించి అధునాతన ధర్మానికీ,రాజ్యాంగ పరిరక్షణకూ పూనుకునే కార్యక్రమాలు నిర్వహించడం మీద బీజేపీ ఆగ్రహంగా ఉంది. ఎన్నికల వేళ నరేంద్ర మోదీ ‘కచ్చతీవు’ అంశాన్ని ప్రస్తావించడంపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్య దర్శి జయరాం రమేష్లు తగిన విధంగా స్పందించారు. 1974లో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు (దీవి)ని శ్రీలంకకు అప్పగించిందని మోదీ ఆరోపించారనీ, మరి 2015లో బంగ్లాదేశ్తో ఎన్డీఏ ప్రభుత్వం చేసుకున్న భూమి సరిహద్దు ఒప్పందంలో భాగంగా 1051 ఎకరాల భారత భూభాగం కోల్పోవాల్సి వచ్చింది కదా అని జయరాం రమేష్ గుర్తు చేశారు. మొత్తం 17,161 ఎకరాల భారత భూభాగంలో 7,110 ఎకరాలు మాత్రమే మనకు వచ్చాయి అన్నారు. ఆ సమయంలో మోదీపై ఆరోపణలు చేయకుండా పార్లమెంటు ఉభయసభల్లో బిల్లుకి కాంగ్రెస్ మద్దతునిచ్చిందని వెల్లడించారు. తమిళనాడులో వారికి ఒక్క సీటు కూడా రాకపోవడం బీజేపీ వర్గాలను కలవరపెట్టిందని విమర్శించారు. తమిళనాడులో వస్తున్న సామాజిక ఆర్థిక పరిణామాలను తట్టుకోలేక మోదీ ‘కచ్చతీవు’ ప్రస్తావన తెచ్చారని అన్నారు. 1974లో సిరిమావో బండారు నాయకే– ఇందిరా గాంధీ మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా శ్రీలంక నుండి ఇందిరా గాంధీ చాతుర్యం వల్ల ఆరు లక్షల మంది తమిళ భారతీయులు స్వదేశానికి రాగలిగారని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో వస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల చైతన్యానికి బెదిరి ఎప్పటివో సరిహద్దు విషయాలను ముందుకు తెచ్చి లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. బిహార్ ఓబీసీ రాజకీయ నాయకులు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఓబీసీ నాయకుల్ని బతకనివ్వటం లేదనీ, తన తల్లి, తండ్రి, తోబుట్టువులపై కేసులు పెట్టి వేధిస్తున్నారనీ, ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం ఓబీసీలు అంటే శూద్ర బానిసలనీ, వారు రాజ్యపాలనకు పనికిరారనేది వారి భావ జాలం అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏ గిరిజనుల, దళితుల, బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తోందో, మాట్లాడుతోందో వారే నిజానికి సామా జిక ఉత్పత్తి శక్తులు. భారతీయ గిరిజనులు మన ప్రకృతినీ, సంస్కృతినీ రక్షించినవారు. దళితులు నదీ నాగరికతను సృష్టించినవారు. వీరి శ్రమ లేనిదే భారతదేశ సంపద లేదు. ఎవరు సంపద సృష్టిస్తున్నారో వారి రక్షణ కోసమే భారత రాజ్యాంగం రాయబడింది. ప్రధాని దేశంలో సామాజిక, సాంస్కృతిక, పారిశ్రామిక, విద్యా వ్యవస్థలను విస్తృతం చేయాలనే పథకాలను రూపొందించుకోలేక పోతున్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా విభాగం సీట్లన్నీ తగ్గించేశారు. ఎస్సీలకు ఇస్తున్న ఉపకార వేతనాలను తగ్గించేశారు. ఇకపోతే మహిళా సంక్షేమ పథకాల అమలులో మోదీ ప్రభుత్వం ఈ పదేళ్ళ కాలంలో ఘోరంగా విఫలమయ్యింది. బడ్జెట్లోనూ మోదీ ప్రభుత్వం మహిళల సంక్షేమ పథకాల కేటాయింపును తగ్గించింది. 5 కీలక మహిళల సమస్యల పరిష్కారంలో విఫలమైంది. 2023 – 24 కేంద్ర బడ్జెట్లో అంగన్వాడీ కేంద్రాలు, మహిళల భద్రత, శిశు సంరక్షణ సంస్థలకు బీజేపీ ప్రభుత్వం కేవలం 0.55 శాతం నిధులు మాత్రమే కేటాయించింది. వాచాలత్వం నుండి, ఆధిపత్యం నుండి, అణచివేత నుండి, హింస నుండి ఉత్పత్తి జరగదు. ఉత్పత్తి జీవులు అయిన గిరిజనులు, దళితులు చెట్టును ప్రేమిస్తారు, నదిని ప్రేమిస్తారు, భూమిని ప్రేమిస్తారు, గాలిని ప్రేమిస్తారు. భారతదేశం ప్రకృతి జీవులది. పెట్టుబడి దారీ సామ్రాజ్యవాద శక్తులు వీరి శ్రమను దోపిడీ చేసి అభివృద్ధి చెందుతున్నాయి. ఎవరి శ్రమ దోచుకుంటున్నారో వారిపై అరాచకాలు చేస్తు న్నారు. బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్లో ఇటీవల ఆరు గురు యువకులు ఒక దళిత బాలికపై (16 ఏళ్ళు) లైంగిక దాడి చేశారు. వారిపై కేసు పెట్టినందుకు ఆమెను వారు అగ్నిలో దహించారు. ఇటు వంటి పాలకులను అందిస్తున్న బీజేపీకి చెందిన కర్నాటక నాయకుడు అనంత కుమార్ హెగ్డే ‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం’ అని ప్రకటించడం ముందు ముందు ఏమి జరగను న్నదనే సంగతిని సూచిస్తోంది. ఇకపోతే ఇండియా కూటమి కూడా అంబేడ్కర్ని ముందు పెట్టుకోకుండా వెళితే రాజ్యాంగాన్ని రక్షించలేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ ఇక ప్రజలకు ఉండదు. రాజ్యాంగంలోని ‘ప్రవేశిక’ ‘భారత దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం’గా ప్రకటించింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ దూకుడు చూస్తుంటే ఈ లౌకిక, ప్రజాస్వామ్య భావనలు ప్రమాదంలో పడబో తున్నట్లనిపిస్తోంది. రాజ్యాంగం ప్రాథమిక హక్కులను మనకు ప్రసాదించింది. ఇప్పుడు అవీ ప్రమాదంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాజ్యాంగ 11వ అధికరణం ప్రాథమిక హక్కులను హరించే ఏ శాసనం చెల్లదని చెప్పడం కొంత ఊరటనిస్తోంది. అంబేడ్కర్ ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి దళిత, బహుజన, ఆదివాసీ మీదా ఉంది. ఇప్పుడు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన కులతత్వ, మత తత్వవాది. ఇవాళ దక్షిణ భారతదేశం మొత్తం తన అస్తిత్వం కోసం పోరాడుతోంది. ఈ దశలో అంబేడ్కర్ ఆలోచనలతో లౌకిక భారత పునరుజ్జీవనం కోసం బడుగు వర్గాలు, లౌకికవాదులం ఏకమై రాజ్యాంగ స్ఫూర్తినీ, చైత న్యాన్నీ, ప్రతిష్ఠనూ, వ్యక్తిత్వాన్నీ కాపాడే పోరాటంలో భాగస్వాముల మవుదాం. విజయం సాధిద్దాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
చారిత్రక మూలాల్లో జ్ఞాన కాంతులు
ఏ దేశానికైనా, ఏ జాతికైనా చారిత్రక తాత్విక జ్ఞానం అవసరం. నిజానికి తొలి నుంచీ ఉన్నది భౌతికవాదమే. భారతదేశంలోని భౌతికవాద చింతన అన్ని కీలక పరిణామాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది. మానవుడు భౌతిక ప్రపంచం నుండి ప్రభవించడం వల్ల అతని ఆలోచనలు, భావాలు, ఊహలు భౌతిక వాస్తవికత వైపే మొదట్లో పయనించాయి. నిప్పును, నీరును, గాలిని, భూమిని; వాటి భౌతిక రూపాలను తెలుసుకోవడమే మానవుని అభివృద్ధి సోపానం. అయితే అనేక సందర్భాలలో ప్రజలు వెలుగు నుండి చీకట్లోకి, జ్ఞానం నుండి అజ్ఞానంలోకి, వాస్తవం నుండి భ్రమలలోకి తిరోగమిస్తూ ఉంటారు. అప్పుడే అభ్యుదయవాదులు వారిలో జ్ఞానతృష్ణను కలిగించాలి. భారతదేశ తాత్విక మూలాలపై ఈనాడు లోతైన చర్చ జరుగుతోంది. నిజానికి భారతీయ తత్వశాస్త్రాన్ని సృష్టించినవారు మూలవాసులు. వీరు మెసపటో మియా, సింధూ నాగరికతల కాలం నాటివారు. వీరి మౌఖిక జ్ఞాన సంపదకు ప్రత్యామ్నాయంగానే వైదిక సాహిత్యం వచ్చింది. వైదిక సాహిత్యం కూడా మొదట్లో మౌఖిక రూపంలోనే ఉంది. తర్వాత లిఖిత రూపం ధరించింది. భారతీయ తత్వశాస్త్రం ప్రధానంగా భౌతికవాద తత్వశాస్త్రం. భారతదేశంలో తత్వశాస్త్రమంటే ఆధ్యాత్మిక వాదంగా ప్రచారం చేశారు. తత్వశాస్త్రమనగానే అది ఆత్మ గురించో, పరలోకం గురించో చెప్పేదనే భావన ఏర్పడింది. నిజానికి భౌతిక అంశాల నుండి రూపొందినదే తత్వశాస్త్రం. భారతదేశంలో అతి ప్రాచీన జాతులు తాత్వికాంశాల మీద సుదీర్ఘమైన చర్చ చేశాయి. శరీరానికీ, చైతన్యానికీ ఉన్న సంబంధాన్నీ; మానవునికీ, ప్రకృతికీ ఉన్న సంబంధాన్నీ, విశ్వ పరిణామాన్నీ, మానవ పరిణామాన్నీ వీరు అర్థం చేసు కోవడానికి ప్రయత్నించారు. ప్రకృతి; సమాజం పట్ల ఉదయించిన అనేక ప్రశ్నలకు భౌతిక దృక్పథంతో సమాధానం వెదికారు. మానవుడు భౌతిక ప్రపంచం నుండి ప్రభవించడం వల్ల అతని ఆలోచనలు, భావాలు, ఊహలు భౌతిక వాస్తవికత వైపే మొదట్లో పయనించాయి. నిప్పును, నీరును, గాలిని, భూమిని; వాటి భౌతిక రూపాలను తెలుసుకోవడమే మానవుని అభివృద్ధి సోపానం. నిప్పు మానవ సామాజిక పరిణామంలో కీలక పాత్ర వహించింది. నిప్పును ఆరాధించిన జాతుల కంటే, నిప్పును భౌతిక శక్తిగా గుర్తించిన జాతులు శక్తిమంతంగా ముందుకు నడిచాయి. నిప్పు మానవ జీవితాన్ని ఒక భౌతిక శక్తిగా ప్రభావితం చేసింది. నిప్పును ఆరాధించే జాతులకూ, నిప్పును అధీనం చేసుకొన్న జాతులకూ సమరం జరిగింది. తన చుట్టూ వున్న భౌతిక ప్రపంచాన్ని సమన్వయించుకోవడంలో విఫలమై నవారు భావవాదులుగా రూపొందారు. వీరు భౌతిక సామాజిక వాస్తవికతకు భిన్నమైన భావవాదంతో భౌతికవాదులకు ఎదురు నిలుస్తూ వచ్చారు. అంతేగాక వానరుడి నుండి నరుడిగా పరిణామం చెందిన ప్రతి కీలక దశలోనూ మానవుని భౌతిక దృక్పథమే అతనికి నిర్ణయాత్మక మెట్టుగా ఉపకరించింది. లక్షలాది సంవత్సరాలకు పూర్వం ఉష్ణమండలంలో ఎక్కడో ఒక చోట నరవానరుడిగా ఉన్న మానవుడు మానవుడిగా రూపొందిన పరిణామంలో చేతుల్ని ఉపయోగించుకున్న తీరును ఎంగెల్స్ వర్ణించాడు. రోమ శరీరులైన మన పూర్వీకులు మొదట ఒక నియమంగానూ, తరువాత అవసరంగానూ నిలబడ టానికి కారణం ఆనాటికి చేతులకు వివిధ రకాలైన ఇతర పనులు ఏర్పడి ఉంటాయని అనుకోవాలి. వానరాలు ఆహారాన్ని స్వీకరించడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి చేతులను ఉపయోగిస్తాయి. కొన్ని రకాల క్రింది తరగతి స్తన్య జంతువులలో కూడా ముందు పంజాలను ఉపయోగించడం మనం చూస్తాం. చాలా రకాల కోతులు తాము చెట్ల మీద నివసించడానికై గూళ్ళను నిర్మించడానికి చేతులను ఉప యోగిస్తాయి. చింపాంజీలు తమ చేతులతో చెట్ల కొమ్మల మధ్య కప్పులు చేసుకొని ఎండ వానల నుండి కాపాడుకుంటాయి. శత్రువుల నుండి ఆత్మ రక్షణకై ఇవి చేతులతో కర్రలను, కొమ్మలను పట్టుకొని కొట్టడానికి పూనుకొంటాయి. బోనుల్లో ఉంచిన కోతులు మానవులను చూచి నేర్చుకున్న అనేక చిన్న చిన్న పనులను తమ చేతులతో చేయగలవు. కానీ మానవునికెంతో సన్నిహితమైన దశకు చేరుకున్న వానరుని చేతినీ, అనేక లక్షల సంవత్సరాల కర్మల వల్ల అభివృద్ధి నొందిన మానవుడి చేతిని చూస్తే ఎంతో భేదం కనబడుతుంది. కండ రాల సంఖ్య ఒక్కటే, నిర్మాణం కూడా ఒక్కటే. అయినా ఎంతటి నికృష్టస్థితిలోని ఆటవికుడైన మానవుని హస్తం కూడా ఎంతో అభివృద్ధి చెందిన వానర హస్తం చేయలేని వందలాది పనులను అలవోకగా చేస్తుంది. వానర హస్తం ఏ చిన్న రాతి పనిముట్టును ఎంత బండగా నైన చేసి ఎరుగదు. భారతదేశంలోని భౌతికవాద చింతన అన్ని కీలక పరిణామాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది. మానవ జాతి ప్రతి అడుగులో తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ ముందుకు నడిచింది. ఈ భౌతిక దృక్పథంతో కూడిన మానవ ప్రయాణానికి భావవాదం ఒక పెద్ద అవరోధంగా నిలిచింది. మానవ ప్రగతిలో అసమానతలు సృష్టించింది. చరిత్ర పరిణామ క్రమంలో మానవ సమాజాన్ని సమన్వయించడాన్ని మార్క్స్ గతి తార్కిక చారిత్రక భౌతికవాద దృక్పథం అన్నాడు. ఈ క్రమంలో భారత సమాజాన్ని పరిశీలిస్తే చార్వాకులు భారత ఉత్తరఖండంలో భౌతిక సిద్ధాంత కర్తలుగా మన ముందు నిలుస్తారు. వారికి ఎదురు నిలిచిన వైదికులు భావ వాదానికి కొమ్ము కాసిన ప్రతినిధులు అయ్యారు. వేద వాఙ్మయానికి ప్రత్యామ్నాయంగా భారతీయ భౌతికవాదంగా చార్వాకవాదం ముందుకొచ్చింది. భారతీయ భౌతికవాదాన్ని సాంఖ్యదర్శనం ముందుకు తీసుకువెళ్ళింది. ఈ సాంఖ్య శాస్త్రానికి మూల పురుషులు కపిలుడు, అసురీ, పంచశిఖుడు, ఈశ్వర కృష్ణుడు. ఈశ్వర కృష్ణుని 26 మంది గురుతరాల నుండి ఈ సాంఖ్యం బోధింపబడినట్లు చెప్పబడింది. ఒక్కొక్క గురువు నుండి మరొక గురువు తరానికి 30 సంవత్సరాల అంతరం ఉందని అనుకుంటే, 780 సంవ త్సరాల అంతరం కపిలుడికీ, ఈశ్వర కృష్ణుడికీ ఉంది. దీనిని బట్టి కపిలుడు క్రీ.పూ.7, 8 శతాబ్దాల వాడై ఉండవచ్చునని చరిత్రకారుల అంచానా. బుద్ధుడి మీద కూడా సాంఖ్య ప్రభావం ఉందనేది స్పష్టం. బుద్ధుడు క్రీ.పూ. 6వ శతాబ్దం వాడనుకుంటే సాంఖ్య సిద్ధాంతం అప్పటికే ప్రాచుర్యం పొంది ఉంది. దీనినిబట్టి కూడా కపిలుని సాంఖ్య శాస్త్రం క్రీ.పూ. 8 శతాబ్దిదని అనుకోవచ్చు. ఇకపోతే సమాజ నిర్మాణానికి సంబంధించిన మూలాలను అధ్య యనం చేయకుండా, సమాజ వ్యవస్థను ఉన్నదున్నట్లుగా అంగీకరించడం యధాతథవాదం. అది మార్పును అంగీకరించని వాదం. మార్పునకు భావజాలం ఒక చోదకశక్తి. దళితుల చరిత్ర నిర్మాణంలో హేతువాదమే కీలకం అవుతుంది. బి.ఆర్. అంబేడ్కర్ హేతువాద దృక్పథంతోనే సామాజిక చరిత్ర నిర్మాణంలోని చిక్కుముడులను విప్పారు. కానీ లిఖిత పరమైన ఆధారాలు లేవని వీరి చరిత్రను మనువాదులు నిరాకరిస్తారు. భారతదేశంలో మనువాదం ఉత్పత్తికి భిన్నమైనది. జీవిక కోసం సృష్టించిన ఆ«ధ్యాత్మిక కల్పన వాదం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి చివరికి దేశ చరిత్రను గజిబిజి చేసింది. అనేక వైరుద్ధ్యాలు, ప్రక్షిప్తాలతో కూడిన సాహిత్యంలో తాత్విక అంశాలు, చారిత్రక అంశాలు మృగ్యమైనాయి. ప్రజలు ఎల్లప్పుడు రాజకీయాల్లో వంచనకు, ఆత్మ వంచనకు తెలివి తక్కువగా బలి అవుతూనే ఉన్నారు. అన్ని నైతిక, మత, రాజ కీయ, సాంఘిక పదజాలాల ప్రకటనల వెనుక ఏదో ఒక వర్గపు ప్రయోజనాలు దాగివున్నాయనే విషయాన్ని గ్రహించేంత వరకు వారలా బలి అవుతూనే ఉంటారు. ప్రతి పురాతన సంస్థ అది ఎంత అనాగరికమైనదిగా, కుళ్ళిపోయినదిగా కనబడినప్పటికీ పాలక వర్గాలకు చెందిన కొన్ని శక్తులచే అది నిలబెట్టబడుతోంది. ఈ విషయాన్ని గ్రహించనంతవరకూ సంస్కరణ వాదులు, అభివృద్ధి కాముకులు పాత వ్యవస్థను సమర్థించే వారి చేత మోసగించబడుతూనే వుంటారు. ఆ వర్గాల ప్రతిఘటనను పటాపంచలు చేయడానికి ఒకే ఒక మార్గం వుంది. అదేమిటంటే మన చుట్టూ ఉన్న సమాజంలోనే పాతను తుడిచి వేసి కొత్తను సృష్టించే సామర్థ్యం కలిగివున్న శక్తులను విజ్ఞానవంతులను చేసి సంఘటిత పర్చడం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
రాజ్యాంగమే సమ సమాజానికి దిక్సూచి
భారతదేశంలో రాజ్యాంగం అమలైన జనవరి 26 ఒక మహత్తరమైన పండుగదినం. భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను కలిగిస్తానని ప్రజలకు వాగ్దానం చేసింది. ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ ఇస్తానని భరోసా ఇచ్చింది. సమాన హోదా, సమాన అవకాశాలు, సమైక్యతా భావన, సోదర భావన కలిగించడానికే రాజ్యాంగం రూపొందింది. సమతా భావాలను అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అమెరికా, బ్రిటన్ రాజ్యాంగాల నుంచి, ఫ్రెంచ్ విప్లవం నుంచి ఆయన స్ఫూర్తి పొందినా... బౌద్ధ తత్వంలోని ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, మానవత్వం, సమానత్వం, స్వేచ్ఛ, తర్కం, ప్రశ్న వంటి అనేక భావాల్ని పొందుపర్చడం వల్లే, స్వాతంత్య్రం వచ్చిన తరువాత రక్తపాతం లేని సమాజంగా భారతదేశం రూపుదిద్దుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్... మహా మేధావి, ఆలోచనాపరుడు, లౌకికవాద శిఖరం, సమతా దర్శనకర్త, గొప్పవక్త, లోతైన రచయిత. ఆయన శైలిలో గాఢత, విశ్లేషణ బలంగా వుంటాయి. విద్యా సంపన్నమైన ఆయన భాషలో సరళత, అభివ్యక్తిలో సాంద్రత కనిపిస్తాయి. అంబేడ్కర్ మానవ హక్కుల పోరాట ధీరుడు. బౌద్ధంలో ఉన్న సామాజిక సమతా నీతిని రాజ్యాంగంలో పొందుపర్చారు. ఆయన జీవితంలో అస్పృశ్యతను ఎదుర్కోవడం ప్రధాన అంశం అయ్యింది. మానవోత్తేజితమైన, వైజ్ఞానికమైన ఎన్నో కార్యక్రమాల్లో అస్పృశ్యులకు చోటు లేకపోయిందని మథనపడ్డారు. అందువలననే అస్పృశ్యతా నివారణా చట్టం గురించి పోరాడారు. ఈ సమాజాన్ని అస్పృశ్యత లేని సమాజంగా రూపొందించాలని తపన పడ్డారు. దాని వల్ల ఎంతో మంది తమ ప్రతిభకు తగిన స్థానం లేక సంఘర్షణకు గురయ్యారు, అణచి వేయబడ్డారు. అంబేడ్కర్ ఒక తాత్వికుడు కూడా. కుల సమాజానికి ప్రత్యామ్నాయంగా కుల నిర్మూలనా సమాజాన్ని బోధించారు. అగ్రకుల రాజ్యాధికారంలో దళితులకు విముక్తి లేదని చాటారు. ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించుకోవడానికి రాజ్యాధికారం అవసరం అని ప్రబోధించారు. ఆయన రాజకీయ తత్వశాస్త్రం భావాత్మకమైంది కాదు... అది సాంఘిక, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించగల సత్తా కలిగినది. బొంబాయి వంటి నగరాల్లో కూడా కులతత్వం వ్యాపించి ఉండ టంతో అంబేడ్కర్ సోదరులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుల తత్వపు గొడ్డలి వేటు వారిని చిన్నప్పుడే తాకింది. ఒకే పాఠశాలలో చదివే పిల్లలు ఒక కూజా నీళ్ళు తాగలేకపోవడం, తోటి విద్యార్థులు ఆ కూజాలోని నీళ్ళను పైనుంచి పోస్తే దోసిళ్ళు పట్టి త్రాగవలసి రావడం వంటి ఘటనలు అంబేడ్కర్ గుండెల్ని పిండివేశాయి. ఆ గాయాలే రాబోయే కాలంలో కుల నిర్మూలన గ్రంథం రాయడానికి పునాదులేశాయి. కేవలం నీటి దగ్గరే కాదు, భాష దగ్గర కూడా ఆయనకు అస్పృశ్యత ఎదురైంది. అంబేడ్కర్ హైస్కూల్లో ప్రత్యేక పాఠ్యభాగంగా సంస్కృతాన్ని కోరుకున్నారు. ఒక అస్పృశ్యుడు సంస్కృతం నేర్చుకోవడం ఏమిటని నిరాకరించారు. దాంతో పర్షియన్ భాషను తీసుకోవలసి వచ్చింది. కానీ సంస్కృతాన్ని స్వయంగా కష్టపడి నేర్చుకున్నారు. వాల్మీకి, వ్యాసుడు, కపిలుడు, లోకాయతులు ఇంకా ఎందరో బ్రాహ్మణేతరులు, క్షత్రియులు సంస్కృతంలో గ్రంథాలు రాశారు. ఎందరో పాశ్చాత్య పండితులు సంస్కృతం నేర్చుకుని, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, కావ్యాలు, అన్నీ ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. అంబేడ్కర్ కూడా వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు అన్నింటినీ అధ్యయనం చేసి, వ్యాఖ్యానించారు. ఏ భాషైనా, ఏ మనిషైనా నేర్చుకోవచ్చని నిరూపించారు. అభివృద్ధిని తరచిచూస్తే... దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతోందని ఇప్పుడు గొప్పగా చెప్పుకొంటున్నాం. కానీ గణతంత్ర దినోత్సవ వేళ కొన్ని కఠిన వాస్తవాలను మనం అంగీకరించాల్సి ఉంటుంది. 2023 ప్రపంచ ఆకలి సూచీలో 125 దేశాల్లో ఇండియా 111వ స్థానంలో ఉంది. దేశంలో 81.35 కోట్ల మందికి ఇప్పటికీ ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి వస్తున్నదంటేనే దేశం ఎక్కడ ఉన్నదో అర్థమవుతుంది. కూడు, గూడు, బట్ట లేని ప్రజలు ఇంకా ఉన్నప్పుడు రాజ్యాంగం అమలవుతున్నట్టా అనే ప్రశ్న ఎదురవుతుంది. అంబేడ్కర్ భూమిని జాతీయం చెయ్య మన్నారు. కానీ అదేమో కార్పోరేట్ చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తిండి గింజల వల్ల ఇక్కడి వ్యవసాయం సంక్షోభంలో వుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్త్రాల వల్ల చేనేత పరిశ్రమ కుంటుపడింది. భారతదేశంలో పేదరికం ఎందుకు ఉందంటే రాజ్యాంగాన్ని నూటికి 90 శాతం ఉల్లంఘించడం వల్లనే అని చెప్పొచ్చు. ప్రజలు ఇప్పటికీ అనారోగ్యంతో కునారిల్లుతున్నారు. పారిశుద్ధ్య వ్యవస్థ దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టినా, ఎన్నో పట్టణాలు ఇంకా మురికి కూపాలుగానే వున్నాయి. వందశాతం బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాలుగా ప్రకటించినవాటిల్లో కూడా 71 శాతం మేరకే నిరోధించగలిగారని జాతీయ గణాంక కార్యాలయ సర్వే వెల్లడించింది. ఇళ్లు, వ్యాపార, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేసిన తరువాతే బయటకు వదిలే నగరాలకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పోటీలో వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ వ్యవస్థ సరిగ్గా లేని నగరాలకూ పురస్కారాలు ఇవ్వడం... పోటీ నిష్పాక్షికతపై సందేహాలు లేవనెత్తుతోంది. ఇకపోతే రోడ్లు నెత్తుటిమయం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి గంటకూ 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, 19 మంది మృత్యువాత పడుతున్నారని 2022 నాటి గణాంకాల్ని కేంద్ర సర్కారే ప్రస్తావిస్తోంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ప్రమాదాల్లో 11.9 శాతం, మృతుల సంఖ్యలో 9.45 శాతం, క్షతగాత్రుల లెక్కలో 15.3 శాతం పెరుగుదల రహదార్ల రక్తదాహ తీవ్రతను కళ్లకు కడుతోంది. రోడ్డు ప్రమాద మృతుల్లో 18–45 ఏళ్ల వయస్కులే 69 శాతం దాకా ఉంటున్నారన్న వాస్తవం గుండెల్ని మెలిపెట్టేదే. కుటుంబ పోషణకు రోడ్డెక్కిన మనిషి అకాల మృత్యువాత పడితే, ఇంటిల్లిపాదీ రోడ్డున పడే దుఃస్థితి ఏటా లక్షల మంది అభాగ్యుల్ని దుఃఖసాగరంలో ముంచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రహదారి ప్రమాద మృతుల సంఖ్య అయిదు శాతం దాకా తగ్గితే, అంతకు రెట్టింపు ఇండియాలో పెరగడం నిశ్చేష్టపరుస్తోంది. రహదార్ల మారణహోమానికి కారణమేమిటో సుప్రీంకోర్టే నియమించిన నిపుణుల కమిటీ పూసగుచ్చినా, సరికొత్త మోటారు వాహనాల చట్టం ద్వారా అవ్యవస్థను ఊడ్చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా జరిగిందీ ఒరిగిందీ ఏమీ లేదు. వాహన వేగాన్ని 5 శాతం తగ్గించ గలిగినా ప్రమాద మరణాల్ని 30 శాతం దాకా నియంత్రించగల వీలుందని తెలిసినా ‘ఏడెనిమిది సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగం’ అందుకొనే శకటాలు ఎందుకు రోడ్డెక్కుతున్నట్లు? ఇకపోతే వాయు కాలుష్య భూతం భయపెడుతోంది. శారీరక మానసిక సమస్యలు పెంచి, ఏటా లక్షల కుటుంబాల్లో శోక సంద్రాల్ని ఉప్పొంగిస్తున్న వాయు కాలుష్య భూతం గర్భస్త పిండాల్ని సైతం కర్కశంగా కాటేస్తోంది. వాయు కాలుష్యంతో పోటీపడుతూ... గాలిలో, నీటిలో, భూమిపై అంతటా పరుచుకుంటున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఆరోగ్య, ఆహార రంగాల్లో పెను సంక్షోభం సృష్టిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు గాలిలో ఉన్నా, భూగర్భ జలాల్లోకి చేరినా ప్రమా దమే. అవి మనుషుల దేహాల్లోకి చొచ్చుకుపోయి, శరీర కణాలను దెబ్బతీస్తాయనీ, క్యాన్సర్ల ముప్పు పెచ్చరిల్లుతుందనీ ఇప్పటికే పలు దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధకులు హెచ్చరించారు. అందుకే అంబేడ్కర్ ఆశయాలు రాజ్యాంగంలో ప్రతిఫలిస్తు న్నాయా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. నిజానికి రాజ్యాంగంలో ఆయన ఆలోచనలు ప్రతిఫలిస్తే 100 శాతం అక్షరాస్యత ఏర్పడుతుంది. విద్య మహోన్నత స్థాయికి చేరుతుంది. ప్రపంచం గర్వించే మేధో సంపన్నులు ఆవిర్భవిస్తారు. పేదరిక నిర్మూలన జరిగి, సమ సమాజం ఏర్పడుతుంది. స్త్రీలు ఆత్మ రక్షణతో, పురుషులతో సమానంగా జీవించగలుగుతారు. యువత శక్తి సంపన్నులై సంపదను సృష్టించగలుగుతారు. నిరుద్యోగం, పేదరికం లేని సమ సమాజం ఏర్పడుతుంది. అందుకే రాజ్యాంగ మార్గంలో నడుద్దాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
సామాన్యులను వేధించే ప్రశ్నలెన్నో!
ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు అలా ముగిశాయో లేదో... 2024 సాధారణ ఎన్నికల ఫలితాల గురించిన ఊహాగానాలు అప్పుడే మొదలైనాయి.ఈ ఫలితాల ఊపుతో బీజేపీనే తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతున్న విషయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ముస్లింలకు సీట్లు ఇవ్వని బీజేపీ మళ్ళీ ఎలా అధికారంలోకి వస్తుందనే ప్రశ్న వేధిస్తోంది. అంకెలకు ఉద్వేగాలు ఉండవు. నిరావేశంగా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, వాస్తవాలు నిగ్గుదేలుతాయి. అధికార పక్షానికీ, ప్రతిపక్షానికీ ఓట్ల శాతంలో తేడా అతి తక్కువ. ఆ ఎన్నికల ఫలితాలకు ముందూ, తరువాతా ఆయా పార్టీల బలాబలాల్లో పెద్ద మార్పు లేదు. మరి 2024లో ప్రతిపక్షాల విజయం ఒక ఎండమావి అని ఎలా నిర్ణయిస్తారు? ఈనాడు భారతదేశం మొత్తం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎన్నికల గురించే ఆలోచిస్తోంది. అయితే ఈ ఎన్నికల కంటే కూడా 2024 సాధారణ ఎన్నికలలో బీజేపీ మళ్లీ గెలుస్తుందా లేక కాంగ్రెస్తో కూడిన ‘ఇండియా’ కూటమి వస్తుందా అనే దాని గురించి ప్రజలు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ‘ఇండియా’ కూటమికి సంబంధించి ఈ నాలుగు రాష్ట్రాల సీట్ల ఎంపిక విషయంలో కాంగ్రెస్ అలసత్వం చేసింది. ఈ ఎన్నికలలో బీజేపీకీ, కాంగ్రెస్కూ వచ్చిన ఉన్న ఓట్ల శాతంలో తేడా అతి తక్కువ. అసలు ముస్లివ్ులకు సీట్లు ఇవ్వని బీజేపీ, మళ్ళీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఎలా అధికారంలోకి వస్తుంది అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. మొన్న తెలంగాణ ఎన్నికలలో గెలిచాక ప్రోటెవ్ు స్పీకర్గా అక్బరుద్దీన్ను కాంగ్రెస్ నియమించినందుకు అసెంబ్లీలో ఆయన సార థ్యంలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయకుండా బీజేపీ బాయ్ కాట్ చేసింది. ఇది అప్రజాస్వామిక చర్య. ఎందుకంటే ముస్లివ్ుల పాత్ర లేకుండా హైదరాబాద్ జీవితమే లేదు. ప్రపంచ మొత్తం పర్యాటకులు హైదరాబాద్ బిర్యానీని ఇష్టపడతారు. చార్మినార్ దగ్గర సెంటు, గాజులు కొనుక్కొనని హిందూ స్త్రీలు లేరు. వారి ఉత్పత్తులను అనుభవిస్తూనే వారిని శత్రువులుగా చూడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వారి సంగీతాన్ని ఆస్వాదిస్తూ, వారి హీరోలతో సినిమాలు నిర్మించి వందల కోట్లు సంపాదిస్తూ, రాజకీయంగా వచ్చేటప్పటికి మాత్రం వారిని నిరోధించడం అప్రజాస్వామికం కాదా! మరో పక్క సామాజిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు ఏంటంటే, ఈ ఎన్నికలలో వచ్చిన సీట్ల సంఖ్య మనకు అంత ప్రధానం కాదు. ఓట్ల శాతమే మనకు నమూనా. మూడు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు ఎదురు దెబ్బేననడం సందేహం లేదు. అంతేకాదు 2024లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్న వారికి ఆ ఫలితాలు తీవ్ర ఆశాభంగం కలిగించాయని కూడా చెప్పొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ చరిత్రాత్మక పునరాగమనంతో నెల కొన్న ఉత్సాహాన్ని ఉత్తరాది అపజయాలు ఒక విధంగా తగ్గించి వేశాయి. తదుపరి లోక్సభ ఎన్నికలలో బీజేపీకి అవి అనేక అను కూల తలను సృష్టించాయని కూడా అంటున్నారు. కానీ ఇదెంతవరకు నిజం? అంకెలకు ఉద్వేగాలుండవు. నిరావేశంగా ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషించండి, వాస్తవాలు నిగ్గు దేలుతాయి. ఆ ఎన్నికల ఫలితాలకు ముందూ, తరువాతా ఆ యా పార్టీల బలాబలాల్లో పెద్ద మార్పు లేదని స్పష్టమవుతుంది. మరి 2024లో ప్రతిపక్షాల విజయం ఒక ఎండమావి అని ఎలా నిర్ణయిస్తారు? మూడు రాష్ట్రాలలో బీజేపీకి తిరుగులేని విజయం లభించడంతో, కేంద్రంలో ఆ పార్టీని మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు ప్రగాఢంగా కోరుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదలా ఉంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో ప్రధాన రాజ కీయ పక్షాలకు లభించిన ఓట్ల గణాంకాలను చూద్దాం. మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో మొత్తం 12.29 కోట్ల ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో బీజేపీకి 4.82 కోట్లు, కాంగ్రె స్కు 4.92 కోట్లు (‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకొంటే 5.06 కోట్లు) లభించాయి. మధ్యప్రదేశ్లో మినహా, ఓట్ల పరంగా బీజేపీకి లభించిన ఆధిక్యత స్వల్ప స్థాయిలో మాత్రమే ఉంది. తెలంగాణాలో బీజేపీ కంటే కాంగ్రెస్కు పెద్ద మొత్తంలో ఓట్లు లభించాయి. మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓట్ల లోటును తెలంగాణ గణ నీయంగా భర్తీ చేసింది. మీడియా ఊదరకు విరుద్ధంగా తాజా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ప్రజల మద్దతు మరీ విశేషంగా ఏమీ లభించలేదని చెప్పొచ్చు. అసలు బీజేపీ ప్రాతినిధ్యం వహించే హిందూ ధార్మిక వ్యవస్థ గురించి అంబేడ్కర్ విశ్లేషించారు. హిందూమతం ధర్మవ్యాపక సంస్థ (మిషనరీ మతం) అవునా, కాదా అనేది చర్చనీయాంశం. హిందూ మతం ఏనాడూ ప్రచారక మతంగా లేదని కొందరంటారు. ఒకానొక కాలంలో హిందూ మతం ప్రచారక మతంగా ఉన్నదనడమే సరిౖయెన వాదంగా కన్పిస్తుంది. అది ప్రచారక మతం కాకపోతే భారత భూభాగంలో ఇంతగా వ్యాపించి ఉండేది కాదు. ఈనాడు అది ప్రచారక మతం కాదనేది కూడా సత్యమే. ఒకప్పుడు ప్రచారక మతంగా ఉన్న హిందూమతం ఇప్పుడెందుకు దానికి వ్యతిరేకంగా మారింది? ఈ ప్రశ్నకు నా జవాబు ఇది: హిందూమతం ప్రచారక మతంగా ఎప్పుడాగి పోయిందంటే, హిందువులలో కులవ్యవస్థ ఏర్ప డినప్పుడు! కుల వ్యవస్థకూ, మతం మార్పునకూ పొసగదు. మతం మార్పునకు కావలసింది విశ్వాసాలూ ,సిద్ధాంతాలూ స్వీకరించడం మాత్రమే కాదు; ఈ మతం మార్పులో అంతకంటే ముఖ్యమైన మరొక విషయం ఉంది. అది – మతం మార్చుకొన్న వారికి సంఘ జీవనంలో లభించే స్థానం. ఈనాడు ఇతరుడెవరైనా హిందూ మతాన్ని స్వీకరించదలిస్తే, హిందూ మతంలో అతని స్థానమెక్కడ? ఏ కులంలో చేర్చుకోవడం? అన్యులైన వారిని తన మతంలో చేర్చుకోవాలనుకునే ప్రతీ హిందువునీ తికమకపరిచే సమస్య ఇది. ఏదో ఒక క్లబ్బులో చేరినట్టు ఒక కులంలో అందరూ చేరడానికి వీలు లేదు. క్లబ్బు సభ్యత్వం వలే కుల సభ్యత్వం స్వేచ్ఛాయుతమైంది కాదు. ఆ కులంలో పుట్టిన వారికే ఆ కులంలో సభ్యత్వం. అది కుల న్యాయం. ఈ న్యాయం కింద ఏ కులానికి ఆ కులమే స్వయం స్వతంత్రం. ఎవరైనా కొత్త వారిని ఏ కులంలోనైనా చేర్పించే అధికారం ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. నిజానికి అంబేడ్కర్ హిందూ భారతాన్ని ఆశించ లేదు. లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద భారతాన్ని ఆశించాడు. ఆయన మార్గంలో నడవకపోతే భారతదేశం ఆర్థిక, సాంఘిక,సాంస్కృతిక, విద్య, తాత్విక రంగాలలో అణగారిపోతుంది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019