breaking news
-
భగభగల్లోనూ బ్రహ్మరథం
సీఎం జగన్ తెచ్చిన వ్యవసాయ సంస్కరణలు రైతును తిరిగి బతికించాయి. గతంలో వ్యవసాయం చేసి పండించిన పంటను దళారులకు అమ్ముకోవాల్సి వచ్చేది. వారు చెప్పిందే ధర. ఆరుగాలం కష్టపడితే లాభం రాకపోగా, నష్టమే కనిపించేది. ఎవరికీ చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు మా గ్రామంలోనే రైతుభరోసా కేంద్రం వచ్చింది. రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు ఇక్కడే ఇస్తున్నారు. పంట నష్టపోతే బీమా అందిస్తున్నారు. నేను 18 ఎకరాలు సాగుచేస్తున్నాను. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.4 లక్షల వరకు లబ్ధిపొందాను. ఇన్నేళ్ల నా జీవితంలో రైతు ఆనందంగా ఉన్నది ఇప్పుడే చూస్తున్నాను. ఇలాంటి నాయకుడే మళ్లీ సీఎం కావాలి. – సత్యనారాయణ, రైతు, రంగంపేట గ్రామం, అనపర్తి నియోజకవర్గం (‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, అభిమానుల కోలాహలం మధ్య సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర 18వ రోజు శుక్రవారం కాకినాడ జిల్లాలో కోలాహలంగా సాగింది. అనపర్తి మండలం రంగంపేటకు సమీపంలోని ఎస్టీ రాజపురం వద్ద ఏర్పాటుచేసిన నైట్ స్టే పాయింట్ నుంచి ఉదయం రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్, ఉండూరు మీదుగా కాకినాడకు చేరుకుంది. మార్గమధ్యంలో మహిళలు హారతులు పట్టి సీఎం జగన్కు జేజేలు పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు వృద్ధులు.. రైతులు.. అక్కచెల్లెమ్మలు పల్లెల నుంచి పరుగుపరుగున రంగంపేటకు చేరుకున్నారు. సూరంపాలెం వరకు 8 కి.మీ. మేర తమ అభిమాన నేత వెంట నడిచారు. సూరంపాలెంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థులు ‘థ్యాంక్యూ సీఎం సర్’ అంటూ భారీ బ్యానర్తో స్వాగతం పలికారు. మీవల్లే మేం ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నాం. ‘అన్నా.. నువ్వు జాగ్రత్త, క్షేమంగా వెళ్లి.. సీఎంగా తిరిగి రా’ అంటూ ఒకరు.. ‘మొనగాడిలా ఒక్కడే వస్తాడు.. చరిత్ర సృష్టిస్తాడు’ అని ఇంకొకరు.. ‘పేదవాడి ఇంట్లో కష్టం లేకుండా ఉండాలంటే మళ్లీమళ్లీ నువ్వే సీఎంగా రావాలన్నా’ అంటూ మరో విద్యార్థి, ‘అన్నా నువ్వు జాగ్రత్త.. నీ ఆరోగ్యం జాగ్రత్త..’ ‘వైనాట్ 175.. వన్స్మోర్ సీఎం జగనన్న..’ వంటి ప్లకార్డులతో విద్యార్థులు తమ ఆనందాన్ని, అభిమానాన్ని చాటారు. జగన్నినాదాలతో హోరెత్తిన రంగంపేట.. ఉదయం ఎస్టీ రాజపురం వద్ద ప్రారంభమైన యాత్రకు గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలతో రంగంపేట కిక్కిరిసిపోయింది. దారిపొడవునా జనం జగన్ నినాదాలతో హోరెత్తించారు. సామర్లకోట సెంటర్ వద్ద మహిళలు జగన్ కాన్వాయ్కి హారతులిచ్చారు. జానపద నృత్యాలు, తీన్మార్ నృత్యాలతో జననేతకు స్వాగతం పలికారు. అచ్చంపేట ఫ్లైఓవర్ వద్ద ఓ పాత ఫొటోతో ఎదురువస్తున్న వృద్ధురాలిని చూసిన జగన్ తన వాహనాన్ని ఆపి ఆమెను పలకరించగా.. తన పేరు మోర్త కుమారి అని, గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఈ మార్గంలో వచ్చినప్పుడు తాను జున్ను పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు ఆయన వచ్చారు, ఇన్నేళ్లకు మీరు వచ్చారంటూ ఆమె తెగ సంబరపడింది. అలాగే, కాకినాడ జిల్లా నాయకంపల్లి వద్ద సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కృష్ణవేణి అనే రోగిని తీసుకుని ఆమె బంధువులు జగన్ కోసం ఎదురుచూస్తూ రోడ్డుపై వేచివున్నారు. వీరిని చూసి జగన్ తన వాహనాన్ని ఆపి వారి వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. చికిత్స నిమిత్తం ఖర్చుచేసిన బిల్లులను జాగ్రత్తచేయాలని పేషెంట్ బంధువులకు సూచించారు. కృష్ణవేణికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించే చర్యలను తక్షణమే చేపట్టాలని ఆరోగ్యశ్రీ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మనసున్న మారాజు అని, ప్రజా సమస్యలపట్ల జగన్ స్పందిస్తున్న తీరును చూసి మళ్లీ సీఎంగా ఆయనే రావాలని అక్కడున్న వారంతా బలంగా కోరుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఉండూరు క్రాస్ నుంచి బయల్దేరి కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగసభకు చేరుకున్నారు. అభిమానం ముందు ఎండ ఎంత? ఓ పక్క భానుడు భగభగలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బయటకు రావడానికి భయపడుతుంటే.. కాకినాడలో మాత్రం జనం ఎండను సైతం లెక్కచేయకుండా అచ్చంపేట జంక్షన్కు తండోపతండాలుగా తరలివచ్చారు. తమకు మేలు చేసిన ప్రజా నాయకుడు సీఎం జగన్ తమ ప్రాంతానికి వచ్చాడని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. మా అభిమానం ముందు ఈ ఎండ తీవ్రత ఎంత.. అంటూ జగన్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక సభా ప్రాంగణమైతే జనంతో కిక్కిరిసిపోయింది. సభ అనంతరం యాత్ర పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, కత్తిపూడి, బెండపూడి, అన్నవరం, తుని మీదుగా యాత్ర సాగింది. కత్తిపూడి కూడలి నుంచి ప్రజలు ప్లకార్డులు పట్టుకుని మానవహారం నిర్వహించారు. లోవ సెంటర్లో అమ్మవారి ఆశీర్వాదం పొందారు. తునిలో రోడ్ షో హైలెట్ తునిలో నిర్వహించిన రోడ్డు షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లేజర్ లైటింగ్, యువత డ్యాన్సులతో సీఎం జగన్కు ఘనంగా స్వాగతం పలికారు. జాతీయ రహదారికి ఇరువైపులా అభిమానులు నిలబడి తమ అభిమాన నేతకు స్వాగతం పలికారు. జగన్ సాయంత్రం తుని వస్తారని తెలిసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మధ్యాహ్నం నుంచే జాతీయ రహదారి పైకి భారీగా తరలివచ్చారు. కానీ ఆయన రాత్రి 8.25కు తుని చేరుకున్నారు. మహిళలు గుమ్మడికాయలతో హారతి ఇచ్చి దిష్టితీశారు. జగన్ బస్సుపై నుంచి వారికి అభివాదం చేస్తూ రాత్రి పాయకరావుపేటకు చేరుకున్నారు. జాతీయ రహదారిపై ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ రాత్రి 9.15 గంటలకు వడిచర్ల వద్ద నైట్ స్టే క్యాంపునకు జగన్ చేరుకున్నారు. సామాన్యులకు ‘కార్పొరేట్’ చదువులు జగన్ సర్ వచ్చాకే సామాన్యుల పిల్లలకు నాణ్యమైన చదువులు అందుతున్నాయి. మాది అనంతపురం జిల్లా గంగవరం గ్రామం. ఇంజినీరింగ్లో ర్యాంక్ రావడంతో కాకినాడ జిల్లాలో సీటు వచ్చింది. సీఎస్ఈ (డేటా సైన్స్)లో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాను. జగన్ రాకముందు.. వచ్చాక రాష్ట్రంలో చదువులెలా ఉన్నాయో చాలా దగ్గర నుంచి గమనించాను. మా స్కూల్లోనే జగన్ సీఎం కాకముందు పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలు వచ్చాయి. స్కూల్లో ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చింది. ఇప్పుడు జగనన్న విద్యాదీవెన పథకంతో ఇంజినీరింగ్ చేస్తున్నాను. మా అన్నయ్యకు కూడా విద్యాదీవెన అందుతోంది. మా నాన్నకు రైతుభరోసా వచ్చింది. ఇలాంటి సీఎంను నేను చూడలేదు. – చైతన్యరెడ్డి, విద్యార్థిని, అనంతపురం జిల్లా జగన్ సర్ రుణం తీర్చుకోలేనిది.. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువు అంటే భయమేసేది. టీచర్లు ఉండేవారు కాదు. టాయిలెట్లు ఉండేవి కావు. వర్షం వస్తే క్లాస్రూంలు కారిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి. చదువులు బాగున్నాయి. గతంలో ఇంజినీరింగ్ చేసినా ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీలేదు. నా పాలిటెక్నిక్ చదువు పూర్తిగా ప్రభుత్వ సాయంతోనే పూర్తయింది. మా చెల్లి, తమ్ముడు (కజిన్స్)కి అమ్మఒడి వస్తోంది. నా డిప్లొమా అవుతుండగానే జాబ్ వచ్చింది, కానీ, జగనన్న విద్యాదీవెన ఇస్తుండడంతో ఇంజనీరింగ్ చదవగలుగుతున్నాను. జగన్ సర్ గ్రేట్. హత్యాయత్నం జరిగినా లెక్కచేయలేదు, నవ్వుతూనే ప్రజల్లో ఉన్నారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. – తనూజ, బీటెక్ (ఈసీఈ సెకండియర్), కాకినాడ జగనన్న వచ్చాకే మేలు జరిగింది.. నాకు ఇద్దరు పిల్లలు, నా భర్త పాల వ్యాపారం చేస్తాడు. గతంలో రేషన్ కార్డు కోసం జన్మభూమి కమిటీలో ఎన్నోసార్లు అప్లై చేసినా ఇవ్వలేదు. కారణం కూడా చెప్పలేదు. జగనన్న సీఎం అయ్యాక ఇంటికి వలంటీర్ వచ్చి మరీ కార్డు ఇచ్చారు. మా పాపకి రెండుసార్లు అమ్మఒడి ఇచ్చారు. ఇంటి స్థలం కూడా ఇచ్చారు. ఇంత మేలు చేసిన అన్న మా ఊరికి వస్తే చూడకుండా ఉండలేం కదా.. అందుకే నా బిడ్డను తీసుకుని వచ్చాను. – ఈ. శ్రీలత, గాంధీనగర్, కాకినాడ చేబ్రోలు పట్టు రైతులకు సీఎం హామీ ముఖ్యమంత్రి తీరుతో పట్టు రైతుల హర్షాతిరేకాలు పిఠాపురం: చేబ్రోలు పట్టు రైతుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సందర్భంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చేబ్రోలు పట్టు పరిశ్రమకు చెందిన పట్టు రైతులు తమ సమస్యలు సీఎంకు వినతిపత్రం ద్వారా తెలియజేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే, బస్సుయాత్ర చేబ్రోలులో ఎక్కడా ఆగకుండా వెళ్లిపోయింది. తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే.. బస్సుయాత్ర ఆగకుండా వెళ్లిపోయిందని రైతులు నిరాశకు గురయ్యారు. ఇంతలో బస్సులో నుంచి రైతులు ప్రదర్శించిన ప్లకార్డులను చూసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో ఉన్న వారి ద్వారా వివరాలు తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన.. రైతుల వద్దకు వెళ్లి, వారి వినతిపత్రం తీసుకుని, వారి సమస్యను క్షుణ్ణంగా విని, తగిన పరిష్కారం చూపిస్తామని తన మాటగా చెప్పి రావాల్సిందిగా సీఎంఓ కార్యాలయ గ్రీవెన్స్ అధికారి ప్రదీప్ను ఆదేశించారు. దీంతో ఆ అధికారి రైతుల వద్దకు చేరుకుని, ముఖ్యమంత్రి తనను పంపించారని చెప్పారు. రైతులతో మాట్లాడి వారి సమస్యను ఆలకించి, వారి వినతిపత్రాన్ని స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారని రైతులకు వివరించారు. దీంతో.. సమయాభావంవల్ల సీఎం ఆగకుండా వెళ్లిపోయినా, రైతులను గుర్తించి.. వెంటనే స్పందించి అధికారిని పంపించడంపై పట్టు రైతులు ఆనందం వ్యక్తంచేశారు. -
బాబు గురి గులకరాయిపైనే!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘ఎన్నికలకు ఇక 25 రోజులే ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ న గారా కూడా మోగింది. ఇంటింటి ఆత్మగౌరవాన్ని, పేదలు, అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న మనందరి ప్రభుత్వానికి మద్దతు పలికేందుకు మీరంతా సిద్ధమేనా? జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు దాకా పెత్తందార్ల దోపిడీకి, మనందరి పేదల పక్షపాత ప్రభుత్వానికి మధ్య ఈరోజు క్లాస్వార్ జరుగుతోంది. చంద్రబాబు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే మంచి పనిగానీ, పథకాలుగానీ ఒక్కటీ లేవు కాబట్టే నాపై వేయించటానికి బాబుకు, ఆయన కూటమికి చివరకు గులక రాళ్లే మిగిలాయి. ఈ యుద్ధంలో ఆ పేదల వ్యతిరేక కూటమిని చిత్తుగా ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? మరోసారి జైత్రయాత్రకు సింహగర్జనతో సిద్ధం కావాలి. ఫ్యాన్కు 2 ఓట్లు వేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం’’అని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్లో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో భారీ జనసందోహాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. పసుపు పతి నిద్ర లేస్తాడు.. జాగ్రత్త! అభిమాన సముద్రంగా మారిన వరద గోదావరి ఇవాళ ఇక్కడ కనిపిస్తోంది. ఐదేళ్లుగా మనందరి ప్రభుత్వం మంచి చేసిందన్న నమ్మకం ఇక్కడ కనిపిస్తోంది. ఆ మంచిని కాపాడుకోవాలన్న సంకల్పం ఈరోజు మీ అందరిలో కనిపిస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. రాబోయే ఐదేళ్లు.. అంటే 1,825 రోజులు.. రాబోయే 60 నెలల పాటు మన బతుకులు ఎలా ఉంటాయి? అనేది నిర్ణయించే మన ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతున్న పథకాలు ఇక మీదట కూడా అందాలా? లేక అవి రద్దు కావడం అన్నది మీ ఓటుపైనే ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. జగన్కు ఓటు వేస్తే.. ఫ్యాన్పై రెండు ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయి. ఇది చరిత్ర చెబుతున్న నిజం. బాబు మోసాల మేనిఫెస్టో చెబుతున్న వాస్తవం. ఫ్యాన్కు ఓటు వేస్తే గ్రామగ్రామాన, పట్టణాల్లో సేవలందిస్తున్న జగన్ మార్కు సచివాలయాలన్నీ కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు, ముగింపు తథ్యం. ఫ్యాన్కు ఓటు వేస్తే అవ్వాతాతలకు ఇంటివద్దే రూ.3,000 పెన్షన్ అందుతుంది. ఇంటికే వచ్చి సేవలందిస్తున్న వలంటీర్ల ద్వారా జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా గత 58 నెలల్లో డీబీటీ ద్వారా మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. మళ్లీ పసుపు పతి నిద్ర లేస్తాడు! వదల బొమ్మాళీ.. వదల.. అంటూ మళ్లీ ఐదేళ్లు మీ రక్తం తాగేందుకు ప్రతి ఇంటికీ వస్తాడు. జాగ్రత్త సుమా..! ఒక్క ఫ్యాన్కు రెండు ఓట్లు వేస్తేనే.. ఫ్యాన్కు ఓటు వేస్తేనే విత్తనం నుంచి పంట విక్రయం వరకూ ఇప్పుడు సేవలందిస్తున్న ఆర్బీకేలు కొనసాగుతాయి. లేదంటే ఆర్బీకేలకు బాబు మార్కు కత్తిరింపులు, ముగింపు ఖాయం. ఫ్యాన్కు ఓటు వేస్తేనే రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఏటా క్రమం తప్పకుండా అందుతుంది. ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా, సున్నావడ్డీకే పంట రుణాలు, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే వ్యవసాయానికి 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోళ్లు నిరాటంకంగా జరుగుతాయి. లేదంటే మళ్లీ చంద్రబాబు మార్కు పాలన, మళ్లీ కత్తిరింపులు, పథకాలన్నీ ముగింపు జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచన చేయండి. పెద్దవారి పిల్లలు అసూయపడేలా.. ఫ్యాన్కు ఓటు వేస్తేనే.. గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, రూపురేఖలు మారిన స్కూళ్లు, 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్, బైజూస్ కంటెంట్, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, ఐఎఫ్పీ ప్యానళ్లు, 8వ తరగతి నుంచి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, ఉన్నత చదువులకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, డిగ్రీ విద్యార్థులకు సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా విదేశీ వర్సిటీలతో మన కాలేజీల అనుసంధానం, తొలిసారిగా డిగ్రీలో తప్పనిసరి ఇంటర్న్షిప్.. ఇవన్నీ కొనసాగుతాయి. మీ జగన్ ఇదే స్థానంలో ఉంటే మరో పదేళ్లలో పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లిష్ మాట్లాడతారంటే.. వారు అనర్గళంగా మాట్లాడే మాటలకు పెద్దవారి పిల్లలు అసూయ పడే పరిస్థితి వస్తుంది. బాబుకు ఓటేస్తే కత్తిరింపులు.. ముగింపు ఫ్యాన్పై రెండు ఓట్లు పడితే జగన్ మార్కు విప్లవాలన్నీ కొనసాగుతాయి. లేదంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దు, స్కూళ్ల రూపురేఖలు మార్చే నాడు–నేడు రద్దు, బడి పిల్లలకు రోజుకో మెనూతో ఇచ్చే గోరుముద్ద రద్దు, బడులు తెరిచే సమయానికి పిల్లలకు ఇస్తున్న విద్యాకానుక రద్దు, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన రద్దు.. 8వ తరగతి నుంచి పిల్లల చేతుల్లో ట్యాబ్లు రద్దు.. వీటన్నిటికీ కత్తిరింపులు ముగింపే! 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు.. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు రద్దు అవుతాయి. అందుకే ఆలోచన చేయండి. పొరపాటు జరిగిందంటే..మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. నిద్ర లేచి మీ పిల్లల చదువులు, బడులు అన్నిటికీ లకలక.. లకలక అంటూ ముగింపు పలుకుతుంది. విప్లవాత్మక పాలన కొనసాగేందుకు.. ఫ్యాన్కు ఓటు వేస్తేనే గ్రామాల్లోనే విలేజీ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దే పరీక్షలు – మందులు, నాడు– నేడుతో రూపురేఖలు మారిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉత్తమ సేవలు, రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీతో ఉచిత వైద్యం, ఆపరేషన్ తరువాత జీవన భృతి కోసం ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా, 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం లాంటి ప్రతి పేదవాడిని బతికించే జగన్ మార్కు విప్లవాత్మక పాలన కొనసాగుతుంది. లేదంటే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. వదల బొమ్మాళీ అంటుంది. పేదవాడు అప్పుల పాలై వైద్యం అందని పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది ఆ చంద్రముఖి. ఫ్యాన్కు ఓటు వేస్తేనే అక్కచెల్లెమ్మల రాజ్యం, పిల్లలను బడులకు పంపే అమ్మలకు అమ్మ ఒడి, చదువులకు ఇబ్బంది లేకుండా విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ జగనన్న కాలనీలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహాల నిర్మాణం.. అన్నీ కొనసాగి వేగంగా అడుగులు ముందుకు పడతాయి. గతంలో నాకు ఓట్లేయని వారూ ఆలోచించండి.. పొదుపు సంఘాల మహిళలకు బాబు చేసిన మోసాలు గుర్తున్నాయా? ఓటు వేసే ముందు మీ కుటుంబమంతా కూర్చుని బాగా ఆలోచన చేయండి. ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి. ఎవరివల్ల మంచి జరిగింది? ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుందనే ఆలోచనతో ఓటు వేయాలని కోరుతున్నా. మీ తలరాతలను మార్చే ఎన్నికలివి. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కొనసాగాలా? లేక రాష్ట్రాన్ని పెత్తందార్లు అందరూ కలసి దోచుకుని, పంచుకునే కూటమి పాలన కావాలా? 58 నెలలుగా మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పలు కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. కులం కారణం కావచ్చు.. ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నామనే కారణం కావచ్చు.. లేదా ఇతర కారణాలు కావచ్చు.. ఆ అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను కూడా అడుగుతున్నా. గత ఎన్నికల్లో మీరు నాకు ఓటు వేయకపోయినా ఈ ఐదేళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా? అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు, క్లాస్ నాయకులు అబద్ధాలు చెప్పవచ్చుగానీ మీ కుటుంబానికి, మీ బ్యాంక్ ఖాతాల్లోకి 58 నెలల పాలనలో జమ అయిన, చేతికి అందిన పథకాల డబ్బులు మీకు నిజాలే చెబుతాయి. ఇంటికే వలంటీర్ల సేవలు, ఇంటి వద్దకే పెన్షన్, రేషన్, వైద్యం, సర్టిఫికెట్లు, ఇళ్ల పట్టాలు.. ఇవన్నీ మీకు నిజాలే చెబుతాయి. మారిపోయిన మన గవర్నమెంట్ స్కూళ్లు, పిల్లల చదువులు, గ్రామంలోనే వైద్య సేవలు, వ్యవసాయం.. ఇవన్నీ మీకు వాస్తవాలు చెబుతాయి. ఎవరి పాలనలో మీకు మంచి జరిగిందో ఆలోచన చేయండి. 2014లో బాబు మోసాలివీ.. ♦ రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? ♦ పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ♦ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా? ♦ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ♦ ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ♦ అర్హులైన వారందరికి మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? ♦ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా? ♦ మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ♦ సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ♦ ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? కాకినాడలో కనిపిస్తోందా? పోనీ పిఠాపురంలో కట్టారా? ♦ పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? అదీ లేదు. ♦ ఇప్పుడు సూపర్ సిక్స్, సెవెన్, ఇంటికి కేజీ బంగారం అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు. ఇన్ని మోసాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమైతే వారి చీకటి యుద్ధాన్ని, ఆ ఎల్లో మీడియా, సోషల్ మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబు నుంచి సెల్ఫోన్లు బయటకు తీసి టార్చిలైట్లు వెలిగించండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు లేని వ్యవస్థలు, మన చదువులు, పిల్లలు, రైతన్నలు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి. బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్! ఇంటింటికీ మంచి చేశాడు కాబట్టి ఈ ఎన్నికల యుద్ధానికి మీ బిడ్డ ఒంటరిగా బయల్దేరాడు. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకే ఏ మంచిపనీ లేదు కాబట్టి వారంతా కూటమిగా ఏకమయ్యారు. మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది. అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పాటైన కూటమి కాదు. ఎన్ని టికెట్లు ఇవ్వాలి? ఎవరు పోటీ చేయాలి? చివరికి ఆ ప్యాకేజీ స్టార్ ఎక్కడ నిలబడాలో కూడా బాబు నిర్ణయిస్తేనే కుదిరిన పొత్తులవి. ఆ ప్యాకేజీ స్టార్ను భీమవరం.. గాజువాక.. పిఠాపురం.. ఇలా ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుందనుకుంటే అక్కడ నిలబెట్టిన పరిస్థితి!ఇక బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్! జగన్ను తిట్టు అంటే తిట్టు..! కొట్టు అంటే కొట్టు..! దత్తపుత్రా నీకిచ్చేది 80 కాదు.. 20 అంటే అందుకు కూడా జీ హుజూర్! ఇదీ ప్యాకేజీ స్టార్ పరిస్థితి! కులాన్ని హోల్సేల్గా అమ్మేయగలననే భ్రమతో.. ఏపీని హోల్సేల్గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే.. కులాన్ని హోల్సేల్గా బాబుకు అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టార్ రాజకీయం చేస్తున్నాడు. ఈయనకు ఏపీ అంటే ఎంత చులకన అంటే.. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్తాడు. ఏ ప్రాంతమన్నా ప్రేమ ఉండదు ఈ మ్యారేజీ స్టార్కు. ఏ భార్య అయినా ప్రేమ ఉండదు! పెళ్లిళ్లే కాదు..నియోజకవర్గాలు కూడా మార్చేశాడు. వెనుకటికి ఒకడు పెళ్లికి పిఠాపురం వెళ్తూ పిల్లిని చంకన బెటు్టకెళ్లాడట! ఆ పిల్లిని చంకన బెట్టుకెళ్లింది ఎవరో ఇంతకాలం ఎవరికీ అర్థం కాలేదు. బాబు తన చంకలో ఉన్న పిల్లిని పిఠాపురంలో వదిలినట్లు ఇప్పుడు అర్థమైంది. ఇదీ గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు.. దాన్ని తోమి, తుడిచి మళ్లీ బాబుకు అందించేది మాత్రం.. ఈ ప్యాకేజీ స్టార్! బాబు ట్రాన్స్ఫర్ ఆర్డర్తో.. బీజేపీలోకి వదినమ్మ ఈ కూటమిలో వదినమ్మ బాబు చేరమంటే కాంగ్రెస్లో చేరింది. ఇదే బాబు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీలో చేరారు. బాబు పొడవమంటే సొంత తండ్రికే వెన్నుపోటు పొడిచేసింది! 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా.. బాబు కోవర్టుగా అదే పనిలో ఉంది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి సీటు ఇవ్వమంటే వారికే ఇస్తారు. వద్దంటే వారిని ఆపేస్తారు, మారుస్తారు. చంద్రబాబు ప్యాకేజీలు, ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. బీఫామ్ బీజేపీదైనా, కాంగ్రెస్దైనా, టీ గ్లాస్దైనా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే! మత్స్యకారులకు మాటిస్తున్నా.. కాసేపటి క్రితం కన్నబాబు అన్న మాట్లాడుతూ మత్య్సకారుల సమస్యల గురించి ప్రస్తావించారు. నాకు మంచి మనసు ఉంది కాబట్టే.. ముమ్మిడివరంలో జరిగిన నష్టాన్ని, ఎప్పటి నుంచే పరిష్కారం కాని సమస్యను పరిష్కరించాం. ఓఎన్జీసీ కమిటీని ఏర్పాటు చేయటానికి మీ బిడ్డ ప్రభుత్వ చొరవే కారణమనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కమిటీ సిఫారసులు ఆధారంగా ప్రతి మత్య్సకార కుటుంబానికి మంచి జరిగేలా మీ బిడ్డ తోడుగా ఉంటాడని మాట ఇస్తున్నా. బాబుకు మిగిలింది గులక రాళ్లే... చంద్రబాబు మేనిఫెస్టో ఎన్నికలు ముగిసేదాకా రంగురంగుల స్వప్నాలను చూపిస్తుంది. ఆ తరువాత చెత్తబుట్టలో మినహా ఎక్కడా కనిపించదు. ఎన్నికల తరువాత మోసాలు చేయడం చంద్రబాబు నైజం! ఆయన పాలనలో చరిత్రలో నిలిచిపోయే మైలు రాళ్లు ఏవీ లేవు. మంచి వ్యవస్థలు గానీ, పథకాలుగానీ, ప్రజలకు చేసిన మంచిగానీ ఒక్కటీ లేవు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు అధికారంలో ఉన్నా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే మంచి పనిగానీ, పథకాలుగానీ ఒక్కటీ లేవు. కాబట్టే నాపై వేయించటానికి చంద్రబాబుకు, ఆయన కూటమికి చివరకు గులక రాళ్లే మిగిలాయి. మన మైలు రాళ్లు.. గత 58 నెలల పాలనలో మనం వేసిన పునాది రాళ్లు, మైలు రాళ్లు చరిత్రలో ఎప్పటికీ విప్లవాలుగా నిలిచిపోతాయి. కాబట్టే మనం జెండా తలెత్తుకుని ఎగురుతోంది. వారి జెండా మరో నాలుగు జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడుతోంది. ఈ ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా? వద్దా? ఆలోచన చేయమని కోరుతున్నా. ఫ్యాన్కు రెండు ఓట్లు వేస్తేనే ఈ అభివృద్ధి కొనసాగుతుందని ప్రతి ఇంట్లో స్టార్ క్యాంపైనర్లుగా ముందుకు వచ్చి వివరించాలి. బాబు గత చరిత్రను, 2014లో ఇదే కూటమి పేరుతో చేసిన మోసాలను ప్రతి ఇంటికీ గుర్తు చేయాలి. -
Memantha Siddham: ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర.. కొనసాగుతున్న సీఎం జగన్ ప్రభంజనం (ఫొటోలు)
-
Memantha Siddham Photos: పల్లె పల్లెలో జన గోదారి..సీఎం జగన్కు జేజేలు (ఫొటోలు)
-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు (ఫొటోలు)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019