breaking news
-
హిమగిరుల సొగసరి కిర్గిజ్స్తాన్.. వైద్య విద్యకు కేరాఫ్!..అందులోనూ..
అమ్మాయిలు బయటకు వెళ్తుంటే బాడీగార్డ్స్లా అబ్బాయిలను తోడిచ్చి పంపే సీన్కి రివర్స్లో అబ్బాయిలు బయటకు వెళ్తూ తోడురమ్మని అమ్మాయిలను బతిమాలుకోవడం కనిపిస్తే.. పురుషులతో సమానంగా మహిళలకూ హక్కులుంటే.. ఇంటా, బయటా అన్నింటా అమ్మాయిలకు గౌరవం అందుతుంటే.. సలాం.. ప్రివేత్.. ఈ కిర్గిజ్ అండ్ రష్యన్ పదాలకు అర్థం వందనం! పై దృశ్యాలు కనిపించేదీ కిర్గిజ్స్తాన్లోనే! ఈ దేశం ఒకప్పటి యూఎస్సెస్సార్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్)లో భాగం అవడం వలన ఇప్పటికీ అక్కడ రష్యన్ అఫీషియల్ లాంగ్వేజ్గా కొనసాగుతోంది కిర్గిజ్తోపాటు. అందుకే ప్రివేత్ కూడా! మొన్న మార్చ్లో కిర్గిజ్స్తాన్కి టేకాఫ్ అయ్యే చాన్స్ దొరికింది. ప్రయాణాలు కామనైపోయి.. అంతకంటే ముందే అంతర్జాలంలో సమస్త సమాచారమూ విస్తృతమై పర్సనల్ ఎక్స్పీరియెన్సెస్ని పట్టించుకునే లీజర్ ఉంటుందా అనే డౌటనుమానంతోనే స్టార్ట్ అయింది ఈ స్టోరీ ఆఫ్ జర్నీ! అయినా కిర్గిజ్స్తాన్లో నేను చూసినవి.. పరిశీలించినవి.. అర్థం చేసుకున్నవి మీ ముందుంచుతున్నాను! ఢిల్లీ నుంచి కిర్గిజ్స్తాన్ రాజధాని బిష్కేక్కి మూడున్నర గంటలు. అందులో దాదాపు రెండున్నర గంటలు టీయెన్ షాన్ పర్వత శ్రేణుల మీంచే ఉంటుంది ఆకాశయానం. విండోలోంచి చూస్తే కొండల మీద వెండి రేకులు పరచుకున్నట్టు కనిపిస్తుంది దృశ్యం. మంచుకొండలు.. మబ్బులు అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటున్నట్టు.. భుజాల మీద చేతులేసుకుని కబుర్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇదొక అద్భుతమైతే.. బిష్కేక్.. మనాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లయిట్ దిగగానే కురిసే మంచుతో స్వాగతం మరో అద్భుతం! సిమ్లాలో హిమ వర్షాన్ని ఆస్వాదించినప్పటికీ బిష్కేక్లో మంచు కురిసే వేళలు గమ్మత్తయిన అనుభూతి. మేం వెళ్లిందే మంచు పడే లాస్ట్ డేస్. ఇంకా చెప్పాలంటే తర్వాతి రోజు నుంచి మంచు పడటం ఆగిపోయి.. కరగడం మొదలైంది. వర్షం వెలిసిన తర్వాత ఉండే కంటే కూడా రొచ్చుగా ఉంటుంది కరుగుతున్న మంచు. ఎండ చిటచిటలాడించినా.. మంచు కొండల మీద నుంచి వీచే గాలులు వేళ్లు కొంకర్లు పోయేంత చలిని పుట్టించాయి. అందుకే ఉన్న వారం రోజులూ షూ, థర్మల్స్, గ్లోవ్స్, క్యాప్ తప్పకుండా ధరించాల్సి వచ్చింది. ఇంకోమాట.. అక్కడి వాతావరణ పరిస్థితులకో ఏమో మరి.. షూ లేకుంటే అక్కడి జనాలు చిత్రంగా చూస్తారు. గోలలు.. గడబిడలకు నియత్.. బిష్కేక్ని కేంద్రంగా చేసుకునే అల అర్చా, ఇసిక్ కుల్ ఇంకా బిష్కేక్ చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాం. కాబట్టి వారం రోజులు బిష్కేక్తో మా అనుబంధం కొనసాగింది. సిటీ సెంటర్లోని హోటల్లో మా బస. అక్కడికి వెళ్లగానే అబ్జర్వ్ చేసిన విషయం.. కిర్గిజ్ ప్రజలు చాలా నెమ్మదస్తులని! గట్టిగట్టిగా మాట్లాడటాలు.. అరుపులు.. కేకలు, గడబిడ వాతావరణం వారికి నచ్చవు. పక్కనవాళ్లు ఏ కొంచెం గట్టిగా మాట్లాడినా చిరాగ్గా మొహం పెడ్తారు. నిర్మొహమాటంగా చెప్పేస్తారు గొంతు తగ్గించి మాట్లాడమని. ఇక్కడ మెజారిటీ రష్యనే మాట్లాడ్తారు. ‘నియత్’ అంటే ‘నో’ అని అర్థం. సైన్బోర్డ్స్, నేమ్ప్లేట్స్ కిర్గిజ్ అండ్ రష్యన్లో ఉంటాయి. ఇది సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్నప్పుడు మామూలు వ్యవహారాలూ రష్యన్లోనే నడచి.. కిర్గిజ్ భాషా పదకోశం కుంచించుకుపోయిందట. స్వతంత్ర దేశమయ్యాక కిర్గిజ్ భాషా వికాసం మీద బాగానే దృష్టిపెట్టారని స్థానికులు చెప్పిన మాట. సర్కారు విద్యాబోధన అంతా కిర్గిజ్ మీడియంలోనే సాగుతుంది. వెస్ట్రనైజ్డ్గా కనిపించే పట్టణ ప్రాంతమే మొత్తం దేశాన్ని డామినేట్ చేస్తుంది. "ఈ దేశం విద్యుత్ అవసరాలను హైడల్ ప్రాజెక్ట్లు, బొగ్గే తీరుస్తున్నాయి. అయితే పట్టణాల్లోని సెంట్రలైజ్డ్ హీటింగ్, ఎయిర్ కండిషనింగ్కి బొగ్గునే వాడటం వల్ల కాలుష్యం పెరిగిపోతోందని అక్కడి పర్యావరణవేత్తల ఆవేదన. కాలుష్యంలో బిష్కేక్ది ఢిల్లీ తర్వాత స్థానం." లోకల్ మార్కెట్లదే హవా.. ఇక్కడ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అంతగా లేదనే చెప్పొచ్చు. ప్రైవేట్ బ్యాంకులు మొదలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వేళ్ల మీద లెక్కపెట్టేన్ని కూడా లేవు. స్థానికులను అడిగితే.. కమ్యూనిజం ప్రభావం వల్లేమో ప్రైవేట్ బ్యాంకుల మీద పూర్తిస్థాయి నమ్మకం ఇంకా కుదరలేదని చెప్పారు. అఫర్డబులిటీ, బేరసారాలకు వీలుడంటం వల్లేమో లోకల్ మార్కెట్సే కళకళలాడుతుంటాయి. ఇక్కడ ఓష్ బజార్, దొర్దోయి, అక్ ఎమిర్ లోకల్ మార్కెట్లు చాలా పాపులర్. మేం ఓష్ బజార్కి వెళ్లాం. రెండు రోజులు మార్కెట్ అంతా కలియతిరిగాం. సిల్వర్ జ్యూలరీ దగ్గర్నుంచి హ్యాండ్ అండ్ లగేజ్ బ్యాగ్స్, బట్టలు, వంట పాత్రలు, వెచ్చాలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, నట్స్ వరకు సమస్త సరకులకూ నిలయమిది. ఏ వస్తువులకు ఆ వస్తువుల సపరేట్ మార్కెట్ల సముదాయంగా కనిపిస్తుంది. బేరం చేయకుండా చూడాలంటేనే రోజంతా పడుతుంది. అన్నట్లు కిర్గిజ్లో సిల్వర్, 14 క్యారెట్ గోల్డ్ జ్యూలరీ చాలా ఫేమస్. ఓష్ బజార్లో ఒక్క సిల్వర్, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ జ్యూలరీయే ఉంటుంది. ఈ దేశం లెదర్ గూడ్స్కీ ప్రసిద్ధే! లోకల్ ఫ్యాషన్ని చూడాలంటే ఇక్కడి బట్టల మార్కెట్ని సందర్శించొచ్చు. ఓష్ బజార్ ఈ మార్కెట్లో ఇంకో అట్రాక్షన్.. కిర్గిజ్స్తాన్ హ్యాండీక్రాఫ్ట్స్ షాప్స్. వీళ్ల సంప్రదాయ వేషధారణలోని కల్పక్ (సూఫీలు ధరించే టోపీని పోలి ఉంటుంది) దగ్గర్నుంచి వీళ్ల సాంస్కృతిక చిహ్నమైన యర్త్ హోమ్, సంప్రదాయ సంగీత వాద్యం కోముజ్ (వాళ్ల నేషనల్ మ్యూజిక్ సింబల్)ల కళాకృతులు, ఎంబ్రాయిడరీ.. ఊలు అల్లికల వరకు కిర్గిజ్ హస్తకళల నైపుణ్యానికి ప్రతీకలైన వస్తువులన్నీ ఈ షాపుల్లో దొరుకుతాయి. అయితే ఏది కొనాలన్నా చాలా బేరం ఆడాలి. కొన్ని చోట్ల వర్కవుట్ అవుతుంది. కొన్ని చోట్ల కాదు ఈ మార్కెట్లో అన్నిరకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లూ ఉంటాయి. అయితే మేం వెళ్లింది అక్కడి వింటర్లో కాబట్టి పెద్దగా కనిపించలేదు. చలికాలాలు మైనస్ డిగ్రీల్లో టెంపరేచర్ ఉంటుంది కావున పంటలన్నీ వేసవిలోనే. యాపిల్స్, కమలా పళ్లు బాగా కనిపించాయి. ఇక్కడి కమలాలు భలే బాగున్నాయి రుచిలో. నిమ్మకాయ కన్నా కాస్త పెద్ద సైజులో ఉండే ఈ పండ్లే మా బ్రేక్ఫస్ట్ అక్కడున్నన్ని రోజులూ! కిర్గిజ్స్తాన్లో మరో ముఖ్యమైన కాపు వాల్నట్స్. ఇవి ఓష్బజార్లో రాశులు రాశులుగా కనిపిస్తాయి. బ్రౌన్ షెల్స్వే కాకుండా నాటుకోడి గుడ్డు పరిమాణంలో వైట్ షెల్స్తో కూడా ఉంటాయి. వీటిని చాక్లెట్లో రోస్ట్ చేసి అమ్ముతారు. ఒలుచుకోవడానికి ఒక హుక్లాంటిదీ ఇస్తారు. వీటితోపాటు ఇంకెన్నో రకాల నట్స్, డ్రైఫ్రూట్స్ ఈ మార్కెట్లో లభ్యం. కానీ మన దగ్గరకన్నా వాల్నట్సే చాలా చవక. మంచి క్వాలిటీవి కూడా సగానికి సగం తక్కువ ధరకు దొరుకుతాయి. రష్యన్ బ్రెడ్ని ఇష్టపడేవాళ్లు ఇక్కడ దాన్ని ట్రై చేయొచ్చు. చాక్లెట్స్ కూడా ఫేమస్. వాటికీ ప్రత్యేక దుకాణ సముదాయముంది. ఇంకో విషయం.. ఇక్కడ సూపర్ మార్కెట్లలో లిక్కర్కీ ఒక సెక్షన్ ఉంటుంది. రకరకాల కిర్గిజ్, రష్యన్ వోడ్కా బ్రాండ్స్ కనిపిస్తుంటాయి. "జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు ప్రధానులుగా వాళ్ల వాళ్ల కాలాల్లో కిర్గిజ్స్తాన్ను సందర్శించారు. ఆయా సమయాల్లో అక్కడ పుట్టిన ఆడపిల్లలందరికీ ఇందిర అని పేరు పెట్టుకున్నారట. వాళ్లలో ఒకరు.. హయ్యర్ మెడికల్ డిగ్రీస్ పొందిన కిర్గిజ్స్తాన్ తొలి మహిళ.. డాక్టర్ ఖుదైబెర్జెనోవా ఇందిరా ఒరొజ్బేవ్నా. కిర్గిజ్స్తాన్ స్టేట్ మెడికల్ అకాడమీలో ఆంకాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నారు. ఆ దేశాధ్యక్షుడి తర్వాత అన్ని అధికార లాంచనాలు అందుకునే రెండో వ్యక్తి ఆమే! ఇంకో విషయం ఇక్కడున్న మన ఎంబసీ వీథి పేరు మహాత్మా గాంధీ స్ట్రీట్". మీడియా.. "ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంతో ఇక్కడ ప్రింట్ మీడియా అంతగా కనిపించదు. అందుకే ఎలక్ట్రానిక్ మీడియానే పాపులర్. ప్రభుత్వ చానెల్స్తోపాటు డజన్కి పైగా ప్రైవేట్వీ ఉన్నాయి. రష్యన్ చానెల్స్కే ఆడియన్స్ ఎక్కువ. ప్రైవేట్ ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లూ ఎక్కువే". కిర్గిజ్స్తాన్.. "ఈ ముస్లిం నొమాడిక్ ల్యాండ్కి సెంట్రల్ ఆసియా స్విట్జర్లండ్గా పేరు. యూఎస్సెస్సార్ విచ్ఛిన్నం తర్వాత 1991లో స్వతంత్ర దేశంగా మారింది. టీయెన్ షాన్ పర్వత శ్రేణుల మధ్య ఒదిగి.. కజకిస్తాన్, చైనా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లతో సరిహద్దుల్ని పంచుకుంటుంది. ఎన్నో నాగరికతలకు కూడలిగా ఉన్న సిల్క్రూట్లో భాగం. సెక్యులర్ కంట్రీ. అధ్యక్ష్య తరహా ప్రజాస్వామ్యం. వ్యవసాయమే ప్రధానం. కెనాళ్లు, చెరువులు సాగుకు ఆధారం. పత్తి, మొక్కజొన్న, గోధుమలు, తృణధాన్యాలు ప్రధాన పంటలు. తేనెటీగలు, మల్బరీ తోటల పెంపకమూ కనిపిస్తుంది. వ్యవసాయం యంత్రాల సాయంతోనే! చిన్న కమతాల రైతులు మాత్రం గాడిదలు, గుర్రాలను ఉపయోగిస్తారు. బొగ్గు, బంగారం, కాటుకరాయి, పాదరసం గనులున్నాయి. కొంత మొత్తంలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నిల్వలూ ఉన్నాయి. మాంసం, పాల ఉత్పత్తులు, ఉన్ని ప్రధాన ఎగుమతులు. కరెన్సీ. సోమ్. జనాభా.. దాదాపు 67 లక్షలు. పురుషుల కన్నా మహిళలే అధికం". 14 క్యారెట్ గోల్డ్ జ్యూలరీ చూద్దామనే ఉత్సుకతతో ఒక రోజు ఆ షాపింగ్కీ వెళ్లాం. అదిరిపోయే డిజైన్స్ ఉన్నాయి కానీ చాలా కాస్టీ›్ల. అంత ధరపెట్టి 14 క్యారెట్ కొనేబదులు అదే ధరలో ఎంతొస్తే అంత 22 క్యారెట్ గోల్డే బెటర్ కదా అనే భారతీయ మనస్తత్వంతో కళ్లతోనే వాటిని ఆస్వాదించి వెనక్కి తిరిగొచ్చేశాం. సెకండ్స్ ఎక్కువ.. ఇక్కడ సెకండ్ హ్యాండ్ మార్కెట్ చాలా పెద్దది. ఫోర్ వీలర్స్ అన్ని సెకండ్సే. అందుకే ప్రపంచంలోని అన్ని బ్రాండ్స్.. అన్నీ మోడల్స్ ఇక్కడ కనిపిస్తాయి. వీటి కోసం బిష్కేక్కి దగ్గర్లోనే దాదాపు 20 ఎకరాల్లో ఒక మార్కెట్ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ స్టీరింగ్.. రెండూ ఉంటాయి. పర్వత ప్రాంతమవడం వల్లేమో రైల్వే కంటే రోడ్డు రవాణాయే ఎక్కువ. మన దగ్గర కనిపించే స్వరాజ్ మజ్దాలాంటి వాహనాన్ని మార్ష్రూత్కా అంటారిక్కడ. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కి దాన్నే ఎక్కువగా వాడతారు. మనకు ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నట్టుగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులుంటాయి. వాటిని ట్రామ్స్ అంటారు. వీటికి రోడ్డు మీద పట్టాలేం ఉండవు. పైన కరెంట్ తీగతో పవర్ జనరేట్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఏం కాదు కానీ ధర చాలా చాలా తక్కువ. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ధర కాస్త ఎక్కువే. ట్రాఫిక్ చాలానే ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. అయినా ట్రాఫిక్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అత్యంత అవసరమైతే తప్ప హాంకింగ్ చేయకూడదు. ఫోన్లు కూడా సెకండ్ హ్యాండ్సే అధికం.. బ్రాండ్ న్యూ ఫోన్లు ఉన్నా! ఐఫోన్ వాడకం ఎక్కువ. బ్రాండ్ న్యూ హై ఎండ్ ఫోన్లు డ్యూటీ ఫ్రీతో మన దేశంలో కన్నా గణనీయమైన తక్కువ ధరకు లభిస్తాయి. నాడీ పట్టుకున్నారు.. "కిర్గిజ్స్తాన్లోని బిష్కేక్, ఇసిక్ కుల్ లాంటి చోట్ల భారతీయవిద్యార్థులు అందులో తెలుగు వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. కారణం.. మెడిసిన్. అవును ఈ దేశం వైద్యవిద్యకు హబ్గా మారింది. ఇది ప్రైవేట్ రంగాలకిస్తున్న ప్రోత్సాహాన్ని గ్రహించి.. రష్యాలో మెడిసిన్ చదివిన కొత్తగూడెం వాసి డాక్టర్ పి. ఫణిభూషణ్ 20 ఏళ్ల కిందటే ఇక్కడ ఐఎస్హెచ్ఎమ్ (ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్)ను స్థాపించాడు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీకొస్తున్న రెస్పాన్స్ చూసి ఇక్కడి ఐకే అకున్బేవ్ కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ (కేఎస్ఎమ్ఏ) ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఈ సంస్థకు తమ యూనివర్సిటీలో అఫిలియేషన్ ఇచ్చింది. ఐఎస్ఎమ్ ఎడ్యుటెక్ అనే కన్సల్టెన్సీ ద్వారా మన తెలుగు స్టూడెంట్స్ ఎందరికో కేఎస్ఎమ్ఏలో అడ్మిషన్స్ ఇప్పించి.. వాళ్ల వైద్యవిద్య కలను సాకారం చేస్తున్నారు డాక్టర్ ఫణిభూషణ్. ఈ రెండు యూనివర్సిటీల్లో దాదపు రెండువేలకు పైగా తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లలో అమ్మాయిలే ఎక్కువ. ఎందుకంటే ఇది అమ్మాయిలకు సురక్షిత దేశం కాబట్టి. ఇక్కడా మెడిసిన్ అయిదున్నరేళ్లే! ఇంగ్లిష్లోనే బోధన సాగుతుంది. చక్కటి ఫ్యాకల్టీ, హాస్టల్ సదుపాయాలున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద అనాటమీ ల్యాబ్స్లలో ఒకటి కేఎస్ఎమ్ఏలో ఉంది. కమ్యూనికేషన్కి ఫారిన్ స్టూడెంట్స్ ఇబ్బందిపడకూడదని కిర్గిజ్, రష్యన్ భాషలనూ నేర్పిస్తారు. శారీరక దృఢత్వం, క్రమశిక్షణ కోసం పీఈటీ కూడా ఉంటుంది. ఇది అకడమిక్స్లో భాగం. వారానికి రెండుసార్లు ఇండియన్ ఫ్యాకల్టీతోనూ క్లాస్లుంటాయి. ఫారిన్లో మెడిసిన్ పూర్తిచేసుకున్న స్టూడెంట్స్కి ఇండియాలో పెట్టే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్ఎమ్జీఈ) కోసమూ ఇక్కడ ప్రత్యేక శిక్షణనిస్తారు. అయితే కిర్గిజ్స్తాన్లో మెడిసిన్ చదవడానికి మన నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ‘ఇండియాలో మెడికల్ సీట్లు తక్కువ. కాంపీటిషన్ చాలా ఎక్కువ. ఎంత కష్టపడ్డా మంచి కాలేజ్లో సీట్ దొరకదు. ‘బీ’ కేటగరీ సీట్కి కనీసం కోటి రూపాయలుండాలి. అంతే ఫెసిలిటీస్.. అంతే మంచి ఫ్యాకల్టీతో ఇక్కడ 35 లక్షల్లో మెడిసిన్ అయిపోతుంది. అదీగాక మంచి ఎక్స్పోజర్ వస్తోంది’ అని చెబుతున్నారు అక్కడి మన తెలుగు విద్యార్థులు. ‘పిల్లల్ని మెడిసిన్ చదివించడానికి ఆస్తులు తాకట్టుపెట్టిన పేరెంట్స్ని చూశాను. డెడికేషన్ ఉన్న స్టూడెంట్స్కి మెడిసిన్ అందని ద్రాక్ష కాకూడదని, తక్కువ ఖర్చుతో క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ని అందించాలనే సంకల్పంతో ఈ సంస్థను స్టార్ట్ చేశాం. అంతేకాదు యాక్టర్ సోనూ సూద్ సహకారంతో ఫీజులు కట్టలేని నీట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ని మా కాలేజెస్లో ఫ్రీగా చదివిస్తున్నాం’ అని చెప్పారు డాక్టర్ ఫణిభూషణ్". - డాక్టర్ ఫణిభూషణ్ విద్య, వైద్యం ఫ్రీ.. ఇందాకే ప్రస్తావించుకున్నట్టు మౌలిక సదుపాయాల విషయంలో ఈ దేశం ఇంకా కమ్యూనిజం విలువలనే పాటిస్తోంది.. విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ! ప్రైవేట్ బడులు, ఆసుపత్రులు లేవని కాదు.. చాలా చాలా తక్కువ. చదువు విషయంలో ఇంగ్లిష్ మీడియం కావాలనుకునే వాళ్లే ప్రైవేట్ బడులకు వెళ్తారు. అయితే ఈ బడుల్లో కూడా కిర్గిజ్, రష్యన్ నేర్పిస్తారు. ఆటలంటే ప్రాణం పెడతారు. ప్రతి విద్యార్థి ఆటల్లో పాల్గొనాల్సిందే! పాఠశాల విద్య నుంచి ప్రొఫెషనల్ కోర్స్ మెడిసిన్ దాకా ఆటలనూ అకడమిక్స్గానే పరిగణిస్తారు. పాఠ్యాంశాలతోపాటు పీఈటీకీ మార్కులుంటాయి. అథ్లెటిక్స్, వాలీబాల్ ఎక్కువ. బిష్కేక్లోని పార్క్స్, గ్రౌండ్స్లో అథ్లెట్స్ ప్రాక్టిస్ చేస్తూ కనపడ్తారు. లెవెంత్ క్లాస్ తర్వాత ప్రతి విద్యార్థి సైన్యంలో శిక్షణ తీసుకోవాలి. ప్రతి శని, ఆదివారాలు స్కూల్ పిల్లలు నగర వీథులను శుభ్రం చేయాలి. మొక్కలు నాటాలి. నీళ్లు పోయాలి. ప్రభుత్వాసుపత్రులైతే ఆధునిక సదుపాయాలతో ప్రైవేట్ ఆసుపత్రులను తలదన్నేలా ఉంటాయి. జీరో క్రైమ్.. నో డొమెస్టిక్ వయొలెన్స్! బిష్కేక్లో మేం తిరిగిన ప్రాంతాల్లో ఎక్కడా మాకు పోలీస్ స్టేషన్లు కనించలేదు. ఆశ్చర్యపోతూ మేం తిరిగిన మార్ష్రూత్కా డ్రైవర్లను అడిగితే.. నవ్వుతూ ‘ఉంటాయి కానీ మా దగ్గర క్రైమ్ చాలా తక్కువ. దాదాపు జీరో అని చెప్పుకోవచ్చు’ అన్నారు. డొమెస్టిక్ట్ వయొలెన్స్కీ తావులేదు. ఇక్కడ ఇంటికి యజమానురాలు మహిళే. ఆర్థిక వ్యవహారాల దగ్గర్నుంచి అన్నిటినీ ఆమే చూసుకుంటుంది. లీడ్లోనే చెప్పుకున్నట్టు మహిళలను గౌరవించే దేశం. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్.. అన్నిట్లో మహిళలే ఎక్కువ. ట్రక్ని డ్రైవ్ చేస్తూ.. సంస్థల్లో ఫ్రంట్ ఆఫీస్ నుంచి మేనేజర్లు.. ఆంట్రప్రన్యూర్స్ దాకా.. లాయర్లుగా.. డాక్టర్లుగా.. ఇలా ప్రతిచోటా మహిళలే ఎక్కువగా కనిపిస్తారు. అల అర్చా నేషనల్ పార్క్ విమెన్స్ డే జాతీయ పండగే.. కిర్గిజ్ ప్రజలు మహిళలకు ఎంత విలువిస్తారో చెప్పడానికి ఇక్కడ జరిగే విమెన్స్ డే సెలబ్రేషనే ప్రత్యక్ష్య ఉదాహరణ. దాన్నో జాతీయ పండగలా నిర్వహిస్తారు. ఆ రోజు మగవాళ్లందరూ గిఫ్ట్స్తో తమ ఇంట్లో.. తమ జీవితంలోని స్త్రీలకు గ్రీటింగ్స్ చెప్తారు. తమ మనసుల్లో వాళ్లకున్న చోటు గురించి కవితలల్లి వినిపిస్తారు. మేం వెళ్లింది విమెన్స్ డే అయిన వారానికే కాబట్టి బిష్కేక్లో ఇంకా ఆ సంబరం కనిపించింది.. సిల్వర్, 14 క్యారెట్ గోల్డ్ మార్కెట్లలో విమెన్స్ డే స్పెషల్ కలెక్షన్స్తో! దీని ప్రభావం కిర్గిజ్స్తాన్లో మెడిసిన్ చదువుకుంటున్న మన తెలుగు విద్యార్థుల మీదా కనిపించింది.. వాళ్లు చదువుకుంటున్న కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ (కిర్గిస్తాన్ ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయం)కి వెళ్లినప్పుడు! వాళ్ల క్లాస్ రూమ్స్ కారిడార్ వాల్స్ మీద రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ అతికించి ఉన్నాయి. ఆ కాలేజ్లోని ప్రతి అబ్బాయి వాళ్లమ్మ .. అమ్మమ్మ.. నానమ్మ.. అత్త.. పిన్ని.. అక్క.. చెల్లి.. టీచర్.. ఫ్రెండ్.. ఇలా వాళ్లకు సంబంధించిన .. వాళ్లకు పరిచయమున్న మహిళలు.. అమ్మాయిల గురించి ఆ గ్రీటింగ్ కార్డ్స్ మీద రాసి తమకు వాళ్ల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అమ్మాయిలను తమకు ఈక్వల్గా ట్రీట్ చేయాలని కిర్గిజ్స్తాన్ కల్చర్ని చూసి నేర్చుకుంటున్నామని చెప్పారు భారతీయ విద్యార్థులు. యర్త్ హోమ్స్ సిటీ ఆఫ్ గార్డెన్స్.. బిష్కేక్లో ఎటుచూసినా విశాలమైన గార్డెన్లు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. మేం వెళ్లినప్పుడు స్ప్రింగ్ సీజన్కి ముస్తాబవుతున్నాయి. వింటర్ అయిపోయే సమయంలో మట్టి తవ్వి.. కొత్త మట్టి వేసి.. కొత్త మొక్కల్ని నాటుతారట. మాకు ఆ దృశ్యాలే కనిపించాయి. స్ప్రింగ్ టైమ్లో ఈ కొత్త మొక్కలన్నీ రకరకాల పూలతో వసంత శోభను సంతరించుకుంటాయి. అసలు కిర్గిజ్స్తాన్ని స్ప్రింగ్ సీజన్లోనే చూడాలని స్థానికుల మాట. తోటల్లోనే కాదు.. కొండలు .. లోయల్లో కూడా మంచంతా కరిగి.. మొక్కలు మొలిచి.. రకారకాల ఆకులు.. పూలతో కొత్త అందం పరచుకుంటుంది. అందుకే ఆ టైమ్లోనే పర్యాటకుల సందడెక్కువ. సిటీ స్క్వేర్.. ఒక పూటంతా బిష్కేక్ సిటీ స్క్వేర్లో గడిపాం. మార్చి 21.. కిర్గిజ్స్తా¯Œ కొత్త సంవత్సరం నూరోజ్ పండగ. మేం అక్కడికి వెళ్లేప్పటికి ఆ వేడుక కోసం పిల్లలంతా జానపద నృత్యాలు.. పాటలతో రిహార్సల్స్ చేసుకుంటూ కనిపించారు.. కిర్గిజ్స్తాన్ ఎపిక్ హీరో మనాస్ విగ్రహం ముందు. పదిలక్షలకు పైగా పద్యాలతో ఉన్న ఈ మనాస్ కావ్యం కిర్గిజ్ ప్రజల చరిత్ర, సంస్కృతి, ఫిలాసఫీని అభివర్ణిస్తుంది. ఇది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కావ్యంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ కింద దీని సంరక్షణ బాధ్యతను యునెస్కో తీసుకుంది. అంతటి ప్రాశస్త్యమున్న మనాస్ విగ్రహానికి పక్కనే కొంచెం దూరంలో ఆ దేశ పార్లమెంట్ ఉంటుంది. విశాలమైన రోడ్లు.. వాటికి ఆనుకుని గార్డెన్లు.. పాత్వేలతో ఎక్కడో యూరప్లోని దేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది. నూరోజ్ కోసం బిష్కేక్ ప్రత్యేకంగా ముస్తాబవుతుందట. యర్త్ హోమ్లు.. హస్తకళల ఎగ్జిబిషన్స్ జరుగుతాయి. ఆ సన్నాహాలు కనిపించాయి. వరల్డ్ నొమాడిక్ గేమ్స్ వేడుకలు ఇసిక్ కుల్ సాల్ట్ లేక్.. ఒకరోజు బిష్కేక్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల అర్చా వెళ్లాం. అ ్చ అటఛిజ్చి అంటే రంగురంగుల జూనపర్ చెట్లు అని అర్థం. రకరకాల పక్షులు, అడవి మేకలు, జింకలు, కొమ్ముల మేకలు, తోడేళ్లకు నిలయం ఈ ప్రాంతం. ఇక్కడున్న నేషనల్ పార్క్ చూడదగ్గది. మంచు కొండల మీద ట్రెకింగ్, పైన్ చెట్లు.. వాటర్ ఫాల్స్, టీయెన్ షాన్ శ్రేణుల నుంచి పారే నదులు.. నిజంగానే స్విట్జర్లండ్లో ఉన్నామేమో అనే భ్రమను కల్పిస్తుంది. అన్నిటికీ మించి ఇక్కడి స్వచ్ఛమైన గాలి.. ఓహ్.. అనుకుంటాం గానీ పాడు చలి చంపేస్తుంది. పార్క్ ఎంట్రెన్స్ నుంచి మంచులో దాదాపు మూడు గంటలకు పైగా నడిస్తే గానీ నదీ తీరానికి వెళ్లలేం. ఆ తీరం వెంట ఇంకాస్త ముందుకు వెళితే వాటర్ఫాల్స్. అలాగే మరికాస్త వెళితే అక్ సై హిమానీ నదం. ఇది అద్భుతమని చెబుతుంటారు స్థానికులు. అక్కడ నైట్ క్యాంప్ వేసుకోవచ్చట. ఇసిక్ కూల్ లేక్ కానీ మైనస్ డిగ్రీల టెంపరేచర్లో మాకు అర కిలోమీటర్ నడిచేసరికే కాళ్లు, చేతులు కొంకర్లు పోయి.. ముక్కు, పెదవులు పగిలి.. మాట మొద్దు బారిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. అలాగని అక్కడే ఉండి పక్షుల కిలకిలారావాలు.. పైన్ చెట్ల తోపులను ఆస్వాదించలేకపోయాం ఇది ప్రొఫెషనల్ ట్రెకర్స్కే సాధ్యమని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ తిరిగొచ్చి మార్ష్రూత్కాలో కూలబడ్డాం. అందులోని హీటర్కి చలికాచుకున్నాం. మా చలివణుకు చూసి డ్రైవర్లు ఒకటే నవ్వులు. ఇంకోరోజు ఇసిక్ కుల్కి ప్రయాణమయ్యాం. బిష్కేక్ నుంచి ఇది దాదాపు 260 కిలోమీటర్లు. సూర్యోదయానికి ముందే స్టార్ట్ అయ్యాం. దార్లో సిల్క్రూట్ టచ్ అవుతుంది కిర్గిజ్స్తాన్ – కజకిస్తాన్ బార్డర్లో. మసక చీకటి.. మంచు.. మార్ష్రూత్కా విండో గ్లాసెస్ మీది ఫాగ్ తుడుచుకుని.. కళ్లు చిట్లించుకున్నా బయటి దృశ్యం స్పష్టంగా లేదు. వెహికిల్ ఆపడానికి లేదు. వచ్చేప్పుడు చూడొచ్చులే అనుకున్నాం. వచ్చేప్పుడూ సేమ్ సీన్. రాత్రి.. చీకటి.. మంచు అయితే ఇసిక్ కుల్ సాల్ట్ లేక్ ఆ నిరాశను కాస్త మరిపించింది. కాస్పియన్సీ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సరస్సుగా.. టిటీకాకా తర్వాత రెండవ అతిపెద్ద మౌంటెన్ లేక్ సరస్సుగా పేరుగాంచిందీ భూతల స్వర్గం. ఆకాశాన్ని అంటుతున్నట్టు కనిపించే మంచు పర్వతాల ఒడిలో నింగి నీలంతో.. చల్లదనంలో ఆ హిమ గిరులతో పోటీ పడుతూ నా ఊహల్లోని మానస సరోవరానికి కవలగా కనపడింది. మైనస్లోకి పడిపోయే టెంపరేచర్లోనూ ఇది గడ్డకట్టదు. ఈ లేక్లో బోటింగ్ కూడా ఉంటుంది. దీనికి విశాలమైన ఇసుక బీచ్ ఉంటుంది. ప్రతి సెప్టెంబర్లో ఇక్కడ వరల్డ్ నొమాడిక్ గేమ్స్ జరుగుతాయి. దీన్ని 2014లో కిర్గిజ్స్తానే ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంచార ప్రజల సంస్కృతీసంప్రదాయల పునరుద్ధరణ, సంరక్షణతోపాటు.. ఈ గేమ్స్లో పాల్గొంటున్న దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో! మొదటి సంవత్సరం ఇందులో 19 దేశాలు పాల్గొంటే 2018 కల్లా 66 దేశాల నుంచి 1500 మంది పాల్గొన్నారు. ఇవి ఒక్క క్రీడాకారులనే కాదు పలురంగాల్లోని కళాకారులందరినీ ఏకం చేస్తోంది. ఈ సంబరాల్లో ఒక్క ఆటలే కాదు.. కిర్గిజ్స్తాన్ కల్చర్, ఫుడ్, ఆర్ట్స్, షాప్స్ అన్నీ తరలి వస్తాయి. వందల సంఖ్యలో యర్త్ హోమ్స్ వెలసి.. ప్రపంచ అతిథులకు ఆతిథ్యాన్నిస్తాయి. ఆ సమయంలో ఇసిక్ కుల్లో ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారట. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవకూడని ఈవెంట్ ఇదని స్థానికులు అంటారు. ఇసిక్ కుల్ నుంచి వచ్చాక ఒకరోజు బిష్కేక్ పొలిమేరలో పౌల్ట్రీ, డెయిరీ ఫామ్ నడిపిస్తున్న ఓ రష్యన్ ఫ్యామిలీ దగ్గరకు వెళ్లాం. అతని పేరు దినేశ్. అరే.. ఇండియన్ నేమ్ అని మేం ఆశ్చర్యపోతుంటే.. అతను నవ్వి.. యూఎస్సెస్సార్లో బాలీవుడ్కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఆ ప్రభావంతోనేమో తనకు దినేశ్ అనే పేరుపెట్టారని చెప్పాడు. నిజమే అక్కడ మాకు కుమార్ అనే పేరూ కామన్గా వినిపించింది. బిష్కేక్లో మెడికల్ కాలేజ్ అనుబంధ హాస్టల్స్లో ఉండి చదువుతున్న భారతీయ వైద్యవిద్యార్థుల కోసం పాలు, చికెన్, కూరగాయలను సప్లయ్ చేయడం కోసమే తను ప్రత్యేకంగా డెయిరీ, పౌల్ట్రీ ఫామ్లను నడుపుతున్నాని, కూరగాయలను సాగు చేస్తున్నాని చెప్పాడు దినేశ్. వరల్డ్ నొమాడిక్ గేమ్స్ మిస్సింగ్.. ఉన్న వారంలో చలి.. ఎండ.. వాన మూడు కాలాలనూ చూపించింది కిర్గిజ్స్తాన్. ఎండ, వాన ఉన్నా చలి కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ వెదర్.. చిన్నపిల్లలమైపోయి మంచులో ఆటలు.. స్కీయింగ్, రోప్ వే సాహసాలు.. కిర్గిజ్, రష్యన్ మాటల్ని నేర్చుకోవడం.. వాళ్ల క్రమశిక్షణకు అబ్బురపడటం.. ఆ ప్రశాంతతను ఆస్వాదించడం.. ఉన్నదాంట్లో తృప్తిపడుతున్న వాళ్ల నైజానికి ఇన్స్పైర్ అవడం.. అక్కడి ఆడవాళ్ల సాధికారతకు గర్వడటం.. మొత్తంగా కిర్గిజ్స్తాన్ మీద బోలెడంత గౌరవంతో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం! కానీ ఒక్క అసంతృప్తి మిగిలిపోయింది. జమీల్యా, తొలి ఉపాధ్యాయుడు వంటి ఎన్నో పుస్తకాలతో ఎప్పుడో కిర్గిజ్స్తాన్ని పరిచయం చేసిన చెంఘిజ్ ఐత్మతోవ్ని కలిపే ఆయన మ్యూజియాన్ని చూడలేపోయామని! బిష్కేక్లో ఉందా మ్యూజియం. దాంతోపాటు కిర్గిజ్స్తాన్ హిస్టరీ అండ్ ఆర్ట్స్కి సంబంధించిన మ్యూజియమూ ఉంది. ఇదీ చూడలేదు.. సమయాభావం వల్ల! ఐత్మతోవ్ పుట్టిన నేల మీద నడయాడమన్న కాస్త ఊరటతో కిర్గిజ్స్తాన్కి సలామత్ బొలుప్ జక్ష్య (ఇప్పటికి వీడ్కోలు)! ఎప్పుడైనా స్ప్రింగ్లో ఒకసారి కిర్గిజ్స్తాన్ను చూసి.. ఐత్మతోవ్ని పలకరించాలని ఆశ! రహమత్ .. స్పసీబా.. థాంక్యూ! — శరాది ఇవి చదవండి: 'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త! -
ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ పాజిటివ్ అంటే..? ప్రమాదమా..!
నాకు 40 ఏళ్లు. మూడవ నెల ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ పాజిటివేమో అనే డౌట్ చెప్పారు. చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఉమ్మనీరు టెస్ట్ చేస్తామన్నారు. దీనివల్ల అన్నీ కనిపెట్టొచ్చా? బేబీ హెల్దీగా ఉన్నట్టు ఎలా గుర్తించడం? – ఎన్. వైశాలి, షోలాపూర్ ఆమ్నియోసెంటీసిస్ (Amniocentesis) ద్వారా ఉమ్మనీరును టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. తగు జాగ్రత్తలతో ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్.. పొట్టలోపల బేబీకి టెస్ట్ చేసే ప్రక్రియ ఇది. ఈ వైద్య పరీక్షను ముఖ్యంగా క్రోమోజోమల్ సమస్యలేమైనా ఉన్నాయేమో అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి సూచిస్తారు. జన్యు వ్యాధుల విషయంలోనూ ఈ టెస్ట్ను చేస్తారు. 40 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ కావడం, మీ బ్లడ్ టెస్ట్లలో డౌట్ రావడం వల్ల క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కనిపెట్టడానికి ఈ టెస్ట్ని సజెస్ట్ చేసి ఉంటారు. దీన్ని చాలా అనుభవం ఉన్న స్పెషలిస్ట్లే చేస్తారు. మీరు మామూలుగా ఫుడ్ తినే ఈ టెస్ట్కి వెళ్లొచ్చు. ఔట్ పేషంట్ డిపార్ట్మెంట్లోనే చేస్తారు. అల్ట్రసౌండ్ చేసి.. బేబీ, ప్లాసెంటా, పొజిషన్ను చెక్ చేసి వివరించి కన్సెంట్ తీసుకుని చేస్తారు. టెస్ట్ రిజల్ట్స్ 5 నుంచి 15 రోజుల్లో వస్తాయి. వచ్చే రిజల్ట్స్ని బట్టి తదనంతర పరిణామాలను మీతో డిస్కస్ చేస్తారు. ఈ టెస్ట్లో అన్నిరకాల అబ్నార్మిలిటీస్ని కనిపెట్టలేము. దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. సెరిబ్రల్ పాల్సీ, ఆటిజం, స్పీనల్ బిఫడా, ఫిజికల్ చేంజెస్ను ఇందులో కనిపెట్టలేం. అలాంటివాటికి కొన్నిసార్లు అడ్వాన్స్డ్ స్కాన్ అవసరం అవుతుంది. ఈ ప్రొసీజర్లో 0–5 శాతం గర్భస్రావం అయ్యే రిస్క్, ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. యాంటీబయాటిక్స్ ఇస్తారు. ప్రొసీజర్ తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుని ఇంటికి వెళ్లొచ్చు. మైల్డ్ క్రాంప్స్ ఉంటాయి. పారాసిటమాల్ లాంటివి ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ప్రొసీజర్ తర్వాత బాగా కడుపు నొప్పి వచ్చినా, బ్లీడింగ్ అవుతున్నా.. వాటర్ లీక్ అయినా ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలి. ఇంటికి వెళ్లాక ఇలాంటి లక్షణాలు కనపడినా.. చలి, జ్వరం ఉన్నా వెంటనే ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్లాలి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ ఫీలవకుండా.. పౌష్టికాహారం తీసుకోవాలి. — డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
వెజైనా నుంచి బ్యాడ్ స్మెల్ వస్తే పరిస్థితి అంతేనా..!
నాకు 18 ఏళ్లు. వెజైనా నుంచి బ్యాడ్ స్మెల్ వస్తోంది. నేను హాస్టల్లో ఉంటాను. నా ప్రాబ్లమ్కి సరైన మెడిసిన్ని సజెస్ట్ చేయగలరు. – అనామిక, హైదరాబాద్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్లో చాలా కామన్గా వచ్చేది బ్యాక్టీరియల్ వెజైనోసస్. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు. వెజైనా నుంచి బ్యాడ్ స్మెల్ ఉంటుంది. రాషెస్, ఇచింగ్ ఉండవు. ఇది వెజైనాలో ఉండే నార్మల్ బ్యాక్టీరియా ఎక్కువైతే వస్తుంది. పలచగా.. వైట్గా డిశ్చార్జ్ కావచ్చు. ఫిషీ స్మెల్ ఉంటుంది. వెజైనా ఎసిడిటీ చేంజెస్ వల్ల వస్తుంది. సువాసనగల సబ్బులు, బబుల్ బాత్స్, వెజైనల్ డియోడరెంట్స్ వాడేవారిలో ఇది ఎక్కువ. ఇన్నర్వేర్ని గాఢమైన డిటర్జెంట్స్తో ఉతికినా.. తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్కి గురవుతున్నా ఇది ఎక్కువ అవుతుంది. మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే కాటన్ స్వాబ్తో వెజైనా నుంచి శాంపిల్ తీసి యూరిన్ని కూడా టెస్ట్కి పంపిస్తారు. ఆ రిజల్ట్స్తో కన్ఫర్మ్ అయితే యాంటీబయాటిక్ మాత్రలు, Doxycycline, Metronidazole లాంటివి ఇస్తారు. డాక్టర్ సలహా మేరకు పూర్తి కోర్స్ వాడాలి. కొంచెం తగ్గగానే మందులు ఆపేస్తే తిరగబెట్టే రిస్క్ పెరుగుతుంది. స్ట్రాంగ్ వెజైనల్ వాషెస్ కూడా వాడకూడదు. రోజుకు నాలుగైదుసార్లు వేడి నీళ్లతో శుభ్రం చేసుకుని.. పొడిగా ఉంచుకోవాలి. కాటన్ ఇన్నర్వేర్నే వాడాలి. ఎక్కువసార్లు ఈ ఇన్ఫెక్షన్ అవుతూంటే యూరిన్ కల్చర్, సెన్సిటివిటీ చెక్ చేయాల్సి ఉంటుంది. — డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Funday Story: బాలిశెట్టి అహం..!
బాలిశెట్టి.. కిరాణా కొట్టు వ్యాపారి. నిత్యావసర సరుకులు బియ్యం, బెల్లం, పప్పు, ఉప్పు, చింతపండు వంటివి అమ్మేవాడు. వ్యాపారం బాగా సాగటంతో చేతికింద పనివాడిని పెట్టుకోవాలని అనుకున్నాడు. పక్క గ్రామంలో ఉండే నర్సయ్య పనికి కుదిరాడు. బాలిశెట్టికి తన కింద పనిచేసేవారంటే చులకన ఎక్కువ. తన ముందు వాళ్లు దేనికీ సరితూగరనీ, ఎందుకూ పనికిరారనే అహంతో ఉండేవాడు. నర్సయ్యది కష్టపడి పనిచేసే స్వభావం. దుకాణం తెరిచినప్పటి నుండి మూసేవరకు బాలిశెట్టి చెప్పే రకరకాల పనులన్నిటినీ కాదనకుండా చేసేవాడు. దుకాణంలో దుమ్ము దులపడం, సరుకులు పొట్లాలు, మూటలు కట్టడం చేసేవాడు. అతనికి ఏమాత్రం విరామం దొరికినా.. పప్పులు, బియ్యంలో ఉండే రాళ్లు ఏరమని పురమాయించేవాడు బాలిశెట్టి. ఎంతపని చేసినా తృప్తి ఉండేది కాదు. పని వేళలు ముగిసి నర్సయ్య ఇంటికి వెళ్లబోతుంటే ఉల్లిగడ్డల బస్తాను కరణం గారింట్లోనో, బియ్యం బస్తాను మునసబు గారింట్లోనో వేసి పొమ్మనేవాడు. ఇంటికి ఆలస్యం అవుతుంది, మరునాడు వేస్తానంటే కించపరుస్తూ, వెక్కిరిస్తూ మాట్లాడేవాడు. బాలిశెట్టి కూతురు పెళ్ళీడు కొచ్చింది. చదువుకున్న పిల్ల కావటంతో మంచి సంబంధం కుదిరింది. నర్సయ్యను దుకాణం పనులతోపాటు, పెళ్ళి పనులకూ తిప్పుకోవటం మొదలుపెట్టాడు. దాంతో ఏ అర్ధరాత్రో ఇంటికి చేరేవాడు నర్సయ్య. ఇంట్లోవాళ్ళు బాలిశెట్టి దగ్గర పని మానేయమని ఒత్తిడి చేశారు. పెళ్ళికి మూడురోజుల ముందు బాలిశెట్టి ఇంట్లో దొంగలు పడి ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. కూతురు పెళ్లి ఆగిపోతుందని బాలిశెట్టి భయపడి నర్సయ్యకు చెప్పుకుని భోరున ఏడ్చాడు. ‘అయ్యా! మీరేం కంగారు పడకండి. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి ఖర్చులు నేను సర్దుతాను’ అన్నాడు నర్సయ్య. ఆమాటకు బాలిశెట్టి ఆశ్చర్యపోయాడు. నర్సయ్యకు తన ఊరిలో పదిహేను ఎకరాల మాగాణి, ఇరవై ఎకరాల మామిడితోట, సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు కొడుకు వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు. అతనికి ఇంట్లో కూర్చోని విశ్రాంతి తీసుకోవటం ఇష్టంలేకనే బాలిశెట్టి వద్ద పనిలో చేరాడని తెలిసింది. తన కూతురు పెళ్లికి నగదు సహాయం చేశాడు నర్సయ్య. ఆనాటి నుండి ఇతరులను తక్కువ అంచనా వేయటం, చులకనగా చూడటం మానేశాడు బాలిశెట్టి. — తేజశ్రీ -
Funday Story: 'వనప్రస్థపురం'.. మరెప్పుడైనానా? ఎన్నేళ్ల నుంచి ఇదే..!?
హాలిడే ట్రిప్కు పిల్లలు, మనవళ్ళతో ఓలా కార్లు బయల్దేరిపోయాయి. తలుపు దగ్గరగా వేసి వచ్చి, హాల్లో సోఫా మీద కూర్చున్నాను. డైనింగ్ టేబులు మీద ఆఖరు మనవడు చివరి క్షణం వరకూ తిననని మారాం చేస్తూ వదిలేసిన పప్పు, నేయి అన్నం. దాని పక్కనే హడావుడిలో మరచిపోయిన మంచినీళ్ళ బాటిల్. ఇల్లంతా నిశ్శబ్దం కరెంటు పోయినట్టుగా. గదిలో సుభద్ర ఒత్తిగిల్లుతూ, దుప్పటి పైకి లాక్కున్న చప్పుడు. ఎంగిలి కంచం సింకులో వేసి, బెడ్రూమ్లోకి తొంగిచుశాను. ‘ఎట్లా ఉంది’ ‘తగ్గుతున్నది జ్వరం. పిల్లలు చాలా డిసప్పాయింట్ అయ్యారు నావల్ల’ ‘మరెప్పుడైనా వెళదాంలే ఏం పోయింది’ ‘మరెప్పుడైనానా? ఎన్నేళ్ల నుంచి అనుకుంటున్నాము తాజ్మహల్ చూద్దామని. అందరికీ కుదిరి, వాతావరణం బాగుండి, సెలవులు దొరికి, పరీక్షలు లేకుండా, ఇదిగో ఇన్నాళ్ళకి వీలయితే, ఈ వైరల్ ఫీవర్ మొత్తాన్ని దెబ్బతీసింది’ నిస్పృహగా నవ్వింది సుభద్ర. చేయి పట్టుకుని నిమిరాను. పలుచటి ముఖం. జ్వరంలోనూ తగ్గని ఆ ముఖంలోని నిర్మలత. కాకుంటే ఒత్తుగా ఉండే జుట్టొకటే ఈ మధ్య పలచబడింది. కాసేపటికి కునుకులోకి జారింది. బయటకు వచ్చి సోఫాలో కూర్చుని, క్రాస్వర్డ్ చేయటం మొదలు పెట్టాను. ఇరవై నిముషాలు పట్టింది. అలవాటయితే తేలికయిన ప్రక్రియే. సాయంత్రం నాలుగు గంటలు కావస్తోంది. ఫ్రిజ్ నుంచి పాలు తీసి బయటపెట్టాక, టీ డబ్బా కోసం వెతుకుతుంటే అకస్మాత్తుగా లాసా–లమ్సా చాక్లెట్ టీ గుర్తుకొచ్చింది. ఈ రోజుల్లో ఎవరయినా తాగుతున్నారా? అనుమానమొచ్చింది. ఫోను చేశాను. త్రివేణి సూపర్ మార్కెటులో ఆశ్చర్యకరంగా స్టాక్ ఉంది. పదినిమిషాల్లో పిల్లవాడితో పంపాడు. కొంచెం పాలతో, తక్కువ పంచదారతో, లైట్గా పెట్టిన టీ మరుగుతుంటే, వాసన కాస్త బలంగానే తగులుతోంది. రెండు మగ్గుల్లో పోసి బెడ్ రూమ్కు తీసుకువెళ్ళాను. చూస్తూనే లేచి కూచుంది సుభద్ర. మొదటి సిప్కే ముఖం విప్పారింది. ‘ఇదెక్కడిది’ ఆశ్చర్యంగా అడిగింది. ‘తెప్పించాను ఇప్పుడే’ టీ కప్పును చేతితో తిప్పుతూ చూస్తుండి పోయింది తాగడం మానేసి. ‘చల్లారిపోతుంది తాగు’ ‘ఈ రుచి, వాసన నీకు ఏం గుర్తుకు తెస్తున్నాయి’ ‘ముంబైలోని మాతుంగా కింగ్స్ సర్కిల్. అక్కడి పూలమాలలు. పక్కనే శృంగేరి మఠం. గిరి బుక్ స్టోర్’ ‘ఇంకా’ ‘బొంబాయ్ బ్లాస్ట్స్... మోకాళ్ళలోతు నీటిలో పెద్దవాడి బస్సు కోసం మెయిన్ రోడ్డు వరకూ చుడీదార్ ఎగగట్టి నడచిపోవడం’ జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా జాగ్రతగా నెమరువేస్తూ అవి అయిపోతాయేమో అన్న భయంతో కొంచెం కొంచెంగా టీ తాగాం. ‘ఎన్నేళ్ళయింది చాక్లెట్ టీ తాగి’ ‘1982లో ఆఖరిసారి తాగాము. బాంబే నుంచి స్విట్జర్లాండ్. వెనక్కు చెన్నై. కొన్ని రోజులు అమెరికా మళ్ళీ చెన్నై. ఎక్కడా దొరకలేదు మనకు’ అందామె. ‘మనం ప్రయత్నించలేదుగా’ ‘అంటే అత్తగారికి ఇష్టం లేదు. రెండు రకాల టీలు పెట్టే ఓపిక నాకు లేదు. మామయ్య, అత్తయ్య పోయాక, ఎప్పుడూ రుచిచూడని పిల్లలకు ఈ రుచి నచ్చలేదు’ ‘హోటల్స్లో దొరకదు’ నేను ముక్తాయింపుగా అన్నాను. మరుసటి రోజు ఉదయం ఢిల్లీ నుంచి ఫోను చేశారు పిల్లలు. అమ్మ ఎట్లా ఉంది. వంట ఏం చేసుకున్నారు వగైరా వగైరా. అమ్మ జ్వరం తగ్గిందనగానే వాళ్లకు కాస్త రిలీఫ్. కార్న్ ఫ్లేక్స్ను బౌల్స్లో తీసుకుని వేడి పాలు ఒంపుకొని డైనింగ్ టేబులు మీద కూర్చున్నాము. అల్మారాలో పై తంతెలో గోధుమ రంగులో ఉంది పెళ్లి ఆల్బమ్. దుమ్ము తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. దాదాపు నలభై ఏళ్ళ క్రితం ఆల్బమ్. పసి పిల్లలుగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళయినారు. చిన్న గొలుసు రెండు పిలకలతో అక్కయ్య ఎత్తుకొని ఉన్న రమ్య ఇవాళ అమెరికాలో సెటిల్ అయింది. కళకళలాడుతున్న ముఖాల్తో అత్తయ్యలు, మామయ్యలు, బాబాయిలు, పిన్నులు. కండువాతో తాతయ్య, అమ్మమ్మ. ఫ్యామిలీ ఫొటోలో దాదాపు 65 మందిమి ఉన్నాము. మనిషి మనిషిని లెక్కపెడితే ప్రస్తుతం అందులో నలభయి అయిదు మంది ప్రపంచంలోనే లేరు. పది మంది ఇండియాలో లేరు. ‘పెళ్ళిలో మామయ్య పాడిన పాట జ్ఞాపకముందా. భక్ష్యాలతో పాల మీగడ లేదని మీ ఆత్తకు కోపం వచ్చింది’ సుభద్ర జ్ఞాపకం చేసింది. ఆల్బమ్స్ వెనక్కి పెట్టేయబోతుంటే, సుభద్ర టీపాయి మీద ఉంచమన్నది– మధ్యాహ్నం తీరికగా చూసుకోవడానికి ఇద్దరం కలిసి. రోజుకు రెండుసార్లు పిల్లల ఫోనులు కొనసాగుతూనే ఉన్నాయి. టాక్సీ ప్రయాణం, హోటల్స్లో తందూరీ రోటీ రుచి. ఆగ్రా దారిలో ధాబాలు.. పుల్కాలు.. మజా కూల్డ్రింకు... బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరుసటి రోజు స్నానం చేసి స్లీవ్లెస్ నైటీలో బయటకు వచ్చింది సుభద్ర. చేతిలో కాగితాల కట్ట. ‘ఎన్నేళ్ళయింది నువ్వీ పింక్ స్లీవ్ లెస్ వేసుకొని’ అశ్చర్యంగా అడిగాను. ‘ఏమో! అల్మారా తెరిస్తే వేసుకోవాలనిపించింది’ ‘ఇన్నేళ్ళయినా ఎంత బాగుందో’ పెద్దగా అనేసి నాలిక కరుచుకొని చుట్టూ తిరిగి చూశాను. ఇంట్లో మేమిద్దరమే అన్న సత్యం మరోసారి గుర్తొచ్చింది. ‘ఏమిటి కాగితాల కట్ట’ ‘ఉత్తరాలు’ ‘ఏ ఉత్తరాలు’ ‘పెళ్ళికి ముందు ఆరు నెలలు మీరు నాకు, నేను మీకు రాసినవి’ నవ్వుతూ టేబుల్ మీద పెట్టింది సుభద్ర. ఒక కట్టకు గ్రీన్ బాండు. అవి సుభద్ర రాసినవి. రెడ్ రబ్బర్ బాండ్తో నావి. ‘ఉప్మా చేయమంటారా?’ ‘నువ్వేం చేయద్దు. కాస్త తొందరగా భోజనం చేద్దాము. ఉత్తరాలిచ్చి సోఫాలో కూర్చో’ సుభద్ర ఉత్తరాలు నేను, నా ఉత్తరాలు సుభద్ర తీసుకున్నాము. ఎన్ని ఆశలు. ఎన్ని ఆలోచనలు. ఎంత అర్థం లేని కవిత్వం. ఎప్పటి సినిమా పాటలు. మూడు వేలతో హనీమూన్ ఎక్కడికంటూ ఎన్ని చర్చలు. పెళ్ళికి ముందు ఎదుర్కోలులో కట్టుకోబోతున్న కాఫీ రంగు కంచి పట్టుచీర వర్ణన. రాసి కొట్టేసిన చిలిపి మాటలు. అప్పుడు చదివిన నవలల ప్రశంస. కనబోయే పిల్లల మీద బెరుగ్గా సాగిన చర్చలు. తెలుగు రాత అర్థం కావడానికి కూడా కొంచెం సమయం పడుతోంది. నాకు మాత్రం ఆ ఉత్తరాలు కృష్ణబిలం కన్నా లోతుగా, ఎంకి పాటల కన్నా మధురంగా అనిపించాయి. గంట తరవాత ఉత్తరాల కట్ట మార్చుకున్నాము. ఉత్తరాలు చదువుతూ అరవయి ఏళ్ళు దగ్గర పడుతున్న సుభద్రలో అప్పుడప్పుడు అణచిపెట్టుకున్న నవ్వు, ముంచెత్తుతున్న సిగ్గు చూస్తుంటే ఒక్కసారి గుండె పొరలో ఏదో కదిలింది. శిథిలమయిన దేవాలయం తలుపులు తీస్తే, చెక్కు చెదరని అమ్మవారి విగ్రహం కనబడినట్లు అనిపించింది నాకు. పుస్తకాలు చదవడం మొదలెట్టాం. ఒకరోజు ‘మిడ్ నైట్స్ చిల్ట్రన్’ కొంతభాగం నేను చదివాను. సుభద్ర విన్నది. మరుసటి రోజు ‘వెన్నెల్లో ఆడపిల్ల’ యండమూరి రచన సుభద్ర చదివింది. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి దగ్గరి సుధా హోటల్లో మసాలా దోశె. మూడోరోజు ఎన్నేళ్ళుగానో పోలేకపోతున్న శర్మ ఇంటికి సాయంత్రం ఓ గంటసేపు టీకి. ఎప్ప్పుడో టీటీడీ నుంచి తెప్పించిన పోతన భాగవతం తీసి చదవడం ప్రారంభించాం ఇద్దరం. ఉదయాన్నే ఐదున్నరకల్లా లేచి ఒక అరగంట ఐ.ఎం.లో నేర్చుకున్న యోగా చేయడం, ఆ తరువాత మరో అరగంట పాటు ఏ ఆలోచనా లేని మౌనం కోసం ధ్యానంలో కూర్చోవడం. మనవళ్ల స్కూలు, పిల్లల ఆఫీసు తొందర లేకపోవడంతో, పనిమనిషిని కూడా లేట్గా రమ్మన్నాము. ఒక విధమైన నిర్వా్యపారత్వంతో చాలారోజుల నుంచి వెతుకుతున్నది, కొంచెం కొంచెం దొరుకుతున్న తృప్తి మొదలైంది. వారం రోజులు త్వరగా గడిచిపోయాయి. ఆదివారం వచ్చేసింది. పిల్లలు సాయంత్రం దిగుతారు. ఉదయాన్నే లేచి కాఫీ కూడా తాగకుండా, కాలనీ పార్కులో మౌనంగా అరగంట కూచున్నాము. శరీరాలు కొంచెం తగులుతున్నాయి. మనసులు పెనవేసుకున్నాయి. నెమ్మదిగా లేచి ఇంటికి వచ్చేశాము. పిల్లలు వచ్చేశారు. ఇల్లంతా మళ్ళా సందడి. పొద్దున స్కూలుకు తయారయ్యేవాళ్ళు, హోమ్వర్క్ మరచిపోయిన వాళ్ళు, స్కూలు బాగ్ దొరకని వాళ్ళు, బ్రేక్ఫస్ట్, లంచ్, డిన్నర్ అన్నిటికి హడావుడి.. పూర్తి బిజీ రొటీన్ మళ్ళీ మొదలయింది. మనవళ్ల బస్సు కోసం రోడ్డు మీద నిలుచోవడం, ఎన్డీటీవీలో ఊదరగొట్టే రాజకీయ చర్చలు, పాత సినిమా పాటలను కొత్త వాళ్ళతో పాడించే కార్యక్రమాలు. అప్పుడప్పుడు రాని నీళ్ళు, ఎప్పుడూ ఎగ్గొట్టే పనిమనిషి. పాత మూసలోకి క్రమంగా జారిపోతున్నాము. ఒంటరిగా ఉన్న వారం రోజులు వెనక్కి తిరిగి చూసుకుంటే, అవి ఒకసారి ఏడాది లాగా, మరోసారి ఏదో కలలాగా అనిపించడం ప్రారంభించాయి. నెలరోజుల తరువాత రెండోవాడి కొలీగ్ పెళ్ళికి పిలుపు వచ్చింది. పెళ్ళి చేసుకునే అమ్మాయి మాకు కూడా బాగా పరిచయం. ఇంటికి వచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టి కార్డు ఇచ్చి రమ్మనమంటూ పిలిచింది. ఇంటిల్లిపాది బయలుదేరారు. ‘నాకెందుకో రావాలని లేదురా’ ప్రయాణానికి గంట ముందర చెప్పాను. ‘ఏం నాన్నా? ఒంట్లో బాలేదా’ ఆదుర్దాగా అడిగాడు మా రెండోవాడు. ‘ఒంట్లో బానే ఉంది. అక్కడికొచ్చి క్యూలో నిల్చుని, బఫే తినే ఇంట్రెస్టూ, రాను పోను నాలుగు గంటలు కార్లో కూచునే ఓపిక రెండూ లేవు’ నేనూ రానంటూ సుభద్ర ఉండిపోయింది. మమ్మల్ని వదిలి వాళ్లకు వెళ్లక తప్పలేదు. ఆ పైవారం బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం. కుటుంబసమేతంగా వనభోజనాలు. మరో వారం బిర్లామందిర్ ప్రయాణం. అన్నీ ఆఖరి క్షణంలో మానేశాము నేను, సుభద్ర. మమ్మల్ని, మా ప్రవర్తనని, ఆలోచనలను చిన్నప్పటి నుండి ఎరిగి ఉన్న పిల్లలకు, ముఖ్యంగా కోడళ్ళకు, ఏం జరుగుతున్నదో అంతుపట్టడం లేదు. మేమేమీ కోపంగా లేము. సాధింపులు లేవు. పిల్లలతో చిరాకు పడటం లేదు. పైపెచ్చు పూర్వం కన్నా కొంచెం సంతోషంగా ఉన్నట్లు కూడా వాళ్ళకు, మాకూ తెలుస్తూనే ఉంది. ఆదివారం ఉదయం. అందరం బ్రేక్ఫస్ట్ కానించి కూర్చున్నాము. పిల్లలు ఆడుకోడానికి వెళ్లారు. పెద్దకొడుకు, కోడలు, చిన్నకొడుకు, కోడలు హాల్లో సోఫాల్లో కూర్చొని ఉన్నారు. సుభద్ర వంటింట్లో టీ పెడుతోంది. పేపరుతో బయటకు వచ్చిన నన్ను చూసి, సింగల్ సీటరు సోఫా ఖాళీ చేసి కూర్చొమన్నాడు పెద్దవాడు. ‘అమ్మా నువ్వు కూడా ఇటురా’ పిలిచాడు. టీ కప్పులు ట్రేలో పట్టుకొని వచ్చింది సుభద్ర. మా దగ్గరున్న స్వతంత్రం వల్ల, ఇంట్లో ఉండే మంచి వాతావరణం వల్ల, ఏ ఉపోద్ఘాతం, డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడిగాడు పెద్దవాడు. ‘నాన్నా ఈ మధ్య మీరు ఇద్దరూ మాతో బయటికి రావడాన్ని ఎవాయిడ్ చేస్తున్నారు. ఒంట్లో బాలేదా? మనసు బాలేదా?’ ‘అదేమీ లేదురా’ మాట దాటేశాను. ‘పోనీ పిల్లలతో, పనితో బాగా అలసిపోతున్నారా? వంటకు సహాయంగా మనిషిని పెడదామంటే మీరేగా వద్దన్నారు’ ‘పనిలో ఏ ప్రాబ్లమ్ లేదురా’ ‘ఎందులోనూ ఏ ప్రాబ్లమ్ లేకపోతే మరి ఈ మార్పు ఎందుకు వచ్చింది. తాజ్మహల్ ట్రిప్ కాన్సిల్ అయినప్పటి నుంచి మీరు దేనికీ మాతో కలిసి రావట్లేదు. ఎందుకు?’ సుభద్ర, నేను మార్చి మార్చి చూసుకున్నాము. ఏమీ మాట్లాడవద్దన్నట్లు తల ఆడించింది సుభద్ర. నామటుకు నాకు, ఈ మౌనం, ముసుగులో గుద్దులాట కొనసాగితే, మనస్పర్థలు మొదలయితాయేమో అనిపించింది. ఆలోచించుకొని నెమ్మదిగా అన్నాను. ‘మేము వనస్థలిపురంలోని మన పాత ఇంట్లో ఉందామనుకుంటున్నాము. కనీసం ఓ ఆర్నెల్లు’ కొడుకులు, కోడళ్ళు అందరూ ఉలిక్కిపడ్డారు. ‘ఎందుకు నాన్నా? ఏమయింది’ చిన్నవాడి ప్రశ్న. ‘ఏమీ కాలేదు. మీరు మమ్మల్ని ఒక్కమాట అనలేదు. పిల్లలు కూడా ఏమీ నోరుజారలేదు. అంతా ఎంతో ప్రేమగా ఉంటున్నారు’ ‘మరి?’ ‘నేను చెప్పే కారణాలు కొన్ని మీకు నవ్వు తెప్పించవచ్చు. కొన్ని మీకు అర్థం కూడా కాకపోవచ్చు. మా అమ్మ చెప్పేది... రామాయణ వనవాస ఘట్టంలో దశరథుడి ఆక్రోశం అర్థం కావాలంటే పిల్లలుండాలని. అట్లాగే నేను చెప్పేవి, అనుకునేవి, మీకు అరవై, డెబ్బై ఏళ్ళు వస్తేగాని పూర్తిగా అర్థం కావు. వయసు పైబడ్డాక భార్య భర్తలకు ఏకాంతం యవ్వనంలో కన్నా ఎక్కువ అవసరం అని నా అభిప్రాయం. పెళ్ళయిన మొదటి రెండేళ్లలో ఎట్లా ఉన్నామో, ఏం మాట్లాడుకున్నామో కూడా జ్ఞాపకం లేదు నాకు. మీ చదువులు, మా అమ్మ, నాన్న, బంధువులు, రోగాలు, ప్రయాణాలు కొన్ని దశాబ్దాలు హాడావుడిగా గడిచిపోయాయి. మీ అందరి మధ్య ఎంత ప్రేమగా ఉన్నా, మేమిద్దరం నిశ్శబ్దంగా పక్కపక్కన కూర్చోవడమో, మా పెళ్లి ఆల్బమ్ చుసుకోవడమో, మాకు ఎంతో సహాయం చేసిన స్నేహితుల విషయం మాట్లాడుకోవడమో, ఇప్పుడు దాదాపు అసంభవం అయింది. కృష్ణశాస్త్రి పాటలు వింటుంటే మనవరాలు చానల్ మార్చేస్తుంది. తలత్ మెహమూద్ గజల్ చిన్నకోడలికి మలేరియా వణుకుపాట. పాత ఆల్బం టీపాయ్ మీద పెడితే పిల్లల పుస్తకాల్లో కలసిపోతుంది. ఏమీ చేయకుండా ఉండటం, చేయదలచుకున్నది మాత్రమే చేయడం, ఈ స్వతంత్రం కాస్త కావాలి అనిపిస్తోంది రా’ నా మాటలకు చిన్నకోడలు కాస్త గిల్టీగా తలదించుకుంది. ‘ఓ పదిహేను రోజులు ఎక్కడి కన్నా వెళ్ళిరండి నాన్నా!’ చిన్నవాడు సలహా ఇచ్చాడు. ‘నేను కోరుకునేది ఎక్కడికీ పోనక్కరలేని స్థిరత్వం, ప్రశాంతత. నాకు అరవై అయిదు ఏళ్ళు. మహా అయితే మరో పదిహేనేళ్ళు, ఆరోగ్యం బాగుంటే ఇరవై. మా ఇద్దరిలో ఒకరు ముందు, ఒకరు వెనక పోక తప్పదు. మా ఇద్దరిలో ఒంటరిగా మిగిలిన వాళ్ళకి మనుమలు, మనవరాళ్ళు తప్ప, ఏ జ్ఞాపకాల గుబాళింపు, ఏ మాటల మంద్రధ్వని ఆలంబనగా ఉండనక్కరలేదా? కళ్ళు మూసుకొని మీ అమ్మను తలచుకుంటే కాఫీ పెడుతూనో, పసిపిల్లకు పాలు పడుతూనో కనబడుతున్నది. ఆ రూపం తప్ప మరే రూపమూ ఎంత ప్రయత్నించినా నా కళ్ళ ముందుకు రావడం లేదు’ ఉద్యోగం చేస్తున్న పెద్దకోడలు తలదించుకొని నెమ్మదిగా అన్నది – ‘పోనీ మేమే ఎక్కడికన్నా మారిపోమా’ ‘మళ్ళా అదే మాట. మీరు మమ్మల్ని కష్టపెట్టడం లేదు. కాని మనమలు మనవరాళ్ళతో ఉండే సుఖం కన్నా కొంచెం వేరే సుఖం, శాంతి కావలసిన సమయం వచ్చిందేమో అనిపిస్తున్నది. ఏదో పొద్దున లేచి, గబగబా దీపం పెట్టి, హాడావుడిగా చేసే పూజ తప్ప, అరగంట ప్రశాంతంగా ఆత్మావలోకనం చేసుకునే తీరిక, వ్యవధి లేకుండా ఉన్నది జీవితం. తండ్రిగా, తాతగా, భర్తగా, ఉద్యోగిగా కాకుండా భగవంతుడు ఇచ్చిన జన్మకు ఒక వ్యక్తిగా నేను సాధించినదేమిటి? నన్ను, నేను ఎంతవరకు తెలుసుకున్నానన్న ప్రశ్న నన్ను ఒక్కొక్కసారి కలవరపెడుతున్నది.’ ‘అయితే వెళ్ళిపోతారా’ కూతురు లేని లోటును తీర్చిన చిన్నకోడలు ఒక్కసారి బావురుమంది. ‘అదేమిటమ్మా, ఆరునెలలు అనుకుంటున్నాము. ఉండగలమో, లేదో? మనసంతా ఇక్కడికే లాగుతుందేమో? చంటివాణ్ణి జోకోట్టకపోతే నాకు నిద్ర పట్టదేమో? ఏ అవసరం వచ్చినా చెప్పండి రెండు గంటల్లో హైటెక్ సిటీలో వచ్చివాలతాము. ఏం తినాలనిపించినా, మమ్మల్ని చూడాలనిపించినా, వెంటనే బయలుదేరి రండి. మన పూర్వులు నిర్ణయించినట్లు వానప్రస్థ ఆశ్రమాన్ని కొన్ని నెలలు అయినా వనస్థలిపురంలో గడుపుదామని మా ప్రయత్నం. భగవంతుడి దయ వల్ల మొదటి రెండు నెలలు ఈ ప్రయత్నం సఫలమయితే, తరువాతి రెండు నెలలు ఉత్తరాలు రాసుకునే వెనకటి రోజులకు పోదామనుంది. వీలయితే వాట్సప్ని ఫోను నుంచి తీసేద్దామనీ ఉంది. రోజువారీ వ్యవహారంలో మీరంతట మీరు నిర్ణయాలు తీసుకోవడం, బాగా అవసరమనుకుంటేనే మా సలహాను అడగడం మీకూ మంచిది. మాకూ మంచిది. ఎవరు చూడొచ్చారు? ప్రతిరోజు కనబడకపోతే మూడు దశాబ్దాల క్రింది నా యూరోపియన్ అనుభవాలు మీకు వినాలనిపిస్తుందేమో! మనవరాలు సంగీతం క్లాసు టయిమ్కి వాకింగ్ పెట్టుకోకుండా నేను ఇంట్లోనే ఉండి దాని ముద్దు పాటలు వింటానేమో’ ‘అహంకారమడగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరతీసుకో అన్న పాట అంతరార్థం తెలుసుకోవాలని ఉందిరా మీ నాన్నకు’ సుభద్ర వత్తాసు పలికింది. తేలికపడిన మనసుతో కుర్చీలోంచి ఉత్సాహంగా లేచాను. — బారు శ్రీనివాసరావు ఇవి చదవండి: Psychological Facts: 'తెలివైనవారి' పది అలవాట్లు ఏంటో మీకు తెలుసా!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019