breaking news
-
అమెరికాకు వెళ్తే పొట్ట తిప్పలేనా?
"తినుటకు ఉన్నచాలు అతిథిం గనినంతనె తల్పుతీసి రమ్మనుటకు ఉన్నచాలు తగ ఆలును బిడ్డలు ఒక్కచోట కూర్చొనుటకు ఉన్నచాలు ! " అన్నాడు కవి. ఇది అత్యాశకు పోకుండా ఉన్నంతలో తృప్తిగా జీవించాలనే పాత కాలం నాటిమాట. ఇపుడు కాలం మారింది , మనుష్యుల మనస్తత్వాలు మారాయి. మామూలు నడకతో లాభం లేదని అంతా పరుగులు తీస్తున్న రోజులు ఇవి. కుటుంబంతో కలిసి కూర్చొని ఉన్నదేదో తినాలంటే కుదరడం లేదు, మనిషి లేనిదాని కోసం అర్రులు చాస్తున్నాడు, కొత్తకొత్త రుచులు కోరుకుంటున్నాడు. ‘ గడుకంబలైన దొర్కక ఆకలిని దీర్ప కల్లు దాగితిమి మా కరువు దీర ‘ అన్నది మా మాతామహుడు వరకవి భూమగౌడు కాలంనాటి మాట. అంతటి దారిద్యం, కరువుకాలం నేను మాత్రం చూడలేదు. నా చిన్నప్పుడు , మా తల్లి దండ్రులు ఉన్నప్పుడు బడికి పోవడానికి ముందు మేము ఊదుకుంటూ తాగింది వేడివేడి గడుకంబలి, అంచుకు పెట్టుకున్నది వక్కకారం. మధ్యాహ్నం బడి వదలగానే ఆకలితో పరుగు పరుగున ఇంటికి వచ్చి ఆవురావురుమని ఆరగించింది పప్పన్నం. సాయంత్రం బడి చుట్టి కాగానే పొలోమని బయటికి వచ్చి ఆడిపాడి అలసిసొలసి ఇంటికి వచ్చి , చేతులు కూడా సరిగా కడుక్కోకుండా తిన్నవి, రాత్రి దీపాలకన్న ముందే కట్టెల పొయి వెలిగించి మా అమ్మ చేసిపెట్టిన జొన్నరొట్టెలు కాయగూరల కూరతో. మధ్య మధ్య సర్వపిండి , మొలక బియ్యం, వరి కుడుములు, మక్క కంకులు, జొన్నపిసికిళ్ళు, అనుప, అలిసంద గుడాలు లాంటి చిరుతిళ్ళు సరేసరి, చుట్టాలు వచ్చినప్పుడు ఒక కోడి ప్రాణం హరీ ! పండగల ప్రత్యేక వంటకాలు దసరా గారెలు, ఉగాది బూరెలు, సంక్రాతి చకినాలు ఉండనే ఉంటాయి. జీవితంలో ఎక్కువ భాగం హైదరాబాద్లో.. ఆ తర్వాత మజిలీ మారింది అమెరికాకు. దేశం కానీ దేశం వచ్చాక.. ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య భోజనం. ఇండియాలో ఏ మాటకు ఆ మాట.. ఉద్యోగాలు చేసే వాళ్లంతా ఇంట్లో భార్యలు చేసింది పుష్టిగా తినడమే కాకుండా.. బాక్సుల్లోనూ ఇంటి భోజనం తీసుకుని వస్తారు. ముంబై లాంటి చోట్ల అయితే వేడివేడిగా సమయానికి ఇంటి భోజనం తెచ్చిచ్చే "డబ్బావాలా"లు కూడా ఉన్నారు. ఎటొచ్చి అమెరికాలో ఈ పరిస్థితి లేదు. బాగా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి.. ఆడా,మగా అంతా సమానమే. అంటే భర్తకు సమయానికి వండి పెట్టే భార్య కనిపించడం అరుదు. ఎవరి మానాన వాళ్లు ఉదయాన్నే లేచి హడావిడిగా రెడీ అయి ఉద్యోగాలకు, వ్యాపారాలకు పరుగులు తీస్తారు. ఇక ఇంటి భోజనమా.? ఆ మాట వారాంతాల్లో తప్ప చాలా మందికి సాధ్యం కాదు. మరి బయటికెళ్లిన వాళ్లు ఏం తినాలి? అమెరికాలో ప్రతీ గల్లీలో ఫుడ్ సెంటర్లు కనిపిస్తాయి. ఆఫీసు క్యాంటీన్లు, బస్స్టేషన్లు, మెట్రో రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు ఎక్కడ చూసినా.. ఏదో బ్రాండ్ ఫుడ్ సెంటర్ కనిపిస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లన్నింటిలో కలిపి ఎక్కువగా కనిపించేవి ఇవి సబ్వే స్టార్బక్స్ మెక్ డొనాల్డ్స్ డంకిన్ బర్గర్ కింగ్ టాకో బెల్ డొమినో పిజ్జా హట్ వెండీస్ డైరీ క్వీన్ సగటు భారతీయుడి కంటే.. నాలుగింతలు నాన్వెజ్ ఎక్కువగా తింటారు. అక్కడి వాళ్ల అలవాటు ఇది. ఇక ఎక్కువ మంది ఉదయం పూట లాగించేవి శాండ్విచ్లు. కాల్చిన బ్రెడ్, మధ్యలో ఆమ్లెట్ లేదా వెజ్ పీస్లు. పక్కన ఫ్రెంచ్ ఫ్రైస్. కొందరు ఓట్స్ తింటారు. పళ్ల ముక్కలు తినేవాళ్లు కూడా బాగానే కనిపిస్తారు. మన దగ్గరి కంటే ఎక్కువగా కాఫీలు పీపాల కొద్దీ తాగేస్తుంటారు. అయితే కాఫీలో పాలు, చక్కెర కలుపుకుని కమ్మగా తాగే మనకు ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా సరే, చల్లటి ప్రాంతం కాబట్టి చాలా మంది రోజుకు ఐదారు కాఫీలు తాగేస్తుంటారు. మధ్యాహ్నం భోజనంలో ఎక్కువ మంది తినేవి బర్గర్లు, పిజ్జాలు. ఇందులో వందల వెరైటీలున్నాయి. ఏది తిన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ పక్కన నంజుకోవచ్చు. గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ చీస్ కూడా బాగానే తింటారు. ఉడికించిన కోడిగుడ్లు, బంగాళ దుంప, ఫ్రైడ్ చికెన్, బార్బెక్యూలు ఎక్కువగా కనిపించే, తినే ఫుడ్లు. తినే తిండికి అదనంగా గ్లాసుల కొద్దీ కూల్డ్రింకులు తాగుతూనే ఉంటారు. కూల్డ్రింక్ సర్వసాధారణం అని వచ్చిన వారానికి తెలిసిపోయింది. హాట్ డాగ్స్, లాబ్స్టర్ రోల్స్, బఫెలో వింగ్స్ వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా.. మన వాళ్లు కూడా నంజుకుని తినేస్తున్నారు. సాయంత్రం అయితే మాత్రం చాలా మంది ఇష్టపడేది డ్రింక్తో కలిపి తినే ఫుడ్. వీటికి అదనంగా మిల్క్ షేక్లు, ఐస్క్రీంలు. మరి ఇండియా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ వారి పరిస్థితి కాస్తా విచిత్రంగా మారుతుంది. వీకెండ్లో వీలైనన్ని కూరలు వండుకోవడం, బకెట్ నిండా సాంబారు తయారు చేసుకోవడం, దోశ/ఇడ్లీ పిండి రుబ్బుకోవడం, శనగలు/రాజ్మా లాంటివి నానబెట్టుకోవడం.. ఓ రకంగా శని/ఆది ఇంటి చాకిరిలో మునిగి తేలుతారు. ఇళ్లలో మన బీరువాల కంటే పెద్ద ఫ్రిడ్జ్లుండడం వల్ల తయారు చేసిన వాటన్నింటిని మళ్లీ వినియోగించుకునేలా ఐస్ట్రే తరహాలో ఉన్న బాక్స్ల్లో పెట్టి ప్యాక్ చేస్తారు. వాటిని ఏ రోజు అవసరం బట్టి ఆ రోజు తీసి మైక్రోఓవెన్లో పెట్టి వేడి చేసుకుని తింటారు. వీలైనన్ని సార్లు ఇంట్లో... తప్పనిసరి పరిస్థితుల్లో బయట తినడం మనవాళ్ల అలవాటు. కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. ఖర్చు తగ్గించుకుందామనుకున్న వాళ్లు.. చిన్న హీటర్ బాక్సుల్లో నూడుల్స్/కూరగాయ ముక్కలు వేసుకుని ఆఫీసుకు వస్తారు. సరిగ్గా లంచ్ సమయానికి పావుగంట ముందు దానికి ప్లగ్ పెడితే.. వేడి వేడి భోజనం రెడీ. ఇప్పుడు అమెరికాలోనూ ఇండియన్ ఫుడ్ బాగా పెరిగింది. హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ ఛాయ్లతో పాటు స్వీట్లు, హాట్లు.. అన్నీ దొరుకుతున్నాయి. ఈస్ట్ కోస్ట్ అంటే న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్లోని హూస్టన్, డాలస్లలో ఎక్కడ పడితే అక్కడ బోలెడు ఇండియన్ రెస్టారెంట్లు దర్శనమిస్తున్నాయి. ఏ మాటకా మాట.. రుచి కూడా బాగుండేలా బ్రహ్మండంగా చేస్తున్నారు. ఇండియా నుంచి వచ్చే చాలా మంది విద్యార్థులకు ఇక్కడే పార్ట్టైమ్ ఉద్యోగాలు. పైగా మోటెల్స్లో, ఔట్స్కర్ట్స్లో దాబాల తరహాలో ఇంట్లోనే ఉండే రెస్టారెంట్లను కూడా మనవాళ్లు మెయింటెయిన్ చేస్తున్నారు. ఏ రోజుకా రోజు ఓ పది రకాల వెజ్/నాన్వెజ్ ఐటమ్లు కావాల్సినన్నీ లాగించొచ్చు. దీన్నే అక్కడి పరిభాషలో బ్రంచ్ అంటారు. అంటే బ్రేక్ఫాస్ట్ సమయం దాటిన తర్వాత.. లంచ్ కంటే కొంచెం ముందు.. ఉదయం 11గంటల నుంచి ఒంటి గంటలోపు పూటుగా తినే రకం అన్నమాట. పది నుంచి 15 డాలర్లు ఇస్తే.. మన నోటికి , కడుపుకు సంతృప్త స్థాయిలో తిని రావొచ్చు. పిల్లలు పెద్దలై దేశ సరిహద్దులు దాటాక , మేమే వాళ్లకు అమెరికా లో అతిథులమయ్యాక , వాళ్ల మాట వినాలి కదా. ఇండియాలో తిన్నట్టు వెజిటేరియనే కావాలి అంటే కుదరదు. అది వాళ్ళు ఇంట్లో గ్రిల్ మీద కాల్చిన మాంసాహారమైనా తిన్నాం. బయట స్ట్రీట్ ఫుడ్ పాయింట్, రెస్టారెంట్ లకు తీసుకుపోయినా వాళ్ళ వెంట నడిచాము. అది మెక్ డోనాల్డ్స్ సాండ్ విచ్, మెక్సికన్ చిపొట్లే , మాంగోలియన్ చికెన్, ఇటాలియన్ పిజ్జా తాజాతాజా ఫుడ్ ఏదైనా తిన్నాం. జపనీస్ సుశి పచ్చి చేపయినా కళ్ళు మూసుకొని నోట్లో పెట్టాము. సముద్రతీర విహారయాత్రల్లో ప్రాణంతో ఉన్న ఎండ్రకాయలు, పాముల్లాంటి జీవులను మా కళ్ళముందే క్రూరంగా, వేడివేడి కడాయి నూనెలో వేయించి ఇస్తుంటే మాత్రం తినడానికి మాకయితే మనసొప్పలేదు. అలా ఒకానొక ఆదివారం ఓ అమెరికన్ రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు, అరగంట వెయిటింగ్ తర్వాత లభించిన సీట్లలో కూర్చొని, మా పిల్లలు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వచ్చిన బర్గర్ లాంటి ఫుడ్ , దాని ఊరూ పేరూ తెలియకుండా నోట్లో పెట్టిన మరుక్షణం మాకో అనుమానం వచ్చింది. నేను కాస్త నమిలి చూసాక తెలిసింది, ఎప్పుడో సర్వీస్ లో ఉన్నప్పుడు పాతబస్తీలో ఓ మిత్రుడితో కలిసి వెళ్లి సరదాగా తిన్నప్పటి ఫుడ్ రుచి అది అని. నేను అదే మాట మా వాళ్ల చెవిలో వేశాను. వెంటనే వాష్ రూం వైపు పరుగున వెళ్ళి బొళ్లుమని వాంతి చేసుకున్నారు, ఏదో ఘోరం జరిగినట్లు. ఎవరి దేశ కాల పరిస్థితులను బట్టి వాళ్ళవాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇక్కడ ప్రశ్న అది ఆరోగ్య కరమైందా కాదా, అయితే ఆ ఆహారం మనకు సరిపడుతుందా లేదా? అన్నదే, అంతేకానీ అందులో అపచారమేమీ లేదు ‘ అని ! వేముల ప్రభాకర్ (చదవండి: అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ !) -
మొలకలు వచ్చిన ఆలు, కలర్ మారిన ఆకుకూరలు వండేస్తున్నారా..?
బిజీ లైఫ్లో ఏ రోజు కారోజు తాజాగా ఉండే కూరగాయాలు తెచ్చుకోవడం అందరికీ కుదరదు. అందులోనూ కొన్ని కాయగూరలు తొందరగా మెత్తగా లేదా మొలకెత్తడం, కలర్ మారిపోవడం జరుగుతుంది. అన్ని డబ్బులు పెట్టి కొని పాడేయడానికి మనసొప్పక ఏదో రకంగా వండేస్తాం. కొందరైతే పాడైన భాగాన్ని తొలగించి మిగతా భాగం నుంచి వండేస్తారు.ఇలా చెయ్యొచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా..? కొన్ని కూరగాయాలు కొద్ది రోజులే నిల్వ ఉంటాయి. మరికొన్ని పాడైపోయినా ఆ విషయం తెలియదు. మెత్తబడటం లేదా మొలకెత్తుతుంటాయి ఇంకొన్ని కూరగాయాలు. మనం పడేయబుద్ధికాక వండేస్తుంటాం. అయితే ఇలా ఉంటే కొన్ని రకాల కూరగాయాలు అస్సలు వాడకూడదట. అవేంటో సవివరంగా చూద్దామా..! బంగాళదుంపం: బంగాళ దుంపపై మొలకలు వస్తే కొందరూ వెంటనే పడేస్తారు. మరొకందరూ వాటిని తొలగించి వండేస్తారు. మరీ వాడొచ్చా అంటే..నిజానికి బంగాళదుంపలో సహజంగా సోలనిన్ , చకోనిన్ అనే రెండు రకాల టాక్సిన్లు ఉంటాయి. అయితే బంగాళదుంపపై మొలకలు వచ్చి, ఆకుపచ్చని రంగు కనిపిస్తే వెంటనే పడేయ్యడం మంచిది. జస్ట్ అప్పుడే చిన్నగా మొలకలు వచ్చి ఆకుపచ్చ రంగు కనిపించనట్లయితే వినయోగించొచ్చు. కానీ మొలకలు, ఆకుపచ్చ రంగు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వినయోగించొద్దిన నిపుణులు చెబుతున్నారు. ఈ సోలనిన్ విష పదార్థం అని దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. ఉల్లిపాయలపై నల్ల మచ్చలు ఉల్లిపాయలు వద్దకు వస్తే బయటి తొక్కలు పొడిగా ఉంటాయి. కానీ లోపాల చాలా వాటికి నల్లటి రంగు ఉంటుంది. మనం వాటిన కడిగేసి వాడేస్తుంటా. అయితే ఇదేం అంత ప్రమాద కాదని చెబుతున్నారు నిపుణులు. మట్టిలో ఉండటం వల్ల వచ్చే కొద్దిపాటి ఫంగస్ అని, దీన్ని చక్కగా కడగడం లేదా ఆ భాగాన్ని తీసేయండి చాలు అని సూచిస్తున్నారు. కానీ ఒక్కోసారి బయటపోరలు తీస్తుండగా మెత్తగా కుళ్లినట్టు ఉండి లోపల భాగం బాగుంటే అస్సలు వంటకు వినయోగించొద్దుని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఆకుకూరలు వద్దకు వస్తే.. ఇవి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. వడలిపోయి, కలర్ మారిపోతే వాడొద్దని హెచ్చరిస్తున్నారు. అక్కడక్కడ కొద్దిగా ఆకులు పసుపురంగులో ఉంటే ఆయా ఆకులను తీసుకుని వాడుకోవచ్చని చెబుతున్నారు. అలాగే ఆకుకూర కాళ్లుభాగం లేదా, ఆకులు కుళ్లినట్లు ఉంటే అస్సలు వినయోగించొద్దని చెబతున్నారు. మొత్తని టొమాటాలు.. దెబ్బతగిలిన టొమాటాలు, కొన్ని లేత మచ్చలు ఉన్నా..ఆ ప్రాంతం వరకు కట్ చేసి తీసేసి వాడుకోవచ్చు. అదే టమాట బూజు పట్టి ఉండి మొత్తం మొత్తగా ఉంటే వెంటనే పారేయండి. కొన్ని టమాటాలు మెత్తగా అయిపోతాయి. అవి వాడుకోవచ్చని, ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. వెల్లుల్లి.. భారతీయ వంటశాలల్లో ప్రధానమైనది. ఇవి గోధుమ రంగులోకి మారిన, దానిపై గోధుమ కలర్ మచ్చలు ఉన్నా.. వెల్లుల్లి పాడైందని అర్థం. కొన్నింటికి ఆకుపచ్చగా మొలకలు వస్తాయి. అలాంటి వెల్లుల్లిలోని ఆకుపచ్చ భాగాన్ని తొలగించి హాయిగా వాడుకోవచ్చు. ఎందుకంటే..? వెల్లుల్లిలోని మొలకెత్తిన ఆకుపచ్చ భాగం చేదుగా ఉంటుంది. కూరల్లో వినయోగిస్తే టేస్ట్ మారుతుంది కాబట్టి వాటిని తొలగించాలి. పుట్టగొడుగులు.. పుట్టగొడుగులు ముడతలు పడినట్టు ఉండి జిగటగా ఉండి పాడైపోయినట్లు సంకేతం. అలాగే వాటిపై నల్ల మచ్చలు చెడిపోవటాన్ని సూచిస్తాయి. ఇలాంటివి వినియోగించకపోవటమే మేలు. దోసకాయలు.. దోసకాయ సాధారణంగా ఫ్రిజ్లో ఒక వారం పాటు తాజగా ఉంటుంది. దోసకాయ మెత్తబడితే అది పాడైపోయిందని అర్థం. మొత్తంగా కాకుండా కేవలం దోసకాయ చివరి భాగం మాత్రమే మెత్తగా ఉంటే ఆ భాగాన్ని తీసేసి వాడుకోవచ్చు. (చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
ఆ బ్లడ్ గ్రూప్ అయితే..చికెన్, మటన్ వద్దంటున్న వైద్యులు!
వారంలో కనీసం ఒక్కరోజైన ముక్క లేనిది ముద్ద దిగదు నాన్ వెజ్ ప్రియులుకు. పుటుకతో వెజిటేరియన్ అయినవాళ్లు సైతం దీని రుచికి ఫిదా అయ్యి నాన్వెజ్గా మారినోళ్లు కూడా ఉన్నారు. అందులోనూ ఆదివారం వస్తే మటన్ లేదా చికెన్ ఉండాల్సిందే. లేదంటే నోరు చచ్చిపోయినట్లు ఉంటుంది. నిజానికి శాకాహారమే ఆరోగ్యానికి మంచిది. కానీ నాన్వెజ్ మాత్రం రుచికి రుచి.. నాలికకు ఆ మషాల తగులుతుంటే..అబ్బా! చెబుతుంటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. అలాంటిది వైద్యులు మాత్రం మీ బ్లడ్ గ్రూప్ని బట్టి చికెన్ లేదా మటన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తినమని సూచిస్తున్నారు. పైగా ఆ బ్లడ్ గ్రూప్ అయితే అస్సలు తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు తినొచ్చు, ఎవరూ తినకూడదో సవివిరంగా తెలుసుకుందామా..! ఎందుకిలా వైద్యుల హెచ్చరిస్తున్నారంటే..అందరి బ్లడ్ గ్రూప్ ఒకలా ఉండుదు. అలాగే కొందరికి నాన్వెజ్ సులభంగా జీర్ణమవుతుంది. మరికొందరూ తినగానే పలు సమస్యలు ఫేస్ చేస్తుంటారు. అందువల్ల ఏయే బ్లడ్ గ్రూప్ వాళ్లు ఏదీ తింటే బెటర్ అనేది తెలుసుకుని తినమని సూచిస్తున్నారు వైద్యులు. మనకి బ్లడ్ గ్రూప్లో నాలుగు రకాలు ఉన్నాయి. అవి వరుసగా ఓ, ఏ, బీ, ఏబీలు. ఈ నాలుగు బ్లడ్ గ్రూపులకు చెందిన వ్యక్తులు తీసుకునే నాన్వెజ్ ఆధారంగా జీర్ణమవ్వడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయా గ్రూప్లోని వ్యక్తుల్లో జీర్ణశక్తి వేరువేరుగా ఉంటుంది. కొందరికి త్వరగా జీర్ణమైతే మరికొందరికి లేట్గా అవుతుంది. అందువల్ల ఎవరు ఎలాంటి నాన్వెజ్ తింటే బెటర్ అనేది సవివరంగా చూద్దాం!. 'ఏ' గ్రూప్.. ముందుగా ఏ బ్లడ్ గ్రూప్ వారు రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వీరి ఆరోగ్యం శాకాహారానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. చికెన్ లేదా మటన్ తక్కువగా తినడం మంచిది. వీళ్లు సీఫుడ్ వంటివి తినాలనుకుంటే వివిధ రకాల పప్పులను చేర్చాలి. ఈ ఆహారాలైతేనే వారికి జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటాయి. 'బీ' గ్రూప్.. బీ బ్లడ్ గ్రూప్ వారికి రోగనిరోధక శక్తి ఎక్కువ. చికెన్, మటన్ వంటి ఏ మాంసాహారం అయినా హాయిగా తినొచ్చు. అయితే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఉండటం కూడా ముఖ్యమనేది గ్రహించాలి. ఇక 'ఏబీ', 'ఓ' గ్రూప్ల వ్యక్తులు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకపోయినా మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించడం మంచిది. ఆకుకూరలు, సీఫుడ్ తినొచ్చు. కాగా, కొందరికి మాత్రం జీర్ణసమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఏదైనా తింటే వెంటనే కడుపులో అసౌకర్యం మెుదలవుతుంది. జీర్ణమం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాంటివారు వైద్యుడిని సంప్రదించాలి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. దీని గురించి మరింతగా తెలుసుకునేలే మీ వ్యక్తిగత వైద్యుడిని లేదా నిపుణుల సలహాలు, సూచనలతో అనుసరించడం ఉత్తమం. (చదవండి: పాపులర్ వీడియో గేమర్కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!) -
ఆ చాక్లెట్లు తిని మత్తులోకి జారి!
కొత్తూరు: స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో విక్రయిస్తున్న చాక్లెట్లు తిని విద్యార్థులు మత్తులోకి జారుకోవడం, వింత వింతగా ప్రవర్తిస్తున్న దృష్టాంతాలు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగుచూశాయి. ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో లభించే చాక్లెట్లను తరచూ కొని తింటున్న పలువురు విద్యార్థులు తరగతి గదుల్లో మత్తులోకి జారుకుంటున్నారు. కొద్ది రోజులుగా విద్యార్థులు వింతగా ప్రవర్తించడాన్ని గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయగా చాక్లెట్ల వల్లనే అని తేలింది. వీటిని మొదట పాన్ డబ్బాల వ్యాపారులు ఉచితంగా విద్యార్థులకు అందించారని, క్రమంగా వాటికి బానిసలైన విద్యార్థులకు ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఉపాధ్యాయుల సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు మంగళవారం సదరు పాన్ డబ్బాలపై దాడిచేయగా స్వల్ప మొత్తంలో చాక్లెట్లు లభించాయి. అయితే ఈ చాక్లెట్లలో ఏముందనేది తెలియరాలేదని చెబుతున్నారు. హెచ్ఎం అంగోర్ నాయక్ను వివరణ కోరగా విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్న విషయం వాస్తవమేనని, దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించామని చెప్పుకొచ్చారు. -
డ్రాగన్ ఫ్రూట్ ఎలా వాడాలి?..పొరపాటున అలా తింటే..
ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్స్ మార్కెట్లో బాగా వస్తున్నాయి. ఇటీవల కాలంలో మన రైతులు వీటి సాగుతో లాభలార్జిండంతో మార్కెట్లో బాగా విరివిగా లభిస్తున్నాయి. అలాంటి ఈ పండు ధర కూడా కాస్త ఎక్కువ. చాలామందికి దీన్ని ఎలా తిన్నాలనే తెలియదు. బాగా దీని రుచి కూడా కాస్త పులుపు స్వీట్తో కూడిన తాటి ముంజుల్లా ఉంటాయి. వీటిని ఎలా తినాలి. తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి తదితరాల గురించి ఆయుర్వేద డైటిషిన్ శిరీష రాకోటి మాటల్లో తెలుసుకుందాం.! డ్రాగన్ ఫ్రూట్ ఎలా కట్ చేయాలంటే.. పొలుసులుగా పొడుచుకు వచ్చిన ఆకులతో వెలుపలి భాగం కఠినంగా కనిపిస్తున్నప్పటికీ, దాన్ని ముక్కలు చేయడం మాత్రం చాలా సులువే. కట్టింగ్ బోర్డు మీద డ్రాగన్ ఫ్రూట్ ఉంచి పండును సగానికి పొడవుగా కత్తిరించండి. అందుకు పదునైన చెఫ్ కత్తిని ఉపయోగించండి. పైభాగంలో ప్రారంభించి, ఆపై మందమైన కాండంలోకి వెళ్లేలా కట్ చేయండి. ఆ తర్వాత ఒక చెంచా ఉపయోగించి గుజ్జును సగం నుండి నేరుగా తినవచ్చు. లేదా పండును రెండు సగభాగాలుగా కోసి పూన ఉన్న మందపాటి చర్మాన్ని తొలగించి ముక్కలుగా చేసుకుని తినేయొచ్చు. ఈ ఫ్రూట్ ఉపయోగాలు.. ఇందులో మాంసకృతులు, పీచు, పిండి పదార్ధాలు, తీపి, సోడియం, విటమిన్ సి, విటమిన్ ఎ, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ ఇ, ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫోస్ఫరస్, బెటాలైన్స్, హైడ్రాక్సీసిన్నమేట్స్, ఫ్లేవనాయిడ్స్, ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. గర్భధారణ సమయంలో రక్తహీనతను దూరం చేస్తుంది. శిశవు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తుంది. గర్భిణికి నీరసం రాకుండా చూస్తుంది. ఎముకల ఆరోగ్యం కాపాడుతుంది. కీళ్లలో ఎముకల రాపిడి జరగకుండా ఉండే మృదులాస్థి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీని వలన ఎముకల మధ్య రాపిడి ఉండదు దాని వలన నొప్పిలు ఉండవు. కండరాలు మరియు రక్త నాళాలు పని తీరును మెరుగు పరుస్తుంది. వాపును తగ్గిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ప్రీబయోటిక్ ఉంటాయి. దాని వలన ప్రోబైయటిక్ పెరిగి జీర్ణ శక్తి మెరుగు అవుతుంది. ఇన్సులిన్ నిరోధకతను తాగించడం ద్వారా మధుమేహం రాకుండా చూస్తుంది. మధుమేహం ఉంటే స్థాయిలను నిర్వహింస్తుంది. క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మంపై అకాల వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కళ్ల ఆరోగ్యం కాపాడుతుంది. చెడు కొవ్వు నియంత్రిస్తుంది. మంచి కొవ్వుని పెంచుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగు పరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తాగిస్తుంది. కాలేయంలో కొవ్వుని నియంత్రిస్తుంచి ఆరోగ్యగా ఉంచుతుంది. అయితే ఈ డ్రాగన్ఫ్రూట్ని తొక్క తోపాటుగా తింటే మాత్రం అజీర్తీ వస్తుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అలా తిని లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే తొక్క కాస్త మందంగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యల ఉన్నవారికి ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాల కన్నా చెడు ఎక్కువ అవుతుంది. అందువల్ల దయచేసి పైన ఉన్న తొక్కను తీసివేసి తినండి. --శిరీష రాకోటి, ఆయుర్వేద డైటిషిన్ (చదవండి: రోజూ ఒక కప్పు 'టీ' తాగితే.. మధుమేహం ఉండదు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019