breaking news
Ad - Sakshi_Home_Sticky
-
అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం ఏది?
కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో పలువురు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్లాన్ చేసుకుంటున్నారు. అందమైన పర్యాటక ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రకృతిని చూడాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం కూడా ఉంది. అయితే అది ఎక్కడ ఉంది? ఎందుకు ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉంది? అంటార్కిటికా ఖండం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతంగా పేరొందింది. దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ఈ ఖండంలో బలమైన మంచు గాలులు వీస్తాయి. అంటార్కిటికాలో దాదాపు రెండు కిలోమీటర్ల మందపాటి మంచు పలక విస్తరించి ఉంది. రక్తాన్ని గడ్డకట్టే చలి వాతావరణం ఉన్నప్పటికీ, ఈ ఖండంలో సందర్శించదగిన అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉండే ఏకైక ప్రదేశం అంటార్కిటికా. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం అనే రెండు సీజన్లు మాత్రమే ఉంటాయి. అంటార్కిటికా ఖండంలో వేసవి కాలంలో ఆరు నెలల పాటు పగటి వెలుతురు ఉంటుంది. అయితే చలికాలంలో ఆరు నెలల పాటు ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తుంది. అంటార్కిటికా ఖండంలోని ఎత్తైన శిఖరం పేరు విన్సన్ రేంజ్. దాదాపు 4,892 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శిఖరాన్ని విన్సన్ మాసిఫ్ అని కూడా పిలుస్తారు. పద్మశ్రీ డాక్టర్ అరుణిమ సిన్హా ఈ పర్వత శిఖరంపై భారత జెండాను ఎగురవేశారు. ఈ శిఖరం పర్వతారోహకులను అమితంగా ఆకర్షిస్తుంది. అంటార్కిటికాలో సౌత్ షెట్లాండ్ ద్వీపం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. సౌత్ షెట్లాండ్ దీవుల్లోని పరిశోధనా కేంద్రాలకు వివిధ దేశాల నుంచి పరిశోధకులు వస్తుంటారు. ఈ ఖండంలో డ్రేక్ పాసేజ్, ఫాక్లాండ్ దీవులు, దక్షిణ జార్జియా వంటి అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రయాణించడాన్ని పర్యాటకులు సాహసంగా పరిగణిస్తారు. అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడానికి వేసవి కాలం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. -
‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి
సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. వాతావరణ రంగంలో సేవలందించేందుకు గాను జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ సాయంతో ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగంలో భాగంగా ఇన్శాట్-3డీఎస్లోని 6-ఛానల్ ఇమేజర్, 19-ఛానల్ ఇమేజర్ భూ చిత్రాలను తీసింది. ఆ చిత్రాల సాయంతో దేశ వాతావరణ పర్యవేక్షణ, అంచనా సామర్థ్యాలను గుర్తించేందుకు ఉపయోగపడతాయి.ఇన్శాట్-డీఎస్ తీసిన చిత్రాలు వాతావరణ అంచనా, వాతావరణ పర్యవేక్షణ, వాతావరణ పరిశోధనల కోసం కీలకమైన డేటాను అందించడానికి ఉపయోగపడతాయని ఇస్త్రో ప్రకటించింది. 6-ఛానల్ ఇమేజర్ భూమి ఉపరితలం, వాతావరణ చిత్రాలను ఒడిసిపట్టింది. ఈ చిత్రాల సాయంతో భూమి ఉపరితల ఉష్ణోగ్రత, వృక్ష ఆరోగ్యం, నీటి ఆవిరి పంపిణీ వంటి వివిధ వాతావరణ, ఉపరితలాల సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. 19-ఛానల్ ద్వారా సేకరించే చిత్రాల సాయంతో భూమి వాతావరణం ద్వారా విడుదలయ్యే రేడియేషన్ను వివిధ వాతావరణ భాగాలు, నీటి ఆవిరి, ఓజోన్, కార్బన్ డయాక్సైడ్, ఇతర వాయువుల వంటి లక్షణాల ద్వారా విడుదలయ్యే రేడియేషన్ గురించి తెలుసుకునేందుకు సహా పడతాయి. -
భూమి అంతానికి నాలుగు కారణాలు!
పుట్టిన ప్రతీదీ గిట్టక తప్పదని అంటారు. ఈ సృష్టిలో ఉద్భవించిన భూమి కూడా ఏదో ఒకరోజు అంతమవుతుందని చెబుతుంటారు. మరి భూమి ఎప్పుడు అంతమవుతుంది? ప్రస్తుతం భూమిపై నెలకొన్ని విపత్కర వాతావరణ పరిస్థితులు భూమి అంతానికి దారి తీస్తున్నాయా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ‘సూపర్ ఖండం’తో పెనుముప్పు గడచిన 500 మిలియన్ సంవత్సరాలలో మన గ్రహం లెక్కలేనన్నిసార్లు భారీ ప్రళయాలను చవిచూసింది. ఆయా ప్రళయకాలాల్లో భూమిపై ఉన్న జాతులలో 90 శాతం జాతులు అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఈ ప్రళయాలు ‘సూపర్ కాంటినెంట్’ ఏర్పడేందుకు దారితీస్తున్నాయి. రాబోయే 250 మిలియన్ సంవత్సరాలలో భూ ఖండాలు మళ్లీ కలిసి ‘పంగియా అల్టిమా’ అని పేరుతో ‘సూపర్ ఖండం’గా ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది భూమధ్యరేఖకు సమీపంలో ఉంటుంది. అలాగే ఇది అత్యంత వేడి ఖండంగా ఉండబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్లోని లీడ్స్ యూనివర్శిటీ, యూఎస్లోని నార్త్వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం ‘పాంగియా అల్టిమా’ పరిస్థితులు క్షీరదాల మనుగడకు ప్రతికూలంగా మారనున్నాయి. మనుగడ కోసం పోరాటంలో.. అమరత్వం అనేది కథల వరకే పరిమితం. అంతరించిపోవడం అనేది కాదనలేని సత్యం. జీవ పరిణామక్రమంలో వివిధ జాతుల మనుగడ కోసం ఒత్తిళ్లు పెరుగుతాయి. జన్యు ఉత్పరివర్తనలు సంభవించినప్పుడు పలు సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ఉత్పరివర్తనలు ఒక నిర్దిష్ట సమయంలో జీవిపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా, మనుగడ సాగించడానికి ప్రయోజనకరంగానే ఉంటాయి. ఆ జన్యువులు తరువాతి తరానికి తరలే అవకాశం ఉంది. వైవిధ్యం, అనుకూలత అనేవి జీవులు జీవించడానికి కావాల్సిన లక్షణాలు. తక్కువ వైవిధ్యం, అననకూల పరిస్థితులు ఉన్పప్పుడు మానవ జనాభా అంతరించిపోయే అవకాశం ఉంది. పరిమిత వనరుల మధ్య.. భూమిపై వనరులు పరిమితం అవుతుండటానికి తోడు అణు, రసాయన, జీవ ఆయుధాలు, అంతుచిక్కని వ్యాధులు మొదలైనవి మానవ మనుగడకు ముప్పుగా మారనున్నాయి. ఇదేవిధంగా భారీ గ్రహశకలాల దాడి కూడా భూమి అంతరించిపోయేందుకు కారణం కావచ్చు. అలాంటి సంఘటన సంభవించినా, సంభవించకున్నా ఏదో రూపంలో మానవాళికి ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. భౌగోళిక, ఖగోళ పరిశోధన ఫలితాల ప్రకారం చూస్తే, ఈ విపత్తు సమీపంలోనే ఉందనే అంచనాలున్నాయి. వేడెక్కుతున్న మహాసముద్రాలు వేడెక్కుతున్న వాతావరణం కారణంగా మహాసముద్రాలు వేడెక్కుతున్నాయి. ఇవి భూమి మనుగడకు మప్పుగా పరిణమిస్తున్నాయి. అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనలో 580 అమెరికన్, 216 సెంట్రల్ యూరోపియన్ నదుల డేటాతో వర్షపాతం, నేల రకం, సూర్యకాంతి తదితర అంశాలను పరిశీలించారు. భవిష్యత్తులో నదులలో ఆక్సిజన్ తగ్గే ఆక్సిజన్ రేటు జీవ వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించనుంది. అధ్యయనంలోని శాంపిల్స్ రాబోయే 70 సంవత్సరాలను అంచనా వేశాయి. తక్కువ ఆక్సిజన్ కారణంగా కొన్ని జాతుల చేపలు పూర్తిగా అదృశ్యమవుతాయి. దీని వల్ల జల వైవిధ్యానికి భారీ నష్టం వాటిల్లుతుంది. మానవులతో సహా అనేక జాతుల మనుగడకు ఇది పెను ముప్పుగా పరిణమించనుంది. -
చండ ప్రచండ మార్తాండ!
భగభగలాడే భానుడిపై ఓ నల్ల మచ్చ... తొలిసారి ఈ నెల 18న కనిపించింది... భయం పుట్టించేలా అది నేరుగా భూమికేసి కసిగా చూస్తోంది.... వారం రోజుల క్రితం తన నోట్లోంచి భూమి వైపు మూడు సౌరజ్వాలల్ని కక్కింది. దాంతో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేకపోవటంతో పెద్దగా నష్టం సంభవించలేదు. తర్వాత ఫిబ్రవరి 24-26 తేదీల మధ్యకాలంలో కేవలం రెండు రోజుల్లోనే ఇంతింతై అన్నట్టు... ఆ మచ్చ సైజు అమాంతంగా 25% పెరిగిపోయింది. .. తొమ్మిదిన్నర భూగ్రహాల వైశాల్యానికి సరిపోయేంతగా ఆ సన్ స్పాట్ విస్తరించింది. 2019లో మొదలైన ప్రస్తుత 25వ సౌరచక్రంలో సూర్యుడిపై ఇదే అతి పెద్ద మచ్చగా అవతరించింది. దీని పేరు ‘ఏఆర్3590’. ఏఆర్ అంటే యాక్టివ్ రీజియన్. సూర్యుడిపై క్రియాశీల ప్రాంతం. భూమికి పొంచి వున్న ముప్పు దృష్ట్యా సన్ స్పాట్ ఏఆర్3590 ప్రస్తుతం ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే సూర్యుడి అంతర్గత స్వరూపంలో గణనీయ మార్పులు వస్తున్నాయి. సూర్యుడిపై నల్ల మచ్చలు మామూలే. సౌరజ్వాలలకు పుట్టినిల్లయిన ఈ మచ్చలు అంతరిక్ష వాతావరణం, సౌరవ్యవస్థలోని గ్రహాలపై ప్రభావం చూపుతాయి. సూర్యుడి ఉపరితలంపై భారీ వైశాల్యంలో ఏర్పడే ఈ మచ్చల అయస్కాంత క్షేత్రం... భూ అయస్కాంత క్షేత్రం కంటే 2,500 రెట్లు శక్తిమంతం. లోలోన సూరీడు బాగా క్రియాశీలంగా ఉన్నచోట ఈ సన్ స్పాట్స్ ద్యోతకమవుతాయి. తమ పరిసర ప్రాంతాలతో పోలిస్తే వీటిలో ఉష్ణోగ్రతలు తక్కువ. Photo Credits: thesuntoday అయినప్పటికీ ఈ మచ్చల్లో 3,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక మచ్చల సంఖ్య మాత్రం 11 ఏళ్ల సౌరచక్రాన్ని అనుసరించి మారుతుంది. సౌరచక్రంలో ఇప్పుడు మనం ముప్పు ముంగిట ఉన్నాం. గణించడం ఆరంభమయ్యాక ప్రస్తుతం 25వ సౌరచక్ర ప్రక్రియ కొనసాగుతోంది. మానవాళిని ఇబ్బంది పెట్టకుండా 24వ సౌరచక్రం ప్రశాంతంగా పూర్తయింది. 25వదీ సాఫీగా అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు ఊహించారు. కానీ తమ అంచనాలను మించి శక్తిమంతంగా కనిపిస్తున్న ఈ 25వ సౌరచక్రం భూమికి అనర్థాలు, చిక్కులు తెచ్చిపెడుతుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సూర్యుడిపై మచ్చలు తరచూ ఏర్పడటం, వాటి సైజు పెరుగుతుండటం, తీవ్ర సౌర తుపాన్లు చోటుచేసుకోవడం గమనిస్తుంటే సూర్యుడు తన తాజా 11 ఏళ్ల సౌరచక్రంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడని, మహోగ్ర విస్ఫోట దశను వేగంగా సమీపిస్తున్నాడని తెలుస్తోంది. తాము గతంలో ఊహించిన దాని కంటే చాలా ముందుగానే, బహుశా 2024 జూన్ మాసం ముగిసేలోపే ‘చండ మార్తాండ’ (సోలార్ మాగ్జిమమ్/సౌర గరిష్ఠం) దశ సంభవిస్తుందని శాస్త్రవేత్తల అంచనా. భూమిపై ఇది ఏ ఉత్పాతాలకు దారితీస్తుందో, ఏ ఉపద్రవాలు తెచ్చిపెడుతుందోనని వారు కలవరపడుతున్నారు. ఈ ఉగ్ర రూపం అనంతరం సూర్యుడు మళ్లీ నెమ్మదిస్తాడు. విశేషమేంటంటే... సోలార్ మాగ్జిమమ్ లేదా ‘పీక్ స్టేజి’ సమాప్తమైందనే సంగతి... అది ముగిసిన ఆరు నెలల దాకా శాస్త్రవేత్తలకు తెలియదు! Photo Courtesy: NASA/SDO, AIA, EVE, HMI Science Teams ఏఆర్3590తో ప్రమాదమే! సూర్యుడు లోపల్లోపల తీవ్రంగా ప్రజ్వలిస్తాడు. తన ఉపరితలంపై కొన్ని చోట్ల అకస్మాత్తుగా విస్ఫోటిస్తాడు. అప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా హెచ్చు మొత్తంలో విద్యుదయస్కాంత వికిరణం విడుదలవుతుంది. ఇవే సౌరజ్వాలలు (సోలార్ ఫ్లేర్స్). ఈ జాజ్వల్యమాన ధగధగలు సూర్యుడిపై ప్రకాశవంతంగా గోచరిస్తాయి. సోలార్ ఫ్లేర్ ప్రక్రియ కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటలపాటు కొనసాగవచ్చు. తీవ్రత ఆధారంగా ‘సోలార్ ఫ్లేర్స్’ను X, M, C, B, A అంటూ అవరోహణ క్రమంలో ఐదు రకాలుగా వర్గీకరించారు. వీటిలో X రకం ఫ్లేర్స్ మహా శక్తిమంతం, భూమికి హానికరం. బలహీనపు A, B సౌరజ్వాలల ప్రభావం స్వల్పం. సన్ స్పాట్ ఏఆర్3590 ఫిబ్రవరి నెల 21న రెండు X రకం సౌరజ్వాలలను వెదజల్లింది. X1.7 తీవ్రతతో ఓసారి, X1.8 తీవ్రతతోమరోసారి రెండు సౌరజ్వాలలను భూమి దిశగా ఎగజిమ్మింది. మర్నాడు 22వ తేదీన X6.3 తీవ్రతతో ఇంకో సౌరజ్వాలను వదిలింది. 2017లో X8.2 తీవ్రతతో విడుదలైన సోలార్ ఫ్లేర్ తర్వాత గత ఆరేళ్ల కాలంలో జనించిన అతి తీవ్ర ఫ్లేర్ ఇదే. పై 3 ఫ్లేర్స్ తర్వాత రెండు బలహీన M క్లాస్ జ్వాలలను కూడా సన్ స్పాట్ ఏఆర్3590 వెలువరించింది. ఈ మచ్చలోని అస్థిర బీటా-గామా-డెల్టా అయస్కాంత క్షేత్రంలో మరిన్ని X రకం సౌరజ్వాలలకు కావాల్సిన శక్తి ఉండవచ్చని, మరో X రకం మహా సౌరజ్వాల కోసం అది శక్తిని సమీకరిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ రూపంలో భూమికి ముప్పు తొలగిపోలేదని హెచ్చరిస్తున్నారు. సౌరచక్రంలో అయస్కాంత ధ్రువాల మార్పిడి సూర్యుడిలో 11 ఏళ్లకోసారి సౌరచక్రం గిర్రున తిరుగుతుంది. ఈ కాలచక్ర మధ్యంలో సౌరక్రియ గరిష్ఠ స్థితిని సంతరించుకునే ‘సోలార్ మాగ్జిమమ్’ దశ సందర్భంగా సూర్యుడి అయస్కాంత క్షేత్రం దాని అయస్కాంత ధ్రువాలను తారుమారు చేస్తుంది. రెండు అయస్కాంత క్షేత్రాలు పరస్పరం మారతాయి. అటుదిటు, ఇటుదటు అవుతాయి. అలా ఉత్తర అయస్కాంత ధ్రువం కాస్తా దక్షిణ అయస్కాంత ధ్రువంగా మారిపోతుంది. ఈ మార్పిడి జరిగేవరకు సూర్యుడు అంతకంతకూ ఉత్తేజితమవుతాడు. అనుక్షణం క్రియాశీలమవుతాడు. సౌరమచ్చలు, జ్వాలలు, సీఎంఈలు పుట్టుకొస్తాయి. ఈ ప్రక్రియ తర్వాత సూర్యుడు నెమ్మదిస్తాడు. మెల్లగా సౌర కనిష్ఠం లేదా సోలామ్ మినిమమ్ దశకు చేరతాడు. ఇదొక చక్రం. కరోనల్ మాస్ ఎజెక్షన్స్.. సౌర తుపాన్లు! ‘కరోనా’ అనేది అత్యంత వేడితో కూడిన సౌర ధూళికణాలతో (ప్లాస్మా) నిండివుండే సూర్యుడి అతి బాహ్య పొర. X, M రకాల సౌర ప్రజ్వలనాలు కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (సీఎంఈ)కు కారణమవుతాయి. కరోనా నుంచి ప్లాస్మా, విద్యుదయస్కాంత వికిరణం భారీగా విడుదలై భూ అయస్కాంత క్షేత్రంలోకి చొరబడి దుష్ప్రభావం చూపుతాయి. ‘నార్తర్న్ లైట్స్’గా పిలిచే ‘అరోరాలు’ సాధారణంగా ధ్రువాల వద్దనే కనిపిస్తాయి. కానీ సీఎంఈల వల్ల తలెత్తే భూ అయస్కాంత తుపాన్లు... భూమధ్యరేఖ వద్ద ‘అరోరా’లను సృష్టిస్తాయి. 1989 మార్చిలో భూమిని తాకిన ఓ కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ అంతటా 9 గంటలపాటు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి 60 లక్షల మంది ఇబ్బందిపడ్డారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వేళల్లో ఆవేశిత శక్తి కణాలు అతి వేగంగా ప్రయాణిస్తాయి. వీటి వల్ల పవర్ గ్రిడ్స్ కుప్పకూలతాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తగలబడతాయి. జీపీఎస్ నేవిగేషన్ వ్యవస్థలు అస్తవ్యస్తమై నౌకలు, విమానాల రాకపోకలు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభిస్తాయి. టెలిఫోన్, కంప్యూటర్, కమ్యూనికేషన్, ఇంధన పంపిణీ-పైపులైన్ వ్యవస్థలు పాడవుతాయి. ఆ సమయాల్లో సౌరతుపాను గండం గడిచేదాకా ఉపగ్రహాల్ని స్విచాఫ్ చేస్తారు. లేకపోతే అవి శలభాల్లా మాడిపోతాయి. పిట్టల్లా రాలి భూమిపై పడతాయి. లక్షల కోట్ల ఆస్తినష్టం జరుగుతుంది. ఇక వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వెలుపలి కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేంద్రంలోని సురక్షిత స్థానాల్లోకి వెళ్లిపోతారు. X, M రకాల సౌర ప్రజ్వలనాల కారణంగా... భూ వాతావరణంలో రేడియో తరంగాలు ప్రయాణించే ‘దిగువ అయనోస్ఫియర్’లో ఎలక్ట్రాన్ల సాంద్రత తీవ్రమవుతుంది. దాంతో రేడియో తరంగాల శక్తి క్షీణించి అవి పై పొరల్లోకి ప్రయాణించలేవు. సూర్యకాంతి 8 నిమిషాల్లో భూమిని చేరుతుంది. సోలార్ ఫ్లేర్స్ నుంచి చొచ్చుకొచ్చే సౌర ధార్మికత కూడా అదే కాంతి వేగంతో భూమిని తాకుతుంది. ఇక కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఫలితంగా వందల కోట్ల టన్నుల కరోనల్ ప్లాస్మా వెదజల్లబడుతుంది. సీఎంఈ వేగం సెకనుకు 250 కిలోమీటర్ల నుంచి 3 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. వేగవంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ 15-18 గంటల్లో భూమిని చేరుతుంది. కారింగ్టన్ ఈవెంట్... అతి పెద్ద సౌర తుపాను! 1860లో సోలార్ మాగ్జిమమ్ దశకు కొన్ని నెలల ముందు 1859 సెప్టెంబరులో ఓ సౌర తుపాను సంభవించింది. చరిత్రలో రికార్డయిన అతి పెద్ద సౌర తుపాను ఇదే. 1859 ఆగస్టులో సూర్యబింబంలో నల్లమచ్చల సంఖ్య పెరిగిపోవతాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా తిలకించారు. లండన్ సమీపంలోని రెడ్ హిల్ పట్టణానికి చెందిన ఔత్సాహిక వీక్షకుడు రిచర్డ్ కారింగ్టన్ కూడా వారిలో ఒకరు. 1859 సెప్టెంబరు 1న సౌరమచ్చల్ని ఆయన చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా తెల్లటి కాంతి తళుక్కున మెరిసింది. అది 5 నిమిషాలు అలాగే ఉంది. నిజానికి అది కరోనల్ మాస్ ఎజెక్షన్. ఈ ఘటనకు ఆయన గౌరవార్థం ‘కారింగ్టన్ ఈవెంట్’ అని పేరు పెట్టారు. ఆ కరోనల్ మాస్ ఎజెక్షన్ సూర్యుడి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని 17.6 గంటల్లో ప్రయాణించి భూమిని చేరుకుంది. కారింగ్టన్ ఈవెంట్ తర్వాత మర్నాడు జియోమాగ్నెటిక్ తుపానుకు టెలిగ్రాఫ్ వ్యవస్థలు మొరాయించాయి. కొన్ని చోట్ల టెలిగ్రాఫ్ లైన్లపై అధిక విద్యుత్ ప్రసారమై టెక్నీషియన్లు కరెంటు షాక్ కు గురవగా ఇంకొన్ని చోట్ల టెలిగ్రాఫ్ సాధన సంపత్తి దగ్ధమైంది. నాటి ‘కారింగ్టన్ ఈవెంట్’కు కారణమైన నలమచ్ఛతో పోలిస్తే నేటి ఏఆర్3590 సన్ స్పాట్ సైజు 60%గా ఉంది. గ్రహణాల సమయంలో సూర్యుడిని వీక్షించడానికి వాడే సురక్షిత కళ్ళద్దాలు మన చెంత ఉంటే ఈ మచ్చను నేరుగా చూడొచ్చు. :::జమ్ముల శ్రీకాంత్ -
NASA: సౌర రేడియేషన్తో పెనుముప్పు
అంతరిక్షం నుంచి వెలువడే ప్రమాదకర సౌర రేడియేషన్ను భూమి అధికంగా శోషించుకుంటోందని దాంతో వాతావరణంలో మార్పులు, విపత్తులు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నాసా తాజా డేటాను విశ్లేషించి సౌర రేడియేషన్ గురించి వారు కీలక విషయాలు వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి 2023 డిసెంబర్ దాకా డేటాను వారు పరిగణనలోకి తీసుకున్నారు. రేడియేషన్ను భూమి శోషించుకోవడం అనేది సంవత్సరమంతా ఒకేతీరుగా లేదని, కొన్నిసార్లు ఎక్కువ స్థాయి, మరికొన్నిసార్లు తక్కువ స్థాయిలో నమోదైనట్లు గుర్తించారు. 2023లో ఫిబ్రవరి, మార్చి, డిసెంబర్లో అధికంగా సోలార్ రేడియేషన్ను భూమి గ్రహించిందని వెల్లడించారు. గత ఏడాది జనవరిలో స్వల్పంగా పెరిగిన రేడియేషన్ ఫిబ్రవరిలో చదరపు మీటర్కు 3.9 వాట్లు, మార్చిలో చదరపు మీటర్కు 6.2 వాట్లుగా నమోదైందని తెలియజేశారు. 2000 సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే 2023లో సౌర రేడియేషన్ను భూమి శోషించుకోవడం ఎన్నో రెట్లు పెరిగినట్లు తేల్చారు. ఇది ఇంకా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భూగోళంపై శక్తి సమతుల్యతలో మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇదంతా భూవాతావరణంలో ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, మంచు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగుదల వంటి పరిణామాలకు దారి తీస్తున్నట్లు స్పష్టం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019