breaking news
-
డా. బీఆర్ అంబేద్కర్కు సీఎం జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేడ్కర్ గారిపై గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో మన ప్రభుత్వం 206 అడుగుల స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ను ఏర్పాటు చేయడం రాష్ట్రానికే కాదు, దేశానికీ తలమానికం. ఈరోజు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులు’ అని సీఎం వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకి అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు. నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేడ్కర్ గారిపై గౌరవాన్ని ఇనుమడింపచేస్తూ భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో మన ప్రభుత్వం 206 అడుగుల… pic.twitter.com/Da4B5jWmQo — YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2024 -
దేశ భవిష్యత్తుకు దిక్సూచి!
ప్రపంచ మేధావి, ఆలోచనాపరుడు, తత్వవేత్త, భారత రాజ్యాంగ నిర్మాణ కర్త డా‘‘ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతి ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని నింపుతున్న ఒక చారిత్రక ఉత్సవం. అంబేడ్కర్ నిరంతర అధ్యయనం, విశ్లేషణ, తర్కం, హేతు వాదం, మానవతావాదం; ఆర్థిక,సాంఘిక, రాజకీయవాదాలు; బౌద్ధ విప్లవ ప్రస్థానం... ఆయన విస్తృతినీ, వ్యాప్తినీ, ప్రాపంచిక తాత్విక దృక్పథాన్నీ మనకు సాక్షాత్కరింప జేస్తున్నాయి. ఆయన ఒక వాల్టేర్ లాగా, రూసో లాగా ప్రపంచానికి ఒక నూతన దర్శనాన్ని అందించారు. ఆయన వ్యక్తిత్వంలో విద్యా జ్ఞానం, పరిశోధన, నైతికత, విమోచన కలిసి నడుస్తాయి. ఆయన బహుభాషా నిష్ణాతులు. మరాఠా భాష ఎంత బలంగా వచ్చో ఇంగ్లీషు, జర్మనీ కూడా అంతే నిశితంగా వచ్చు. ఆయన ఒక భాషా నిఘంటువు. ఆయన విద్యాభ్యాసంలో ఒక యుద్ధ ప్రక్రియ ఉంది. ఆయన ఆర్థిక శాస్త్ర నిపుణులు. అంబేడ్కర్ అపారమైన జ్ఞాపక శక్తి కలవారు. రాజ్యాంగ సభ డిబేట్స్లో కొన్ని వందల అంశాలు చూడకుండా చెప్పగలిగే వారు. ఆయన వాక్చాతుర్యా నికీ, వాదనా పటిమకూ, విషయ పరిజ్ఞానానికీ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజాజీ వంటి వారు అచ్చెరువొందేవారు. అంబేడ్కర్ సున్నితమైన హాస్య చతురుడు. చక్కని చిరునవ్వుతో ఆయన కళ్ళు మెరుస్తూ ఉండేవి. ఆయన చూపుడు వేలు ప్రపంచానికి ఓ ప్రశ్నోపనిషత్తు వంటిది. అంబేడ్కర్ 1913లో న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా, పరిశోధకుడిగా ‘బ్రిటిష్ ఇండియాలో ప్రొవెన్షియల్ ఫైనాన్స్ పరిణామం’ అనే థీసిస్ రాసి ఎందరి మెప్పునో పొందారు. 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ పట్టా పుచ్చు కోవడం కోసం రాత్రింబవళ్లు శరీరం శుష్కించే వరకూ చదివారు. విద్య పట్ల అంబేడ్కర్ దృక్పథాన్ని గమనిస్తే ఆయన విద్య అంటే కేవలం అక్షరాస్యత అనో, చదువనో అనుకోలేదని స్పష్టమ వుతుంది. విద్య మనిషిని సంపూర్ణంగా మార్చగలిగే సాధనమ న్నది అంబేడ్కర్ నమ్మకం. ఈ విషయంలో ఆయనపై బౌద్ధ ధర్మ ప్రభావం ఉన్నట్లు అనిపిస్తుంది. బుద్ధుడి బోధనలు, తాత్విక చింతన కేంద్రంగానే అంబేడ్కర్ విద్యను అభ్యసించారు. విద్య పర మార్థం ప్రజ్ఞ, కరుణ, సమత అనీ, ఈ త్రిగుణాలు పెంపొందించినప్పుడే విద్యకు పరిపూర్ణత చేకూరుతుందనీ అంబేడ్కర్ భావించారు. సమాజంలో విద్య ద్వారా చైతన్యం వస్తుందన్న ఉద్దేశంతో ఆయన విద్యా వ్యాప్తి కోసం 1945 నుంచి ఒక ఉద్యమం ప్రారంభించారు. ‘పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, అనేక విద్యాలయాలు, కళాశాలల ఏర్పాటుకు కృషి చేశారు. జ్ఞానం, కరుణ అనేవి తాను స్థాపించిన సొసైటీ ప్రధాన లక్ష్యా లుగా పేర్కొన్న అంబేడ్కర్ ‘హక్కుల సాధన కోసం చదువుకోండి! సంఘటితం కండి! పోరాడండి! మీపైన మీరు విశ్వాసం పెంచుకోండి! ఏ రకంగా కూడా మనకు ఓటమి ఉండదు. ఇది విజయం కోసం చేస్తున్న పోరాటం, స్వేచ్ఛ కోసం సాగిస్తోన్న యుద్ధం, ఈ యుద్ధం మనం కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగిపొందడానికి చేస్తున్నది’ అని ఉద్బోధించారు. సామాజిక మార్పు పోరాటాల ద్వారా, పోరాటాలు విజ్ఞానం ద్వారా, విజ్ఞానం విద్య ద్వారా అందుతాయన్నది అంబేడ్కర్ మార్గం. అలాగే దళితులు చదువు కోవడం ద్వారా సంప్రదాయ వృత్తుల్లో స్థిరపడే అవకాశం ఉండదనీ, తద్వారా తమ తరతరాల కులవృత్తులు చేస్తున్నందువల్ల ఎదురవుతున్న చిన్నచూపు తప్పుతుందనీ అంబేడ్కర్ ఆలోచన. అంబేడ్కర్ మనుస్మృతి భావజాలానికి ప్రత్యామ్నాయంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన పాండిత్యం, విజ్ఞత, మానవతా దృష్టి, బౌద్ధనీతి, సమ సమాజ భావన, భారత రాజ్యాంగంలో సముచితంగా సమన్వయించబడ్డాయి. అంబేడ్క ర్లో కుల నిర్మూలనా భావం, దార్శనికత, అహింసాతత్వం, భారతదేశాన్ని రక్తపాతం లేని దేశంగా సృష్టించగలిగింది. రాజ్యాంగంలో స్త్రీలందరికీ చదువుకునే హక్కు ఇవ్వటం ద్వారానూ, అçస్పృశ్యులందరికీ రిజర్వేషన్ కల్పించడం ద్వారానూ, శూద్రులందరికీ హక్కులు కల్పించడం ద్వారానూ ఆయన సమ సమాజ నిర్మాణానికి పునాదులు వేశారు. అంబేడ్కర్ విద్యా విప్లవంతో పాటు రాజకీయోద్యమాన్నీ నడిపారు. 1936 ఆగస్టులో దళిత జాతుల సముద్ధరణకు ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ’(ఐఎల్పీ)ని ఆయన స్థాపించారు. ఈ పార్టీ బొంబాయిలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన పది హేను సీట్లలో పదమూడింటిని కైవసం చేసుకుంది. జనరల్ సీట్లను కూడా రెండింటిని కైవసం చేసుకుంది. ఆయన ‘లేబర్’ అనే పదానికి ‘అణగదొక్కబడిన’ అనే అర్థాన్ని రూపొందించారు. ఆర్థికంగా, సాంఘికంగా అణగదొక్కబడిన వారందరినీ ఈ పార్టీ లోనికి తేవడానికి ప్రయత్నించారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును బట్టి ఆ పార్టీ దళితులకు ప్రాతినిధ్యం వహించడం లేదని డా‘‘ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆ పార్టీని విస్తృత పరచాలనే ఉద్దేశ్యంతో అంబేడ్కర్ 1942 జూలైలో ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్సీఎఫ్) ను స్థాపించారు. ఆ సందర్భంగా దళితుల సాంఘిక, ఆర్థిక హక్కు లను సాధించడానికి వారికి రాజకీయ అధికారం కావాలని ప్రబోధించారు. 1962లో విడుదల చేసిన ప్రణాళికలో ఆయన తన వామ పక్షాల భావాలను ప్రకటించారు. భారతీయుడైన ప్రతివాడూ ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రాలను పొందాలని నొక్కి వక్కాణించారు. ప్రతి మనిషికీ నిర్భయంతో కూడిన స్వేచ్ఛను సాధించడం ప్రభుత్వ బాధ్యత అని ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రణాళిక అణగదొక్కబడ్డ వారి సాంఘిక సమానత్వాన్ని నొక్కి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బీమా పథకాన్ని తప్పనిసరిగా అమలు జరపాలని కోరారు. ఏఐఎస్సీఎఫ్ నుండి రిపబ్లికన్ పార్టీ వరకు నడిచిన దారిలో దళితుల కోసం ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానతల కోసం తన శక్తిని ధారపోశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను పార్టీగా ప్రకటించక ముందే ఆయన పరి నిర్వాణం చెందారు. ఈ విధంగా అంబేడ్కర్ సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా, తాత్వికంగా, భారతీయ సమాజాన్ని పునః నిర్మించటానికి కృషి చేశారు. ఆయన ప్రపంచ మానవునిగా ఎదిగారు, ప్రపంచ తత్వవేత్తలలో ఒకరిగా నిలిచారు. భారతదేశానికి ఎనలేని కీర్తి తెచ్చారు. ఆయన నిర్మించిన రాజ్యాంగమే మన దేశ భవి ష్యత్తుకు దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 (నేడు డా‘‘ బీఆర్ అంబేడ్కర్ జయంతి) -
రాజ్యాంగమే సమ సమాజానికి దిక్సూచి
భారతదేశంలో రాజ్యాంగం అమలైన జనవరి 26 ఒక మహత్తరమైన పండుగదినం. భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను కలిగిస్తానని ప్రజలకు వాగ్దానం చేసింది. ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ ఇస్తానని భరోసా ఇచ్చింది. సమాన హోదా, సమాన అవకాశాలు, సమైక్యతా భావన, సోదర భావన కలిగించడానికే రాజ్యాంగం రూపొందింది. సమతా భావాలను అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అమెరికా, బ్రిటన్ రాజ్యాంగాల నుంచి, ఫ్రెంచ్ విప్లవం నుంచి ఆయన స్ఫూర్తి పొందినా... బౌద్ధ తత్వంలోని ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, మానవత్వం, సమానత్వం, స్వేచ్ఛ, తర్కం, ప్రశ్న వంటి అనేక భావాల్ని పొందుపర్చడం వల్లే, స్వాతంత్య్రం వచ్చిన తరువాత రక్తపాతం లేని సమాజంగా భారతదేశం రూపుదిద్దుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్... మహా మేధావి, ఆలోచనాపరుడు, లౌకికవాద శిఖరం, సమతా దర్శనకర్త, గొప్పవక్త, లోతైన రచయిత. ఆయన శైలిలో గాఢత, విశ్లేషణ బలంగా వుంటాయి. విద్యా సంపన్నమైన ఆయన భాషలో సరళత, అభివ్యక్తిలో సాంద్రత కనిపిస్తాయి. అంబేడ్కర్ మానవ హక్కుల పోరాట ధీరుడు. బౌద్ధంలో ఉన్న సామాజిక సమతా నీతిని రాజ్యాంగంలో పొందుపర్చారు. ఆయన జీవితంలో అస్పృశ్యతను ఎదుర్కోవడం ప్రధాన అంశం అయ్యింది. మానవోత్తేజితమైన, వైజ్ఞానికమైన ఎన్నో కార్యక్రమాల్లో అస్పృశ్యులకు చోటు లేకపోయిందని మథనపడ్డారు. అందువలననే అస్పృశ్యతా నివారణా చట్టం గురించి పోరాడారు. ఈ సమాజాన్ని అస్పృశ్యత లేని సమాజంగా రూపొందించాలని తపన పడ్డారు. దాని వల్ల ఎంతో మంది తమ ప్రతిభకు తగిన స్థానం లేక సంఘర్షణకు గురయ్యారు, అణచి వేయబడ్డారు. అంబేడ్కర్ ఒక తాత్వికుడు కూడా. కుల సమాజానికి ప్రత్యామ్నాయంగా కుల నిర్మూలనా సమాజాన్ని బోధించారు. అగ్రకుల రాజ్యాధికారంలో దళితులకు విముక్తి లేదని చాటారు. ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించుకోవడానికి రాజ్యాధికారం అవసరం అని ప్రబోధించారు. ఆయన రాజకీయ తత్వశాస్త్రం భావాత్మకమైంది కాదు... అది సాంఘిక, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించగల సత్తా కలిగినది. బొంబాయి వంటి నగరాల్లో కూడా కులతత్వం వ్యాపించి ఉండ టంతో అంబేడ్కర్ సోదరులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుల తత్వపు గొడ్డలి వేటు వారిని చిన్నప్పుడే తాకింది. ఒకే పాఠశాలలో చదివే పిల్లలు ఒక కూజా నీళ్ళు తాగలేకపోవడం, తోటి విద్యార్థులు ఆ కూజాలోని నీళ్ళను పైనుంచి పోస్తే దోసిళ్ళు పట్టి త్రాగవలసి రావడం వంటి ఘటనలు అంబేడ్కర్ గుండెల్ని పిండివేశాయి. ఆ గాయాలే రాబోయే కాలంలో కుల నిర్మూలన గ్రంథం రాయడానికి పునాదులేశాయి. కేవలం నీటి దగ్గరే కాదు, భాష దగ్గర కూడా ఆయనకు అస్పృశ్యత ఎదురైంది. అంబేడ్కర్ హైస్కూల్లో ప్రత్యేక పాఠ్యభాగంగా సంస్కృతాన్ని కోరుకున్నారు. ఒక అస్పృశ్యుడు సంస్కృతం నేర్చుకోవడం ఏమిటని నిరాకరించారు. దాంతో పర్షియన్ భాషను తీసుకోవలసి వచ్చింది. కానీ సంస్కృతాన్ని స్వయంగా కష్టపడి నేర్చుకున్నారు. వాల్మీకి, వ్యాసుడు, కపిలుడు, లోకాయతులు ఇంకా ఎందరో బ్రాహ్మణేతరులు, క్షత్రియులు సంస్కృతంలో గ్రంథాలు రాశారు. ఎందరో పాశ్చాత్య పండితులు సంస్కృతం నేర్చుకుని, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, కావ్యాలు, అన్నీ ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. అంబేడ్కర్ కూడా వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు అన్నింటినీ అధ్యయనం చేసి, వ్యాఖ్యానించారు. ఏ భాషైనా, ఏ మనిషైనా నేర్చుకోవచ్చని నిరూపించారు. అభివృద్ధిని తరచిచూస్తే... దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతోందని ఇప్పుడు గొప్పగా చెప్పుకొంటున్నాం. కానీ గణతంత్ర దినోత్సవ వేళ కొన్ని కఠిన వాస్తవాలను మనం అంగీకరించాల్సి ఉంటుంది. 2023 ప్రపంచ ఆకలి సూచీలో 125 దేశాల్లో ఇండియా 111వ స్థానంలో ఉంది. దేశంలో 81.35 కోట్ల మందికి ఇప్పటికీ ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి వస్తున్నదంటేనే దేశం ఎక్కడ ఉన్నదో అర్థమవుతుంది. కూడు, గూడు, బట్ట లేని ప్రజలు ఇంకా ఉన్నప్పుడు రాజ్యాంగం అమలవుతున్నట్టా అనే ప్రశ్న ఎదురవుతుంది. అంబేడ్కర్ భూమిని జాతీయం చెయ్య మన్నారు. కానీ అదేమో కార్పోరేట్ చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తిండి గింజల వల్ల ఇక్కడి వ్యవసాయం సంక్షోభంలో వుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్త్రాల వల్ల చేనేత పరిశ్రమ కుంటుపడింది. భారతదేశంలో పేదరికం ఎందుకు ఉందంటే రాజ్యాంగాన్ని నూటికి 90 శాతం ఉల్లంఘించడం వల్లనే అని చెప్పొచ్చు. ప్రజలు ఇప్పటికీ అనారోగ్యంతో కునారిల్లుతున్నారు. పారిశుద్ధ్య వ్యవస్థ దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టినా, ఎన్నో పట్టణాలు ఇంకా మురికి కూపాలుగానే వున్నాయి. వందశాతం బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాలుగా ప్రకటించినవాటిల్లో కూడా 71 శాతం మేరకే నిరోధించగలిగారని జాతీయ గణాంక కార్యాలయ సర్వే వెల్లడించింది. ఇళ్లు, వ్యాపార, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేసిన తరువాతే బయటకు వదిలే నగరాలకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పోటీలో వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ వ్యవస్థ సరిగ్గా లేని నగరాలకూ పురస్కారాలు ఇవ్వడం... పోటీ నిష్పాక్షికతపై సందేహాలు లేవనెత్తుతోంది. ఇకపోతే రోడ్లు నెత్తుటిమయం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి గంటకూ 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, 19 మంది మృత్యువాత పడుతున్నారని 2022 నాటి గణాంకాల్ని కేంద్ర సర్కారే ప్రస్తావిస్తోంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ప్రమాదాల్లో 11.9 శాతం, మృతుల సంఖ్యలో 9.45 శాతం, క్షతగాత్రుల లెక్కలో 15.3 శాతం పెరుగుదల రహదార్ల రక్తదాహ తీవ్రతను కళ్లకు కడుతోంది. రోడ్డు ప్రమాద మృతుల్లో 18–45 ఏళ్ల వయస్కులే 69 శాతం దాకా ఉంటున్నారన్న వాస్తవం గుండెల్ని మెలిపెట్టేదే. కుటుంబ పోషణకు రోడ్డెక్కిన మనిషి అకాల మృత్యువాత పడితే, ఇంటిల్లిపాదీ రోడ్డున పడే దుఃస్థితి ఏటా లక్షల మంది అభాగ్యుల్ని దుఃఖసాగరంలో ముంచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రహదారి ప్రమాద మృతుల సంఖ్య అయిదు శాతం దాకా తగ్గితే, అంతకు రెట్టింపు ఇండియాలో పెరగడం నిశ్చేష్టపరుస్తోంది. రహదార్ల మారణహోమానికి కారణమేమిటో సుప్రీంకోర్టే నియమించిన నిపుణుల కమిటీ పూసగుచ్చినా, సరికొత్త మోటారు వాహనాల చట్టం ద్వారా అవ్యవస్థను ఊడ్చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా జరిగిందీ ఒరిగిందీ ఏమీ లేదు. వాహన వేగాన్ని 5 శాతం తగ్గించ గలిగినా ప్రమాద మరణాల్ని 30 శాతం దాకా నియంత్రించగల వీలుందని తెలిసినా ‘ఏడెనిమిది సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగం’ అందుకొనే శకటాలు ఎందుకు రోడ్డెక్కుతున్నట్లు? ఇకపోతే వాయు కాలుష్య భూతం భయపెడుతోంది. శారీరక మానసిక సమస్యలు పెంచి, ఏటా లక్షల కుటుంబాల్లో శోక సంద్రాల్ని ఉప్పొంగిస్తున్న వాయు కాలుష్య భూతం గర్భస్త పిండాల్ని సైతం కర్కశంగా కాటేస్తోంది. వాయు కాలుష్యంతో పోటీపడుతూ... గాలిలో, నీటిలో, భూమిపై అంతటా పరుచుకుంటున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఆరోగ్య, ఆహార రంగాల్లో పెను సంక్షోభం సృష్టిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు గాలిలో ఉన్నా, భూగర్భ జలాల్లోకి చేరినా ప్రమా దమే. అవి మనుషుల దేహాల్లోకి చొచ్చుకుపోయి, శరీర కణాలను దెబ్బతీస్తాయనీ, క్యాన్సర్ల ముప్పు పెచ్చరిల్లుతుందనీ ఇప్పటికే పలు దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధకులు హెచ్చరించారు. అందుకే అంబేడ్కర్ ఆశయాలు రాజ్యాంగంలో ప్రతిఫలిస్తు న్నాయా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. నిజానికి రాజ్యాంగంలో ఆయన ఆలోచనలు ప్రతిఫలిస్తే 100 శాతం అక్షరాస్యత ఏర్పడుతుంది. విద్య మహోన్నత స్థాయికి చేరుతుంది. ప్రపంచం గర్వించే మేధో సంపన్నులు ఆవిర్భవిస్తారు. పేదరిక నిర్మూలన జరిగి, సమ సమాజం ఏర్పడుతుంది. స్త్రీలు ఆత్మ రక్షణతో, పురుషులతో సమానంగా జీవించగలుగుతారు. యువత శక్తి సంపన్నులై సంపదను సృష్టించగలుగుతారు. నిరుద్యోగం, పేదరికం లేని సమ సమాజం ఏర్పడుతుంది. అందుకే రాజ్యాంగ మార్గంలో నడుద్దాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్: విజయవాడ ప్రతిష్ట ఆకాశమంత ఎత్తుకు..
మనం ఎవరిమైనా అమెరికాకు వెళ్లినప్పుడో, ప్రత్యేకంగా న్యూయార్క్ నగరానికి వెళ్లినప్పుడో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడాలని అనుకుంటాం. మనం ఆ నగరానికి వెళ్లామన్న సంగతి తెలిసిన స్నేహితులు కూడా లిబర్టి విగ్రహాన్ని చూసి వచ్చావా అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు అమెరికానే వెళ్లనవసరం లేదు. ఆ స్థాయి విగ్రహాన్ని చూడాలంటే విజయవాడ నగరాన్ని సందర్శిస్తే చాలు. ఇక్కడ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహం అంతకన్నా గొప్పగా కనిపిస్తుంంది. కృష్ణానది ఆవల నుంచి సుమారు పది, పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహం దర్శనమిస్తుంది. దేశ రాజ్యాంగ నిర్మాతగా వాసికెక్కిన డాక్టర్ BR అంబేడ్కర్ భారీ విగ్రహం అది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇంత ఎత్తైన ఆయన విగ్రహం మరొకటి లేదని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. విజయవాడ నగరానికి ఒక శాశ్వత చిరునామాగా, ఒక ప్రఖ్యాత టూరిస్టు కేంద్రంగా రూపుదిద్దుకునే అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం ఉన్న స్వరాజ్ మైదానం, ఇప్పుడు స్వేచ్చకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలవబోతుంది. ఇది వినడానికి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది! మూడేళ్ల క్రితం వరకు విజయవాడలో ఇంత పెద్ద టూరిస్ట్ స్పాట్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కాని ఒక నేత సమర్ధతకు నిదర్శనంగా ఇది రూపొందింది. ఆయన ఎవరో కాదు.. ఏపీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి అని వేరే చెప్పనవసరం లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రమే కాకుండా మూడు అంతస్థులలో అంబేడ్కర్కు చెందిన వివిధ చిత్రపటాలు, డాక్యుమెంటరీలు, ఆయన గురించి తెలియచేసే సినిమాను వేయడానికి వీలుగా ఒక హాలు, ఎన్నో విశేషాలు అందులో కనిపిస్తాయి. 206 అడుగుల ఎత్తున తయారైన ఈ విగ్రహ ప్రాంగణం అంతా రంగు, రంగుల కాంతుల మధ్య అత్యంత ఆకర్షణీయంగా తయారైంది. అక్కడే పలు ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి. నగర ప్రజలకే కాకుండా, విజయవాడ సందర్శించే టూరిస్టులకు కూడా అదొక విజ్ఞాన, వినోద కేంద్రంగా భాసిల్లబోతోంది. దేశ ప్రజలకు స్వేచ్చను, ప్రత్యేకించి బలహీనవర్గాలకు ఎంతో స్పూర్తిని ఇచ్చే ఈ విగ్రహ ప్రతిష్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించినప్పటికీ, దానిని మించిన రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఢిల్లీలో విగ్రహం తయారీతో పాటు హంగులను స్థానికంగా హనుమాన్ జంక్షన్కు చెందిన శిల్పిద్వారా చేయించడం కూడా హర్షించదగిన అంశమే. ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక సాధికార యాత్రలు నిర్వహిస్తున్నారు. అందులో వివిధ బలహీనవర్గాల ప్రజలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచెబుతున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలియజేసినట్లయింది. కేవలం విగ్రహంతోనే అభివృద్ది అయిపోతుందని కాదు. కాని ఆ విగ్రహాన్ని చూస్తే వచ్చే చైతన్యం, అనుభూతి చెప్పనలవికానిది. ఏదో కొద్ది మంది అగ్రవర్ణ దురహంకారులకు తప్ప, సమానత్వం కోరుకునే ఎవరికైనా ఈ విగ్రహం చూడగానే ఒక అనుభూతి కలుగుతుంది. ఏపీలోని వివిద జిల్లాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఈ విగ్రహాన్ని వీక్షించనున్నారు. గతంలో అమరావతి రాజధాని పేరుతో ఒక భ్రమరావతిని సృష్టించాలని భావించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడో మారుమూల, ఎవరికి కనిపించని చోట అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని చూశారు. ఇందు కోసం కొన్ని కోట్ల రూపాయల వ్యయం చేశారు. అయినా ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. చంద్రబాబు హయాంలో చాలామంది అంబేడ్కర్ అభిమానులు ఎవరికి కనిపించని చోట విగ్రహం పెట్టడమేమిటని విమర్శించేవారు. అయినా అప్పట్లో చంద్రబాబు పట్టించుకోలేదు. చిత్తశుద్దితో చేసి ఉంటే అక్కడ విగ్రహం తయారై ఉండేదేమో! మొక్కుబడి కార్యక్రమంగా సాగించారన్న భావన ఉంది. తదుపరి వచ్చిన జగన్ ప్రభుత్వం మారుమూల అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట కన్నా, విజయవాడ నడిబొడ్డున ప్రతిష్టించడం ద్వారా రాష్ట్ర ప్రజలనే కాక, దేశ వ్యాప్తంగా అభిమానులను ఆకర్షించవచ్చని భావించారు. ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా పేరుగాంచిన అంబేడ్కర్ విగ్రహంతో పాటు విజయవాడ నగరవాసులకు ఆహ్లాదంగా ఉండేలా అక్కడ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తలపెట్టారు. మూడేళ్ల నుంచి అందుకు సన్నాహాలు సాగించారు. నిజానికి ఆరు నెలల క్రితమే ఈ పనులు పూర్తి చేయాలని అనుకున్నారు కాని, సాధ్యపడలేదు. అయినా పనుల వేగం పెంచి జనవరి 19న ప్రారంభోత్సవానికి రంగం సిద్దం చేశారు. ఇది జగన్ సమర్ద నాయకత్వ లక్షణానికి దర్పణం పడుతుంది. 'చెప్పాడంటే చేస్తాడంతే!' అన్న నమ్మకానికి అనువుగా ఈ విగ్రహం ఏర్పాటు పూర్తి అయింది. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మృతివనం ఏర్పాటు అవుతోంది. ఇప్పటికే విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ వద్ద, కనకదుర్గమ్మ గుడి వద్ద భారీ వంతెనలను పూర్తి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృష్ణలంక ప్రాంతంలో నివసించే వేలాది మంది బీద ప్రజలకు పెద్ద ఊరట కల్పిస్తూ.. నది అంచున రిటైనింగ్ వాల్ నిర్మించింది. కిలోమీటర్ల కొద్ది నిర్మించిన ఈ వాల్ కూడా విజయవాడ అభివృద్ధికి మారుపేరుగా కనిపిస్తుంది. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేయలేని విశిష్టమైన పనులను చేపట్టి, పూర్తి చేయడం ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మన్ననలు పొందగలుగుతున్నారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా అందరికి ఆహ్వానం పలుకుతూ జగన్ ఇచ్చిన సందేశం కూడా హృద్యంగా ఉంది. ఆకాశమంతటి వ్యక్తిత్వంతో దేశగతిన మార్చిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేడ్కర్ అని ఆయన ప్రశంసించారు. పెత్తందార్ల భావాలపై తిరుగుబాటుకు స్పూర్తి ఇచ్చేలా అంబరాన్ని తాకేలా ఈ సమాజిక న్యాయ మహాశిల్పం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్) ఏర్పాటు అయిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు తన చేతితో ఒక దిశను చూపుతున్నట్లుగా అంబేడ్కర్ విగ్రహం నిజంగానే విజయవాడ ప్రతిష్టను అకాశమంత ఎత్తుకు తీసుకు వెళ్లిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంత బ్రహ్మాండంగా విగ్రహ ప్రారంభోత్సవం జరుగుతుంటే నిత్యం ఏడ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా యధా ప్రకారం పెత్తందారి, అగ్రవర్ణ దురహంకార మనస్తత్వంతో చెత్త కథనాలను ప్రచురించింది. నీచత్వానికి పరాకాష్టగా రామోజీ, రాధాకృష్ణలు వ్యవహరిస్తూ తమ మీడియాను దిగజార్చుతూ ఈ రోజు కూడా ఛండాలపు స్టోరీలు ఇచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తమ విద్వేషాన్ని వెళ్లగక్కారు. సుమారు నాలుగు వందల కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
సామాజిక బందీల విముక్తి ప్రదాత!
ప్రపంచంలోని వివిధ సమాజాలు తమకు నచ్చిన తాత్త్విక మార్గాల్లో ప్రయాణిస్తూ మనుగడ సాగించడం అనాదిగా వస్తున్నదే.. అయితే కొన్ని సమాజాల్లో అనేక సమూహాలు తమ ఇష్టానికి వ్యతిరేకంగా బందీలై కనీస మానవ హక్కులకూ దూరమయ్యాయి. భారతీయ సమాజంలోని అస్పృశ్యులూ, ఆదివాసులూ, మహిళలూ, ఇతర అణగారిన సమూహాల వారు అటువంటి వారిలో కొందరు. తత్త్వశాస్త్రానికి మూల జీవం మానవ దుఃఖ నివారణ. ఇందుకోసం బుద్ధుడు, సోక్రటీస్, మార్క్స్ వంటి వారు ఎంతగానో ప్రయత్నించారు. ఇటువంటి తాత్త్వికులను అధ్యయనం చేసి అంబేడ్కర్ తన ఉపన్యాసాలు, రచనల ద్వారా పీడిత, తాడిత జనుల ఉద్ధరణకు ప్రయత్నించారు. ఆయన ఫిలాసఫీ భారత రాజ్యాంగంలో స్పష్టంగా కనిపిస్తుంది. అంబేడ్కర్ ప్రాసంగికత నానాటికీ పెరుగు తుందనడానికి నవంబర్ 26వ తేది రాజ్యాంగ అవతరణ దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా జరగడం వల్ల మనకు అర్థమౌతోంది. అంబేడ్కర్ సిద్ధాంతాలు ప్రపంచ తాత్త్వికులకు సమ తుల్యమైనవి, తులనాత్మకమైనవి కూడా. అంబేడ్కర్ రచనా వైవి ధ్యంలో సోక్రటీస్, ప్లేటో, బుద్ధుడు, అరిస్టాటిల్ ఉన్నారు. ‘జ్ఞానవం తుడైనవాడు తాను తెలుసుకున్నది ఇతరులకు చెప్పకపోతే మూర్ఖుడ వుతాడు’ అనే సత్యాన్ని సోక్రటీస్ చెప్పాడు. అందుకు రాజ్యానికి, దేశానికి భయపడని నిర్భీతి తత్త్వాన్ని ఆయన ప్రదర్శించాడు. అదే తత్త్వం అంబేడ్కర్లో మనకు కనిపిస్తుంది. అందుకు సత్యాన్వేషణ, ధీశక్తి, శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధత అవసరం. వాటిని సోక్రటీస్ స్థాయిలో ఆధునిక యుగంలో వ్యక్తీకరించిన వాడు అంబేడ్కర్. ఆయన ముఖ్యంగా వేదాలకూ, స్మృతులకూ ప్రత్యామ్నా యంగా భారత రాజ్యాంగ దర్శనాన్ని రూపొందించాడు. అందుకు బుద్ధుని తత్త్వం ఆయనకు వాహిక. ఆయన సమాజంలో మానవతా స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం చేశాడు. అందుకు కారణం ఆయన హృదయ భావం, ఆయన చాలా సున్నిత హృదయుడు. ఆయన సున్నితత్వంలో కరుణ వుంది, ప్రేమ వుంది, ఆత్మీయత వుంది. అంకిత భావం వుంది. ఈ గుణాలు నాయకుణ్ణి ప్రవక్తగా తీర్చిదిద్దాయి. అందుకే ఆయన అణ గారిన ప్రజల తరఫున మాట్లాడాడు. ఈ దేశంలో కోట్లాదిమంది ప్రజలు అస్పృశ్యత అనే శాపంతో క్రుంగిపోయారు. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఉపద్రవం ఇది. ప్రతి మానవుడికీ ఉండవలసిన ప్రాథమిక హక్కులు వారికి తిరస్క రించబడ్డాయి. నాగరికత, సంస్కృతి ఫలాల లబ్ధిని వారికి అంద నివ్వలేదు. అస్పృశ్యులే కాకుండా ఈ దేశంలో అంతే పెద్ద సంఖ్యలో ఆదిమ జాతులు, గిరిజన తెగలు ఉన్నాయి. నాగరిక, సాంస్కృతిక స్రవంతిలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేయకుండా వారిని ఆటవిక, సంచార జాతులలా తిరిగేలా వదిలి పెట్టారు కులీనులు. ఈ పరిస్థితిని మార్చడానికి ఆయన తన వాదాన్ని తాత్త్వికంగా మలిచాడు. కుల నిర్మూలనా వాదాన్ని ఇలా ప్రతిపాదించాడు. ‘‘కుల వ్యవస్థను సమర్థించడానికి వారసత్వం గురించీ, నరసంతతి శుద్ధి శాస్త్రం గురించీ చెత్తవాదన ఎంతో లేవనెత్తబడింది. నరవంశ శుద్ధిశాస్త్రం (యూజెనిక్స్) ప్రాథమిక సూత్రానికి కుల వ్యవస్థ అనుగుణంగా ఉంటే దానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. ఎందు కంటే స్త్రీ పురుషులను వివేకంతో జత కలపడం ద్వారా జాతి అభి వృద్ధిని సాధించడానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. అయితే వివేక వంతమైన స్త్రీ, పురుష సంయోగాన్ని కుల వ్యవస్థ ఏ విధంగా సాధిస్తున్నదో అర్థం కావడం లేదు. కుల వ్యవస్థ ప్రకృతి విరుద్ధమైన ఒక కృత్రిమ వ్యవస్థ. అది చేస్తున్నదల్లా వివిధ కులాల స్త్రీ పురుషులు కులాంతర వివాహాలను చేసుకోకుండా నిషేధించడం. ప్రకృతి సిద్ధమై నది కాదది, ఒక కులంలో ఏ ఇద్దరు కలసి వివాహం చేసుకోవాలని ఉన్నదో నిర్ణయించే పద్ధతి కాదది. జాతి శుద్ధి శాస్త్రం దృష్ట్యా ఒక కులమే ఒక ప్రత్యేక మూల జాతి అయితే... ఉపకులాల పుట్టుక కూడా అదే విధంగా అయి వుండాలి. అయితే ఉప కులాల మూలం కూడా యూజినిక్సే అని నిజంగా ఎవరైనా వాదించగలరా? అలాంటి వాదన పూర్తిగా అసంగతం.’’ ఇకపోతే ఈ కులనిర్మూలన సిద్ధాంత ఆచరణకు మహాత్మాగాంధీ రాజకీయంగా మతవాద ధోరణితో అడ్డు వచ్చారు. అంబేడ్కర్ సాంఘికంగా కుల నిర్మూలనా వాది. ఆర్థికంగా స్టేట్ సోషలిజం ప్రతిపాదకుడు. రాజకీయంగా బహుజన రాజ్య నిర్మాణ దక్షుడు. ఈ మూడింటినీ సాధించడానికి ఆయన బుద్ధునిలో సంఘ వాదాన్నీ, మహాత్మా ఫూలేలోని సాంస్కృతిక విప్లవ వాదాన్నీ పోరాట ఆయుధాలుగా మలచుకున్నాడు. అందువల్ల ఆయన కుల నిర్మూలనా పునాదులపై పునర్నిర్మించే తత్త్వశాస్త్ర నిర్మాతగా ముందుకొచ్చాడు. జ్యోతిబా ఫూలే స్త్రీల కోసం చేసిన ఉద్యమం అంబేడ్కర్ను ఎంతగానో ప్రభావితం చేసింది. స్త్రీని విముక్తి చేయడం భారత పునరుజ్జీవ నోద్యమంలో ప్రధానాంశంగా ఆయన భావించాడు. హిందూ సంస్కరణవాదులు ప్రతిపాదించే పద్ధతిలో విధవా వివాహాలు, సతీసహగమన నిర్మూలన వంటి సంస్కరణల వలే కాక స్త్రీల హక్కులకు సంబంధించిన అంశం మీద ఆయన ఎక్కు పెట్టాడు. స్త్రీని భావ దాస్యం నుండి విముక్తి చేయడం, సాంఘిక, ఆర్థిక, సాంస్కృ తిక, రాజకీయ భాగస్వామ్యాన్ని పురుషులతో సమానంగా స్త్రీలకు కల్గించడానికి ఆయన తీవ్రమైన కృషి చేశాడు. అంబేడ్కర్ తనకు ముందున్న భారతీయ పాశ్చాత్య తత్త్వశాస్త్రాలన్నింటినీ చదివి భారత దేశ పున ర్నిర్మాణానికి పూనుకున్నాడు. అంబేడ్కర్లోని మరొక కోణం సామాజిక వ్యక్తిత్వ మనో విశ్లేషణ. ఈ ప్రత్యేకతను ప్లేటోలోని రచనా వైవిధ్యం, జ్ఞానతృష్ణ, సంభాషణా ప్రావీణ్యత, అంతరాంతర పరిశీలనల నుండి ఆయన సంతరించుకున్నారు. తత్త్వశాస్త్రానికి మూల జీవమైన మానవ దుఃఖ నివారణ పట్ల సోక్రటీస్ ఎంత వేదన పడ్డాడో, అంబేడ్కరూ అంత వేదన పడ్డాడు. వ్యక్తిగతమైన దుఃఖాన్ని అధిగమించి, సామాజిక దుఃఖాన్ని గుర్తించి, దాని నివారణ కోసం సిద్ధాంతపరంగా, ఆచరణ పరంగా కృషి చేసినవారు సోక్రటీస్, అంబేడ్కర్లు. ఎంత క్లిష్టతరమైన పరిస్థితులు వచ్చినా వారు సత్య నిరూపణ కోసం ముందడుగు వేస్తారు. ఇకపోతే అంబేడ్కర్ విద్యా తాత్త్విక వాది. ఆయన తన ప్రతిభా సంపత్తితో అçస్పృశ్యుల గురించి అనేక కమిషన్లకు వివరాలు అందించి అనేక హక్కులు సాధించాడు. ఏ పాఠశాల అయితే తనకు ప్రవేశాన్ని నిరాకరించిందో తనను తరగతి గదిలో బయట కూర్చో బెట్టి, బైట పాఠాలు చెప్పిందో, అదే భారతంలో తన ప్రజలను విద్యావంతులను చేయడానికి... అన్ని ప్రభుత్వ పాఠశాలల ద్వారాలు తెరిపించగలిగాడు. ఆయన ఒక్కడుగా ఒక సైన్యంగా పని చేశాడు. అంబేడ్కర్కు అధ్యయనంతో పాటు లోతైన అవగాహన, అనుభవం, ఆచరణ వున్నాయి. అందుకే ఆయన మాటలు సత్య నిష్టం అయ్యాయి. బుద్ధుని ధార్మిక సూత్రాలను, నీతి సూత్రాలను అంబే డ్కర్ రాజ్యాంగంలో అవసరం అయిన చోటంతా పొందుపరుస్తూ వెళ్ళాడు. ఈనాడు అంబేడ్కర్ రాజ్యాంగానికి ప్రత్యామ్నాయ వాదాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం అనే పేరు మీద భారత చరిత్ర పరిశోధనా మండలి (ఐసీహెచ్ఆర్) హిందూ పునరుద్ధరణవాద పత్రాన్ని రాష్ట్రాల గవర్నర్లకు, విశ్వవిద్యాలయాలకు పంపింది. అంటే అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణ సూత్రాలను దెబ్బతీయాలనే ప్రయత్నం జరగు తోందన్న మాట! రాజ్యాంగం పీఠికలో చెప్పబడిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దెబ్బతీయాలనే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం బౌద్ధ యుగాన్ని దెబ్బతీయడానికి కౌంటర్ రివల్యూషన్గా వచ్చిన గుప్తుల కాలం నాటి మతోద్ధరణ వాదం లాగా వుంది. అంబేడ్కర్ రాజ్యాంగానికి ప్రత్యామ్నాయ వాదాన్ని ప్రచారం చేయా లనే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని సామా జిక సామ్యవాద భావాన్ని దెబ్బతీయలేరనేది కూడా మరో ప్రక్క రుజువవుతూ వస్తోంది. మతం ఎప్పుడూ తత్త్వశాస్త్రానికి ప్రత్యా మ్నాయం కాలేదు. మతం కొందరికే పరిమితమైంది. రాజ్యాంగం అందరిని సమన్వయీకరించుకుంటుంది. ఆ శక్తి దానికుంది. ప్రపంచ తాత్త్విక దృక్పథం నుంచి ఏర్పడింది రాజ్యాంగం. అంబేడ్కర్వాదులు, మార్క్స్వాదులు, లౌకికవాదులు, ప్రజా స్వామ్యవాదులు ఐక్యంగా అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని తప్పక కాపాడుకుంటారు. ఈ యుగం అంబేడ్కర్ది. ఆయన నిర్మిం చిన తాత్త్విక సామాజిక మార్గంలో నడుద్దాం. డా. కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు (ఈ వ్యాసం Dec 06, 2022 రోజున sakshi.comలో ప్రచురితమైనది)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019