breaking news
Ad - Sakshi_Home_Sticky
-
రుణమాఫీ చేస్తా.. బీఆర్ఎస్ రద్దు చేస్తావా?: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, నాగర్కర్నూల్/కోస్గి/మద్దూరు: ‘జోగుళాంబదేవి సాక్షిగా మాట ఇస్తున్నా.. ఆగస్టు 15లోపు ఆరునూరైనా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా. అదే రోజు నువ్వు, నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? నా రాజీనామా కాదు. నీ పార్టీ రద్దుకు సిద్ధంగా ఉండండి’అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే మాజీమంత్రి హరీశ్రావు తన సవాలును స్వీకరించాలని చెప్పారు. మంగళవారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారా యణపేట జిల్లా మద్దూరులో నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం, అనంతరం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలకేంద్రంలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర భారీ బహిరంగసభలో సీఎం మాట్లాడారు. ‘ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరుతానని, రేవంత్రెడ్డి మాట ఇస్తే ఎలా ఉంటూందో నీ మామ కేసీఆర్ను అడుగు..ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి రాష్ట్రంలో రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్లో ఉందని, పదవి తీసుకున్న నాలుగు నెలల్లో నీ మామ చేసిన లక్షల కోట్ల అప్పులకు రూ. 26వేల కోట్ల కిస్తీలు చెల్లిస్తూ.. ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నాం. కావాలంటే లెక్కలతో సహా నీకు, నీ మామకు చూపడానికి మేము సిద్ధంగా ఉన్నాం’అంటూ తనదైన శైలిలో మాజీ మంత్రి హరీశ్రావుపై మండిపడ్డారు. రుణమాఫీతోపాటు వచ్చే పంటకే వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారు. దొంగలకు సద్ది మోస్తున్నరు.. పాలమూరు నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఏర్పడి అధికారంలోకి వచ్చి పదేళ్లలో ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. కుర్చీ వేసుకొని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి ఫామ్హౌస్లో పడుకున్నాడని చెప్పారు. పగోడి చేతులో చురకత్తులుగా మారి, ఇక్కడి నాయకులు దొంగలకు సద్ది మోస్తున్నారని మండిపడ్డారు. తమను రేవంత్రెడ్డి తిడుతున్నారని అరుణమ్మ, ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ అంటున్నారని.. వారితో తనకేం తగాదా, పంచాయితీ లేదన్నారు. గతంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సుముఖంగా ఉన్నప్పుటికీ మంత్రిగా ఉన్న డీకే.అరుణ నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు రాకుండా ప్రాజెక్టులను అడ్డుకున్నది వాస్తవం కాదా.. మరోమారు నరేంద్రమోదీ చేతిలో చురకత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పోడుస్తున్నావంటూ ప్రశ్నించారు. 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని, ఈ ఐదేళ్లు రాజకీయాలకతీతంగా జెండాలు, ఎజెండాలు పక్కనబెట్టి ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో దేశంతో పోటీపడేందుకు తనకు సహకరించాలని కోరారు. అభివృద్ధి ఆలోచన చేయకుండా కాళ్లలో కట్టెలు పెట్టడం ధర్మమా? అని ప్రశ్నించారు. కేసీఆర్కు ఓటేస్తే.. మోదీకి అమ్ముకుంటడు.. ‘ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అంటే నాకు గౌరవం ఉంది. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కేసీఆర్ ఇబ్బందులు పెడితే మేం అండగా ఉన్నాం. ప్రజాజీవితంలోకి వచ్చి దొరలకు వ్యతిరేకంగా ప్రవీణ్కుమార్ పోరాటం చేశాడు. ఆరు నెలల్లో ఏం మారింది.. ఎందుకు కేసీఆర్ను నమ్ముతుండో సమాధానం చెప్పాలి. 4 కోట్ల మంది తిరస్కరించి కేసీఆర్కు గొయ్యి తవ్వితే, ఆ సమాధికి పూలదండలు వేసి భుజాలపై మోస్తున్నవు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశాడు. ఆయనతో చేరిన నువ్వు వర్గీకరణకు వ్యతిరేకమా? ఏనుగు తిరిగి దోమ దగ్గరకు ఎందుకు పోయిందో చెప్పాలి. దోమకు ఎంతపెద్ద తొండం ఉన్నా ఏనుగు అవుతుందా’అని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తామని నిర్ణయం తీసుకున్నామని, కానీ ఎందుకు తిరస్కరించారో తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవీణ్కుమార్ డీజీపీ అయ్యేవారని, ముఖ్యమంత్రి స్థాయి పదవితో గౌరవించుకునే వారమని చెప్పారు. సన్’స్ట్రోక్ దెబ్బతో ఎంపీ రాములును ఆయన కొడుకు పదవి కోసం ఇంట్లో పెట్టి తాళం వేస్తే.. బీజేపీకి పోయి టికెట్ తెచ్చుకున్నాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు ఓటేస్తే తిరిగి మోదీకే అమ్ముకుంటాడని, గత పదేళ్లలో ప్రతిసారి ఈ కేడీ మద్దతు పలికింది మోదీకే కదా అని వ్యాఖ్యానించారు. పాలమూరు అభివృద్ధి నా జీవితాశయం.. పాలమూరులో తనకు ఎవరూ శత్రువులు లేరని, తనకెవరూ పోటీ కాదని చెప్పారు. పాలమూరు జిల్లా అభివృద్ధి తన జీవిత ఆశయమన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు ఖర్చయినా నాలుగున్నర ఏళ్లలోనే పూర్తిచేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. తమ అభ్యర్థులును ఎంపీలుగా గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామన్నారు. ముదిరాజ్లను బీసీ–డీ నుంచి బీసీ–ఏ గ్రూపులోకి, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే పని కోసం తనకు సహకారం అందించాలని రేవంత్రెడ్డి చెప్పారు. – మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించి రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన పాలమూరు ప్రజలు తనను కూడా ఎంపీగా ఆశీర్వదిస్తే.. ముఖ్యమంత్రికి సోదరుడిగా రేవంత్రెడ్డి గొంతుకనై ఢిల్లీలో పాలమూరు ప్రజల కోసం పోరాడుతానన్నారు. నాగర్కర్నూల్ అభ్యర్థి మల్లురవి మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు. ఆయా సమావేశాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, మనోహర్రెడ్డి, రాంమోహన్రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర పోలీస్ హౌసింస్బోర్డు చైర్మన్ గురున్నాథ్రెడ్డి, మాజీమంత్రి చిత్తరంజన్దాస్ పాల్గొన్నారు. -
ఒట్టేసి చెబుతున్నా..! రేవంత్ ‘ఒట్లపై’ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
సాక్షి, హైదరాబాద్: ‘బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి చెపుతున్నా.. మా ప్రభుత్వం పంద్రాగస్టు లోపల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుంది. అది మా మంత్రివర్గం బాధ్యత. రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం..’. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఒక్క నిజామాబాద్లోనే కాదు..ఆదిలాబాద్ అయినా మహబూబాబాద్ అయినా, మహబూబ్నగర్ అయినా, మెదక్ అయినా, భువనగిరి అయినా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడకు వెళ్లినా రేవంత్ ఒట్లు మీద ఒట్లు పెడుతున్నారు. ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చి, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, భద్రాద్రి రామయ్యతో పాటు గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ సాక్షిగా అంటూ.. పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేస్తున్నారు. దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని నిత్యం విరుచుకుపడే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్యమంత్రి.. ఏ దేవుడి దగ్గరకు వెళితే ఆ దేవుడు సాక్షి అంటూ ఒట్టేస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఒట్టు మాటలు గట్టివేనా? లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్రెడ్డి మాట్లాడుతున్న ఈ ‘ఒట్టు’మాటలు ఎంత గట్టివనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తరహాలోనే లోక్సభ ఎన్నికల్లోనూ రాజకీయ ప్రత్యర్థులపై దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్ దేవుళ్ల సాక్షిగా ఎందుకు మాట ఇస్తున్నారనేది హాట్టాపిక్గా మారింది. రైతు రుణమాఫీ కేంద్రంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అటు ప్రతిపక్షాలతో పాటు ఇటు అధికార పక్షంలోనూ చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో విఫలమైనందున రేవంత్రెడ్డి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని, అందుకే ఈ తరహాలో హామీ ఇవ్వడం ద్వారా వారిని నమ్మించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లోనే రేవంత్ ‘ఒట్టు’మాటలు మాట్లాడాల్సి వస్తోందని అంటోంది. రైతు బంధు ఇవ్వలేదని, రుణమాఫీ చేయలేదని, కరువు వచ్చి పడిందని, కరువును కూడా ప్రభుత్వం ఎదుర్కోలేకపోతోందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇదే మార్గమని చెబుతోంది. తాము అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కాగానే..ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఈలోపే తామేమీ చేయడం లేదన్నట్టు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే రేవంత్ ఘాటుగా స్పందిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో పాటు ప్రజలు ఆయన మాటలు విశ్వసించేలా చేసేందుకే ఆయన ఈ ఎత్తుగడ అమలు పరుస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు, మహిళలు, రైతులు, మైనార్టీల ఓట్లు రాబట్టుకునే వ్యూహంతోనే రేవంత్ ఈ తరహాలో ఎన్నికల ప్రచార ప్రసంగాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. కోమటిరెడ్డికి కితాబుపైనా చర్చ భువనగిరి ప్రచార సభలో మాట్లాడుతూ సీఎం అయ్యేందుకు మంత్రి కోమటిరెడ్డికి అన్ని అర్హతలున్నాయని రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత చర్చకు దారితీస్తున్నాయి. భువనగిరి అభ్యర్థి, తన సన్నిహితుడు చామల కిరణ్రెడ్డిని గెలిపించుకోవడంలో భాగంగా అక్కడ మంచి పట్టున్న కోమటిరెడ్డి బ్రదర్స్ను మచ్చిక చేసుకునేందుకే రేవంత్ అలా మాట్లాడారని కొందరంటుంటే... మరికొందరు మాత్రం రేవంత్ స్టైల్ ఆట నల్లగొండలో ఆడారని, ఆ జిల్లాకు చెందిన నేతలను డిఫెన్స్లో పడేసేలా ఆయన మాట్లాడారని కొందరంటున్నారు. మరోవైపు బీజేపీ చేస్తున్న హిందూత్వ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా దేవుడు, మతాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘దేవుడు గుడిలో ఉండాలి..భక్తి గుండెల్లో ఉండాలి.. పోలింగ్ బూత్లలో కాదు.. నేను హిందువునని గర్వపడతా.. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులను ఆదరిస్తా.. గౌరవిస్తా..’అంటూ చెప్పడం, హామీల అమలుకు దేవుళ్ల మీద ఒట్లు పెట్టడం.. ఎలాంటి ఫలితాలనిస్తుందోనన్న చర్చ జరుగుతోంది. వేడి రాజేసేలా రాజకీయ వ్యాఖ్యలు ఒట్ల మాటలు అలా ఉంటే... ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్ పదేపదే మరో విషయాన్ని నొక్కి చెబుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాయంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఇవి కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుకే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయన, సమయం వచ్చినప్పుడల్లా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇక తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ అంశంపై దాడిని ఆయన మరింత తీవ్రతరం చేశారు. టచ్ చేసి చూడండి... మసై పోతారంటూ సినిమా డైలాగులు విసురుతున్నారు. ‘ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాపలా ఉంది రేవంత్రెడ్డి. నేను జైపాల్రెడ్డి, జానారెడ్డి కాదు. రేవంత్రెడ్డిని..’లాంటి పదునైన వ్యాఖ్యలతో సవాళ్లు విసురుతున్నారు. అయితే అలాంటి వ్యాఖ్యల ద్వారా కేడర్లో ధైర్యాన్ని నింపడమే కాకుండా రాజకీయ వేడి పుట్టించడం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ సానుకూలతను పెంచేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. -
కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా విన్నా నేరమే
జైపూర్/రాయ్పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్పై మరోసారి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో ప్రజలు వారి మత విశ్వాసాలు పాటించడం చాలా కష్టమని, కనీసం హునుమాన్ చాలీసా వినడం కూడా పెద్ద నేరం అవుతుందని అన్నారు. మంగళవారం రాజస్తాన్లోని టోంక్, ఛత్తీస్గఢ్లోని శక్తి, ధామ్తారీ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఇటీవల హనుమాన్ చాలీసా వింటున్న ఓ దుకాణదారుడిని దారుణంగా కొట్టారని గుర్తుచేశారు. రాజస్తాన్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్లు విసిరారని చెప్పారు. రాళ్లు విసిరినవారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి రక్షణ కల్పించారని, రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలపై ఆంక్షలు విధించారని మండిపడ్డారు. రాజస్తాన్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజల మత విశ్వాసాలను ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారని చెప్పారు. ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా హనుమాన్ చాలీసా పఠించవచ్చని, శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవచ్చని, ఇది బీజేపీ గ్యారంటీ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. రిజర్వేషన్లపై ఇదే నా గ్యారంటీ ‘‘మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో కోత విధించి, ముస్లింలకు కట్టబెట్టే పనికి శ్రీకారం చుట్టింది. 2004 నుంచి 2010 దాకా ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లను అమలు చేసేందుకు నాలుగుసార్లు గట్టిగా ప్రయతి్నంచింది. కానీ, చట్టపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో కాంగ్రెస్ ఉద్దేశం నెరవేరలేదు. 2011లో దేశవ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లను అమల్లోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సాగించిన కుట్రలు ఫలించలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కొల్లగొట్టి, మరో వర్గానికి ప్రయోజనం కల్పించాలని చూశారు. భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను కాంగ్రెస్ ఏనాడూ గౌరవించలేదు. దళితులు, వెనుకబడిన గిరిజనులకు కల్పించిన రిజర్వేషన్లను విభజించి, ముస్లింలకు ఇచ్చేస్తామని బహిరంగంగా ప్రకటించే ధైర్యం కాంగ్రెస్కు ఉందా? కర్ణాటకలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల నుంచి దొంగిలించి, ముస్లింలకు ఇచ్చిన కోటాను బీజేపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ల గడువు 2020లో ముగిసిపోగా, మేము మరో పదేళ్లు పొడిగించాం. దళితులకు, వెనుకబడిన గిరిజనులకు రిజర్వేషన్లు ఎప్పటికీ అంతం కాబోవని నేను గ్యారంటీ ఇస్తున్నా. మతం పేరిట ఎవరైనా రిజర్వేషన్లను విభజించాలని చూస్తే సహించే ప్రసక్తే లేదు. రాజ్యాంగాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. రాజ్యాంగానికి విధేయుడిగా నడుచుకుంటున్నా. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ను ఆరాధిస్తున్నా’’ నక్సలిజం, మావోయిజాన్ని అంతం చేస్తాం ‘‘ఛత్తీస్గఢ్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి హింసను ప్రోత్సహించింది. కాంగ్రెస్కు, అభివృద్ధికి పొత్తు పొసగదు. అవి రెండూ కలిసి ముందుకు సాగలేవు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి, హింస పెరిగిపోతాయి. ఈశాన్య రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు నక్సలైట్ల హింసాకాండ విపరీతంగా పెరిగింది. హింసాకాండలో ఒకవైపు జనం మరణిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకున్నారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అవినీతి, మావోయిస్టు హింసాకాండ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో నక్సలిజాన్ని, మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నా’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు’’ కాంగ్రెస్ వస్తే ప్రజల సొమ్ముపై ఎక్స్–రే ‘‘దేశంలో వనరులపై మొదటి హక్కు మైనార్టీలకే ఉందని కాంగ్రెస్ పాలనలో ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అన్నారు. ఇది యాదృచ్చికం కాదు. బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ సిద్ధాంతం. ప్రజల ఆస్తులను, కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకొని, కొందరు ఎంపిక చేసిన వ్యక్తులకు పంపిణీ చేయాలని కాంగ్రెస్ కుట్రలు పన్నుతోంది. కాంగ్రెస్తోపాటు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలను బయటపెడుతున్నందుకే ఆ పార్టీ నాయకులు నన్ను దూషిస్తున్నారు. నిజం మాట్లాడితే వారు భయపడుతున్నారు. వారి రహస్య ఎజెండాలను బహిర్గతం చేస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను నమ్ముకుంది. అందుకే రాజ్యాంగాన్ని కూడా లెక్కచేయకుండా వ్యవహరిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులను, సొమ్ములను ఎక్స్–రే తీస్తామని కాంగ్రెస్ యువరాజు చెబుతున్నారు. అంటే ప్రజలు తమ దగ్గరున్న డబ్బులు, బంగారాన్ని పెట్టెలో దాచి, గోడల్లో రహస్యంగా భద్రపరిచినా కాంగ్రెస్ నాయకులు ఎక్స్–రే ద్వారా కనిపెట్టి, స్వాధీనం చేసుకుంటారు. తర్వాత ఎంపిక చేసిన వ్యక్తులకు ఆ సొమ్ము పంపిణీ చేస్తారు. కాంగ్రెస్ చెబుతున్న సంపద పునఃపంపిణీ వెనుక ఉన్న అసలైన అర్థం ఇదే’’ దేశాన్ని విభజించే కుతంత్రమే ‘‘కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని మతం పేరిట ముక్కలు చేసింది. స్వాతంత్య్రం వచ్చాక మొదటిరోజు నుంచే బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల ప్రజలు అధికారంలో భాగస్వాములు కావడాన్ని ఆ పార్టీ జీరి్ణంచుకోలేకపోతోంది. మరో నాటకానికి తెరతీసింది. దేశాన్ని విభిజించే కుట్రలకు పాల్పడుతోంది. దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా మార్చాలని ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ఎంపీ డిమాండ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు గోవాలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయొద్దని అంటున్నారు. ఇది ముమ్మాటికీ దేశాన్ని విభజించే కుతంత్రమే. రాజ్యాంగాన్ని అమలు చేయొద్దనడం రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ను అవమానించినట్లు కాదా? తమపై రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దడానికి ప్రయతి్నస్తున్నారంటూ గతంలో జమ్మూకశ్మీర్లో కొందరు వ్యక్తులు గగ్గోలు పెడుతుండేవారు. మీరు(ప్రజలు) బీజేపీని ఆదరించాక ఆ వ్యక్తుల నోళ్లు మూతపడ్డాయి. జమ్మూకశ్మీర్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారతదేశం కాంగ్రెస్ను తిరస్కరించింది. అందుకే దేశాన్ని చిన్నచిన్న దేశాలుగా, దీవులుగా విడగొట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ నేడు గోవాలో రాజ్యాంగం అమలును అంగీకరించడం లేదు. రేపు దేశమంతటా అమలు చేయొద్దని చెప్పడం ఖాయం. దేశ అభివృద్ధి పట్ల కాంగ్రెస్కు ఒక విజన్ లేదు. పేదల సంక్షేమం గురించి ఆ పార్టీకి ఏబీసీడీ కూడా తెలియదు. ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది. బీజేపీ సంగతి పక్కన పెట్టండి. సాక్షాత్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దిగొచ్చినా సరే రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు’’ -
మేనిఫెస్టోపై తప్పుడు ప్రచారం.. బీజేపీపై కాంగ్రెస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: తమ మేనిఫెస్టోపై బీజేపీ అగ్రనేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీపై ఆ పార్టీ మంగళవారం(ఏప్రిల్23) ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసింది. మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగాల్లో లేనిపోని గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమానత్వ అభివృద్ధి అని రాహుల్గాంధీ చేసిన కామెంట్లకు తప్పుడు అర్థాలు చెబుతున్నారని తెలిపారు. ‘ఇది బీజేపీ కావాలని చేస్తోంది. మధ్య తరగతి వర్గాల్లో భయాందోళనలు కలిగిస్తున్నారు’అని కాంగ్రెస్ నేత ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. ఈ విషయంలో బీజేపీపై కఠినన చర్యలు తీసుకోవాలని కోరారు. -
డీకే అరుణతో నాకు పోటీ ఏంటి? పొంతనేంటి?: సీఎం రేవంత్
సాక్షి, నాగర్ కర్నూల్: లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ను దొంగ దెబ్బ తీయాలని బీజేపీ, బీఆరెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని.. ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్ధి డీకే అరుణపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మంత్రిగా ఉండి నారాయణపేట ఎత్తిపోతల రాకుండా అడ్డుకున్న డీకే అరుణ.. నేడు మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని మండిపడ్డారు. తనను అవమానించానని డీకే అరుణ మాట్లాడుతున్నారని.. శత్రువు చేతిలో చుర కత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పొడుస్తున్నవని మాత్రమే తాను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. నరేంద్రమోదీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులో పొడవద్దని అన్నారు. ‘కొడంగల్ నియోజకవర్గంలో మీరు నాటిన మొక్క ఇవాళ మీ ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంది. కొడంగల్ నియోజకవర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి ఏక కాలంలో ఇచ్చిన ఘనత సోనియమ్మది. చేయి చాచి అడిగే పరిస్థితి నుంచి ఇవాళ ఎవరికి ఏం కావాలో ఇచ్చే స్థాయికి కొడంగల్కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. మీరే కథానాయకులై నన్ను 33 వేల మెజారిటీతో గెలిపించారు. పాలమూరు బిడ్డలు నూటికి నూరు శాతం నాకు అండగా నిలబడ్డారు. అలాంటి నాకు నీ మీద అసూయ ఎందుకుంటుంది.? ఎందుకు కోపం ఉంటుంది.? నాకు నీకు పోటీ ఏంటి..? పొంతనేంటి..? ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాకు శత్రువులు లేరు. ప్రత్యర్ధులు లేరు. పాలమూరు అభివృద్ధి కోసమే నా తపనంతా. 70ఏళ్ల తరువాత పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు అండగా నిలబడండి. పాలమూరును రాబోయే వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తా. పార్టీలకు అతీతంగా ముందుకు రండి.పాలమూరు అభివృద్ధి చేసి చూపిస్తా. వందరోజుల్లోనే మమ్మల్ని కేసీఆర్ దిగిపొమ్మంటున్నారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన నిన్ను చెంపలు వాయించాలి. తాగుబోతు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రూ. 3,900 కోట్ల లోటు బడ్జెట్తో నేను సీఎంగా బాధ్యత తీసుకున్నా. నేను వచ్చాక నాలుగు నెలలల్లో 26వేల కోట్లు వడ్డీలు కట్టా. అసెంబ్లీకి రా నేను లెక్కలు చూపిస్తా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. రూ.10లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ... 45 లక్షల ఇళ్లల్లో వెలుగు నింపుతున్నాం. సేవాలాల్ సాక్షిగా పంద్రాగస్టులోగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతున్నాడు. ఈ వేదికగా నేను హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా? ఈ సవాల్కు హరీష్ సిద్ధమా.? నేను మాట ఇస్తే ఎలా ఉంటుందో పోయి మీ మామను అడుగున. బీజేపీ నేతలకు పిచ్చి ముదిరి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. వారి మాయలో పడొద్దు. కొడంగల్ నుంచి వంశీచంద్ రెడ్డికి 50వేల మెజారిటీ ఇవ్వండి’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019