breaking news
Ad - Sakshi_Home_Sticky
-
Vinamar Test Article Webo
None -
ఓటుకు కోట్లు కేసు: మరోసారి వాయిదా కోరొద్దు: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో విచారణను వాయిదా వేయాలని మరోసారి కోరొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని.. విచారణను సీబీఐకు అప్పగించాలంటూ మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను గురువారం న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తొలిసారి కేసు విచారణకు హాజరవుతున్నానని.. మరికొన్ని వివరాలు అందజేయాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి న్యాయస్థానానికి నివేదించారు. ఈ నేపథ్యంలో విచారణను మరో రెండు వారాలు వాయిదా వేయాలని కోరారు. దీనికి పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు ఆర్.బసంత్, రమేశ్ అల్లంకి అభ్యంతరం తెలిపారు. చిన్న చిన్న అంశాలు సాకుగా చూపి ఇప్పటికే పలుసార్లు వాయిదా కోరారన్నారు. ఇదే ధర్మాసనం ముందు కూడా వాయిదా పొందారని గుర్తుచేశారు. పిటిషనర్ వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హైకోర్టులో ప్రతివాదులకు అనుకూలంగానే వచ్చిందని, ఇంకా అదనంగా వివరాలు అందజేయడానికి ఏముంటుందని ప్రశ్నించారు. ప్రతిసారి వాయిదా కోరడం సరికాదన్నారు. అనంతరం రెండు వారాలు వాయిదా వేస్తామని ధర్మాసనం చెప్పగా స్పష్టమైన తేదీని ప్రకటించాలని రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు కోరారు. ఈ సమయంలో చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా జోక్యం చేసుకొని వేసవి సెలవుల అనంతరం కేసును విచారించాలని అభ్యర్థించారు. జూలైకు వాయిదా వేయడం అసలు సరికాదని మరోసారి ఆళ్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. తమ వాదనలు ఇప్పుడే వినాలని కోరారు. అనంతరం తదుపరి విచారణను జూలై 24న చేపడతామని ధర్మాసనం వాయిదా వేసింది. చంద్రబాబు, రేవంత్ మరోసారి కుమ్మక్కు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. విచారణను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరడం చూస్తేనే ఈ విషయం అర్థమవుతోందన్నారు. ఓటుకు కోట్లు కేసు విచారణ అనంతరం గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు ఆదేశాల మేరకు నాడు టీడీపీలో ఉన్న రేవంత్రెడ్డి రూ.5 కోట్లకు బేరం కుదుర్చుకొని రూ.50 లక్షలు బయానాగా ఇచ్చిన విషయాన్ని దేశ ప్రజలందరూ స్పష్టంగా చూశారన్నారు. సెక్షన్ 39 సీఆర్పీసీ ప్రకారం అనుకోని ఘటన, ప్రమాదం జరిగినప్పుడు ఏ పౌరుడైనా పోలీసుస్టేషన్, మేజిస్ట్రేట్ దగ్గరకు వెళ్లొచ్చని.. దీని ఆధారంగానే తాను కోర్టును ఆశ్రయించానని తెలిపారు. 2017లో సుప్రీంకోర్టును ఆశ్రయించానని, తనకు అనుగుణంగా ఆదేశాలు వచ్చినా ఇప్పటివరకు అనేక సాకులతో చంద్రబాబు న్యాయవాదులు కేసును సాగదీస్తూ వచ్చారని ఆరోపించారు. ఈసారి తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాయిదా కోరడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ న్యాయవాదులకు బాబు న్యాయవాదులు వత్తాసు పలకడం చూస్తుంటే చంద్రబాబు, రేవంత్రెడ్డి కుమ్మక్కైనట్టు తెలుస్తోందన్నారు. జూలై 24 నుంచి వాదనలు ప్రారంభమవుతాయని, వారిద్దరూ తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. ఈ కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు. -
అవినీతిలో మేటి ప్రత్తిపాటి
ఆయన అవినీతిలో ఘనాపాఠి. పదవిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు తెరలేపారు.కుంభకోణాలకు కేంద్రబిందువుగా నిలిచారు. భూ ఆక్రమణల నుంచి గ్రావెల్ తవ్వకాల వరకు అంతా దోపిడీ పర్వమే. రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన సీసీఐ స్కామ్కు సూత్రధారుడు. అగ్రిగోల్డ్ భూముల అక్రమ కొనుగోళ్ల వ్యవహారాల్లో అడ్డంగా దోచేశాడు. బడుగుల భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన ఘనుడు. ఇదీ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు అవినీతి బాగోతం. చిలకలూరిపేట: గత టీడీపీ ప్రభుత్వం హయాంలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రత్తిపాటి పుల్లారావు 2014–15 కాలంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఈ సమయంలో సీసీఐ కుంభకోణం జరిగింది. దాదాపు రూ.650 కోట్లు అక్రమాలు జరిగినట్లు సీబీఐ విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో మంత్రి పాత్ర ఉన్నట్టు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కుంభకోణం అప్పటి ప్రభుత్వాన్ని కుదిపేసింది. దీంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించిన అప్పటి ప్రభుత్వం అనంతరం 2016 నవంబర్లో చిలకలూరిపేట మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి కె.నాగవేణి సహా మొత్తం 26 మంది మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపేసుకుంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో అగ్రిగోల్డ్ వెంచర్లలో 14.81 ఎకరాల భూమిని విడతలవారీగా ప్రత్తిపాటి పుల్లారావు తన సతీమణి ప్రత్తిపాటి తేనె వెంకాయమ్మ(ప్రత్తిపాటి వెంకట కుమారి) పేరుతో కారుచౌకగా కొన్నారు. అప్పటికే అగ్రిగోల్డ్ సంస్థ వివాదాల్లో ఇరుక్కోవడంతో ఆ సంస్థ భాగస్వాములను అధికారం అడ్డంపెట్టుకుని బెదిరించి ఈ భూములను చౌకగా కొట్టేశారనే ఆరోపణలు పుల్లారావుపై వెల్లువెత్తాయి. ఈ మొత్తం భూమిని ఆ తర్వాత గుంటూరుకు చెందిన కామేపల్లి వెంకటేశ్వరరావుకు, పెదకాకాని మండలం, ఉప్పలపాడుకు చెందిన చెరుకూరి నరసింహారావులకు దాదా పు 30 లక్షలు ఎక్కువకు విక్ర యించారు. ఈ భూమిని ఎకరా రూ. 20 లక్షలలోపు ధరకు కొన్న ప్రత్తిపాటి ఆ తర్వాత ఎకరా రూ.52 లక్షలకు విక్రయించినట్లు సమాచారం. గ్రావెల్, రేషన్ మాఫియా యడ్లపాడు మండలంలోని అసైన్డ్ భూముల్లో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వి ప్రత్తిపాటి, ఆయన అనుచరులు రూ.కోట్లాది రూపాయలు గడించారు. చారిత్రాత్మక కొండవీడు కొండలనూ పిండి చేశారు. ప్రత్తిపాటిపై అప్పట్లో అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్బాబు బహిరంగ విమర్శలు చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించిన ప్రత్తిపాటి పుల్లారావు రేషన్ మాఫియాను ప్రోత్సహించి రూ.కోట్లు వెనుకేశారు. అప్పట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడుల్లో ఈయన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నీరు–చెట్టు పథకంలోనూ ప్రత్తిపాటి అనుచరులు రూ.కోట్లు కొల్లగొట్టారు. యడవల్లి దళిత భూములు కాజేసే కుట్ర చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో 1975లో సర్వే నెంబర్ 381లో ఉన్న 416.5 ఎకరాల భూమిని 250 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఏకపట్టాగా అందజేశారు. 1976లో యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కమిటీ పేరుతో లబ్దిదారులైన ఎస్సీ, ఎస్టీలు ఓ సొసైటీగా ఏర్పడి సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ భూముల్లో విలువైన బ్లాక్ పెరల్ గ్రానైట్ ఉన్నట్టు తెలుసుకున్న ప్రత్తిపాటి సొసైటీనే రద్దు చేయించారు. ప్రభుత్వ భూములుగా ప్రకటింపజేశారు. బినామీలతో అక్రమ మైనింగ్కు సిద్ధమవుతున్న తరుణంలో వైఎస్సార్ సీపీ, దళిత సంఘాల పోరాటానికి దిగాయి. దళితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్కు వెళ్లారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక యడవల్లి దళితులకు న్యాయం జరిగింది. జర్నలిస్టులపై కక్ష చిలకలూరిపేట పట్టణానికి చెందిన విలేకరి ఎంవీఎన్ శంకర్ 2014 నవంబర్ 25వ తేదీ విధులు ముగించుకుని రాత్రి వేళ ఇంటి బయట బైక్ పార్క్ చేస్తుండగా ఇద్దరు దాడి చేశారు. అతను గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ కేసులో ప్రత్తిపాటి పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తనకు వ్యతిరేకంగా వార్తలు రాశారన్న అక్కసుతో యడ్లపాడుకు చెందిన మాజీ విలేకరి మానుకొండ సురేంద్రనాథ్కు సంబంధించిన భూమిలో మంత్రి అనుచరులు భారీగా గ్రావెల్ తవ్వకాలు జరిపి విక్రయించారు. అదే భూమిని గతంలో ఇతరులకు అమ్మేందుకు సురేంద్ర అడ్వాన్సులు తీసుకున్నాడు. ఆ భూమి వివాదంలోకి వెళ్లడంతో తీసుకున్న అడ్వాన్సులు ఇవ్వలేక సురేంద్ర 2017 డిసెంబర్ 18న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుల్లా రావు సతీమణి పెత్తనం పుల్లారావు తన అధికారాన్ని రాష్ట్ర స్థాయిలో విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తే ఆయన సతీమణి వెంకాయమ్మ నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇంటికి వచ్చి తనకు సలాం కొట్టలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.జ్యోతిర్మయితోపాటు ముగ్గురు వైద్యులు, ఓ హెడ్నర్సు, నలుగురు స్టాఫ్ నర్సులు, ఒక సీనియర్ అసిస్టెంట్ను బదిలీ చేయించారు. ఏ కార్యాలయంలోనైనా ఫైల్ కదలాలంటే ముందు మేడమ్కు కప్పం కట్టాల్సిందే అన్నంతగా అవినీతికి పాల్పడ్డారు. పుల్లారావుపై కేసులివే.. ♦ ఎమ్మెల్యే విడదల రజినిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పిల్లి కోటిని అరెస్టు చేసినప్పుడు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ప్రత్తిపాటి పుల్లారావుపై చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 45/2020 యూ/ ఎస్ 341.18855/ కింద కేసు నమోదు చేశారు. ♦ మంచినీటి చెరువువద్ద ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ అనుమతులు లేకుండా ప్రారంభించేందుకు యత్నించి విధుల్లో ఉన్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కోడిరెక్క సునీతపై దాడి చేసినందుకు క్రైమ్ నంబర్ 136/2022 యూ/ఎస్ 353, 509, 506,323 ఆర్/డబ్ల్యూ, 34 ఐపీసీ – సెక్షన్ 3(1)(ఆర్)(ఎస్),3(2)(వీఏ) ఆఫ్ ఎస్సీ/ఎస్టీ పీఓఏ యాక్ట్ కింద ప్రత్తిపాటిపై కేసు నమోదైంది. ♦ చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్టయినప్పుడు చిలకలూరిపేట జాతీయ రహదారి దిగ్బంధనం చేసి పోలీసు విధులకు ఆటంకపరిచినందుకు క్రైమ్ నంబర్ 238/2023 యూ/ఎస్ 341, 353, 120(బి), 144, 148 ఆర్/డబ్ల్యూ 143 ఐపీసీ – సెక్షన్ 129–149, క్రైమ్ నంబర్ 240/2023 యూ/ఎస్ 435, 353, 120–బి ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ కింద, క్రైమ్ నంబర్ 125/2023 యూ/ఎస్ 353, 341, 147, 143, 120–బి. ఆర్/డబ్ల్యూ 149 కింద మూడు కేసులు నమోదయ్యాయి. ♦ చట్టప్రకారం జరుగుతున్న ఇసుక రవాణాను అడ్డు కుని పోలీసు విధులను అడ్డుకోవడంతో అమరా వతి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 93/2023 యూ/ఎస్ 143, 341, 230 ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ కి ంద కేసు నమోదైంది. -
ఇదంతా సీబీఐ, సునీత ఆడుతున్న డ్రామా
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సునీతక్క చెబుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి చెప్పారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు శాస్త్రీయ విధానంలో కాకుండా, పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని అన్నారు. ఇదంతా దస్తగిరిని అడ్డం పెట్టుకొని, హియర్ సే ఎవిడెన్స్ అంటూ సీబీఐ, సునీత తదితరులు కలిసి ఆడుతున్న డ్రామా అని స్పష్టం చేశారు. ఎంపీ అవినాశ్ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసలు దస్తగిరి అప్రూవర్గా మారకముందే ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ‘వివేకా హత్య జరిగిన 40 రోజుల తర్వాత దస్తగిరి సీబీఐ ముందు వాంగ్మూలమిస్తూ అతనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలి. కానీ, సీబీఐ అతన్ని అరెస్టు చేయలేదు. పైగా, అతనికి ముందస్తు బెయిలు వచ్చేలా సీబీఐ, సునీత సహకరించారు. 2021 అక్టోబరు 21న కోర్టులో దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే సీబీఐ అభ్యంతరం లేదని చెప్పింది. సునీత అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్ వచ్చేంత వరకూ వేచి ఉండి, ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ఐపీసీ 306(4)ఏ ప్రకారం అప్రూవర్ అయితే కోర్టులో విచారణ అయ్యే వరకు బెయిల్ రాదు. కాబట్టే బెయిల్ వచ్చిన తర్వాత 306 (4)బి ప్రకారం అప్రూవర్గా మార్చారు. ఇక అతను జైలుకెళ్లే అవకాశం లేదు. సీబీఐ, సునీత ఈ విధానాన్ని వాడుకున్నారు. ఒకవేళ హంతకుడినని ఒప్పుకొన్న అతన్ని అరెస్టు చేసి ఉంటే జీవిత కాలం బెయిల్ వచ్చి ఉండేది కాదు. అందుకే హంతకుడినని ఒప్పుకొన్న దస్తగిరి ఒక్క రోజు కూడా జైలులో ఉండకుండా అతనికి ముందస్తు బెయిలు వచ్చేలా సహకరించి, ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని బయటకు తెచ్చారు. ఇక జీవిత కాలం ఈ కేసులో అతని అరెస్టు ఉండదని హామీ ఇచ్చి, ఈ ప్రయోజనాన్ని కల్పించినందుకు వారికి కావల్సిన పేర్లను అతనితో చెప్పించుకున్నారు. ఇదంతా డ్రామా కాదా?’ అని అవినాశ్ ప్రశ్నించారు. దస్తగిరి హియర్ సే ఎవిడెన్స్ అంటూ అప్పటి దర్యాప్తు అధికారి రామ్సింగ్, సునీత కలిసి కట్టుకథ అల్లారని, అందువల్లే తన తండ్రి చేయని నేరానికి ఏడాదిగా జైల్లో మగ్గుతున్నారని, రెండున్నరేళ్లు శివశంకర్రెడ్డి జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలిపారు. గూగుల్ టేకౌట్కు కచ్చితత్వం ఉండదని గూగులే వెల్లడించిందని, అయినా దాని ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేస్తున్నారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మేన్ రంగన్న నలుగురి పేర్లు చెప్పినప్పటికీ, వారిని దర్యాప్తు అధికారి అరెస్టు చేయలేదని, కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపి వాస్తవాలు రాబట్టలేదని తెలిపారు. సునీత అప్పుడొకలా.. ఇప్పుడొకలా.. వివేకా హత్యపై నర్రెడ్డి సునీత మొదట్లో ఒకలా, ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారని అవినాశ్ అన్నారు. ‘2020 జూలై 20న సీబీఐకి సునీత వాంగ్మూలమిస్తూ ఆమె భర్త సెల్ఫోన్లో వివేకా రాసిన డెత్ నోట్ ఫోటో చూపించారని, అందులో మా తండ్రి డ్రైవర్ ప్రసాద్ను డ్యూటీకి త్వరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టాడని, ఈ లెటర్ రాసేందుకు చాలా కష్టపడ్డానని, డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దని రాసి ఉన్నట్లు చెప్పింది. 2020 ఆగస్టు 27న లెటర్ గురించి ఏమీ తెలియదని, ఎస్పీ రాహుల్దేవ్శర్మ చూపించారని చెబుతోంది. ఇలా నెలలోనే ఎందుకు మాట మార్చింది? హత్య జరిగిన 10 రోజులకు నాన్నగారు అవినాశ్ను ఎంపీని చేసేందుకు, జగనన్నను సీఎంను చేసేందుకు ఏమేమి చేయాల్నో అంతా చేశారని సునీత చెప్పింది. ఈరోజు హత్యకు ఎంపీ టికెట్ మోటివ్ అని చెబుతున్నారు. నాలుగేళ్ల తర్వాత 2023 మే31న సీబీఐ దగ్గరికి వెళ్లి అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెప్పమంటే అలా చెప్పానంది. అప్పటికే 13 సార్లు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన సునీత ఏనాడూ ఈ విషయాన్ని చెప్పలేదు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పమంటే.. ఇప్పుడు చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణా చెప్పమంటే చెబుతున్నారా’ అని అన్నారు. శివప్రకాష్రెడ్డి ఫోన్ చేస్తేనే వెళ్లాను ‘ఆ రోజు జమ్మలమడుగు వెళ్తున్న నాకు వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాష్రెడ్డి ఫోన్ చేశారు. వివేకా చనిపోయినట్లు చెప్పి విలపించారు. వెంటనే ఇంటికెళ్లమన్నారు. నేను వెళ్లి డెడ్బాడీని చూసి బయటకు వచ్చేశాను. సీఐకి ఫోన్ చేసి త్వరగా రమ్మన్నాను. డెత్ నోట్లో ఉన్న వాస్తవ విషయాన్ని చెప్పకుండా ఘటన స్థలంలోకి నన్ను వెళ్లమని ఎందుకు చెప్పారు? లెటర్లో ఉన్న విషయం తెలిసిన వెంటనే నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు పోలీసులకు చెప్పలేదు? ఇంక థర్డ్ పర్సన్ ఫోన్కాల్ కోసం వెయిటింగ్ ఎక్కడ? శివప్రకాష్రెడ్డి థర్డ్ పర్సనా? వివేకా చివరి రెండేళ్లు డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడ్డారని పని మనుషులు వాంగ్మూలమిచ్చారు. ఆస్తి ఆమ్మే అవకాశం లేదు. చెక్ పవర్ రద్దు చేశారు. రెండో భార్య షమీమ్, అమె కుమారుడి కోసం ఇబ్బందులు పడ్డారు. డబ్బు కోసం డైమండ్స్, సెటిల్మెంట్లు అంటూ తిరగడం ఆరంభించారు’ అని తెలిపారు. మా ఇద్దర్నీ గెలిపించాలని వివేకా పిలుపు ‘నేను చేసే ప్రతి కార్యక్రమాన్నీ వివేకా బలపర్చేవారు. 2014లో వేంపల్లెలో వీధి వీధీ తిరుగుతూ జగన్నను సీఎం చేయాలని, నన్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. 2019ఎన్నికల్లో చివరిరోజు కూడా ఇంటింటా ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించామని చెబుతున్నారు. 854 మంది ఓటర్లలో ఒక్కరినైనా సీబీఐ విచారించిందా? మీకంటే చిన్నోడినైన నాపైన ఎందుకింత ద్వేషం’ అని ప్రశ్నించారు. వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలే ఆరోజు రాత్రి అంతా నేను ఫోన్ వాడినట్లు సునీత చెబుతోంది. నేను ఆరోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేచాను. ఫోన్ నెట్ ఆన్లో ఉంటే మేసేజ్లు వస్తుంటాయి. నానుంచి ఎవరికీ మెసేజ్ కానీ, ఫోన్కాల్ కానీ వెళ్లలేదు. ఎర్ర గంగిరెడ్డి నుంచి నాకు ఎలాంటి మేసేజ్ రాలేదు. అంటే వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలే. ఎవరెన్ని అబద్దాలు చెప్పినా న్యాయమే గెలుస్తుంది. సీబీఐ ఎప్పటికైనా లెంపలేసుకోక తప్పదు. నాకు న్యాయస్థానాలపై నమ్మకం, గౌరవం ఉంది. షర్మిల, సునీత ఆరోపణలను ప్రజలు విశ్వసించరు. తాను బీజేపీకిలోకి వెళ్తాననడం ‘జోక్ ఆఫ్ ది సెంచురీ’ అని ఓ విలేకరి ప్రశ్నకు సమా«ధానంగా అవినాశ్ రెడ్డి చెప్పారు. హార్ట్ ఎటాక్ అన్నది సునీత కుటుంబం చేసిన ప్రచారమే ‘హార్ట్ ఎటాక్ అన్న విషయం సునీత కుటుంబం నుంచే ప్రచారమైంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం అదే రోజు మీడియాతో మాట్లాడుతూ హార్ట్ ఎటాక్తో వివేకానందరెడ్డి చనిపోయినట్లు శివప్రకాష్రెడ్డి చెప్పినట్లుగా తెలిపారు. అదే విషయాన్ని వీడియో ద్వారా వివరించారు. హార్ట్ ఎటాక్ అని ఫిర్యాదు చేయాలని పీఏ కృష్ణారెడ్డికి చెప్పినట్లు సునీత చెప్పారు. డెత్నోట్ చదివాక కూడా హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పారు’ అని ప్రశ్నించారు. -
ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు: అవినాష్ రెడ్డి
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019