breaking news
Ad - Sakshi_Home_Sticky
-
విశాఖ స్టీల్పై కూటమి వైఖరి చెప్పాలి
సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్ప్లాంట్పై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తమ వైఖరి స్పష్టంచేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఎండాడలో 21వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి (కార్మిక సంఘం) నాయకులు మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి విశాఖ స్టీల్ప్లాంట్ సమస్యలపై నివేదించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారితో మాట్లాడుతూ.. ‘విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ స్టీల్ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలుస్తుంది. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకరిస్తూ కార్మికుల తరఫున మొట్టమొదట గళమెత్తిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అదే విధంగా స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారాలను ప్రతిపాదిస్తూ తాను స్వయంగా ప్రధానికి లేఖ రాశాను’.. అని గుర్తుచేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీది రాజీలేని ధోరణి అని జగన్ స్పష్టంచేశారు. ఇనుప ఖనిజం గనులను శాశ్వతంగా కేటాయించడంవల్ల ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుందని, ప్లాంట్ పునరుద్ధరణకు తాము శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నామని ఆయన కార్మికులకు చెప్పారు. ఈ ఎన్నికల్లో వైజాగ్ స్టీల్ప్లాంట్ కార్మికుల మద్దతును కోరే నైతికత వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందని, ఎందుకంటే మా పార్టీ మాత్రమే కార్మికులకు అండగా నిలిచిందన్నారు. ఈ అంశంపై టీడీపీ, బీజేపీ రెండూ విభిన్న నిర్ణయాలు ప్రకటించాయని, ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్న కూటమి పార్టీలు ఈ విషయంపై తమ నిర్ణయాన్ని స్పష్టంచేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. కూటమిగా ఏర్పడిన టీడీపీ–జనసేన–బీజేపీ స్టీల్ప్లాంట్ విషయంలో తమ నైతికతను, విలువలు మరిచాయని విమర్శించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పోరాట కమిటీ నాయకులు సీహెచ్. నర్సింగరావు, డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, వై. మస్తానప్ప ఉన్నారు. -
ఆడా నేనే.. ఈడా నేనే.. కూటమిలో మరో హైడ్రామా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి కట్టిన పార్టీల నడుమ మంగళవారం రాత్రి మరో హైడ్రా మా నడిచింది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటా యించిన అనపర్తి నియోజకవర్గ నుంచి కూడా టీడీపీ నేతనే రంగంలోకి దింపేందుకు నాయకుడి మార్పు డ్రామా పూర్తయ్యింది. రెండు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగుస్తున్న సమయంలో అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీకి కేటాయించిన అనపర్తి నియోజకవర్గం నుంచి మాజీ సైనికుడైన శివకృష్ణంరాజు పేరును పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలో ఉంది. ఆ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తి నుంచి బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించిన అభ్యర్థి కంటే ప్రస్తుత టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తేనే ప్రయోజనం ఉంటుందనేలా కొంతకాలంగా పురందేశ్వరి రాజకీయాలు నెరుపుతున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించిన అభ్యర్థి శివకృష్ణంరాజును ప్రచారం చేసుకోనివ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుపడుతూ వచ్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ శివకృష్ణంరాజు సోమవారం బీజేపీ తరఫున నామినేషన్ కూడా దాఖలు చేశారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన తరువాత కూడా టీడీపీ నేతను బీజేపీలో చేర్పించి.. ఆ పార్టీకి, పొత్తు ధర్మానికి వెన్నుపోటు పొడిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక పునరావాసం కోసం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకులే బీజేపీకి కేటాయించిన సీట్లలోనూ పోటీ చేస్తున్నారు. తొలి నుంచి బీజేపీలో రాజకీయాలు కొనసాగించిన నాయకులకు బీజేపీ మొండిచేయి చూపడంతో ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నారు. మా అభ్యర్థి ఆయనే: పురందేశ్వరి కాగా.. టీడీపీ అనపర్తి నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం రాత్రి విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఎన్నికల ఇన్చార్జి అరుణ్సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. -
'కమలం టార్గెట్' రెండంకెల బలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండంకెల (డబుల్ డిజిట్) ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని కమలదళం ఉవ్విళ్లూరుతోంది. 17 ఎంపీ సీట్లకు గాను 10 నుంచి 12 స్థానాలు గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్రంలో అత్యధిక లోక్సభా స్థానాల్లో గెలుపొందిన పార్టీగా రికార్డు సృష్టించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీని, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో వెనక్కి నెట్టేలా ఫలితాలు రాబట్టాలని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఆ రెండు పార్టీల కంటే ముందుగా ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారాన్ని ముగించుకున్న బీజేపీ అదే దూకుడుతో ముందుకెళ్లాలని భావిస్తోంది. అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమాల్లో జాతీయ స్థాయి నేతలు పాల్గొనేలా వ్యూహరచన చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రేకెత్తిస్తోన్న కమలదళం, అగ్రనేతల పర్యటనలతో ప్రచార పర్వాన్ని మరింత వేడెక్కించే ప్రయత్నాల్లో ఉంది. మోదీ మ్యాజిక్పైనే ఆశలు రాష్ట్రంలో గత రెండు నెలల్లో ఐదు సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఓ విడత ప్రచారం పూర్తి చేయడంతో రాష్ట్ర పార్టీకి ఊపు వచ్చింది. మిగతా పార్టీల కంటే ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐదు రోజులు ఐదు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే రాష్ట్రంలో తొలివిడత ప్రచారాన్ని పూర్తిచేశారు. గత పదేళ్ల పాలనలో కేంద్రంలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతితో పాటు, గతంతో పోల్చితే వివిధ వర్గాల అభ్యున్నతి కోసం పెద్దయెత్తున అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరించారు. గత పదేళ్లలో తెలంగాణకు వివిధ పథకాల ద్వారా కేంద్రం చేకూర్చిన లబ్ధి, వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన నిధులు తదితరాలు వెల్లడించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీపై ప్రజల్లో సానుకూలత పెరిగిందని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి లభిస్తున్న మద్దతు, వరుసగా మూడోసారి మోదీ ప్రధాని అవుతారనే అభిప్రాయం.. తెలంగాణలోనూ గట్టిగా పనిచేస్తుందని, పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు సాధించి పెడుతుందని జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. పార్టీపరంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వివిధ సర్వేల్లో పార్టీకి ప్రజల్లో మద్దతు పెరిగిందని, మెజారిటీ ఎంపీ సీట్లలో గెలుపొందుతామని ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్యాచరణ వేగవంతం డబుల్ డిజిట్ లక్ష్య సాధనకు ఇప్పటికే ప్రాథమిక కసరత్తును పూర్తిచేసిన బీజేపీ.. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికల అమలును వేగవంతం చేసింది. వివిధ సామాజిక వర్గాలను కలుసుకునేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపడుతోంది. జిల్లాలు, పార్లమెంట్ నియోజక వర్గాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల స్థాయిలో వివిధ కుల సంఘాలతో సమ్మేళనాలు, యువత, మహిళలు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా వివిధ వర్గాల వారితో ఎక్కడికక్కడ వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లను పలుమార్లు కలవడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతల పర్యటనల సందర్భంగా మాత్రమే పెద్ద బహిరంగ సభలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. మిగతా ఎన్నికల ప్రచారమంతా ఇంటింటికీ వెళ్లడం, స్వయంగా ఓటర్లను కలవడం, కార్నర్ మీటింగ్లు లాంటి ఔట్ రీచ్ కార్యక్రమాల ద్వారా నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇంటింటి ప్రచారంలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం, ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్, పార్టీ జెండా, ఓటర్లకు ఎంపీ అభ్యర్థి విజ్ఞప్తి పత్రం (అప్పీల్) లాంటివి అందజేస్తున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో రెండోవిడత, వచ్చేనెల 9,10,11 తేదీల్లో మూడోవిడత ప్రచారాన్ని పూర్తిచేయనున్నారు. 4, 6, 8 తేదీల్లో మోదీ పర్యటన రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మే 4, 6, 8 తేదీల్లో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపేలా ఆయన పర్యటన ఉంటుందని సమాచారం. ఇందులో భాగంగా విమానాశ్రయానికి సమీపంలోని ఓ ఇండోర్ స్టేడియంలో ఐటీ వృత్తి నిపుణులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమై ఓ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. అదే విధంగా ఓటర్లలో యాభై శాతం మంది దాకా మహిళలు ఉండడంతో వీరిని ఆకట్టుకునేలా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మోదీతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయించింది. నల్లగొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్; ఖమ్మం ఎంపీ సీట్లలో ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేసేలా జనగామలో లేదా అక్కడికి దగ్గరలో మోదీ పాల్గొనేలా ఓ సభ నిర్వహించాలని భావిస్తోంది. అదేవిధంగా హైదరాబాద్లో లేదా నగర శివార్లలో జరిపే భారీ బహిరంగ సభతో తెలంగాణలో మోదీ ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నట్టు సమాచారం. రేపు రాష్ట్రానికి అమిత్ షా బీజేపీ అగ్రనేత అమిత్ షా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 11.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సిద్దిపేట చేరుకుంటారు. డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు సభ ఉంటుంది. అనంతరం 1.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని రెండున్నర గంటలపాటు అక్కడ ఉంటారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులతో సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి భువనేశ్వర్కు వెళ్తారు. -
ఒట్టేసి చెబుతున్నా..! రేవంత్ ‘ఒట్లపై’ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
సాక్షి, హైదరాబాద్: ‘బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి చెపుతున్నా.. మా ప్రభుత్వం పంద్రాగస్టు లోపల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుంది. అది మా మంత్రివర్గం బాధ్యత. రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం..’. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఒక్క నిజామాబాద్లోనే కాదు..ఆదిలాబాద్ అయినా మహబూబాబాద్ అయినా, మహబూబ్నగర్ అయినా, మెదక్ అయినా, భువనగిరి అయినా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడకు వెళ్లినా రేవంత్ ఒట్లు మీద ఒట్లు పెడుతున్నారు. ఏడుపాయల దుర్గమ్మ, మెదక్ చర్చి, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, భద్రాద్రి రామయ్యతో పాటు గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ సాక్షిగా అంటూ.. పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేస్తున్నారు. దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని నిత్యం విరుచుకుపడే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్యమంత్రి.. ఏ దేవుడి దగ్గరకు వెళితే ఆ దేవుడు సాక్షి అంటూ ఒట్టేస్తుండటం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఒట్టు మాటలు గట్టివేనా? లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్రెడ్డి మాట్లాడుతున్న ఈ ‘ఒట్టు’మాటలు ఎంత గట్టివనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తరహాలోనే లోక్సభ ఎన్నికల్లోనూ రాజకీయ ప్రత్యర్థులపై దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్ దేవుళ్ల సాక్షిగా ఎందుకు మాట ఇస్తున్నారనేది హాట్టాపిక్గా మారింది. రైతు రుణమాఫీ కేంద్రంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అటు ప్రతిపక్షాలతో పాటు ఇటు అధికార పక్షంలోనూ చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడంలో విఫలమైనందున రేవంత్రెడ్డి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని, అందుకే ఈ తరహాలో హామీ ఇవ్వడం ద్వారా వారిని నమ్మించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లోనే రేవంత్ ‘ఒట్టు’మాటలు మాట్లాడాల్సి వస్తోందని అంటోంది. రైతు బంధు ఇవ్వలేదని, రుణమాఫీ చేయలేదని, కరువు వచ్చి పడిందని, కరువును కూడా ప్రభుత్వం ఎదుర్కోలేకపోతోందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇదే మార్గమని చెబుతోంది. తాము అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కాగానే..ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఈలోపే తామేమీ చేయడం లేదన్నట్టు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే రేవంత్ ఘాటుగా స్పందిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో పాటు ప్రజలు ఆయన మాటలు విశ్వసించేలా చేసేందుకే ఆయన ఈ ఎత్తుగడ అమలు పరుస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు, మహిళలు, రైతులు, మైనార్టీల ఓట్లు రాబట్టుకునే వ్యూహంతోనే రేవంత్ ఈ తరహాలో ఎన్నికల ప్రచార ప్రసంగాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. కోమటిరెడ్డికి కితాబుపైనా చర్చ భువనగిరి ప్రచార సభలో మాట్లాడుతూ సీఎం అయ్యేందుకు మంత్రి కోమటిరెడ్డికి అన్ని అర్హతలున్నాయని రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత చర్చకు దారితీస్తున్నాయి. భువనగిరి అభ్యర్థి, తన సన్నిహితుడు చామల కిరణ్రెడ్డిని గెలిపించుకోవడంలో భాగంగా అక్కడ మంచి పట్టున్న కోమటిరెడ్డి బ్రదర్స్ను మచ్చిక చేసుకునేందుకే రేవంత్ అలా మాట్లాడారని కొందరంటుంటే... మరికొందరు మాత్రం రేవంత్ స్టైల్ ఆట నల్లగొండలో ఆడారని, ఆ జిల్లాకు చెందిన నేతలను డిఫెన్స్లో పడేసేలా ఆయన మాట్లాడారని కొందరంటున్నారు. మరోవైపు బీజేపీ చేస్తున్న హిందూత్వ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా దేవుడు, మతాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘దేవుడు గుడిలో ఉండాలి..భక్తి గుండెల్లో ఉండాలి.. పోలింగ్ బూత్లలో కాదు.. నేను హిందువునని గర్వపడతా.. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులను ఆదరిస్తా.. గౌరవిస్తా..’అంటూ చెప్పడం, హామీల అమలుకు దేవుళ్ల మీద ఒట్లు పెట్టడం.. ఎలాంటి ఫలితాలనిస్తుందోనన్న చర్చ జరుగుతోంది. వేడి రాజేసేలా రాజకీయ వ్యాఖ్యలు ఒట్ల మాటలు అలా ఉంటే... ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్ పదేపదే మరో విషయాన్ని నొక్కి చెబుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాయంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఇవి కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుకే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయన, సమయం వచ్చినప్పుడల్లా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇక తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ అంశంపై దాడిని ఆయన మరింత తీవ్రతరం చేశారు. టచ్ చేసి చూడండి... మసై పోతారంటూ సినిమా డైలాగులు విసురుతున్నారు. ‘ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాపలా ఉంది రేవంత్రెడ్డి. నేను జైపాల్రెడ్డి, జానారెడ్డి కాదు. రేవంత్రెడ్డిని..’లాంటి పదునైన వ్యాఖ్యలతో సవాళ్లు విసురుతున్నారు. అయితే అలాంటి వ్యాఖ్యల ద్వారా కేడర్లో ధైర్యాన్ని నింపడమే కాకుండా రాజకీయ వేడి పుట్టించడం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ సానుకూలతను పెంచేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. -
ఆ ఐదు చోట్ల అమీతుమీ
పూర్ణియా (బిహార్) ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి సిట్టింగ్ ఎంపీ, జేడీ(యూ) నేత సంతోష్ కుమార్ కుశ్వాహా ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. విపక్ష ఇండియా కూటమి తరఫున ఆర్జేడీ నాయకురాలు బీమా భారతీ పోటీలో ఉన్నారు. ఆమె నెల క్రితమే జేడీ(యూ) నుంచి ఆర్జేడీలో చేరారు. కానీ బాహుబలి రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూయాదవ్ రంగప్రవేశంతో పోటీ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయింది. ఆయనపై లెక్కలేనన్ని హత్య, హత్యాయత్నం తదితర కేసులున్నాయి. ఐదుసార్లు లోక్సభ ఎంపీగా నెగ్గారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2015లో ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురయ్యాక జన్ అధికార్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. కాంగ్రెస్ టికెట్పై ఆశతో దాన్ని ఇటీవలే ఆ పార్టీలో విలీనం చేశారు. కానీ కూటమి సర్దుబాటులో ఆ సీటు ఆర్జేడీకి వెళ్లడంతో ఆగ్రహించి స్వతంత్రునిగా రంగంలోకి దిగి ప్రధాన పార్టీల అభ్యర్థులకు పెనుసవాలు విసురుతున్నారు. గతంలో కూడా ఆయన స్వతంత్రునిగా నెగ్గడం విశేషం. సంతోష్ కుమార్పై ఓటర్లలో అసంతృప్తి, వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. పైగా జేడీ(యూ) మాజీ నేత అయిన బీమా భారతీ కూడా ఆ పార్టీ ఓట్లను బాగానే చీల్చేలా కన్పిస్తున్నారు. ప్రణామ్ పూర్ణియా పేరిట పప్పూయాదవ్ చేస్తున్న ప్రచారానికి భారీ స్పందన లభిస్తుండటం విశేషం! రాజ్నంద్గావ్ (ఛత్తీస్గఢ్) ఈ స్థానం బీజేపీకి కంచుకోట. ఈసారి దాన్ని ఎలాగైనా బద్దలు కొట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందులో భాగంగా తాజా మాజీ సీఎం భూపేశ్ బఘెల్ను బరిలో దింపింది. అయితే, కాకాగా ప్రసిద్ధుడైన ఆయన బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిజానికి సీఎంగా ఈ ప్రాంతాన్ని బఘెల్ ఎంతగానో అభివృద్ధి చేశారు. పైగా ఈ లోక్సభ స్థానం పరిధిలోని 8 అసెంబ్లీ సీట్లలో ఏకంగా ఐదు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. అయినా ఈసారి కూడా ఇక్కడ బీజేపీదే విజయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ సంతోష్ పాండే ఈసారి కూడా విజయంపై ధీమాగా ఉన్నారు. 2000లో రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి ఒక్కసారి మినహా ఇక్కడ కాషాయ జెండాయే ఎగిరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో ఇక్కడ గెలుపు బఘెల్కు తప్పనిసరిగా మారింది. దాంతో ఈ పోరును ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. నిత్యం ఓటర్లను కలుస్తూ ఓట్లడుగుతున్నారు. కాకపోతే మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం ఆరోపణలు ఆయన అవకాశాలకు మరింతగా గండికొట్టేలా కన్పిస్తున్నాయి. ఇక్కడి ఓటర్లలో ఆదివాసీలు ఏకంగా 35 శాతం, ఓబీసీలు 30 శాతమున్నారు. నాందేడ్ (మహారాష్ట్ర) ఈ లోక్సభ స్థానం కొన్నాళ్ల క్రితం దాకా కాంగ్రెస్కు పెట్టని కోట. కానీ ఆ పార్టీ అగ్ర నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ ఇటీవల బీజేపీలో చేరడంతో ఇక్కడ సమీకరణాలు పూర్తిగా మారాయి. దానికి తోడు గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పాగా వేసింది. అయితే సిట్టింగ్ బీజేపీ ఎంపీ ప్రతాప్రావ్ గోవిందరావ్ పాటిల్ చికలీకర్కు ఇండియా కూటమి తరఫున వసంత్ చవాన్ ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారు. దీనికి తోడు ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాఢీ (వీబీఏ) కూడా బరిలో ఉండటంతో ముక్కోణపు పోరు నెలకొంది. ఈ సెగ్మెంట్లో సంఖ్యాధికులైన ఓబీసీలు బీజేపీకి గట్టి ఓటు బ్యాంకు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన వీబీఏ అభ్యర్థి అవినాశ్ భోసికర్ బీజేపీ ఓట్లను చీలుస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికలీకర్ను గెలిపించుకోవాల్సిన బాధ్యతను పార్టీ నాయకత్వం అశోక్ చవాన్పై ఉంచింది. దాంతో ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వీబీఏ అభ్యర్థి బీజేపీ వ్యతిరేక ఓట్లనే చీల్చి చికిలీకర్ విజయాన్ని సునాయాసం చేస్తారని చవాన్ చెబుతున్నారు. అమరావతి (మహారాష్ట్ర) రాష్ట్రంలో అత్యంత హోరాహోరీ పోరు నెలకొన్న స్థానాల్లో ఇదొకటి. సిట్టింగ్ ఎంపీ, సినీ నటి నవ్నీత్ కౌర్ రాణా ఈసారి బీజేపీ టికెట్పై బరిలో ఉన్నారు. ఆమె 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ దన్నుతో ఇండిపెండెంట్గా పోటీ చేసి కేంద్ర మాజీ మంత్రి ఆనంద్రావ్ అడ్సుల్పై నెగ్గి తొలిసారి లోక్సభలో ప్రవేశించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి మాత్రం ఎదురీదుతున్నారు. ఎందుకంటే ఆమెకు టికెటివ్వడంపై స్థానిక బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇది చాలదన్నట్టు ఎన్డీఏ స్థానిక భాగస్వామి ప్రహార్ పార్టీ రాణా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ పార్టీ తరఫున దినేశ్ బూబ్ను పోటీకి నిలిపింది! దీనికి తోడు మహావికాస్ అఘాఢీ కూటమి తరఫున బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వంత్ వాంఖడేకు నియోజకవర్గమంతటా మంచి పేరుంది. పైగా ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో మూడు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. అయితే వంచిత్ బహుజన్ పార్టీ నుంచి బరిలో ఉన్న అంబేడ్కర్ మనవడు ఆనంద్రాజ్ అంబేడ్కర్ కాంగ్రెస్ ఓట్లను భారీగా చీలుస్తారని భావిస్తున్నారు. ఇది రాణాకు బాగా కలిసొచ్చే అంశం. బాలూర్ఘాట్ (పశ్చిమబెంగాల్) పశ్చిమబెంగాల్లో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోటీ నెలకొన్న లోక్సభ స్థానాల్లో బాలూర్ఘాట్ ముఖ్యమైనది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ సుకాంత మజుందార్ పోటీ చేస్తున్నారు. 2019లో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో భారీగా సీట్లను గెలుచుకోవడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి అర్పితా ఘోష్పై సుకాంత భారీ మెజారిటీతో నెగ్గారు. దాంతో ఈసారి బాలూర్ఘాట్ను తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుకాంతను ఎలాగైనా ఓడించి తీరాలని పట్టుదలగా ఉన్నారు. రాష్ట్ర మంత్రి విప్లవ్ మిత్రాను మమత బరిలో దించడంతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. అయినా సుకాంత మాత్రం బాలూర్ఘాట్తో పాటు బెంగాల్ మొత్తాన్నీ మోదీ వేవ్లో బీజేపీ క్లీన్స్వీప్ చేస్తుందంటున్నారు. ఈసారి కూడా తనకు భారీ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తృణమూల్ నేతల అంతులేని అవినీతి, సందేశ్ఖాలీలో మహిళలపై వారి అకృత్యాలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని చెబుతున్నారు. మీరట్ (ఉత్తరప్రదేశ్) ‘టీవీ రాముడు’ అరుణ్ గోవిల్ పోటీతో ఈ లోక్సభ స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దూరదర్శన్లో సీరియల్గా వచ్చిన రామాయణంలో రాముని పాత్ర పోషించిన ఆయన దేశవ్యాప్త క్రేజ్ సంపాదించారు. బీజేపీ ఆయనను అనూహ్యంగా పార్టీలో చేర్చుకోవడమే గాక మీరట్ టికెట్ కూడా ఇచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను బీజేపీ 62 చోట్ల నెగ్గడం తెలిసిందే. ఈసారి దేశవ్యాప్తంగా సొంతంగా 370 లోక్సభ స్థానాల లక్ష్యాన్ని సాధించాలంటే యూపీలో క్లీన్స్వీప్ చేయడం తప్పనిసరని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మీరట్ పరిసరాల్లోని పలు లోక్సభ స్థానాల్లో గోవిల్ ప్రభావం చూపుతారన్న అంచనాతో ఆయన్ను బరిలోకి దింపింది. సమాజ్వాదీ నుంచి సునీతా వర్మ, బీఎస్పీ నుంచి దేవవ్రత్ కుమార్ త్యాగీ ఆయనకు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019