breaking news
Ad - Sakshi_Home_Sticky
-
ఎన్నికల వేళ.. పవన్ సంపద సృష్టి
సాక్షి, అమరావతి: సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ హైదరాబాద్, మంగళగిరిలో దాదాపు రూ.25 కోట్ల ఆస్తులను కొనుగోలు చేశారు. ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తున్న ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా తన వ్యక్తిగత, కుటుంబ సభ్యుల ఆదాయ, ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల సంఘానికి సమర్పించారు. అందులో ఆయన నెలన్నర క్రితం 2024 మార్చి 4న రూ.16.14 కోట్లతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో 1,060 చదరపు గజాల స్థలంలో 15,709 చదరపు అడుగుల్లో ఉన్న ఇంటిని కోనుగోలు చేసినట్లు చూపగా.. 2024 ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో మంగళగిరి పట్టణ పరిధిలోని 5,517.6 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్లు పవన్ అందులో పేర్కొన్నారు. అంతేకాక.. వ్యక్తిగతంగా తన పేరిట రూ. 209.13 కోట్లు స్థిర చరాస్తులుగానూ, రూ.65.76 కోట్లు అప్పులు ఉన్నట్లు ఆయన తెలిపారు. తన భార్య అన్నా లెజినోవా, అఫిడవిట్లో పేర్కొన్న నలుగురు పిల్లల పేరిట మరో రూ.28.47 కోట్ల స్థిర చరాస్తులు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ఇక మొత్తం ఆస్తుల్లో 10 శాతానికి పైగా ఆస్తులు ఎన్నికలకు రెండు నెలల ముందు కొనడం గమనార్హం. ఆ పిల్లలకు ఒక రకంగా.. ఈ పిల్లలకు మరో రకంగా.. ఇదిలా ఉంటే.. అఫిడవిట్లో పవన్ తన పిల్లలు దేశాయి అకీరా నందన్, దేశాయి ఆద్య (వీరిద్దరూ రేణుదేశాయి–పవన్కళ్యాణ్ పిల్లలు)తో పాటు పోలీనా అంజని, మార్క్ శంకర్ (పవన్కళ్యాణ్–అన్నా లెజినోవా పిల్లలు) పేర్లతో ఉన్న ఆస్తులూ వెల్లడించారు. ఆ అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. వీరికి ఆస్తుల కేటాయింపులో పవన్ వ్యత్యాసం చూపించారు. విడాకులిచ్చిన రేణుదేశాయి పిల్లలకు ఒక రకంగా, ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న లెజినోవా పిల్లలకు మరో రకంగా వారి పేరిట తన ఆస్తులు బహుమతుల రూపంలో ఇవ్వడం గమనార్హం. చదివింది పదో తరగతే.. ఇక పవన్ పదో తరగతి వరకే చదువుకున్నారు. అది కూడా ఎస్ఎస్ఎల్సీ (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) రద్దయి, దాని స్థానంలో ఎస్ఎస్సీ (సెకండరీ స్కూల్ సర్టిఫికెట్) వచ్చిన చాలా ఏళ్ల తర్వాత ఎస్ఎస్ఎల్సీ చదవడం గమనార్హం. ఇంటర్లో మేథమేటిక్స్ మొదలు ఎకనామిక్స్ వరకు దాదాపు అరడజను సబ్జెక్టులు చదివినట్లు సందర్భాన్ని బట్టి చెప్పే పవన్.. అవన్నీ హంబక్ అని అఫిడవిట్లో కుండబద్దలు కొట్టారు. 1984లో నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టెన్త్ ఉత్తీర్ణులైనట్లు అఫిడవిట్లో వివరించారు. తనపై మొత్తం 8 కేసులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొనగా.. తన ప్రస్తుత చిరునామా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీగా చెబుతూ.. మంగళగిరి అసెంబ్లీ పరిధిలోని 197 పోలింగ్ బూత్ 1120 నెంబరుగా తనకు ఓటు ఉన్నట్లు తెలిపారు. పవన్, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో తనకెలాంటి ఆదాయం లేకపోగా, రూ.1,10,62,939 నష్టం వచ్చిందని.. అయితే, 2019–20లో రూ.4.51 కోట్లు, 2020–21లో రూ.12.86 కోట్లు, 2021–22లో 30.09 కోట్లు, 2022–23 ఆర్థిక ఏడాదిలో 12.20 కోట్లు మాత్రమే తన ఆదాయంగా ఆదాయపన్ను శాఖకు సమర్పించినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే, తన భార్య, పిల్లల ఆదాయాలకు సంబంధించి ఎలాంటి ఐటీ రిటరŠన్స్ వివరాలు లేవు. చరాస్తులు.. ► పవన్కళ్యాణ్ చేతిలో ఈ ఏడాది ఏప్రిల్ 19 నాటికి తన చేతిలో నగదు రూపంలో రూ.3.15 లక్షలు ఉన్నాయని.. బ్యాంకుల్లో డిపాజిట్లుగా రూ.16.48 కోట్లు.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.15.48 లక్షలు.. ఇన్సూరెన్స్ తదితర పెట్టుబడులుగా మరో రూ.3.02 కోట్లు.. ఇతరులకు అప్పు రూపంలో ఇచ్చిన మొత్తం రూ.3.65 కోట్లు.. అలాగే, రూ.14.01 కోట్లు విలువ చేసే కార్లు, వాహనాలున్నాయని.. రూ.2.34 కోట్ల బంగారు ఆభరణాలు.. రూ.14.51 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు.. ఇతర రూపాల్లో మరో రూ.1.79 కోట్లు కలిపి మొత్తం చర ఆస్తుల రూపంలో రూ.41.65 కోట్లుగా చూపించారు. ► తన వద్ద రూ.32 లక్షల విలువ చేసే హార్లీ డేవిడ్సన్ బైక్తో పాటు పది కార్లు (రెండు బెంజి, మూడు మహీంద్రా స్కార్పియాలు, రేంజ్ రోవర్, రెండు టయోటాలు, జీపు, టాటా పికప్ ట్రక్ వాహనాలున్నట్లు పవన్ పేర్కొన్నారు. ► ఇక తన భార్య అన్నా లెజినోవా పేరిట నగదు రూపంలో రూ.19,340లు.. బ్యాంకు డిపాజిట్లు రూపంలో రూ.86.05 లక్షలు.. రూ.13.97 లక్షల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు కలిపి మొత్తంగా రూ.ఒక కోటి చరాస్తులున్నాయి. ► పిల్లలు దేశాయి అకీరా నందన్ పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.89.38 లక్షలు.. దేశాయి ఆద్య పేరిట రూ 87.77 లక్షల బ్యాంకు డిపాజిట్లు.. పోలీనా అంజని పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.85.92 లక్షలు.. మార్క్ శంకర్ పేరిట రూ.86.25 లక్షలు బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆకీరా నందన్కు తన తల్లి 2022లో ఆడి కారు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ► మరోవైపు.. మొత్తం రూ.65.76 కోట్ల మేర తాను బ్యాంకులు లేదా వివిధ వ్యక్తులకు చెల్లించాలని పవన్ పేర్కొంటూ, అందులో రూ.17.56 కోట్లు బ్యాంకులకు, మరో రూ.46.70 కోట్లు 15 మంది వ్యక్తులు లేదా సంస్థలకు అప్పులుగా చెల్లించాల్సి ఉందని ఆయన తన అఫిడవిట్లో వివరించారు. స్థిరాస్తులు.. ► హైదరాబాద్ శంకరపల్లి మండలం జొన్నవాడ గ్రామంలో 18.02 ఎకరాల వ్యవసాయ భూములున్నాయని, వాటి ప్రస్తుత విలువ రూ. 10.42 కోట్లు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. ► ప్రస్తుత మార్కెట్ విలువ అంచనాల ప్రకారం రూ.52.85 కోట్ల విలువచేసే ఏడుచోట్ల స్థలాలు (శేరిలింగంపల్లి మండల పరిధిలో రెండు, మంగళగిరి మండల పరిధిలో నాలుగు, హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఒకటి స్థలాలు ఉన్నట్లు తెలిపారు. మంగళగిరిలో పేర్కొన్న నాలుగు స్థలాల్లో ఒకటి ఈ ఏడాది ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో కోనుగోలు చేసినట్లు వివరించారు. ► ఆ ఏడింటిలో ఒకటి మంగళగిరిలోని స్థలం తన తల్లి బహుమతి రూపంలో ఇచ్చారని.. మిగిలినవి తను కొనుగోలు చేసినవన్నారు. ► హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రూ. 3.14 కోట్లు విలువచేసే రెండు ఇళ్లు ఉన్నట్లు తెలిపారు. è రూ.1.95 కోట్లు విలువచేసే హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఇంటిని భార్య అన్నా లెజినోవాకు బహుమతిగా ఇచ్చానన్నారు. è రూ.22 కోట్లు విలువ చేసే హైదరాబాద్ జూబీహిల్స్లోని ఇంటిని తన భార్య అన్నా లెజినోవా పిల్లలు పోలీనా అంజని, మార్క్ శంకర్ ఇద్దరికీ చేరి సగం వాటాగా బహుమతిగా అందజేసినట్లు పవన్ పేర్కొన్నారు. పవన్కళ్యాణ్ నామినేషన్ అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ మంగళవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సోదరుడు నాగబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, తన న్యాయవాదితో కలిసి వచ్చిన ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిబంధనలను వారు బేఖాతరు చేశారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు నలుగురికే అనుమతి ఉండగా అంతకుమించి లోపలకు అనుమతించారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో మాత్రమే అభ్యర్థుల అనుచరులు ఉండాలన్న నిబంధననూ లెక్కచేయలేదు. అక్కడ నినాదాలూ చేశారు. బీజేపీ నేతలకు పరాభవం.. కూటమిలో సభ్యులైన టీడీపీ నేతలకు మాత్రమే విలువనిచ్చిన పవన్కళ్యాణ్.. అప్పటివరకూ ర్యాలీలో తనతో పాటు తిప్పుకున్న బీజేపీ నేత బుర్రా కృష్ణంరాజుకు నామినేషన్ కేంద్రంలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు. తనను పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ కృష్ణంరాజు అసహనానికి గురయ్యారు. తరువాత పోలీసులు వర్మ కుమారుడు గిరీష్ వర్మతో పాటు ఆయన్ను లోపలకు పంపించారు. ఇక నామినేషన్ వేసేందుకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి ఒకసారి ర్యాలీగా పిఠాపురం చేరుకోవడానికే పవన్ అనుమతి తీసుకున్నారు. అయితే, రెండుసార్లు తిరగడం గమనార్హం. -
నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజైన బుధవారం(ఏప్రిల్ 24) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ మంగళవారం రాత్రి బస చేసిన అక్కివలస నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కె.కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకొని.. 3 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. -
మీ డ్రీమ్సే.. నా స్కీమ్స్: సీఎం వైఎస్ జగన్
ఊరు కలలనూ నెరవేర్చాం..ఊరికి కూడా కలలుంటాయి. గ్రామంలో అందే సేవలు బాగుంటేనే తమ ఊరు బాగుంటుందని.. ఆ గ్రామాన్ని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్లిపోరని.. గ్రామానికి కూడా కల ఉంటుంది. ఆ గ్రామం డ్రీమ్ కోసం మీ జగన్ ఎన్ని స్కీమ్లు తెచ్చాడో తెలుసా? ఏకంగా ఏడు స్కీమ్లు తెచ్చాడు. ఆ గ్రామంలోనే కనిపిస్తాయి సచివాలయాలు, 60–70 ఇళ్లకో వలంటీర్ వ్యవస్థ, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, నాడు–నేడుతో మారిన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, మహిళా పోలీసు వ్యవస్థ కనిపిస్తాయి. వీటితోపాటు నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్.. ఇవన్నీ మీ గ్రామాల్లోనే కనిపించే జగన్ మార్కు విప్లవాత్మక మార్పులు. గ్రామాలే కాకుండా రాష్ట్రం కలలను కూడా సాకారం చేస్తూ విప్లవాత్మక చర్యలు చేపట్టాం. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘‘డ్రీమ్స్ మీవి.. స్కీమ్స్ మీ బిడ్డ జగన్వి! ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం కలలను నెరవేరుస్తూ విప్లవాత్మక పథకాలు, వ్యవస్థలు తీసుకొచ్చాం. 58 నెలల పాలనలో మీ అందరి కలలను నెరవేర్చిన ప్రజా ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కాలి’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం విజయనగరం జిల్లా చెల్లూరు వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘చెల్లూరు సభ జనసముద్రాన్ని తలపిస్తోంది. ఒక్కసారిగా లక్షల మంది తాండ్ర పాపారాయుళ్లు శత్రుసైనాన్ని చిత్తుగా ఓడించేందుకు సిద్ధమైతే, ఆ యుద్ధం ఎలా ఉంటుందో పేదల వ్యతిరేకులకు రుచి చూపించడానికి నా ఉత్తరాంధ్ర, నా విజయనగరం సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, తమ పిల్లల భవిష్యత్తును రాబోయే ఐదేళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజలంతా గుర్తించారు. వారికి అడ్డుతగులుతున్న ఆ పెత్తందార్లకు, ఆ కౌరవ సైన్యానికి, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తున్న ప్రజాసైన్యం ఈ రోజు నా కళ్ల ఎదుట కనిపిస్తోంది. చంద్రబాబుకు కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతిస్తున్నాయి. ఇదే బాబుకు తోడుగా దత్తపుత్రుడున్నా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయి. వాళ్లు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్ధాలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతున్నారు. జగన్ కనుక ఇంటింటికీ మంచి చేయకపోయి ఉంటే, జగన్ను ప్రతీ ఇంట్లోనూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ్ముడిగా భావించకపోతే ఇన్ని తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంది? జగన్ ఒకే ఒక్కడు కాదు. నాకున్న ధైర్యం మీరే అని సగర్వంగా చెబుతున్నా. 58 నెలల పాలనలో ఇంటింటికీ చేసిన మంచి నా నమ్మకం. ప్రతీ వర్గాన్ని మోసం చేసిన వారితో ఈరోజు ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్నాం. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించి ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? ప్రజల కలల్ని తన మోసాలతో వంచించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు, ఆ బాబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? 420.. చంద్రముఖి బృందం వస్తువులు ఎత్తుకుపోయేవారని దొంగల ముఠా అంటాం. బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి ఆ ప్రజలు ఇచ్చిన అధికారంతో ఐదేళ్లూ మోసం చేసిన చరిత్ర ఉన్న కూటమిని ఏమనాలి? తియ్యటి మాటలు మేనిఫెస్టోలో చెప్పి ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రజల్ని మోసం చేసేవారిని ఏమంటాం? 420 అనే కదా అంటారు. పేదల కలల్ని, బతుకుల్ని బలిపెట్టి దోచుకునేందుకు వచ్చిన ఈ రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాం. చంద్రబాబు అంటే చంద్రముఖి... తల్లుల కలలు, బాధల గురించి 14 ఏళ్లు పాలించానని చెప్పుకునే చంద్రబాబు ఏరోజైనా ఆలోచన చేశాడా? ఆయనకు ఆ ఆలోచన ఎందుకు రాలేదంటే కారణం.. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాకుండా పేదల రక్తం తాగేందుకు లకలకా అని తపిస్తాడు. కలలను నెరవేర్చిన స్కీములు... ఏ అక్కచెల్లెమ్మ అయినా ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటుంది. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, కుటుంబం మరింత బాగుండేలా రెండు మెట్లు ఎదగాలని కలగంటుంది. చంద్రబాబు మాటలు నమ్మి 2014 నుంచి 2019 మధ్య కుదేలయిపోయిన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల సాధికారత, మళ్లీ వాళ్లను తమ కాళ్ల మీద తమను నిలబెట్టేందుకు వారి డ్రీమ్స్ను సాకారం చేస్తూ వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాలు పుట్టాయి. 45 – 60 సంవత్సరాల వయసున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆత్మగౌరవంతో జీవించేలా చేసేందుకు పుట్టింది వైఎస్సార్ చేయూత పథకం. నా కాపు అక్కచెల్లెమ్మల కోసం తెచ్చిన మరో పథకం వైఎస్సార్ కాపు నేస్తం. ఈబీసీ అక్కచెల్లెమ్మల కోసం వైఎస్సార్ ఈబీసీ నేస్తం అనే పథకం. తెచ్చాం. చంద్రబాబు హయాంలో ఏరోజూ ఇలాంటి స్కీములు ఎందుకు లేవు? నాడు ఉన్నదల్లా అక్కచెల్లెమ్మలను మోసం చేయడం, రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రమే. అక్కచెల్లెమ్మల సొంతింటి కల... తమకు సొంత ఇల్లు ఉండాలని ప్రతి అక్కచెల్లెమ్మ కల కంటుంది. కొన్ని కుటుంబాలకు ఇది జీవితకాల కల లాంటిది. వారి డ్రీమ్ను నెరవేరుస్తూ 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మీ బిడ్డ జగన్ ఇచ్చాడు. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. భావోద్వేగానికి గురైన మంత్రి బొత్స... చీపురుపల్లి అభ్యర్ధిగా మంత్రి బొత్స సత్యనారాయణను సీఎం జగన్ పరిచయం చేసిన సందర్భంలో ఉద్వేగ వాతావరణం నెలకొంది. బొత్స తనకు తండ్రి లాంటివారని, ఆయన్ను ఆప్యాయంగా అన్నా అని పిలుస్తానని సీఎం జగన్ చెప్పడంతో బొత్స భావోద్వేగానికి గురయ్యారు. అవ్వాతాతలు.. రైతుల కలలు నెరవేర్చాం ► అవ్వా తాతల డ్రీమ్ ఏమిటో తెలుసా? బాబు హయాంలో మాదిరిగా పెన్షన్ల కోసం క్యూలో నిలబడి తమ ప్రాణాలు అక్కడికక్కడే పోయే పరిస్థితి రాకూడదన్నది వారి డ్రీమ్. ఆ పెన్షన్ సొమ్ము కాస్తంత పెంచి ఇస్తే బాగుంటుందన్నది డ్రీమ్. వారి మనవడు జగన్ తెచ్చిన స్కీమ్ ఏమిటంటే అవ్వాతాతల ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ వలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి రూ.3 వేల పెన్షన్ ఇవ్వడం. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. నాడు చంద్రబాబు ముష్టి వేసినట్లు రూ.వెయ్యి రాష్ట్రంలో 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. ► మీ బిడ్డ వచ్చాక ఇంటివద్దే నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నాడు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 58 నెలల కాలంలో 2.31 లక్షల ఉద్యోగాలు యువతకు ఇచ్చి వారి కలను సాకారం చేశాం. రైతన్నలు కోరుకున్నట్లుగా పంట వేసే సమయానికి పెట్టుబడి సాయం, సమయానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామంలోనే అందచేస్తున్నాం. అమూల్ను తెచ్చి పాడి రైతులకు అండగా నిలిచాం. ఏకంగా 35 లక్షల ఎకరాల భూముల మీద రైతులకు పూర్తి హక్కులు ఇచ్చిందీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. మరి రైతుల గురించి చంద్రబాబు ఏరోజైనా ఆలోచించాడా? నాడూ నేడూ ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్. కానీ చంద్రబాబు హయాంలో డీబీటీలు, బటన్లు నొక్కడం లేవు. మీ పొలాలలో పెట్టే దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చేమో గానీ చంద్రబాబును మాత్రం నమ్మలేమని గుర్తు పెట్టుకోండి. విజయవాడలో కాల్మనీ, సెక్స్ రాకెట్లు నడపటం మినహా బాబు చేసిందేమిటి? మళ్లీ ప్రజల రక్తం తాగడానికి చంద్రముఖిలా మారాడు. జనానికి మంచి చేసిన మీ జగన్పై తోడేళ్లలా దాడి చేస్తున్నారు. మన 58 నెలల పాలనలో జరిగిన మేలుపై మీ కుటుంబమంతా చర్చించుకోవాలి. పిల్లలు, సంక్షేమ పథకాల భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఏకంగా 40 పథకాలు.. ఏ మనిషికైనా, ఏ కుటుంబానికైనా కొన్ని కలలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని నిజం చేసే మార్గాలు ఉంటే ఆ కుటుంబం ఒక్కో మెట్టు ఎదుగుతూ పోతుంది. అలాంటి పేదల కలల్ని అర్ధం చేసుకుని నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? దాదాపుగా 40. ఈ 58 నెలల కాలంలో వాటిని నెరవేర్చేందుకు మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కాడు. ఏకంగా రూ. 2.70 లక్షల కోట్లు నేరుగా అందజేశాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లాయి. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. దీనికి తోడు నాన్ డీబీటీ అంటే ఇళ్లస్థలాలు, విద్యాకానుక, టాబ్స్... ఇవన్నీ కలిపి మరో రూ.లక్ష కోట్లకుపైగా ప్రయోజనాన్ని చేకూర్చాం. ఇలా వాళ్ల డ్రీమ్స్.. మీ బిడ్డ స్కీమ్స్ ద్వారా ఏకంగా రూ. 3.75 లక్షల కోట్లు పై చిలుకు లబ్ధి చేకూర్చాడని చెప్పడానికి గర్వపడుతున్నా. విద్యా విప్లవం.. ప్రతి నిరుపేద తల్లి కలను నిజం చేయడానికే పుట్టింది జగనన్న అమ్మఒడి పథకం. పేద తల్లులు తన పిల్లల భవిష్యత్తు కోసం కనే కలలు గురించి అర్థం చేసుకున్నాను. తమ పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, పెద్ద కంపెనీల్లో ఉద్యోగస్తులుగా చూడాలని, ఉన్నత చదువులు చదివించాలన్న కలల నుంచి పుట్టిన స్కీములతో నాడు – నేడు, ఇంగ్లిష్ మీడియం బడులు, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేశాం. 3వ తరగతి నుంచి గవర్నమెంట్ బడుల్లో టోఫెల్ శిక్షణ, సబ్జెక్టు టీచర్లు, బైజూస్ కంటెంట్, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, క్లాస్ రూముల్లో ఐఎఫ్పీ ప్యానళ్లతో డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టాం. పెద్ద చదువులు చదువుతున్న 93 శాతం మందికి ఈ రోజు విద్యాదీవెనతో లబ్ధి చేకూరుతోంది. డిగ్రీ కరిక్యులమ్లో మార్పులు తీసుకొస్తూ, విదేశీ విశ్వవిద్యాలయాల్లో సర్టిఫైడ్ ఆన్ లైన్ వర్టికల్స్ను మన డిగ్రీలతో అనుసంధానం చేయడం, డిగ్రీలో తప్పనిసరి ఇంటర్న్షిప్ తెచ్చాం. ఇవన్నీ నా అక్కచెల్లెమ్మలు, ఆ పిల్లల డ్రీమ్స్ నుంచి వచ్చిన మీ జగనన్న స్కీమ్స్. అత్యధిక మెజార్టీతో గెలిపించండి... విజయనగరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పరిచయం చేశారు. ఎంపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి, బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థిగా శంబంగి చిన అప్పలనాయుడు,. నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు, రాజాం నుంచి పోటీచేస్తున్న డాక్టరు తలే రాజేష్, గజపతినగరం నుంచి పోటీచేస్తున్న బొత్స అప్పలనరసయ్య, ఎచ్చెర్ల నుంచి పోటీచేస్తున్న గొర్లె కిరణ్ను గొప్ప మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. 2014లో ‘చంద్రముఖి’ మోసాలివీ.. ► రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? ► పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ► ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా? ► ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ► అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? ► రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా? ► మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ► సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ► ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి నిర్మించాడా? విజయనగరంలో ఏమైనా కనిపిస్తోందా? ► పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే అదీ లేదు. ► ఇప్పుడు సూపర్ సిక్స్, సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్ అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు. -
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
రాష్ట్రంలో ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ఇరు వర్గాలూ జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ప్రతిపక్ష కూటమి ముప్పొద్దులా జగన్పై విరుచుకుపడడమే వారి పంథాగా బరిలోకి దిగింది. వారి వైఖరి గమ నిస్తే ఎన్నికలకు ఒకటే అజెండా పెట్టుకున్నట్టున్నారు – జగన్ని వ్యతిరేకించడం! సిద్ధాంతపరంగా కాక కేవలం ఒక వ్యక్తిని వ్యతిరేకించడం ఏమి విధానం? పవన్ కల్యాణ్ వంటి వారైతే ‘జగన్ వ్యతిరేక ఓటు’ అని కొత్త నామ కరణం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే ఒక నిర్వచనం ఉంది. ‘జగన్ వ్యతిరేక ఓటు’ ఏంటి? జగన్ అమలు చేసిన సంక్షేమ వ్యతిరేక ఓటా? మరి అదే వారి ఉద్దేశం అయితే ‘మేము ప్రభుత్వం నెలకొల్పితే జగన్ సంక్షేమ పథకాలు రద్దు చేస్తాం’ అని చెప్పే ధైర్యం చేయగలరా? పైపెచ్చు వారు ‘సూపర్ సిక్స్’ పేరుతో సంక్షేమ పథకాలు ప్రకటించారు. అంటే వీరు చేస్తే గొప్ప, జగన్ చేస్తే ఖజానా కుప్పకూలుటా? ఇదెక్కడి తర్కం? చంద్రబాబు నాయుడు ప్రతి సభలోనూ ‘ఈ దుర్మార్గుడు’ అని జగన్పై అక్కసు వెళ్లగక్కడం తనలోని కార్పణ్యానికి తార్కాణం. డీబీటీ పద్ధతి ద్వారా ప్రజల డబ్బుని లక్షల కోట్ల రూపాయల మేర పేద ప్రజలకే చేర్చడం దుర్మార్గమా? అదే అయితే బాబు పదే పదే ‘నేను వస్తే ఆడబిడ్డకు 15,000 చొప్పున మీ బ్యాంకు ఖాతాలలో వేస్తాను అనే ‘దుర్మార్గ’పు హామీ ఎందుకు ఇస్తున్నారు? అంటే, ‘జగన్ వ్యతిరేక ఓటు’ రాబట్టడానికి కూటమి దగ్గర ఉన్న ప్రణాళిక... అదే సంక్షేమం అనే మందుని కొత్త సీసాలో అమ్మదలచటమా? ‘జగన్ వ్యతిరేక ఓటు’ అంటే ఎక్కువగా యెల్లో మీడియా ప్రభావంతో నిజాన్ని చూడలేకపోతున్న వారి ఓటు. నిజానికి ‘జగన్ వ్యతిరేక ఓటు’ అనే నినాదంతో వెళ్ళడం లోనే భావదారిద్య్రం కనిపిస్తుంది. నిబద్ధత ఉన్న ప్రతిపక్షం అయితే వారు వేరేగా ఏమి చేస్తారో చెప్పాలి. 14 ఏళ్లు వెలగబెట్టి చేయని మేలు ఈ రోజు కొత్తగా చేస్తాము అంటే జనం నమ్మే పరి స్థితి లేదు. గత 10 ఏళ్లు కేంద్రంలో తిరుగులేని ఆధిక్యంతో ప్రభుత్వాన్ని నడుపుతూ కూడా ఆంధ్ర ప్రదేశ్కు ఇవ్వవలిసిన ప్రత్యేక హోదా ఇవ్వని బీజే పీతో కూటమి ఏర్పరిచి, ఈసారి గెలిచేది మళ్ళీ మోదీ కాబట్టి మమ్మలిని గెలిపించండి అనడం దివాళాకోరుతనానికి పరాకాష్ఠ. ఈ మధ్య జరుగుతున్న సభల్లో చంద్రబాబు రైతులపై వల్లమాలిన ప్రేమ వొలకపోస్తుంటే జుగుప్స కలుగుతోంది. ‘ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోడానికి తప్ప పనికిరావు’ అని బాబు ఎద్దేవా చేయలేదా? ఆలూరు సభలో పత్తి రైతులకు మేలు చేస్తాను అని బాబు అంటుంటే అప్పట్లో ఇదే రైతుల ఇళ్లలోకి ప్రభుత్వమే చొరబడి బకాయిలకు బదులుగా వంట పాత్రలు, గిన్నెలు జప్తు చేసిన వైనం గుర్తుకొస్తుంది. ఒక పక్క నోరు విప్పితే ఆడవారిని కించ పరిచి, హత్యారోపణలు ఎదుర్కొని మతి స్థిమితం లేదనే నెపంతో చట్టానికి దొరక్కుండా బయట పడ్డ బాల కృష్ణ, మరో పక్క సొంత పార్టీకి చెందిన బహుజన నాయకులను కాలరాస్తూ బాబు బినామీలు అయిన వారికి తన పార్టీ సీట్లు కట్టబెట్టిన పవన్ తారా శక్తి చాలక సరికొత్తగా చిరంజీవి కూడా కూటమి కుంపట్లో కాలు పెట్టారు. చిరంజీవి అప్పట్లో ఒక బలమైన ప్రత్యా మ్నాయం కోసం కృషి చేసి, ఓర్పు లేక కేంద్ర మంత్రి పదవి కోసం కాంగ్రెస్ దరిచేరి, దాన్ని పూర్తిగా అనుభవించి ఇప్పుడు కాషాయ మాత్రలు మింగుతూ సీఎం రమేశ్ లాంటి వారి కోసం ప్రత్యేక వీడియో సందే శాలు ఇస్తున్నారు. ఇంకో అడుగు ముందు కేసి చంద్రబాబు తన తమ్ముడితో కలిసి కూటమి ఏర్పాటు చేయడం రాష్ట్రానికి మేలు అని చెప్ప డంతో, అదే కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసిన పురందేశ్వరిలానే ఈయన కూడా ఏ ఎండకి ఆ గొడుగు పట్టే ఫక్తు రాజకీయ కళాకారుడు అని తేలిపోయింది. ఇలాంటి విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని ప్రజలు తిరస్కరిస్తారని ఆశిద్దాము. డా‘‘ జి. నవీన్ వ్యాసకర్త సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకులు ‘ naveen.prose@gmail.com -
తమ్ముడే అనుకుంటే.. అన్నయ్య కూడా అంతేనా..!?
ఎవరైనా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటారు. అందులోను సమాజంలో ప్రముఖులుగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అప్రతిష్టపాలవుతారు. కానీ ఆర్దిక, రాజకీయ సంబంధాలు పెనవేసుకుపోయినప్పుడు కొందరు సెలబ్రిటీలు సైతం తమ వ్యక్తిత్వాన్ని వదలుకుని దిగజారడం సామాన్యులను ఆశ్చర్యపరుస్తుంది. ఇదంతా మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గురించే చెబుతున్నది. ఆయన అంటే అందరికి గౌరవమే. ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది. కానీ అందుకు విరుద్దంగా ఆయన ప్రవర్తిస్తే అభిమానగణం అప్సెట్ అవుతుంది. ప్రస్తుతం చిరంజీవి అలాగే వ్యవహరించారు. ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని పలుమార్లు చెప్పిన చిరంజీవి సడన్గా మాట మార్చి ఏపీ రాజకీయాలలో వేలు పెట్టారు. పోనీ అదేదో ఏదైనా రాజకీయ పార్టీలో పోటీచేసిన సామాన్యులకు మద్దతు ఇస్తే ఆయనకు పేరే వచ్చేది. ఏ పార్టీలో ఉన్న పేదలకైనా తన అండ ఉంటుందని చెబితే ఆయనకు కీర్తి వచ్చేది. కానీ ఆయన ఒక పెద్ద పెత్తందారీకి, ఆర్దిక నేరాభియోగాలు ఉన్న వ్యక్తికి సహకారం అందిస్తున్నట్లు ప్రకటించితే జనం ఏమని అనుకుంటారు. ఆయనకు ఈపాటి ఆలోచన రాకపోయిందా! అవును! కొన్ని సబంధాల ముందు అవేవి కనపించకపోవచ్చు. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పక్షాలు కలిసి కూటమి కట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో టీడీపీకి చెందిన సీ.ఎం. రమేష్ వ్యూహాత్మకంగా బీజేపీలోకి వెళ్లి, ఇప్పుడు అనకాపల్లిలో లోక్ సభ సీటుకు కూడా పోటీచేస్తున్నారు. బహుశా చిరంజీవి, రమేష్లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది. అదేదో ఢిల్లీ స్థాయిలో కనుక ఎవరి దృష్టికి రాలేదు. కానీ ఎన్నికల నేపథ్యంలో సీ.ఎం. రమేష్ కొద్ది రోజుల క్రితం చిరంజీవి ఇంటికి వెళ్లడం, అక్కడ సంప్రదింపులు జరిపి చిరంజీవి తనకు మద్దతు ప్రకటించేలా చేసుకున్నారు. సీ.ఎం. రమేష్ పలు ఆర్ధిక నేరాభియాలు ఎదుర్కుంటున్నారు. తాజాగా ఒక సినీ నటుడు వేణు ఈయనపై 450 కోట్ల రూపాయల మేర ఫోర్జరీ చేసి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన రమేష్ గురించి చిరంజీవికి ఏమీ తెలియకుండా సంఘీభావం ప్రకటించి ఉంటారా? అన్న సందేహం రావచ్చు. తన సోదరుడు పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని, ఆ తర్వాత బీజేపీని కూడా కలుపుకున్నారు. ఈ పొత్తులో పవన్ కల్యాణ్ ధోరణి చూసి పలువురు జనసేన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అది వేరే కథ. పవన్ కల్యాణ్ సొంతంగా పార్టీ పెట్టి 2014లో చంద్రబాబు కోసం పనిచేసినా చిరంజీవి వారితో కలవలేదు. అప్పట్లో ఈయన కాంగ్రెస్ నేతగా ఉండేవారు. చంద్రబాబును విమర్శిస్తూ కొన్ని ప్రకటనలు కూడా చేశారు. ప్రత్యేకించి హిందుపూర్ లో ముస్లిం అభ్యర్ధికి కాకుండా బాలకృష్ణకు సీటు ఇవ్వడాన్ని చిరంజీవి తప్పు పట్టారు. ఆ తర్వాత రోజుల్లో రాజకీయాలకు దూరం అయి సినిమాలపైనే దృష్టి పెడతామని ప్రకటించారు. అలాగే ఉంటారులే అనుకుంటే సడన్గా ఇప్పుడు కూటమి అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా తాను కూడా పెత్తందారులలో భాగమేనని చిరంజీవి రుజువు చేసుకున్నారు. ఈయన నటించిన పలు సినిమాలు చూసి చాలామంది అభిమానులు ఏర్పడ్డారు. ఆ సినిమాల వల్ల స్పూర్తిపొంది చిరంజీవి అంటే అంత గొప్పవాడు.. ఇంత గొప్పవాడు అని భావిస్తుంటారు. ఆయన ఠాగూర్ సినిమాలో నటిస్తే, ఈయన అంత గొప్ప నిజాయితీపరుడు అని అభిమానులు అంతా సంతోషించారు. రుద్రవీణ వంటి ప్రోగ్రెసివ్ సినిమాలో హీరోగా నటించి ఆదర్శవాది అనిపించుకున్నారు. పేదల తరపున పనిచేసే నేతగా, మద్యపానాన్ని వ్యతిరేకించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. తీరా వాస్తవ ప్రపంచంలోకి చూస్తే చిరంజీవి అందుకు భిన్నంగా కనిపించడం ఆయన అభిమానులకు ఆవేదన కలిగిస్తుంది. సీ.ఎం.రమేష్ సారా వ్యాపారంతో జీవితాన్ని మొదలుపెట్టి కాంట్రాక్టర్ అవతారం ఎత్తి, రాజకీయాలలోకి వచ్చి వేల కోట్లకు అధిపతి అయ్యారు. రమేష్ బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల విరాళం ఇచ్చి సంచలనం సృష్టించారు. సొంతంగా విమానం కొని ఆయా పార్టీలవారిని అందులో తిప్పే స్థాయికి ఎదిగారు. అది చట్టబద్దంగా, న్యాయబద్దంగా చేస్తే మంచిదే. కానీ సీ.ఎం. రమేష్ నడిపిన లావాదేవీల గురించి చిరంజీవికి తెలియవని అనుకుంటే పొరపాటే అవుతుంది. కానీ ఏదో ఆతీత సంబంధం ఏర్పడి ఉండాలి. అందుకే రమేష్కు అనుకూలంగా చిరంజీవి ఏకంగా వీడియో రిలీజ్ చేశారు. దీంతో చిరంజీవి తన పరువు తానే పొగొట్టుకున్నారు. ప్రజల దృష్టిలో పలచన అయ్యారు. చిరంజీవి ఎన్నికలలో పోటీచేస్తున్న ఒక టిప్పర్ డ్రైవర్కు అనుకూలంగా మాట్లాడితే శభాష్ అనిపపించుకునేవారు. ఒక ఉపాధి హామీ కూలి ఈ ఎన్నికలలో పోటీచేస్తున్నారు. ఆయనకు సంఘీభావం చెప్పి ఉంటే అంతా మెచ్చుకునేవారు. కానీ ఆర్ధిక నేరారోపణలు ఉన్న బీజేపీ అభ్యర్ధులకు చిరంజీవి మద్దతు ఇవ్వడం అంటే ఆయన మాటలకు, చేతలకు ఉన్న తేడా తెలియచేస్తుంది. అసలు చిరంజీవి కాంగ్రెస్కు రాజీనామా చేశారా? ఆ పార్టీ నేతలు కొందరు ఈయన కాంగ్రెస్కు ప్రచారం చేస్తారని చెప్పారు.. కానీ ఈయనేమో బీజేపీ కూటమి అభ్యర్ధికి భజన చేస్తున్నారు. ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే చిరంజీవి సినిమాల సంగతి ఎలా ఉన్నా, రాజకీయాలలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలే తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు చిరంజీవి ఎక్కడకు వెళ్లినా వేలు, లక్షల సంఖ్యలో అభిమానులు తరలివచ్చేవారు. దానిని చూసి ఆయన రాజకీయాలలోకి రావాలని ఆలోచన చేశారు. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటే అదో రకంగా ఉండేది. కానీ రాజకీయాలలోకి వచ్చేది, రానిది చెప్పకుండా దాగుడుమూతలు ఆడేవారు.ఏదో వేరు పేరుతో సంస్థ పెట్టి కార్యకలాపాలు నిర్వహించి, తన బావమరిది అరవింద్ను ముందు పెట్టి కథ నడిపారు. ఆయా పార్టీలలోని నేతలు, ముఖ్యంగా తన సామాజికవర్గంవారు అంతా చిరంజీవి రాజకీయాలలోకి రావాలని కోరుతున్నట్లు ప్రకటనలు చేసేవారు. వారంతా కోరితే వస్తున్నట్లు కనిపించాలన్నది ఈయన ఉద్దేశం కావచ్చు. కానీ ఆ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చిరంజీవి గురించి, ఆయన పెట్టబోయే పక్షం గురించి వ్యతిరేక ప్రచారం చేసేశాయి. దాంతో ఆదిలోనే హంసపాదు మాదిరి ఆయన పార్టీకి విఘ్నాలు ఎదురయ్యేయి. ఆయన ఎట్టకేలకు చిరంజీవి తిరుపతిలో ఒక భారీ సభ పెట్టి ప్రజారాజ్యం పార్టీని అనౌన్స్ చేశారు. పార్టీ అయితే పెట్టారు కానీ, దానికి తగ్గ వ్యూహాలు, ఎజండాను సిద్ధం చేసుకోలేకపోయారు. తొలి రోజుల్లో ఈ పార్టీ వల్ల కాంగ్రెస్కు దెబ్బతగులుందని అనుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆయనకు బాగానే ప్రచారం చేశాయి. కానీ దానివల్ల తెలుగుదేశంకు నష్టం వాటిల్లుతోందని అంచనాకు వచ్చిన ఆ మీడియా వెంటనే ప్లేట్ ఫిరాయించి ప్రజారాజ్యాన్ని, చిరంజీవిని గబ్బు పట్టించేవి. ఇది కేవలం కాపుల పార్టీ అన్న ముద్రవేశారు. దానిని ఎదుర్కునే సత్తా ప్రజారాజ్యానికి లేకుండా పోయింది. తన బావమరిది అల్లు అరవింద్కు ప్రాధాన్యం ఇవ్వడం, ఆర్దిక విషయాలలో కొన్ని విమర్శలు వచ్చేలా చిరంజీవి వ్యవహరించారని అంటారు. టీడీపీ అయితే చిరంజీవి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ప్రచారం చేసేది. టిక్కెట్లు రాని కొందరు అదే తరహా ఆరోపణలు చేసేవారు. చంద్రబాబు నాయుడు తన కోవర్టులను కొందరిని ముందుగానే ప్రజారాజ్యంలో ప్రవేశపెట్టి, తర్వాత వారిని బయటకు తీసుకు వచ్చి తిట్టించేవారు. ఇదే చిరంజీవికి పెద్ద సమస్యగా ఉండేది. ఆ రోజుల్లో సీపీఐ, సీపీఎంలతో కలిసి పొత్తు పెట్టుకోవాలని చిరంజీవి ఆలోచన చేశారు. కానీ దానిని పడనివ్వకుండా వామపక్ష జాతీయ నేతలను చంద్రబాబు మేనేజ్ చేయగలిగారు. టిక్కెట్ల కేటాయింపులో అవకతవకలు తదితర కారణాల వల్ల ప్రజారాజ్యం ఎన్నికలకు ముందే చతికిలపడింది. చివరికి ఉమ్మడి ఏపీలో పద్దెనిమిది సీట్లకే పరిమితం అవడం కాకుండా, చిరంజీవే రెండు చోట్ల పోటీచేసి ఒక చోట ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ నడపడంలో తడబడ్డారు. ఆ దశలో జెండా పీకేద్దాం అని చిరంజీవి భావిస్తున్నారని ఈనాడు మీడియా ఒక పెద్ద కథనాన్ని ప్రచురించింది. అది చూసి చిరంజీవి చాలా బాధపడ్డారు. తదుపరి అప్పట్లో జరిగిన వివిధ పరిణామాలలో కాంగ్రెస్కు దగ్గరయ్యారు. అనూహ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులను తనకు అనుకకూలంగా మలచుకోవడంలో విఫలం అయిన ఈయన తనపార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, రాజ్యసభకు వెళ్లి కేంద్రంలో ఒక సహాయ మంత్రి పదవి పొంది సంతృప్తి చెందారు. కానీ 2014లో కాంగ్రెస్ ఓడిపోవడంతో చిరంజీవి మళ్లీ సినిమాలపైనే దృస్టి పెడతామని అన్నారు. ఇంతలో తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేనను ప్రకటించినా ఈయన పట్టించుకోలేదు. ఎవరి రాజకీయాలు వారివే అన్నట్లు వ్యవహరించారు. 2019లో పవన్ కల్యాణ్ సొంతంగా ఒక కూటమి పెట్టుకుని రెండు నియోజకవర్గాలలో పోటీచేసి ఓడిపోయారు. అప్పుడు కూడా చిరంజీవి పెద్దగా స్పందించలేదు. వైఎస్సార్సీపీ గెలిచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చిరంజీవి సత్సంబంధాలు కొనసాగించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఆయనకు విశేష గౌరవాన్ని ఇచ్చారు. సినిమా సమస్యలపై చర్చలు జరపడానికి ఒక బృందాన్ని తీసుకువెళ్లారు. ఆ సందర్భంలో చిరంజీవిని అవమానించేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు వ్యాఖ్యానించినా పట్టించుకోలేదు. ఈ విషయాలన్ని చూసినవారు ఇక చిరంజీవి రాజీకీయాల జోలికి రారని అనుకుంటే పవన్ కల్యాణ్కు ఐదు కోట్ల చెక్ ఇచ్చి దానికి ప్రచారం కల్పించారు. బహుశా పవన్ వైపు నుంచి ఏదో ఒత్తిడి వచ్చి ఉండాలి. ఆ తర్వాత సీ.ఎం. రమేష్ ఉదంతంతో చిరంజీవి తన ప్రతిష్టను కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఠాగూర్, రుద్రవీణ వంటి సినిమాలలో చిరంజీవి చేసింది నటనేనని, రియల్ జీవితంలో ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారని అభిమానులంతా అనుకునే పరిస్థితి తెచ్చారు. కాపు సామాజికవర్గం ఒకసారి చిరంజీవిని నమ్మి, తదుపరి పవన్ కల్యాణ్ను నమ్మి మోసపోయిందన్న అభిప్రాయం ఉంది. పవన్ కల్యాణ్ ఇప్పటికీ వారిని మోసం చేయడానికి విశ్వయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పూర్తిగా సరెండర్ అయి జనసేన ఉనికినే నాశనం చేసుకున్న పవన్ కల్యాణ్కు చిరంజీవి మద్దతు ఇచ్చినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. కాంగ్రెస్కు రాజీనామా చేయకుండా బీజేపీకి ఎందుకు సంఘీభావం ప్రకటించారని ఆలోచిస్తే కొందరు ఇది పద్మవిభూషణ్ బిరుదు ఇచ్చినదానికి ప్రతిఫలం అని అంటున్నారు. మరి కొందరు అదే కారణం అయితే కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి బీజేపీలో నేరుగా చేరి ఉండేవారన్నది మరికొందరి భావన. కేవలం సీ.ఎం. రమేష్ను పక్కన కూర్చోబెట్టుకుని ఆయన కోసం వీడియో చేయడం కేవలం వ్యక్తిగత కారణాలే అయి ఉండవచ్చన్నది మరికొందరి భావన. ఏది ఏమైనా చిరంజీవి చేసింది తప్పు. అనైతికం, పరువు కోల్పోయే విషయం అని అంతా ఒప్పుకుంటున్నారు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019