breaking news
Ad - Sakshi_Home_Sticky
-
తమ్ముడే అనుకుంటే.. అన్నయ్య కూడా అంతేనా..!?
ఎవరైనా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటారు. అందులోను సమాజంలో ప్రముఖులుగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అప్రతిష్టపాలవుతారు. కానీ ఆర్దిక, రాజకీయ సంబంధాలు పెనవేసుకుపోయినప్పుడు కొందరు సెలబ్రిటీలు సైతం తమ వ్యక్తిత్వాన్ని వదలుకుని దిగజారడం సామాన్యులను ఆశ్చర్యపరుస్తుంది. ఇదంతా మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గురించే చెబుతున్నది. ఆయన అంటే అందరికి గౌరవమే. ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది. కానీ అందుకు విరుద్దంగా ఆయన ప్రవర్తిస్తే అభిమానగణం అప్సెట్ అవుతుంది. ప్రస్తుతం చిరంజీవి అలాగే వ్యవహరించారు. ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని పలుమార్లు చెప్పిన చిరంజీవి సడన్గా మాట మార్చి ఏపీ రాజకీయాలలో వేలు పెట్టారు. పోనీ అదేదో ఏదైనా రాజకీయ పార్టీలో పోటీచేసిన సామాన్యులకు మద్దతు ఇస్తే ఆయనకు పేరే వచ్చేది. ఏ పార్టీలో ఉన్న పేదలకైనా తన అండ ఉంటుందని చెబితే ఆయనకు కీర్తి వచ్చేది. కానీ ఆయన ఒక పెద్ద పెత్తందారీకి, ఆర్దిక నేరాభియోగాలు ఉన్న వ్యక్తికి సహకారం అందిస్తున్నట్లు ప్రకటించితే జనం ఏమని అనుకుంటారు. ఆయనకు ఈపాటి ఆలోచన రాకపోయిందా! అవును! కొన్ని సబంధాల ముందు అవేవి కనపించకపోవచ్చు. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పక్షాలు కలిసి కూటమి కట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో టీడీపీకి చెందిన సీ.ఎం. రమేష్ వ్యూహాత్మకంగా బీజేపీలోకి వెళ్లి, ఇప్పుడు అనకాపల్లిలో లోక్ సభ సీటుకు కూడా పోటీచేస్తున్నారు. బహుశా చిరంజీవి, రమేష్లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది. అదేదో ఢిల్లీ స్థాయిలో కనుక ఎవరి దృష్టికి రాలేదు. కానీ ఎన్నికల నేపథ్యంలో సీ.ఎం. రమేష్ కొద్ది రోజుల క్రితం చిరంజీవి ఇంటికి వెళ్లడం, అక్కడ సంప్రదింపులు జరిపి చిరంజీవి తనకు మద్దతు ప్రకటించేలా చేసుకున్నారు. సీ.ఎం. రమేష్ పలు ఆర్ధిక నేరాభియాలు ఎదుర్కుంటున్నారు. తాజాగా ఒక సినీ నటుడు వేణు ఈయనపై 450 కోట్ల రూపాయల మేర ఫోర్జరీ చేసి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన రమేష్ గురించి చిరంజీవికి ఏమీ తెలియకుండా సంఘీభావం ప్రకటించి ఉంటారా? అన్న సందేహం రావచ్చు. తన సోదరుడు పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని, ఆ తర్వాత బీజేపీని కూడా కలుపుకున్నారు. ఈ పొత్తులో పవన్ కల్యాణ్ ధోరణి చూసి పలువురు జనసేన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అది వేరే కథ. పవన్ కల్యాణ్ సొంతంగా పార్టీ పెట్టి 2014లో చంద్రబాబు కోసం పనిచేసినా చిరంజీవి వారితో కలవలేదు. అప్పట్లో ఈయన కాంగ్రెస్ నేతగా ఉండేవారు. చంద్రబాబును విమర్శిస్తూ కొన్ని ప్రకటనలు కూడా చేశారు. ప్రత్యేకించి హిందుపూర్ లో ముస్లిం అభ్యర్ధికి కాకుండా బాలకృష్ణకు సీటు ఇవ్వడాన్ని చిరంజీవి తప్పు పట్టారు. ఆ తర్వాత రోజుల్లో రాజకీయాలకు దూరం అయి సినిమాలపైనే దృష్టి పెడతామని ప్రకటించారు. అలాగే ఉంటారులే అనుకుంటే సడన్గా ఇప్పుడు కూటమి అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా తాను కూడా పెత్తందారులలో భాగమేనని చిరంజీవి రుజువు చేసుకున్నారు. ఈయన నటించిన పలు సినిమాలు చూసి చాలామంది అభిమానులు ఏర్పడ్డారు. ఆ సినిమాల వల్ల స్పూర్తిపొంది చిరంజీవి అంటే అంత గొప్పవాడు.. ఇంత గొప్పవాడు అని భావిస్తుంటారు. ఆయన ఠాగూర్ సినిమాలో నటిస్తే, ఈయన అంత గొప్ప నిజాయితీపరుడు అని అభిమానులు అంతా సంతోషించారు. రుద్రవీణ వంటి ప్రోగ్రెసివ్ సినిమాలో హీరోగా నటించి ఆదర్శవాది అనిపించుకున్నారు. పేదల తరపున పనిచేసే నేతగా, మద్యపానాన్ని వ్యతిరేకించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. తీరా వాస్తవ ప్రపంచంలోకి చూస్తే చిరంజీవి అందుకు భిన్నంగా కనిపించడం ఆయన అభిమానులకు ఆవేదన కలిగిస్తుంది. సీ.ఎం.రమేష్ సారా వ్యాపారంతో జీవితాన్ని మొదలుపెట్టి కాంట్రాక్టర్ అవతారం ఎత్తి, రాజకీయాలలోకి వచ్చి వేల కోట్లకు అధిపతి అయ్యారు. రమేష్ బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల విరాళం ఇచ్చి సంచలనం సృష్టించారు. సొంతంగా విమానం కొని ఆయా పార్టీలవారిని అందులో తిప్పే స్థాయికి ఎదిగారు. అది చట్టబద్దంగా, న్యాయబద్దంగా చేస్తే మంచిదే. కానీ సీ.ఎం. రమేష్ నడిపిన లావాదేవీల గురించి చిరంజీవికి తెలియవని అనుకుంటే పొరపాటే అవుతుంది. కానీ ఏదో ఆతీత సంబంధం ఏర్పడి ఉండాలి. అందుకే రమేష్కు అనుకూలంగా చిరంజీవి ఏకంగా వీడియో రిలీజ్ చేశారు. దీంతో చిరంజీవి తన పరువు తానే పొగొట్టుకున్నారు. ప్రజల దృష్టిలో పలచన అయ్యారు. చిరంజీవి ఎన్నికలలో పోటీచేస్తున్న ఒక టిప్పర్ డ్రైవర్కు అనుకూలంగా మాట్లాడితే శభాష్ అనిపపించుకునేవారు. ఒక ఉపాధి హామీ కూలి ఈ ఎన్నికలలో పోటీచేస్తున్నారు. ఆయనకు సంఘీభావం చెప్పి ఉంటే అంతా మెచ్చుకునేవారు. కానీ ఆర్ధిక నేరారోపణలు ఉన్న బీజేపీ అభ్యర్ధులకు చిరంజీవి మద్దతు ఇవ్వడం అంటే ఆయన మాటలకు, చేతలకు ఉన్న తేడా తెలియచేస్తుంది. అసలు చిరంజీవి కాంగ్రెస్కు రాజీనామా చేశారా? ఆ పార్టీ నేతలు కొందరు ఈయన కాంగ్రెస్కు ప్రచారం చేస్తారని చెప్పారు.. కానీ ఈయనేమో బీజేపీ కూటమి అభ్యర్ధికి భజన చేస్తున్నారు. ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే చిరంజీవి సినిమాల సంగతి ఎలా ఉన్నా, రాజకీయాలలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలే తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు చిరంజీవి ఎక్కడకు వెళ్లినా వేలు, లక్షల సంఖ్యలో అభిమానులు తరలివచ్చేవారు. దానిని చూసి ఆయన రాజకీయాలలోకి రావాలని ఆలోచన చేశారు. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటే అదో రకంగా ఉండేది. కానీ రాజకీయాలలోకి వచ్చేది, రానిది చెప్పకుండా దాగుడుమూతలు ఆడేవారు.ఏదో వేరు పేరుతో సంస్థ పెట్టి కార్యకలాపాలు నిర్వహించి, తన బావమరిది అరవింద్ను ముందు పెట్టి కథ నడిపారు. ఆయా పార్టీలలోని నేతలు, ముఖ్యంగా తన సామాజికవర్గంవారు అంతా చిరంజీవి రాజకీయాలలోకి రావాలని కోరుతున్నట్లు ప్రకటనలు చేసేవారు. వారంతా కోరితే వస్తున్నట్లు కనిపించాలన్నది ఈయన ఉద్దేశం కావచ్చు. కానీ ఆ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చిరంజీవి గురించి, ఆయన పెట్టబోయే పక్షం గురించి వ్యతిరేక ప్రచారం చేసేశాయి. దాంతో ఆదిలోనే హంసపాదు మాదిరి ఆయన పార్టీకి విఘ్నాలు ఎదురయ్యేయి. ఆయన ఎట్టకేలకు చిరంజీవి తిరుపతిలో ఒక భారీ సభ పెట్టి ప్రజారాజ్యం పార్టీని అనౌన్స్ చేశారు. పార్టీ అయితే పెట్టారు కానీ, దానికి తగ్గ వ్యూహాలు, ఎజండాను సిద్ధం చేసుకోలేకపోయారు. తొలి రోజుల్లో ఈ పార్టీ వల్ల కాంగ్రెస్కు దెబ్బతగులుందని అనుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆయనకు బాగానే ప్రచారం చేశాయి. కానీ దానివల్ల తెలుగుదేశంకు నష్టం వాటిల్లుతోందని అంచనాకు వచ్చిన ఆ మీడియా వెంటనే ప్లేట్ ఫిరాయించి ప్రజారాజ్యాన్ని, చిరంజీవిని గబ్బు పట్టించేవి. ఇది కేవలం కాపుల పార్టీ అన్న ముద్రవేశారు. దానిని ఎదుర్కునే సత్తా ప్రజారాజ్యానికి లేకుండా పోయింది. తన బావమరిది అల్లు అరవింద్కు ప్రాధాన్యం ఇవ్వడం, ఆర్దిక విషయాలలో కొన్ని విమర్శలు వచ్చేలా చిరంజీవి వ్యవహరించారని అంటారు. టీడీపీ అయితే చిరంజీవి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ప్రచారం చేసేది. టిక్కెట్లు రాని కొందరు అదే తరహా ఆరోపణలు చేసేవారు. చంద్రబాబు నాయుడు తన కోవర్టులను కొందరిని ముందుగానే ప్రజారాజ్యంలో ప్రవేశపెట్టి, తర్వాత వారిని బయటకు తీసుకు వచ్చి తిట్టించేవారు. ఇదే చిరంజీవికి పెద్ద సమస్యగా ఉండేది. ఆ రోజుల్లో సీపీఐ, సీపీఎంలతో కలిసి పొత్తు పెట్టుకోవాలని చిరంజీవి ఆలోచన చేశారు. కానీ దానిని పడనివ్వకుండా వామపక్ష జాతీయ నేతలను చంద్రబాబు మేనేజ్ చేయగలిగారు. టిక్కెట్ల కేటాయింపులో అవకతవకలు తదితర కారణాల వల్ల ప్రజారాజ్యం ఎన్నికలకు ముందే చతికిలపడింది. చివరికి ఉమ్మడి ఏపీలో పద్దెనిమిది సీట్లకే పరిమితం అవడం కాకుండా, చిరంజీవే రెండు చోట్ల పోటీచేసి ఒక చోట ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ నడపడంలో తడబడ్డారు. ఆ దశలో జెండా పీకేద్దాం అని చిరంజీవి భావిస్తున్నారని ఈనాడు మీడియా ఒక పెద్ద కథనాన్ని ప్రచురించింది. అది చూసి చిరంజీవి చాలా బాధపడ్డారు. తదుపరి అప్పట్లో జరిగిన వివిధ పరిణామాలలో కాంగ్రెస్కు దగ్గరయ్యారు. అనూహ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులను తనకు అనుకకూలంగా మలచుకోవడంలో విఫలం అయిన ఈయన తనపార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, రాజ్యసభకు వెళ్లి కేంద్రంలో ఒక సహాయ మంత్రి పదవి పొంది సంతృప్తి చెందారు. కానీ 2014లో కాంగ్రెస్ ఓడిపోవడంతో చిరంజీవి మళ్లీ సినిమాలపైనే దృస్టి పెడతామని అన్నారు. ఇంతలో తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేనను ప్రకటించినా ఈయన పట్టించుకోలేదు. ఎవరి రాజకీయాలు వారివే అన్నట్లు వ్యవహరించారు. 2019లో పవన్ కల్యాణ్ సొంతంగా ఒక కూటమి పెట్టుకుని రెండు నియోజకవర్గాలలో పోటీచేసి ఓడిపోయారు. అప్పుడు కూడా చిరంజీవి పెద్దగా స్పందించలేదు. వైఎస్సార్సీపీ గెలిచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చిరంజీవి సత్సంబంధాలు కొనసాగించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఆయనకు విశేష గౌరవాన్ని ఇచ్చారు. సినిమా సమస్యలపై చర్చలు జరపడానికి ఒక బృందాన్ని తీసుకువెళ్లారు. ఆ సందర్భంలో చిరంజీవిని అవమానించేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు వ్యాఖ్యానించినా పట్టించుకోలేదు. ఈ విషయాలన్ని చూసినవారు ఇక చిరంజీవి రాజీకీయాల జోలికి రారని అనుకుంటే పవన్ కల్యాణ్కు ఐదు కోట్ల చెక్ ఇచ్చి దానికి ప్రచారం కల్పించారు. బహుశా పవన్ వైపు నుంచి ఏదో ఒత్తిడి వచ్చి ఉండాలి. ఆ తర్వాత సీ.ఎం. రమేష్ ఉదంతంతో చిరంజీవి తన ప్రతిష్టను కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఠాగూర్, రుద్రవీణ వంటి సినిమాలలో చిరంజీవి చేసింది నటనేనని, రియల్ జీవితంలో ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారని అభిమానులంతా అనుకునే పరిస్థితి తెచ్చారు. కాపు సామాజికవర్గం ఒకసారి చిరంజీవిని నమ్మి, తదుపరి పవన్ కల్యాణ్ను నమ్మి మోసపోయిందన్న అభిప్రాయం ఉంది. పవన్ కల్యాణ్ ఇప్పటికీ వారిని మోసం చేయడానికి విశ్వయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పూర్తిగా సరెండర్ అయి జనసేన ఉనికినే నాశనం చేసుకున్న పవన్ కల్యాణ్కు చిరంజీవి మద్దతు ఇచ్చినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. కాంగ్రెస్కు రాజీనామా చేయకుండా బీజేపీకి ఎందుకు సంఘీభావం ప్రకటించారని ఆలోచిస్తే కొందరు ఇది పద్మవిభూషణ్ బిరుదు ఇచ్చినదానికి ప్రతిఫలం అని అంటున్నారు. మరి కొందరు అదే కారణం అయితే కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి బీజేపీలో నేరుగా చేరి ఉండేవారన్నది మరికొందరి భావన. కేవలం సీ.ఎం. రమేష్ను పక్కన కూర్చోబెట్టుకుని ఆయన కోసం వీడియో చేయడం కేవలం వ్యక్తిగత కారణాలే అయి ఉండవచ్చన్నది మరికొందరి భావన. ఏది ఏమైనా చిరంజీవి చేసింది తప్పు. అనైతికం, పరువు కోల్పోయే విషయం అని అంతా ఒప్పుకుంటున్నారు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
April 20th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
-
బాబు గురి గులకరాయిపైనే!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘ఎన్నికలకు ఇక 25 రోజులే ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ న గారా కూడా మోగింది. ఇంటింటి ఆత్మగౌరవాన్ని, పేదలు, అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న మనందరి ప్రభుత్వానికి మద్దతు పలికేందుకు మీరంతా సిద్ధమేనా? జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు దాకా పెత్తందార్ల దోపిడీకి, మనందరి పేదల పక్షపాత ప్రభుత్వానికి మధ్య ఈరోజు క్లాస్వార్ జరుగుతోంది. చంద్రబాబు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే మంచి పనిగానీ, పథకాలుగానీ ఒక్కటీ లేవు కాబట్టే నాపై వేయించటానికి బాబుకు, ఆయన కూటమికి చివరకు గులక రాళ్లే మిగిలాయి. ఈ యుద్ధంలో ఆ పేదల వ్యతిరేక కూటమిని చిత్తుగా ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? మరోసారి జైత్రయాత్రకు సింహగర్జనతో సిద్ధం కావాలి. ఫ్యాన్కు 2 ఓట్లు వేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం’’అని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్లో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో భారీ జనసందోహాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. పసుపు పతి నిద్ర లేస్తాడు.. జాగ్రత్త! అభిమాన సముద్రంగా మారిన వరద గోదావరి ఇవాళ ఇక్కడ కనిపిస్తోంది. ఐదేళ్లుగా మనందరి ప్రభుత్వం మంచి చేసిందన్న నమ్మకం ఇక్కడ కనిపిస్తోంది. ఆ మంచిని కాపాడుకోవాలన్న సంకల్పం ఈరోజు మీ అందరిలో కనిపిస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. రాబోయే ఐదేళ్లు.. అంటే 1,825 రోజులు.. రాబోయే 60 నెలల పాటు మన బతుకులు ఎలా ఉంటాయి? అనేది నిర్ణయించే మన ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతున్న పథకాలు ఇక మీదట కూడా అందాలా? లేక అవి రద్దు కావడం అన్నది మీ ఓటుపైనే ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. జగన్కు ఓటు వేస్తే.. ఫ్యాన్పై రెండు ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయి. ఇది చరిత్ర చెబుతున్న నిజం. బాబు మోసాల మేనిఫెస్టో చెబుతున్న వాస్తవం. ఫ్యాన్కు ఓటు వేస్తే గ్రామగ్రామాన, పట్టణాల్లో సేవలందిస్తున్న జగన్ మార్కు సచివాలయాలన్నీ కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు, ముగింపు తథ్యం. ఫ్యాన్కు ఓటు వేస్తే అవ్వాతాతలకు ఇంటివద్దే రూ.3,000 పెన్షన్ అందుతుంది. ఇంటికే వచ్చి సేవలందిస్తున్న వలంటీర్ల ద్వారా జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా గత 58 నెలల్లో డీబీటీ ద్వారా మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. మళ్లీ పసుపు పతి నిద్ర లేస్తాడు! వదల బొమ్మాళీ.. వదల.. అంటూ మళ్లీ ఐదేళ్లు మీ రక్తం తాగేందుకు ప్రతి ఇంటికీ వస్తాడు. జాగ్రత్త సుమా..! ఒక్క ఫ్యాన్కు రెండు ఓట్లు వేస్తేనే.. ఫ్యాన్కు ఓటు వేస్తేనే విత్తనం నుంచి పంట విక్రయం వరకూ ఇప్పుడు సేవలందిస్తున్న ఆర్బీకేలు కొనసాగుతాయి. లేదంటే ఆర్బీకేలకు బాబు మార్కు కత్తిరింపులు, ముగింపు ఖాయం. ఫ్యాన్కు ఓటు వేస్తేనే రైతన్నలకు వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఏటా క్రమం తప్పకుండా అందుతుంది. ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా, సున్నావడ్డీకే పంట రుణాలు, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే వ్యవసాయానికి 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోళ్లు నిరాటంకంగా జరుగుతాయి. లేదంటే మళ్లీ చంద్రబాబు మార్కు పాలన, మళ్లీ కత్తిరింపులు, పథకాలన్నీ ముగింపు జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచన చేయండి. పెద్దవారి పిల్లలు అసూయపడేలా.. ఫ్యాన్కు ఓటు వేస్తేనే.. గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, రూపురేఖలు మారిన స్కూళ్లు, 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్, బైజూస్ కంటెంట్, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, ఐఎఫ్పీ ప్యానళ్లు, 8వ తరగతి నుంచి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, ఉన్నత చదువులకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, డిగ్రీ విద్యార్థులకు సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా విదేశీ వర్సిటీలతో మన కాలేజీల అనుసంధానం, తొలిసారిగా డిగ్రీలో తప్పనిసరి ఇంటర్న్షిప్.. ఇవన్నీ కొనసాగుతాయి. మీ జగన్ ఇదే స్థానంలో ఉంటే మరో పదేళ్లలో పేద పిల్లలు ఏ స్థాయిలో ఇంగ్లిష్ మాట్లాడతారంటే.. వారు అనర్గళంగా మాట్లాడే మాటలకు పెద్దవారి పిల్లలు అసూయ పడే పరిస్థితి వస్తుంది. బాబుకు ఓటేస్తే కత్తిరింపులు.. ముగింపు ఫ్యాన్పై రెండు ఓట్లు పడితే జగన్ మార్కు విప్లవాలన్నీ కొనసాగుతాయి. లేదంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దు, స్కూళ్ల రూపురేఖలు మార్చే నాడు–నేడు రద్దు, బడి పిల్లలకు రోజుకో మెనూతో ఇచ్చే గోరుముద్ద రద్దు, బడులు తెరిచే సమయానికి పిల్లలకు ఇస్తున్న విద్యాకానుక రద్దు, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన రద్దు.. 8వ తరగతి నుంచి పిల్లల చేతుల్లో ట్యాబ్లు రద్దు.. వీటన్నిటికీ కత్తిరింపులు ముగింపే! 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు.. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు రద్దు అవుతాయి. అందుకే ఆలోచన చేయండి. పొరపాటు జరిగిందంటే..మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. నిద్ర లేచి మీ పిల్లల చదువులు, బడులు అన్నిటికీ లకలక.. లకలక అంటూ ముగింపు పలుకుతుంది. విప్లవాత్మక పాలన కొనసాగేందుకు.. ఫ్యాన్కు ఓటు వేస్తేనే గ్రామాల్లోనే విలేజీ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష, ఇంటి వద్దే పరీక్షలు – మందులు, నాడు– నేడుతో రూపురేఖలు మారిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉత్తమ సేవలు, రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీతో ఉచిత వైద్యం, ఆపరేషన్ తరువాత జీవన భృతి కోసం ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా, 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం లాంటి ప్రతి పేదవాడిని బతికించే జగన్ మార్కు విప్లవాత్మక పాలన కొనసాగుతుంది. లేదంటే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. వదల బొమ్మాళీ అంటుంది. పేదవాడు అప్పుల పాలై వైద్యం అందని పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది ఆ చంద్రముఖి. ఫ్యాన్కు ఓటు వేస్తేనే అక్కచెల్లెమ్మల రాజ్యం, పిల్లలను బడులకు పంపే అమ్మలకు అమ్మ ఒడి, చదువులకు ఇబ్బంది లేకుండా విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ జగనన్న కాలనీలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహాల నిర్మాణం.. అన్నీ కొనసాగి వేగంగా అడుగులు ముందుకు పడతాయి. గతంలో నాకు ఓట్లేయని వారూ ఆలోచించండి.. పొదుపు సంఘాల మహిళలకు బాబు చేసిన మోసాలు గుర్తున్నాయా? ఓటు వేసే ముందు మీ కుటుంబమంతా కూర్చుని బాగా ఆలోచన చేయండి. ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి. ఎవరివల్ల మంచి జరిగింది? ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుందనే ఆలోచనతో ఓటు వేయాలని కోరుతున్నా. మీ తలరాతలను మార్చే ఎన్నికలివి. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కొనసాగాలా? లేక రాష్ట్రాన్ని పెత్తందార్లు అందరూ కలసి దోచుకుని, పంచుకునే కూటమి పాలన కావాలా? 58 నెలలుగా మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పలు కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతున్నా. కులం కారణం కావచ్చు.. ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నామనే కారణం కావచ్చు.. లేదా ఇతర కారణాలు కావచ్చు.. ఆ అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను కూడా అడుగుతున్నా. గత ఎన్నికల్లో మీరు నాకు ఓటు వేయకపోయినా ఈ ఐదేళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా? అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు, క్లాస్ నాయకులు అబద్ధాలు చెప్పవచ్చుగానీ మీ కుటుంబానికి, మీ బ్యాంక్ ఖాతాల్లోకి 58 నెలల పాలనలో జమ అయిన, చేతికి అందిన పథకాల డబ్బులు మీకు నిజాలే చెబుతాయి. ఇంటికే వలంటీర్ల సేవలు, ఇంటి వద్దకే పెన్షన్, రేషన్, వైద్యం, సర్టిఫికెట్లు, ఇళ్ల పట్టాలు.. ఇవన్నీ మీకు నిజాలే చెబుతాయి. మారిపోయిన మన గవర్నమెంట్ స్కూళ్లు, పిల్లల చదువులు, గ్రామంలోనే వైద్య సేవలు, వ్యవసాయం.. ఇవన్నీ మీకు వాస్తవాలు చెబుతాయి. ఎవరి పాలనలో మీకు మంచి జరిగిందో ఆలోచన చేయండి. 2014లో బాబు మోసాలివీ.. ♦ రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? ♦ పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ♦ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా? ♦ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ♦ ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ♦ అర్హులైన వారందరికి మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? ♦ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా? ♦ మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ♦ సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ♦ ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? కాకినాడలో కనిపిస్తోందా? పోనీ పిఠాపురంలో కట్టారా? ♦ పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? అదీ లేదు. ♦ ఇప్పుడు సూపర్ సిక్స్, సెవెన్, ఇంటికి కేజీ బంగారం అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు. ఇన్ని మోసాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమైతే వారి చీకటి యుద్ధాన్ని, ఆ ఎల్లో మీడియా, సోషల్ మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబు నుంచి సెల్ఫోన్లు బయటకు తీసి టార్చిలైట్లు వెలిగించండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు లేని వ్యవస్థలు, మన చదువులు, పిల్లలు, రైతన్నలు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి. బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్! ఇంటింటికీ మంచి చేశాడు కాబట్టి ఈ ఎన్నికల యుద్ధానికి మీ బిడ్డ ఒంటరిగా బయల్దేరాడు. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకే ఏ మంచిపనీ లేదు కాబట్టి వారంతా కూటమిగా ఏకమయ్యారు. మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది. అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పాటైన కూటమి కాదు. ఎన్ని టికెట్లు ఇవ్వాలి? ఎవరు పోటీ చేయాలి? చివరికి ఆ ప్యాకేజీ స్టార్ ఎక్కడ నిలబడాలో కూడా బాబు నిర్ణయిస్తేనే కుదిరిన పొత్తులవి. ఆ ప్యాకేజీ స్టార్ను భీమవరం.. గాజువాక.. పిఠాపురం.. ఇలా ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుందనుకుంటే అక్కడ నిలబెట్టిన పరిస్థితి!ఇక బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్! జగన్ను తిట్టు అంటే తిట్టు..! కొట్టు అంటే కొట్టు..! దత్తపుత్రా నీకిచ్చేది 80 కాదు.. 20 అంటే అందుకు కూడా జీ హుజూర్! ఇదీ ప్యాకేజీ స్టార్ పరిస్థితి! కులాన్ని హోల్సేల్గా అమ్మేయగలననే భ్రమతో.. ఏపీని హోల్సేల్గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే.. కులాన్ని హోల్సేల్గా బాబుకు అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టార్ రాజకీయం చేస్తున్నాడు. ఈయనకు ఏపీ అంటే ఎంత చులకన అంటే.. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్తాడు. ఏ ప్రాంతమన్నా ప్రేమ ఉండదు ఈ మ్యారేజీ స్టార్కు. ఏ భార్య అయినా ప్రేమ ఉండదు! పెళ్లిళ్లే కాదు..నియోజకవర్గాలు కూడా మార్చేశాడు. వెనుకటికి ఒకడు పెళ్లికి పిఠాపురం వెళ్తూ పిల్లిని చంకన బెటు్టకెళ్లాడట! ఆ పిల్లిని చంకన బెట్టుకెళ్లింది ఎవరో ఇంతకాలం ఎవరికీ అర్థం కాలేదు. బాబు తన చంకలో ఉన్న పిల్లిని పిఠాపురంలో వదిలినట్లు ఇప్పుడు అర్థమైంది. ఇదీ గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి. ఈ గ్లాస్తో గటగట తాగేది బాబు.. దాన్ని తోమి, తుడిచి మళ్లీ బాబుకు అందించేది మాత్రం.. ఈ ప్యాకేజీ స్టార్! బాబు ట్రాన్స్ఫర్ ఆర్డర్తో.. బీజేపీలోకి వదినమ్మ ఈ కూటమిలో వదినమ్మ బాబు చేరమంటే కాంగ్రెస్లో చేరింది. ఇదే బాబు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీలో చేరారు. బాబు పొడవమంటే సొంత తండ్రికే వెన్నుపోటు పొడిచేసింది! 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా.. బాబు కోవర్టుగా అదే పనిలో ఉంది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి సీటు ఇవ్వమంటే వారికే ఇస్తారు. వద్దంటే వారిని ఆపేస్తారు, మారుస్తారు. చంద్రబాబు ప్యాకేజీలు, ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. బీఫామ్ బీజేపీదైనా, కాంగ్రెస్దైనా, టీ గ్లాస్దైనా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే! మత్స్యకారులకు మాటిస్తున్నా.. కాసేపటి క్రితం కన్నబాబు అన్న మాట్లాడుతూ మత్య్సకారుల సమస్యల గురించి ప్రస్తావించారు. నాకు మంచి మనసు ఉంది కాబట్టే.. ముమ్మిడివరంలో జరిగిన నష్టాన్ని, ఎప్పటి నుంచే పరిష్కారం కాని సమస్యను పరిష్కరించాం. ఓఎన్జీసీ కమిటీని ఏర్పాటు చేయటానికి మీ బిడ్డ ప్రభుత్వ చొరవే కారణమనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కమిటీ సిఫారసులు ఆధారంగా ప్రతి మత్య్సకార కుటుంబానికి మంచి జరిగేలా మీ బిడ్డ తోడుగా ఉంటాడని మాట ఇస్తున్నా. బాబుకు మిగిలింది గులక రాళ్లే... చంద్రబాబు మేనిఫెస్టో ఎన్నికలు ముగిసేదాకా రంగురంగుల స్వప్నాలను చూపిస్తుంది. ఆ తరువాత చెత్తబుట్టలో మినహా ఎక్కడా కనిపించదు. ఎన్నికల తరువాత మోసాలు చేయడం చంద్రబాబు నైజం! ఆయన పాలనలో చరిత్రలో నిలిచిపోయే మైలు రాళ్లు ఏవీ లేవు. మంచి వ్యవస్థలు గానీ, పథకాలుగానీ, ప్రజలకు చేసిన మంచిగానీ ఒక్కటీ లేవు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు అధికారంలో ఉన్నా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే మంచి పనిగానీ, పథకాలుగానీ ఒక్కటీ లేవు. కాబట్టే నాపై వేయించటానికి చంద్రబాబుకు, ఆయన కూటమికి చివరకు గులక రాళ్లే మిగిలాయి. మన మైలు రాళ్లు.. గత 58 నెలల పాలనలో మనం వేసిన పునాది రాళ్లు, మైలు రాళ్లు చరిత్రలో ఎప్పటికీ విప్లవాలుగా నిలిచిపోతాయి. కాబట్టే మనం జెండా తలెత్తుకుని ఎగురుతోంది. వారి జెండా మరో నాలుగు జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడుతోంది. ఈ ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా? వద్దా? ఆలోచన చేయమని కోరుతున్నా. ఫ్యాన్కు రెండు ఓట్లు వేస్తేనే ఈ అభివృద్ధి కొనసాగుతుందని ప్రతి ఇంట్లో స్టార్ క్యాంపైనర్లుగా ముందుకు వచ్చి వివరించాలి. బాబు గత చరిత్రను, 2014లో ఇదే కూటమి పేరుతో చేసిన మోసాలను ప్రతి ఇంటికీ గుర్తు చేయాలి. -
CM Jagan : ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలా
సాక్షి, తూర్పుగోదావరి: సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా యాత్ర కొనసాగుతోంది. గోదావరి జిల్లాల్లో జన జాతరను తలపిస్తోంది. పల్లెల నుంచి పట్టణాల వరకూ తరలివచ్చిన జన సందోహంతో రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నడినెత్తిన సూరీడు 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతతో నిప్పులు చెరుగుతున్నా లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడాలని, ఆయనతో మాట కలపాలని రోడ్డుకు ఇరువైపులా బారులు తీరుతున్నారు. ఆయనకు అప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో దారిపొడవునా సీఎం వైఎస్ జగన్ కోసం జనం వేచి చూసి మరీ స్వాగతం పలికారు. సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ జరగనుంది దిక్కులు నాలుగే. కానీ ‘తూర్పు’ ఓ ప్రత్యేకత ఉంటుంది! ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేది ఈ దిక్కునే మరి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘తూర్పు’ గోదావరి స్పెషాలిటీ ఏంటన్నది.. మనమిప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు... ఈ జిల్లాపై పట్టు అధికారానికి మెట్టు అని చరిత్ర ఇప్పటికే చాలాసార్లు చెప్పింది! అలాంటి ‘తూర్పు’లో జగనన్న ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కొత్త చరిత్రను లిఖిస్తోంది బస్సు యాత్ర ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు! కాదూ కూడదు.. మాకు రుజువు కావాలంటున్నారా? చాలా సింపుల్... సీఎం జగన్ బస్సు యాత్రను దగ్గరగా ఫాలో కండి.. అభిమానంతో ఉప్పొంగిపోతున్న ప్రజలను చూడండి. ఇవ్వాళ రంగంపేటలో మొదలైన యాత్ర, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు చేరుకుంటుంది. ఇక్కడ కొద్దిసేపు భోజన విరామం. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్ , కత్తిపూడి బైపాస్ , తుని బైపాస్ , పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్లకు రాత్రి వరకు చేరుకుంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. సీఎంను కలవడానికి ప్రజలు పోటీ పడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సామర్లకోట వద్ద పెద్దాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ బస్సుయాత్రకు జనం ఆత్మీయ స్వాగతం పలికారు. సామర్లకోటలో మిట్టమధ్యాహ్నపు మండుటెండల్లోనూ అభిమానం ఏమాత్రం తగ్గలేదు. మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రి కోసం జనం బారులు తీరారు. పెద్దాపురం పాండవుల మెట్ట వద్ద 12:20గంటలకు బస్సు యాత్ర చేరుకుంది. స్థానికులకు అభివాదం చేసిన సీఎం జగన్.. కొద్దిసేపు వారిని కలిసారు. మధ్యాహ్నం 12.37గంటల నుంచి12.48 వరకు సామర్లకోట ఫ్లైఓవర్ పై బస్సు యాత్ర సాగింది. సామర్లకోట ఉన్డూరు క్రాస్ కు 12.48 గంటలకు చేరుకున్నారు సీఎం జగన్. సామర్లకోట అచ్చంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద మహిళలు కోరడంతో ముఖ్యమంత్రి జగన్ బస్సును కొద్దిసేపు నిలిపివేశారు. కిందికి దిగి మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. కాకినాడ జిల్లాలో కొందరు మహిళలు సీఎం జగన్ బస్సు యాత్రకు గుమ్మడికాయలతో దిష్టితీసి స్వాగతం పలికారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకోవాలని, క్షేమంగా ఉండాలని సీఎం జగన్ను దీవించారు. -
సీఎం జగన్ హత్యకు పెద్ద కుట్ర.. ‘ఎల్లో బ్యాచ్’పై అనుమానాలెన్నో!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో హత్యాయత్నం జరిగినప్పుడు తెలుగుదేశం స్పందన, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా పిచ్చి రాతలు, నిందితులను పోలీసులు ట్రేస్ చేయడంతో టీడీపీకానీ, వారి మీడియా కానీ మాటలు మార్చిన వైనం చూస్తే కచ్చితంగా ఇందులో ఏదో పెద్ద కుట్రే ఉందన్న అనుమానం వస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అంతా ఒక మాట మీద ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటివాటిని ప్రోత్సహించే విధంగా మాట్లాడరాదు. నిందితులకు మద్దతుగా సానుభూతి వచనాలు చెప్పడానికి యత్నించకూడదు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఒక పదునైన రాయి ద్వారా హత్యాయత్నం నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నిటిని పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ, అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఎక్కువగా కంగారు పడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఖండన తప్ప ఇతరత్రా స్పందించనవసరం లేని వాటిపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్, అచ్చెన్నాయుడు వంటి వారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తొలుత ఖండన చేసినట్లు కనిపించినా, ఆ తర్వాత నాటకం అంటూ ఆరోపించడం ఆరంభించారు. కానీ పోలీసులు కచ్చితంగా ఇది హత్యాయత్నమేనని తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. ఈ ఘటన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని అజిత్ సింగ్ నగర్ వద్ద జరిగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ట్రాక్ రికార్డు అంత సవ్యంగా లేదు. ఆయనపై పలు అభియోగాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి. దానికి తగినట్లే ఆయన అనుచరులే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఇప్పుడు పోలీసుల రిమాండ్లోని అంశాలను బట్టి అర్థం అవుతుంది. ఈ రిపోర్టులో ఇంకా కుట్రదారులదాకా వెళ్లలేదు కానీ, భవిష్యత్తులో ఈ కేసులో కుట్రకు పాల్పడింది ఎవరు అన్న దర్యాప్తు జరుగుతుంది. అప్పుడు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావచ్చు. ప్రస్తుతానికి ఒక నిందితుడు వేముల సతీష్ను పోలీసులు పట్టుకున్న తీరు ఆసక్తికరంగా ఉంది. అజిత్ సింగ్ నగర్ వద్ద ఒక స్కూల్కు, ఒక దేవాలయానికి మధ్య ఉన్న చెట్ల వద్ద ఎవరికి కనబడకుండా ఈ దాడి చేశారు. పొరపాటున ఆ రాయి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కంటికి తగిలి ఉంటే ఏమిటి పరిస్థితి! అంతేకాదు, నవరగంత వద్ద ఆ పదునైన రాయి తగిలి ఉంటే ఇంకెంత ప్రమాదం జరిగేది. అంత పెద్ద గాయం కంటిపైన తగిలితే చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా అది కేవలం గులకరాయి దాడిగా అభివర్ణించడం నీచంగా ఉంది. పవన్ కల్యాణ్ వంటి రాజకీయ అజ్ఞాని ముఖ్యమంత్రికి వేసిన దండలో వచ్చిన రాయి కావచ్చని పిచ్చి వాదన తెచ్చారు. లోకేష్ వంటి పరిణితిలేని వ్యక్తి ఈ రాయిని తాడేపల్లి పాలెస్ నుంచి వచ్చిందని అహంకారపూరిత, కనీసం ఇంగితం లేని వ్యాఖ్య చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా తొలుత అయితే ఇదంతా పోలీసుల వైఫల్యంగా తేల్చాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి విసురుతున్నప్పుడు పోలీసులు ఏమి చేస్తున్నారని, వారు ఎందుకు ఆపలేకపోయారని నిలదీస్తూ వార్తలు రాశారు. అప్పటికి వీరికి ఒక నమ్మకం ఉండి ఉండాలి. ఈ రాయి విసిరిన వ్యక్తులను విజయవాడ పోలీసులు ఎప్పటికి పట్టుకోలేరని భావించి ఉండాలి. అందుకే అంత ధైర్యంగా పోలీసులదే వైఫల్యం అన్నట్లు ప్రొజెక్టు చేసే యత్నం చేశారు. చంద్రబాబు తన సహజ శైలిలో దీనిపై కూడా రెండు నాల్కల ధోరణితో మాట్లాడి తన లక్షణాన్ని మరోసారి బహిర్గతం చేసుకున్నారు. ఇక్కడ కీలకమైన టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. తొలుత ఈ దాడి విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కలిసి ఆడిన డ్రామా అన్నట్లు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అనుమానితులను, నిందితులను పట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయన్న సమాచారం రాగానే మాట మార్చి, అదేదో కావాలని చేసింది కాకపోవచ్చన్నట్లు చెప్పారు. ఆ తర్వాత నిందితుడు అన్నా క్యాంటిన్ ఎత్తివేశారని కోపంతో, తన తల్లికి రోడ్షోకు వచ్చినందుకు ఇస్తానన్న 200 రూపాయలు ఇవ్వలేదన్న కోపంతో రాయి విసిరి ఉండవచ్చని బొండా అన్నారు. అక్కడితో ఆగలేదు. ఈ కేసులో కనుక తనను కూడా ఇరికించాలని చూస్తే జూన్ నాలుగు తర్వాత ఆ పోలీసుల సంగతి చూస్తానని బెదిరించారు. ఇది అచ్చం చంద్రబాబు, లోకేష్ల నుంచి తర్ఫీదు పొందినట్లే మాట్లాడారు. వారు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా, అధికారులను ,ముఖ్యంగా పోలీసులను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ఒక అలవాటుగా చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్న వెంటనే టీడీపీ స్వరం మార్చింది. బీసీ వర్గానికి చెందినవారిని కేసులో పెడతారా అని అచ్చెన్నాయుడు విమర్శించారు. హత్యాయత్నం ఘటనలలో కులం చూసి కేసు పెట్టాలని కొత్త రాజ్యాంగాన్ని వీరు చెబుతున్నారు. అలాగైతే చంద్రబాబుపై అలిపిరిలో నక్సల్స్ దాడి జరిగినప్పుడు కూడా కులం చూసే కేసులు పెట్టారా? ఇక చంద్రబాబు అయితే ఈ కేసులో బొండా ఉమాను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. అసలు కేసు దర్యాప్తే ఒక దశకు రాకుండానే చంద్రబాబుకు ఈ సమాచారం ఎవరు ఇచ్చారు? అంటే ఈ హత్యాయత్నం ఎలా జరిగింది? అందులో ఎవరు ఉన్నారు? ఎవరికి సంబంధించినవారో ముందే తెలుసునని అనుకోవాలి. పోలీసు రిమాండ్ రిపోర్టులో వేముల సతీష్ అనే వ్యక్తి పదునైన రాయి విసిరితే, అందుకు ప్రేరేపించింది మరో వ్యక్తి అని తెలిపారు. ఆ వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలపలేదు. ఈ రెండో నిందితుడు బొండా ఉమా అనుచరులలో ఒక ముఖ్యుడన్న ప్రచారం జరుగుతోంది. లేదా బొండా తన పేరును నిందితులు చెబుతారన్న భయం ఏమైనా ఏర్పడిందా?ఇప్పటికే సతీష్ తాను నేరానికి పాల్పడ్డానని అంగీకరించారు. ఆ తర్వాత అందుకు ఎవరు ప్రోద్బలం చేసింది కూడా చెప్పి ఉంటారు. తీగ లాగితే డొంక కదులుతుందన్న భయం వీరికి పట్టుకుంది. దాంతో వెంటనే పోలీసులను విమర్శించడం ఆరంభించారు. అందుకు ఈనాడు, జ్యోతి వంటి అనైతికంగా మారిన మీడియాను వాడుకున్నారు. ఒక ముఖ్యమంత్రిపై అంత దాడి జరిగితే, సానుభూతి చూపకపోతే మానే, ఏకంగా నిందితులకు మద్దతు ఇచ్చేలా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వారు మాట్లాడుతున్నారు. నిజానికి టీడీపీలో ఎవరికి సంబంధం లేకపోతే, అసలు ఈ అంశం గురించి వారు ప్రస్తావించవలసిన పనే లేదు. కానీ అందుకు భిన్నంగా అతిగా వ్యవహరించి తెలుగుదేశం నేతలు వారికివారే ఆత్మరక్షణలో పడ్డారనిపిస్తుంది. ఈనాడు మీడియా నిందితులు ఉన్న వడ్డెర కాలనీకి వెళ్లి నిందితుల కుటుంబాలు చాలా బాధలో ఉన్నట్లు, వారిని అరెస్టు చేయడం అన్యాయమన్నట్లు వార్తలు ప్రచారం చేశారు. ఘటన జరిగినప్పుడు పోలీసులు వైఫల్యం అని రాసిన ఈ మీడియా ఇప్పుడు పోలీసులు నిందితులను పట్టుకోవడాన్ని తప్పు పడుతోంది. నిందితుడు రాళ్ళు విసరడంలో నేర్పరి అయి ఉండాలి. లేకుంటే ముఖ్యమంత్రి కంటిపై భాగానికి తగిలేలా ఎలా వేయగలుగుతారు? ఇతనికి సహకరించినవారిని కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తన పేరు ఎక్కడ వస్తుందోనని బోండా ఉమ అజ్ఞాతంలోకి వెళ్లినటట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలీసులను బెదిరించారు. నిందితుడు సతీష్ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆశ్చర్యంగా అతనికి అనుకూలంగా వాదించడానికి లాయర్లు వచ్చారు. రోజుకు 250 రూపాయలు సంపాదించుకునే కుటుంబానికి ఇంత పెద్ద లాయర్లను పెట్టుకునే శక్తి ఎక్కడ నుంచి వస్తుందన్నది ప్రశ్న. ఇక్కడ కూడా సరిగ్గా చంద్రబాబు పై వచ్చిన కేసుల్లో వాదించిన రీతిలోనే ఈ లాయర్లు వాదన చేసినట్లు అనిపిస్తుంది. గతంలో చంద్రబాబుకు ఐటి నోటీసులు వస్తే, ఫలానా ఆఫీస్కు జ్యురిస్ డిక్షన్ లేదని సమాధానం ఇచ్చారు. స్కిల్ స్కామ్ కేసులో గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదించారు. ఇప్పుడు వేముల సతీష్ మైనర్ అని చెప్పడానికి ఆయన లాయర్లు యత్నించారు. కానీ పోలీసులు పకడ్బందిగా అతనికి పందొమ్మిదేళ్లని నిరూపించారు. తదుపరి సతీష్ రాయి వేయలేదన్న వాదనకు వెళ్లారు. సీఎంకు వేసిన దండ కర్ర గీసుకుని ఉండవచ్చని వాదించినట్లు అతని తరపు లాయర్ చెప్పారు. జగన్మోహన్రెడ్డితో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కూడా గాయం అయిన సంగతిని విస్మరించారేమో తెలియదు. దండ కర్ర గీసుకుంటే ఒకరికే గాయం అవుతుంది కానీ, ఇద్దరికి అవ్వదు కదా! ఈ లాజిక్ మిస్ అయి మాట్లాడినట్లు అనిపిస్తుంది. మరో సంగతి చెప్పాలి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు హంతకుడు అప్రూవర్గా మారడంతోనే అతనికి బెయిల్ వచ్చేసింది. కానీ ఆ కేసు కుట్రదారులన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి మాత్రం నెలల తరబడి బెయిల్ రావడం లేదు. ఈ కేసుతో ముఖ్యమంత్రి పై జరిగిన హత్యాయత్నం కేసును పోల్చి చూస్తే, రాయి విసిరిన వ్యక్తి సంగతి ఎలా ఉన్నా, వెనుక ఉన్న కుట్రదారులకు కీలక పాత్ర ఉంటుందన్నమాట. కుట్రదారులను పట్టుకుని జైలులో పెట్టాల్సి ఉంటుంది. గతంలో ప్రముఖ నేతలపై జరిగిన హత్యాయత్నం, దాడుల కేసుల్లో నిందితుల తరపున వాదించడానికి లాయర్లు సుముఖంగా ఉండేవారు కారు. కానీ ఇక్కడ సతీష్ రిమాండ్ సమయంలోనే లాయర్లు రావడం విశేషం. మామూలుగా అయితే పోలీసులు కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టగానే రిపోర్టు చూసుకుని న్యాయమూర్తి రిమాండ్కు పంపిస్తుంటారు. కానీ అతని తరపు లాయర్లు రావడంతో వాదోపవాదాలు జరిగాయి. ఈ పరిణామం చూసిన తర్వాత, అతని ఆర్దిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, నిందితుడిని కాపాడడానికి పెద్దప్రయత్నమే జరుగుతోందన్న అనుమానం వస్తోంది. దీనికి కారణం ఆ నిందితుడు విచారణలో తమ పేర్లు చెబితే అది సమస్య అవుతుందన్న భయం కావచ్చు. వీటన్నిటిని చూసిన తర్వాత తెలుగుదేశం నేతలుకానీ, ఎల్లో మీడియా కానీ వ్యవహరించిన వైనం అనుమానాస్పదంగా ఉన్నట్లు అర్ధం అవుతుంది. వారు అతిగా స్పందించడం, గులకరాయి దాడి అని పనికిమాలిన రాతలు రాయడం, నిందితుడిని రక్షించే యత్నం చేయడం ఇవన్నీ గుమ్మడి కాయల దొంగ భుజాలు తడుముకున్నట్లు కనిపించడం లేదూ! - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019