breaking news
Ad - Sakshi_Home_Sticky
-
తమ్ముడే అనుకుంటే.. అన్నయ్య కూడా అంతేనా..!?
ఎవరైనా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటారు. అందులోను సమాజంలో ప్రముఖులుగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అప్రతిష్టపాలవుతారు. కానీ ఆర్దిక, రాజకీయ సంబంధాలు పెనవేసుకుపోయినప్పుడు కొందరు సెలబ్రిటీలు సైతం తమ వ్యక్తిత్వాన్ని వదలుకుని దిగజారడం సామాన్యులను ఆశ్చర్యపరుస్తుంది. ఇదంతా మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గురించే చెబుతున్నది. ఆయన అంటే అందరికి గౌరవమే. ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది. కానీ అందుకు విరుద్దంగా ఆయన ప్రవర్తిస్తే అభిమానగణం అప్సెట్ అవుతుంది. ప్రస్తుతం చిరంజీవి అలాగే వ్యవహరించారు. ఈ మధ్యకాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని పలుమార్లు చెప్పిన చిరంజీవి సడన్గా మాట మార్చి ఏపీ రాజకీయాలలో వేలు పెట్టారు. పోనీ అదేదో ఏదైనా రాజకీయ పార్టీలో పోటీచేసిన సామాన్యులకు మద్దతు ఇస్తే ఆయనకు పేరే వచ్చేది. ఏ పార్టీలో ఉన్న పేదలకైనా తన అండ ఉంటుందని చెబితే ఆయనకు కీర్తి వచ్చేది. కానీ ఆయన ఒక పెద్ద పెత్తందారీకి, ఆర్దిక నేరాభియోగాలు ఉన్న వ్యక్తికి సహకారం అందిస్తున్నట్లు ప్రకటించితే జనం ఏమని అనుకుంటారు. ఆయనకు ఈపాటి ఆలోచన రాకపోయిందా! అవును! కొన్ని సబంధాల ముందు అవేవి కనపించకపోవచ్చు. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పక్షాలు కలిసి కూటమి కట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో టీడీపీకి చెందిన సీ.ఎం. రమేష్ వ్యూహాత్మకంగా బీజేపీలోకి వెళ్లి, ఇప్పుడు అనకాపల్లిలో లోక్ సభ సీటుకు కూడా పోటీచేస్తున్నారు. బహుశా చిరంజీవి, రమేష్లు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి ఉంటుంది. అదేదో ఢిల్లీ స్థాయిలో కనుక ఎవరి దృష్టికి రాలేదు. కానీ ఎన్నికల నేపథ్యంలో సీ.ఎం. రమేష్ కొద్ది రోజుల క్రితం చిరంజీవి ఇంటికి వెళ్లడం, అక్కడ సంప్రదింపులు జరిపి చిరంజీవి తనకు మద్దతు ప్రకటించేలా చేసుకున్నారు. సీ.ఎం. రమేష్ పలు ఆర్ధిక నేరాభియాలు ఎదుర్కుంటున్నారు. తాజాగా ఒక సినీ నటుడు వేణు ఈయనపై 450 కోట్ల రూపాయల మేర ఫోర్జరీ చేసి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన రమేష్ గురించి చిరంజీవికి ఏమీ తెలియకుండా సంఘీభావం ప్రకటించి ఉంటారా? అన్న సందేహం రావచ్చు. తన సోదరుడు పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని, ఆ తర్వాత బీజేపీని కూడా కలుపుకున్నారు. ఈ పొత్తులో పవన్ కల్యాణ్ ధోరణి చూసి పలువురు జనసేన నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అది వేరే కథ. పవన్ కల్యాణ్ సొంతంగా పార్టీ పెట్టి 2014లో చంద్రబాబు కోసం పనిచేసినా చిరంజీవి వారితో కలవలేదు. అప్పట్లో ఈయన కాంగ్రెస్ నేతగా ఉండేవారు. చంద్రబాబును విమర్శిస్తూ కొన్ని ప్రకటనలు కూడా చేశారు. ప్రత్యేకించి హిందుపూర్ లో ముస్లిం అభ్యర్ధికి కాకుండా బాలకృష్ణకు సీటు ఇవ్వడాన్ని చిరంజీవి తప్పు పట్టారు. ఆ తర్వాత రోజుల్లో రాజకీయాలకు దూరం అయి సినిమాలపైనే దృష్టి పెడతామని ప్రకటించారు. అలాగే ఉంటారులే అనుకుంటే సడన్గా ఇప్పుడు కూటమి అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా తాను కూడా పెత్తందారులలో భాగమేనని చిరంజీవి రుజువు చేసుకున్నారు. ఈయన నటించిన పలు సినిమాలు చూసి చాలామంది అభిమానులు ఏర్పడ్డారు. ఆ సినిమాల వల్ల స్పూర్తిపొంది చిరంజీవి అంటే అంత గొప్పవాడు.. ఇంత గొప్పవాడు అని భావిస్తుంటారు. ఆయన ఠాగూర్ సినిమాలో నటిస్తే, ఈయన అంత గొప్ప నిజాయితీపరుడు అని అభిమానులు అంతా సంతోషించారు. రుద్రవీణ వంటి ప్రోగ్రెసివ్ సినిమాలో హీరోగా నటించి ఆదర్శవాది అనిపించుకున్నారు. పేదల తరపున పనిచేసే నేతగా, మద్యపానాన్ని వ్యతిరేకించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. తీరా వాస్తవ ప్రపంచంలోకి చూస్తే చిరంజీవి అందుకు భిన్నంగా కనిపించడం ఆయన అభిమానులకు ఆవేదన కలిగిస్తుంది. సీ.ఎం.రమేష్ సారా వ్యాపారంతో జీవితాన్ని మొదలుపెట్టి కాంట్రాక్టర్ అవతారం ఎత్తి, రాజకీయాలలోకి వచ్చి వేల కోట్లకు అధిపతి అయ్యారు. రమేష్ బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల విరాళం ఇచ్చి సంచలనం సృష్టించారు. సొంతంగా విమానం కొని ఆయా పార్టీలవారిని అందులో తిప్పే స్థాయికి ఎదిగారు. అది చట్టబద్దంగా, న్యాయబద్దంగా చేస్తే మంచిదే. కానీ సీ.ఎం. రమేష్ నడిపిన లావాదేవీల గురించి చిరంజీవికి తెలియవని అనుకుంటే పొరపాటే అవుతుంది. కానీ ఏదో ఆతీత సంబంధం ఏర్పడి ఉండాలి. అందుకే రమేష్కు అనుకూలంగా చిరంజీవి ఏకంగా వీడియో రిలీజ్ చేశారు. దీంతో చిరంజీవి తన పరువు తానే పొగొట్టుకున్నారు. ప్రజల దృష్టిలో పలచన అయ్యారు. చిరంజీవి ఎన్నికలలో పోటీచేస్తున్న ఒక టిప్పర్ డ్రైవర్కు అనుకూలంగా మాట్లాడితే శభాష్ అనిపపించుకునేవారు. ఒక ఉపాధి హామీ కూలి ఈ ఎన్నికలలో పోటీచేస్తున్నారు. ఆయనకు సంఘీభావం చెప్పి ఉంటే అంతా మెచ్చుకునేవారు. కానీ ఆర్ధిక నేరారోపణలు ఉన్న బీజేపీ అభ్యర్ధులకు చిరంజీవి మద్దతు ఇవ్వడం అంటే ఆయన మాటలకు, చేతలకు ఉన్న తేడా తెలియచేస్తుంది. అసలు చిరంజీవి కాంగ్రెస్కు రాజీనామా చేశారా? ఆ పార్టీ నేతలు కొందరు ఈయన కాంగ్రెస్కు ప్రచారం చేస్తారని చెప్పారు.. కానీ ఈయనేమో బీజేపీ కూటమి అభ్యర్ధికి భజన చేస్తున్నారు. ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే చిరంజీవి సినిమాల సంగతి ఎలా ఉన్నా, రాజకీయాలలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలే తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు చిరంజీవి ఎక్కడకు వెళ్లినా వేలు, లక్షల సంఖ్యలో అభిమానులు తరలివచ్చేవారు. దానిని చూసి ఆయన రాజకీయాలలోకి రావాలని ఆలోచన చేశారు. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటే అదో రకంగా ఉండేది. కానీ రాజకీయాలలోకి వచ్చేది, రానిది చెప్పకుండా దాగుడుమూతలు ఆడేవారు.ఏదో వేరు పేరుతో సంస్థ పెట్టి కార్యకలాపాలు నిర్వహించి, తన బావమరిది అరవింద్ను ముందు పెట్టి కథ నడిపారు. ఆయా పార్టీలలోని నేతలు, ముఖ్యంగా తన సామాజికవర్గంవారు అంతా చిరంజీవి రాజకీయాలలోకి రావాలని కోరుతున్నట్లు ప్రకటనలు చేసేవారు. వారంతా కోరితే వస్తున్నట్లు కనిపించాలన్నది ఈయన ఉద్దేశం కావచ్చు. కానీ ఆ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చిరంజీవి గురించి, ఆయన పెట్టబోయే పక్షం గురించి వ్యతిరేక ప్రచారం చేసేశాయి. దాంతో ఆదిలోనే హంసపాదు మాదిరి ఆయన పార్టీకి విఘ్నాలు ఎదురయ్యేయి. ఆయన ఎట్టకేలకు చిరంజీవి తిరుపతిలో ఒక భారీ సభ పెట్టి ప్రజారాజ్యం పార్టీని అనౌన్స్ చేశారు. పార్టీ అయితే పెట్టారు కానీ, దానికి తగ్గ వ్యూహాలు, ఎజండాను సిద్ధం చేసుకోలేకపోయారు. తొలి రోజుల్లో ఈ పార్టీ వల్ల కాంగ్రెస్కు దెబ్బతగులుందని అనుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆయనకు బాగానే ప్రచారం చేశాయి. కానీ దానివల్ల తెలుగుదేశంకు నష్టం వాటిల్లుతోందని అంచనాకు వచ్చిన ఆ మీడియా వెంటనే ప్లేట్ ఫిరాయించి ప్రజారాజ్యాన్ని, చిరంజీవిని గబ్బు పట్టించేవి. ఇది కేవలం కాపుల పార్టీ అన్న ముద్రవేశారు. దానిని ఎదుర్కునే సత్తా ప్రజారాజ్యానికి లేకుండా పోయింది. తన బావమరిది అల్లు అరవింద్కు ప్రాధాన్యం ఇవ్వడం, ఆర్దిక విషయాలలో కొన్ని విమర్శలు వచ్చేలా చిరంజీవి వ్యవహరించారని అంటారు. టీడీపీ అయితే చిరంజీవి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ప్రచారం చేసేది. టిక్కెట్లు రాని కొందరు అదే తరహా ఆరోపణలు చేసేవారు. చంద్రబాబు నాయుడు తన కోవర్టులను కొందరిని ముందుగానే ప్రజారాజ్యంలో ప్రవేశపెట్టి, తర్వాత వారిని బయటకు తీసుకు వచ్చి తిట్టించేవారు. ఇదే చిరంజీవికి పెద్ద సమస్యగా ఉండేది. ఆ రోజుల్లో సీపీఐ, సీపీఎంలతో కలిసి పొత్తు పెట్టుకోవాలని చిరంజీవి ఆలోచన చేశారు. కానీ దానిని పడనివ్వకుండా వామపక్ష జాతీయ నేతలను చంద్రబాబు మేనేజ్ చేయగలిగారు. టిక్కెట్ల కేటాయింపులో అవకతవకలు తదితర కారణాల వల్ల ప్రజారాజ్యం ఎన్నికలకు ముందే చతికిలపడింది. చివరికి ఉమ్మడి ఏపీలో పద్దెనిమిది సీట్లకే పరిమితం అవడం కాకుండా, చిరంజీవే రెండు చోట్ల పోటీచేసి ఒక చోట ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ నడపడంలో తడబడ్డారు. ఆ దశలో జెండా పీకేద్దాం అని చిరంజీవి భావిస్తున్నారని ఈనాడు మీడియా ఒక పెద్ద కథనాన్ని ప్రచురించింది. అది చూసి చిరంజీవి చాలా బాధపడ్డారు. తదుపరి అప్పట్లో జరిగిన వివిధ పరిణామాలలో కాంగ్రెస్కు దగ్గరయ్యారు. అనూహ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులను తనకు అనుకకూలంగా మలచుకోవడంలో విఫలం అయిన ఈయన తనపార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, రాజ్యసభకు వెళ్లి కేంద్రంలో ఒక సహాయ మంత్రి పదవి పొంది సంతృప్తి చెందారు. కానీ 2014లో కాంగ్రెస్ ఓడిపోవడంతో చిరంజీవి మళ్లీ సినిమాలపైనే దృస్టి పెడతామని అన్నారు. ఇంతలో తన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేనను ప్రకటించినా ఈయన పట్టించుకోలేదు. ఎవరి రాజకీయాలు వారివే అన్నట్లు వ్యవహరించారు. 2019లో పవన్ కల్యాణ్ సొంతంగా ఒక కూటమి పెట్టుకుని రెండు నియోజకవర్గాలలో పోటీచేసి ఓడిపోయారు. అప్పుడు కూడా చిరంజీవి పెద్దగా స్పందించలేదు. వైఎస్సార్సీపీ గెలిచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చిరంజీవి సత్సంబంధాలు కొనసాగించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఆయనకు విశేష గౌరవాన్ని ఇచ్చారు. సినిమా సమస్యలపై చర్చలు జరపడానికి ఒక బృందాన్ని తీసుకువెళ్లారు. ఆ సందర్భంలో చిరంజీవిని అవమానించేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు వ్యాఖ్యానించినా పట్టించుకోలేదు. ఈ విషయాలన్ని చూసినవారు ఇక చిరంజీవి రాజీకీయాల జోలికి రారని అనుకుంటే పవన్ కల్యాణ్కు ఐదు కోట్ల చెక్ ఇచ్చి దానికి ప్రచారం కల్పించారు. బహుశా పవన్ వైపు నుంచి ఏదో ఒత్తిడి వచ్చి ఉండాలి. ఆ తర్వాత సీ.ఎం. రమేష్ ఉదంతంతో చిరంజీవి తన ప్రతిష్టను కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఠాగూర్, రుద్రవీణ వంటి సినిమాలలో చిరంజీవి చేసింది నటనేనని, రియల్ జీవితంలో ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారని అభిమానులంతా అనుకునే పరిస్థితి తెచ్చారు. కాపు సామాజికవర్గం ఒకసారి చిరంజీవిని నమ్మి, తదుపరి పవన్ కల్యాణ్ను నమ్మి మోసపోయిందన్న అభిప్రాయం ఉంది. పవన్ కల్యాణ్ ఇప్పటికీ వారిని మోసం చేయడానికి విశ్వయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పూర్తిగా సరెండర్ అయి జనసేన ఉనికినే నాశనం చేసుకున్న పవన్ కల్యాణ్కు చిరంజీవి మద్దతు ఇచ్చినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. కాంగ్రెస్కు రాజీనామా చేయకుండా బీజేపీకి ఎందుకు సంఘీభావం ప్రకటించారని ఆలోచిస్తే కొందరు ఇది పద్మవిభూషణ్ బిరుదు ఇచ్చినదానికి ప్రతిఫలం అని అంటున్నారు. మరి కొందరు అదే కారణం అయితే కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి బీజేపీలో నేరుగా చేరి ఉండేవారన్నది మరికొందరి భావన. కేవలం సీ.ఎం. రమేష్ను పక్కన కూర్చోబెట్టుకుని ఆయన కోసం వీడియో చేయడం కేవలం వ్యక్తిగత కారణాలే అయి ఉండవచ్చన్నది మరికొందరి భావన. ఏది ఏమైనా చిరంజీవి చేసింది తప్పు. అనైతికం, పరువు కోల్పోయే విషయం అని అంతా ఒప్పుకుంటున్నారు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సీఎం జగన్ హత్యకు పెద్ద కుట్ర.. ‘ఎల్లో బ్యాచ్’పై అనుమానాలెన్నో!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో హత్యాయత్నం జరిగినప్పుడు తెలుగుదేశం స్పందన, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా పిచ్చి రాతలు, నిందితులను పోలీసులు ట్రేస్ చేయడంతో టీడీపీకానీ, వారి మీడియా కానీ మాటలు మార్చిన వైనం చూస్తే కచ్చితంగా ఇందులో ఏదో పెద్ద కుట్రే ఉందన్న అనుమానం వస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అంతా ఒక మాట మీద ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటివాటిని ప్రోత్సహించే విధంగా మాట్లాడరాదు. నిందితులకు మద్దతుగా సానుభూతి వచనాలు చెప్పడానికి యత్నించకూడదు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఒక పదునైన రాయి ద్వారా హత్యాయత్నం నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నిటిని పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ, అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఎక్కువగా కంగారు పడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఖండన తప్ప ఇతరత్రా స్పందించనవసరం లేని వాటిపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్, అచ్చెన్నాయుడు వంటి వారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తొలుత ఖండన చేసినట్లు కనిపించినా, ఆ తర్వాత నాటకం అంటూ ఆరోపించడం ఆరంభించారు. కానీ పోలీసులు కచ్చితంగా ఇది హత్యాయత్నమేనని తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. ఈ ఘటన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని అజిత్ సింగ్ నగర్ వద్ద జరిగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ట్రాక్ రికార్డు అంత సవ్యంగా లేదు. ఆయనపై పలు అభియోగాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి. దానికి తగినట్లే ఆయన అనుచరులే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఇప్పుడు పోలీసుల రిమాండ్లోని అంశాలను బట్టి అర్థం అవుతుంది. ఈ రిపోర్టులో ఇంకా కుట్రదారులదాకా వెళ్లలేదు కానీ, భవిష్యత్తులో ఈ కేసులో కుట్రకు పాల్పడింది ఎవరు అన్న దర్యాప్తు జరుగుతుంది. అప్పుడు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావచ్చు. ప్రస్తుతానికి ఒక నిందితుడు వేముల సతీష్ను పోలీసులు పట్టుకున్న తీరు ఆసక్తికరంగా ఉంది. అజిత్ సింగ్ నగర్ వద్ద ఒక స్కూల్కు, ఒక దేవాలయానికి మధ్య ఉన్న చెట్ల వద్ద ఎవరికి కనబడకుండా ఈ దాడి చేశారు. పొరపాటున ఆ రాయి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కంటికి తగిలి ఉంటే ఏమిటి పరిస్థితి! అంతేకాదు, నవరగంత వద్ద ఆ పదునైన రాయి తగిలి ఉంటే ఇంకెంత ప్రమాదం జరిగేది. అంత పెద్ద గాయం కంటిపైన తగిలితే చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా అది కేవలం గులకరాయి దాడిగా అభివర్ణించడం నీచంగా ఉంది. పవన్ కల్యాణ్ వంటి రాజకీయ అజ్ఞాని ముఖ్యమంత్రికి వేసిన దండలో వచ్చిన రాయి కావచ్చని పిచ్చి వాదన తెచ్చారు. లోకేష్ వంటి పరిణితిలేని వ్యక్తి ఈ రాయిని తాడేపల్లి పాలెస్ నుంచి వచ్చిందని అహంకారపూరిత, కనీసం ఇంగితం లేని వ్యాఖ్య చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా తొలుత అయితే ఇదంతా పోలీసుల వైఫల్యంగా తేల్చాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి విసురుతున్నప్పుడు పోలీసులు ఏమి చేస్తున్నారని, వారు ఎందుకు ఆపలేకపోయారని నిలదీస్తూ వార్తలు రాశారు. అప్పటికి వీరికి ఒక నమ్మకం ఉండి ఉండాలి. ఈ రాయి విసిరిన వ్యక్తులను విజయవాడ పోలీసులు ఎప్పటికి పట్టుకోలేరని భావించి ఉండాలి. అందుకే అంత ధైర్యంగా పోలీసులదే వైఫల్యం అన్నట్లు ప్రొజెక్టు చేసే యత్నం చేశారు. చంద్రబాబు తన సహజ శైలిలో దీనిపై కూడా రెండు నాల్కల ధోరణితో మాట్లాడి తన లక్షణాన్ని మరోసారి బహిర్గతం చేసుకున్నారు. ఇక్కడ కీలకమైన టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. తొలుత ఈ దాడి విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కలిసి ఆడిన డ్రామా అన్నట్లు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అనుమానితులను, నిందితులను పట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయన్న సమాచారం రాగానే మాట మార్చి, అదేదో కావాలని చేసింది కాకపోవచ్చన్నట్లు చెప్పారు. ఆ తర్వాత నిందితుడు అన్నా క్యాంటిన్ ఎత్తివేశారని కోపంతో, తన తల్లికి రోడ్షోకు వచ్చినందుకు ఇస్తానన్న 200 రూపాయలు ఇవ్వలేదన్న కోపంతో రాయి విసిరి ఉండవచ్చని బొండా అన్నారు. అక్కడితో ఆగలేదు. ఈ కేసులో కనుక తనను కూడా ఇరికించాలని చూస్తే జూన్ నాలుగు తర్వాత ఆ పోలీసుల సంగతి చూస్తానని బెదిరించారు. ఇది అచ్చం చంద్రబాబు, లోకేష్ల నుంచి తర్ఫీదు పొందినట్లే మాట్లాడారు. వారు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా, అధికారులను ,ముఖ్యంగా పోలీసులను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ఒక అలవాటుగా చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్న వెంటనే టీడీపీ స్వరం మార్చింది. బీసీ వర్గానికి చెందినవారిని కేసులో పెడతారా అని అచ్చెన్నాయుడు విమర్శించారు. హత్యాయత్నం ఘటనలలో కులం చూసి కేసు పెట్టాలని కొత్త రాజ్యాంగాన్ని వీరు చెబుతున్నారు. అలాగైతే చంద్రబాబుపై అలిపిరిలో నక్సల్స్ దాడి జరిగినప్పుడు కూడా కులం చూసే కేసులు పెట్టారా? ఇక చంద్రబాబు అయితే ఈ కేసులో బొండా ఉమాను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. అసలు కేసు దర్యాప్తే ఒక దశకు రాకుండానే చంద్రబాబుకు ఈ సమాచారం ఎవరు ఇచ్చారు? అంటే ఈ హత్యాయత్నం ఎలా జరిగింది? అందులో ఎవరు ఉన్నారు? ఎవరికి సంబంధించినవారో ముందే తెలుసునని అనుకోవాలి. పోలీసు రిమాండ్ రిపోర్టులో వేముల సతీష్ అనే వ్యక్తి పదునైన రాయి విసిరితే, అందుకు ప్రేరేపించింది మరో వ్యక్తి అని తెలిపారు. ఆ వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలపలేదు. ఈ రెండో నిందితుడు బొండా ఉమా అనుచరులలో ఒక ముఖ్యుడన్న ప్రచారం జరుగుతోంది. లేదా బొండా తన పేరును నిందితులు చెబుతారన్న భయం ఏమైనా ఏర్పడిందా?ఇప్పటికే సతీష్ తాను నేరానికి పాల్పడ్డానని అంగీకరించారు. ఆ తర్వాత అందుకు ఎవరు ప్రోద్బలం చేసింది కూడా చెప్పి ఉంటారు. తీగ లాగితే డొంక కదులుతుందన్న భయం వీరికి పట్టుకుంది. దాంతో వెంటనే పోలీసులను విమర్శించడం ఆరంభించారు. అందుకు ఈనాడు, జ్యోతి వంటి అనైతికంగా మారిన మీడియాను వాడుకున్నారు. ఒక ముఖ్యమంత్రిపై అంత దాడి జరిగితే, సానుభూతి చూపకపోతే మానే, ఏకంగా నిందితులకు మద్దతు ఇచ్చేలా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వారు మాట్లాడుతున్నారు. నిజానికి టీడీపీలో ఎవరికి సంబంధం లేకపోతే, అసలు ఈ అంశం గురించి వారు ప్రస్తావించవలసిన పనే లేదు. కానీ అందుకు భిన్నంగా అతిగా వ్యవహరించి తెలుగుదేశం నేతలు వారికివారే ఆత్మరక్షణలో పడ్డారనిపిస్తుంది. ఈనాడు మీడియా నిందితులు ఉన్న వడ్డెర కాలనీకి వెళ్లి నిందితుల కుటుంబాలు చాలా బాధలో ఉన్నట్లు, వారిని అరెస్టు చేయడం అన్యాయమన్నట్లు వార్తలు ప్రచారం చేశారు. ఘటన జరిగినప్పుడు పోలీసులు వైఫల్యం అని రాసిన ఈ మీడియా ఇప్పుడు పోలీసులు నిందితులను పట్టుకోవడాన్ని తప్పు పడుతోంది. నిందితుడు రాళ్ళు విసరడంలో నేర్పరి అయి ఉండాలి. లేకుంటే ముఖ్యమంత్రి కంటిపై భాగానికి తగిలేలా ఎలా వేయగలుగుతారు? ఇతనికి సహకరించినవారిని కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తన పేరు ఎక్కడ వస్తుందోనని బోండా ఉమ అజ్ఞాతంలోకి వెళ్లినటట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలీసులను బెదిరించారు. నిందితుడు సతీష్ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆశ్చర్యంగా అతనికి అనుకూలంగా వాదించడానికి లాయర్లు వచ్చారు. రోజుకు 250 రూపాయలు సంపాదించుకునే కుటుంబానికి ఇంత పెద్ద లాయర్లను పెట్టుకునే శక్తి ఎక్కడ నుంచి వస్తుందన్నది ప్రశ్న. ఇక్కడ కూడా సరిగ్గా చంద్రబాబు పై వచ్చిన కేసుల్లో వాదించిన రీతిలోనే ఈ లాయర్లు వాదన చేసినట్లు అనిపిస్తుంది. గతంలో చంద్రబాబుకు ఐటి నోటీసులు వస్తే, ఫలానా ఆఫీస్కు జ్యురిస్ డిక్షన్ లేదని సమాధానం ఇచ్చారు. స్కిల్ స్కామ్ కేసులో గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదించారు. ఇప్పుడు వేముల సతీష్ మైనర్ అని చెప్పడానికి ఆయన లాయర్లు యత్నించారు. కానీ పోలీసులు పకడ్బందిగా అతనికి పందొమ్మిదేళ్లని నిరూపించారు. తదుపరి సతీష్ రాయి వేయలేదన్న వాదనకు వెళ్లారు. సీఎంకు వేసిన దండ కర్ర గీసుకుని ఉండవచ్చని వాదించినట్లు అతని తరపు లాయర్ చెప్పారు. జగన్మోహన్రెడ్డితో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కూడా గాయం అయిన సంగతిని విస్మరించారేమో తెలియదు. దండ కర్ర గీసుకుంటే ఒకరికే గాయం అవుతుంది కానీ, ఇద్దరికి అవ్వదు కదా! ఈ లాజిక్ మిస్ అయి మాట్లాడినట్లు అనిపిస్తుంది. మరో సంగతి చెప్పాలి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు హంతకుడు అప్రూవర్గా మారడంతోనే అతనికి బెయిల్ వచ్చేసింది. కానీ ఆ కేసు కుట్రదారులన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి మాత్రం నెలల తరబడి బెయిల్ రావడం లేదు. ఈ కేసుతో ముఖ్యమంత్రి పై జరిగిన హత్యాయత్నం కేసును పోల్చి చూస్తే, రాయి విసిరిన వ్యక్తి సంగతి ఎలా ఉన్నా, వెనుక ఉన్న కుట్రదారులకు కీలక పాత్ర ఉంటుందన్నమాట. కుట్రదారులను పట్టుకుని జైలులో పెట్టాల్సి ఉంటుంది. గతంలో ప్రముఖ నేతలపై జరిగిన హత్యాయత్నం, దాడుల కేసుల్లో నిందితుల తరపున వాదించడానికి లాయర్లు సుముఖంగా ఉండేవారు కారు. కానీ ఇక్కడ సతీష్ రిమాండ్ సమయంలోనే లాయర్లు రావడం విశేషం. మామూలుగా అయితే పోలీసులు కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టగానే రిపోర్టు చూసుకుని న్యాయమూర్తి రిమాండ్కు పంపిస్తుంటారు. కానీ అతని తరపు లాయర్లు రావడంతో వాదోపవాదాలు జరిగాయి. ఈ పరిణామం చూసిన తర్వాత, అతని ఆర్దిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, నిందితుడిని కాపాడడానికి పెద్దప్రయత్నమే జరుగుతోందన్న అనుమానం వస్తోంది. దీనికి కారణం ఆ నిందితుడు విచారణలో తమ పేర్లు చెబితే అది సమస్య అవుతుందన్న భయం కావచ్చు. వీటన్నిటిని చూసిన తర్వాత తెలుగుదేశం నేతలుకానీ, ఎల్లో మీడియా కానీ వ్యవహరించిన వైనం అనుమానాస్పదంగా ఉన్నట్లు అర్ధం అవుతుంది. వారు అతిగా స్పందించడం, గులకరాయి దాడి అని పనికిమాలిన రాతలు రాయడం, నిందితుడిని రక్షించే యత్నం చేయడం ఇవన్నీ గుమ్మడి కాయల దొంగ భుజాలు తడుముకున్నట్లు కనిపించడం లేదూ! - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబూ.. డైలాగులు చెబితే సరిపోదు!
రాష్ట్రాన్ని కాపాడుకోవాలి... ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నాం... ప్రజలంతా ఫ్రస్టేషన్లో ఉన్నారు... ఇవన్నీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న డైలాగులు. ఇవన్నీ పాత డైలాగులే అయినా, కొత్తగా చెబుతున్నట్లు కనిపిస్తుంటారు. వీటిలో ఏ ఒక్కటైనా నిజమేనా అన్నదానికి సమాధానం దొరకదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం అంటే ఏమిటి? ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పనులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయనే కదా.. చంద్రబాబు సొదగా నిత్యం చెప్పేది. ఇక్కడే ఆయనలో బహురూపి కనిపిస్తాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసే పనులన్నీ తాను చేస్తానని అంటారు. కావాలంటే ఇంకా ఎక్కువ సంక్షేమ స్కీములు అమలు చేస్తానని చెబుతారు. మరి అది రాష్ట్రాన్ని నాశనం చేయడం అవ్వదా అంటే జవాబు దొరకదు. అదేమంటే తాము సంపద సృష్టించి ఖర్చు చేస్తామని చంద్రబాబు ఒక పిచ్చి డైలాగు చెబుతారు. అదెలాగో మాత్రం వివరించరు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడితే ఈ నాలుగేళ్లు పూర్తిగా వ్యతిరేకించారు. అనేక నిందలు మోపారు. దానివల్ల రాష్ట్రం నాశనం అయిందని ప్రచారం చేశారు. వలంటీర్లు అంటే ఏమిటి? వారు చేసేది ఏమిటి? మూటలు మోసే ఉద్యోగం. ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు ఆడవాళ్లను ఇబ్బంది పెడతారు! అని చంద్రబాబు విమర్శించేసేవారు. ఈయన దత్తపుత్రుడుగా పేరొందిన పవన్ కల్యాణ్ మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లు ఆడవాళ్లను ట్రాఫికింగ్ చేస్తున్నారని దారుణమైన నీచమైన ఆరోపణ చేశారు. ఇవి విన్నవారికి ఏమినిపిస్తుంది. ఓహో.. చంద్రబాబు, పవన్ కల్యాణ్లు అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థలన్నీ తొలగిస్తారు కాబోలు అనుకుంటే, అందరిని ఆశ్చర్యపరచే విధంగా ప్రకటన చేశారు. తాము వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, పైగా ఇప్పుడు ఇస్తున్న గౌరవ వేతనం ఐదువేల రూపాయలను పదివేల రూపాయలు చేస్తామని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదువేలు ఇస్తే రాష్ట్రం నాశనం అవుతుందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్న చంద్రబాబు ఇప్పుడు రెట్టింపు వేతనం ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడతానంటే జనం ఎవరైనా నమ్ముతారా! గతంలో 2014లో లక్ష కోట్ల రుణాల మాఫీ చేస్తానని అంటే చంద్రబాబును నమ్మి ఓటేసిన వారిని ఎలా నట్టేట ముంచింది తెలిసిన వారంతా ఆయన ఏదో ఒకటి ఇలాగే చెబుతారులే అని సరిపెట్టుకుంటున్నారు. అసలు విశ్వసనీయతతో నిమిత్తం లేకుండా మాట్లాడడం అంటే ఇది. వైఎస్ జగన్మోహన్రెడ్డి వృద్దాప్య పెన్షన్లను రెండువేల నుంచి మూడువేల రూపాయలకు పెంచితే రాష్ట్రం నాశనం అయినట్లు కదా! ఆ మాట నేరుగా చెప్పకపోయినా, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారనే కదా చంద్రబాబు చెబుతూ వస్తోంది. మరి తాను అధికారంలోకి వస్తే నాలుగువేల రూపాయల పెన్షన్ ఇస్తానని అంటున్నారు. అది బొంకడమా? కాదా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అలాంటి హామీనే ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. అలాగే చంద్రబాబు కూడా పొరపాటున అధికారంలోకి వస్తే అలాగే చేస్తారని చెప్పడంలో ఎలాంటి సంశయం ఉండదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు చేయూత స్కీమ్ కింద ఏడాదికి 18750 రూపాయలు ఇస్తుంటే రాష్ట్రం పాడైపోతోందని చంద్రబాబు బృందం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఆయన మీడియా ప్రచారం చేసింది. చిత్రంగా సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన వాగ్ధానాలలో ప్రతి మహిళకు 1500 ఇస్తానని అంటున్నారు. అప్పుడు రాష్ట్రం పాడవదా? అంటే సమాధానం ఉండదు. అమ్మ ఒడి కింద స్కూల్కు వెళ్లే పిల్లల కోసం పదిహేను వేలు ఇస్తానంటే డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారని పరోక్షంగా ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు అదే స్కీమ్కు తల్లికి వందనం పేరుతో ప్రతి కుటుంబంలో ఎందరు పిల్లలు ఉంటే అందరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. అక్కడితో ఆగలేదు. సంసారాలు చేసుకునేవారంతా ఎక్కువ మంది పిల్లలను కనాలని ఒక దిక్కుమాలిన సలహా ఇస్తున్నారు. రైతు భరోసా కింద వైఎస్ జగన్మోహన్రెడ్డి 13500 ఇస్తుంటే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నది వీరి మనసులో మాట. కానీ 2024 ఎన్నికలలో రైతులను మోసం చేయడానికి ఏకంగా ఇరవైవేల చొప్పున ఇస్తానని అంటున్నారు. గతంలో రుణమాఫీ చేస్తానని చెప్పి జనాన్ని ఆ తర్వాత ఆశపోతులన్నట్లుగా ఇప్పుడు మాత్రం దూషించరని గ్యారంటీ ఏమైనా ఉందా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా అనేది ఆయనే.వలంటీర్ల సేవలను నిమ్మగడ్డ ద్వారా నిలుపుదల చేయించిన తర్వాత లక్షన్నర మంది సచివాలయ ఉద్యోగాలు చేస్తున్నారు కదా! అని చెప్పింది చంద్రబాబే! ఇవన్నీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కదా ఇచ్చింది. ఇంతకీ ఏ రకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరికి అర్దం కాదు. పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ రకంగా బాగు చేసింది చెప్పరు. తాను ఇన్ని పోర్టులు నిర్మింప చేశానని చెప్పే పరిస్థితి చంద్రబాబుకు లేదు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు పోర్టులను నిర్మిస్తున్న ఘనత పొందారు. అవే కాదు. ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ లాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నది వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే కదా! అయినా రాష్ట్రం నాశనం అయిందని అంటారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని నిర్మించడం, 800 గ్రామాలకు వాటర్ స్కీమ్ అమలు చేయడం రాష్ట్రాన్ని పాడు చేయడమా? లేక తన పద్నాలుగేళ్ల పాలనలో ఆ ఆస్పత్రి నిర్మించని చంద్రబాబు రాష్ట్రాన్ని పాడు చేసినట్లా? రాజధాని అమరావతి పేరుతో మూడు పంటలు పండే భూములను సమీకరించి పంటలు లేకుండా చేసిన చంద్రబాబు విధ్వంసానికి పాల్పడినట్లా? కాదా! అన్ని హంగులు ఉన్న విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని చేయడం ద్వారా లక్ష కోట్లు ఆదా చేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పు చేసినట్లా!ప్రతిదానికి ఒక సినిమా డైలాగు మాదిరి చెప్పి జనాన్ని తప్పుదారి పట్టించాలని అనుకుంటే ప్రజలు పిచ్చివాళ్లు కాదు. విజయవాడలో కృష్ణానదికి రిటైనింగ్ వాల్ను నిర్మించడం ద్వారా వేలాది మందిని వైఎస్ జగన్మోహన్రెడ్డి రక్షిస్తే రాష్ట్రం ఏ రకంగా నాశనం అవుతుంది? మరి అదే పని చంద్రబాబు తన పాలనలో ఎందుకు చేయలేకపోయారు? బడులకు రంగులేస్తే సరిపోతుందా అని అంటారు. మరి తన హయాంలో వాటిని బాగు చేయడానికి ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు చేయలేదో చెప్పరు. ఆస్పత్రులను వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగు చేస్తే రాష్ట్రం పాడైందట. చంద్రబాబు పట్టించుకోకుండా ఉంటే అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగం జరిగినట్లా? ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక స్థాయిలో అవసరం లేదని అంటారు. అలాంటప్పుడు తన కొడుకును, మనుమడిని ఎందుకు తెలుగు మీడియంలో చదివించడం లేదంటే మాత్రం నోరు పెగలదు. ప్రైవేటు స్కూళ్లలో మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండవచ్చు. ప్రభుత్వ స్కూళ్లలో ఉంటే తప్పని చెబుతున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలను కాపాడతారట. ముప్పైఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తుంటే రాష్ట్రం పాడైపోయినట్లు.. తన హయాంలో ఒక్క ఇల్లు కట్టకుండా ఉంటే రాష్ట్రాన్ని బాగు చేసినట్లా? పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి నిర్మాణాలు చేస్తుంటే రాష్ట్రం ఎలా నాశనం అవుతుందో తెలియదు. చంద్రబాబు టరమ్లో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాకపోయినా, రాష్ట్రాన్ని బాగా అభివృద్ది చేసినట్లు! ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి అడ్డగోలు మీడియాను అడ్డం పెట్టుకుని పడికట్టు డైలాగులు చెబితే సరిపోదు. స్పష్టంగా ఏ రకంగా రాష్ట్రం నష్టపోతోంది చెప్పి, ఆ తర్వాత తాను ఏమి చేస్తానో చెప్పగలిగితే ఆలోచించవచ్చు. కేవలం ప్రజలను భ్రమలలో పెట్టాలన్న దృష్టితోనే ఇలాంటి మాటలు చెబితే ప్రజలు ఎవరు అభివృద్ది చేసేది, ఎవరు చేయనిది అర్ధం చేసుకోగలరు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘‘రాళ్లతో కొట్టండి.. మసి చేయండి!’’.. ఇంత జరిగినా మారని బాబు తీరు
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక ప్రచార సభలో మాట్లాడుతూ ఏమన్నారో గమనించారా! తనకు ప్రత్యర్ధిగా ఉన్న వేరే పార్టీ నేతను రాళ్లతో కొట్టండి అని చెబుతున్నారు. పైగా ఆ నేతను ఉద్దేశించి దున్నపోతు అని కూడా సంబోధిస్తున్నారు. మరో సందర్భంలో ఏమన్నారంటే తమ్ముళ్లూ మనం కొట్టే దెబ్బకు వైఎస్ జగన్మోహన్రెడ్డి మసి అయిపోవాలి.. తెలుగుదేశం కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుంది అని కూడా ఆయన చెప్పారు. దీనిని బట్టి ఏమి అర్దం అవుతుంది. టీడీపీ కార్యకర్తలు ప్రత్యర్దులపై రాళ్లతో దాడి చేయాలనే చెప్పడమే కదా! వైఎస్ జగన్మోహన్రెడ్డిను పట్టుకుని అంతమాట అన్నారంటే మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది కదా! ఈ వీడియోని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు చూపించారు. ఇవి విన్న తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది. చంద్రబాబు మాటలకు రెచ్చిపోయిన ఎవరో టీడీపీ దుండగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి విసిరారని వైఎస్సార్సీపీ వారు అనుకోవడంలో తప్పు ఏమి ఉంటుంది? ఆ అనుమానం నిజమా? కాదా? అన్నది పోలీసులు నిర్ధారిస్తారు. ప్రాథమికంగా చూస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డికు రాజకీయంగా ఉన్న ప్రధాన ప్రత్యర్ధి పార్టీపైనే సందేహాలు వస్తాయి. దానికి తగినట్లుగానే ఈ ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు స్పందించిన తీరు కూడా పలు సంశయాలు కలిగిస్తుంది. చంద్రబాబేమో కొంత తెలివిగా దాడిని ఖండిస్తూ నిష్పాక్షిక విచారణ చేయించి నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్య తీసుకోవాలని కోరారు. అంటే దాని అర్దం ఏమిటి? ఇది దుండగులు చేసిన పని అయినా, అధికారులను తప్పు పట్టే రీతిలో ఆయన మాట్లాడారు. ఓకే! అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరడం తప్పుకాదు. కానీ అందులో కూడా అంతర్లీనంగా మొత్తం నెపాన్ని పోలీసులపై నెట్టేసి, రాయి వేసిన వారిని కాపాడాలన్న భావన ఆయనలో ఉన్నట్లు అనిపించదా! మరుసటి రోజుకు మాట మార్చి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వచ్చి పడింది గులకరాయి అని నీచ ప్రచారం ఆరంభించారు. చంద్రబాబు అలా మాట్లాడితే అధికారిక ఎక్స్లో తెలుగుదేశం పార్టీ చేసిన వ్యాఖ్య దారుణంగా ఉంది. "కమలాసన్" అంటూ ఎద్దేవ చేస్తూ ఇదంతా డ్రామా అన్నట్లుగా వ్యాఖ్యానించింది. దీనికి ,చంద్రబాబుకు సంబంధం ఉండదా? అంటే.. కచ్చితంగా ఉంటుంది. ప్రతి దానిలోను ఆయన డబుల్ గేమ్ ఆడుతుంటారు. అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం అయినా, వలంటీర్ల సంగతి అయినా, మోదీ, సోనియాలపై వ్యాఖ్యలు అయినా ఎప్పటికి ఏది అవసరమైతే అది మాట్లాడి యుటర్న్ తీసుకోవడం ఆయనకు సర్వసాధారణం. చంద్రబాబు దాదాపు పద్నాలుగేళ్లపాటు సీఎంగా ఉన్నారు. పదిహేనేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంత సీనియర్ ఎంత మర్యాదగా, ఎంత హుందాగా ఉండాలి! కానీ తన రాజకీయ స్వార్దం ముందు ఆయనకు అవేవి అక్కర్లేదు. అదే తనను ఎవరైనా పొరపాటున ఏమైన అంటే మాత్రం అమ్మో.. నన్ను అన్నారు.. నేను ప్రజల కోసం పడతాను అంటూ డ్రామా రక్తి కట్టిస్తారు. ఆయనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర ఎల్లో మీడియా అంతా తబలా వాయిస్తాయి. ఆయన మాత్రం ఎదుటి వ్యక్తిని ఎంత మాట పడితే అంత అనేస్తారు. కొన్నిసార్లు అసలు ఈయన మతి ఉండి మాట్లాడుతున్నారా అన్న సంశయం కూడా వస్తుంది. టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద జరిగిన దాడిని డ్రామాగా అభివర్ణిస్తూ ప్రకటనలు చేశారు. కోడికత్తి-2 అంటూ వ్యంగ్య వ్యాఖ్యనాలు చేశారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏకంగా ఆ రాయి తాడేపల్లి పాలస్ నుంచి వచ్చిందంటూ ఒక పిచ్చి వ్యాఖ్య చేసి తన రాజకీయ అపరిపక్వతను, పిల్ల చేష్టను తెలియచేసుకున్నారు. జనసేన నేత నాగబాబు మాత్రం తొలుత అభ్యంతర వ్యాఖ్య చేసి తదుపరి దానిని తీసివేసి పద్దతిగా ఖండించారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు.. ఏ నాయకుడి మీద ఎలాంటి దాడి జరిగినా, ముందుగా అంతా ఖండించాలి. తమ పార్టీపై ఏదైనా ఆరోపణ వస్తే అది నిజం కాకపోతే అంతవరకు చెప్పవచ్చు. మరి అధికార పార్టీ తమపై ఆరోపణ చేయవచ్చా అని ఎవరైనా అడగవచ్చు. ఇప్పుడు వైఎస్సార్సీపీ బాధిత స్థానంలో ఉంది. తన అనుమానాన్ని వెల్లడించింది. అందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. పోలీసుల దర్యాప్తులో ఇలాంటివన్నీ తేలే అవకాశం ఉంటుంది. అంతెందుకు! ఏపీలో ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డా, వారిలో ఒకరిని వైఎస్సార్సీపీ పార్టీ అని పులిమి ఈనాడు మీడియా ప్రచారం చేయడం లేదా? రాష్ట్రంలో జరిగే చిన్న నేరమైనా, పెద్ద నేరమైనా, దానిని వైఎస్సార్సీపీకి అంటకట్టే విధంగా అది వైఎస్సార్సీపీ నేతల పనే అనుకుంటున్నారని ఈనాడు మీడియా ఎందుకు నిర్లజ్జగా రాస్తోంది. దానిని తప్పు అని తెలుగుదేశం వారు అనడం లేదే! పైగా ఈనాడు మీడియా వాగడం, టీడీపీ ప్రచారానికి పెట్టడం, రాష్ట్రంలో ఏదో అయిపోయిందన్న తప్పుడు భావన కలిగించే యత్నం చేయడం నిత్యకృత్యం అయిందే. అందువల్ల వైఎస్సార్సీపీ నేతలు తమకు ఉన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానికి ఆధారంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ వంటివారు తన ప్రసంగాలలో చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియోలను చూపిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు వైఎస్సార్సీపీవారిని బట్టలూడదీసి కొడతాం అని ఎన్నిసార్లు అన్నారో గుర్తు చేసుకోండి. అందువల్లే టీడీపీ అభిమాని లేదా, కార్యకర్త, లేదా మూర్ఖుడు ఎవరైనా మానసికంగా పర్వర్ట్ గా మారి ఇలా దాడి చేశారు అన్న అభిప్రాయం కలగదా! గతంలో ఏ ముఖ్యమంత్రికి రాని విధంగా విజయవాడ నగర వీధులలో వేలాది జనం తండోపతండాలుగా తరలి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డికు మద్దతు ప్రకటిస్తుంటే చూసి ఓర్వలేనివారు ఇలాంటి ఘాతుకానికి పాల్పడినట్లు అర్థం అవడం లేదా!రాయలసీమలో ఆరంభం అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్ యాత్ర మొదటి నుంచి ఒక రికార్డు స్థాయిలో జనాదరణ పొందుతోంది. రాయలసీమ ఆయనకు బాగా పట్టుఉన్న ప్రాంతం కనుక వచ్చారులే అనుకుంటే గుంటూరు, విజయవాడ ప్రాంతాలలో అదే స్థాయిలో జనం రావడం టీడీపీ వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. దాంతో వారికి మైండ్ బ్లాంక్ అయింది. ఇంతవరకు తమకు కూడా విజయావకాశాలు ఉంటాయని ఆశతో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి నిరాశ ఆవరించే పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి బలహీనవర్గాలవారు, మహిళలు, పిల్లలు వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్ యాత్రలో పాల్గొని ఆయనకు సంఘీబావం ప్రకటిస్తున్న వైనం వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. గతంలో ఏ ముఖ్యమంత్రికి ఐదేళ్ల పాలన తర్వాత ఈ స్థాయిలో ఇలాంటి జన స్పందన రాలేదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున జనం వీదులలోకి వచ్చి స్వాగతం చెప్పారు. కానీ ఏడేళ్ల పాలన తర్వాత ఎన్టీఆర్ జనంలోకి వెళితే స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది. ఆయన 1989లో తొలుత ఉమ్మడి ఏపీలో మేడ్చల్ వద్ద సభ పెడితే కేవలం కొద్ది వందల మంది మాత్రమే సభకు వచ్చారు. అప్పుడే టీడీపీ ఆ ఎన్నికలలో ఓడిపోతుందని అర్దం అయింది. చివరికి ఎన్టీఆర్ సైతం కల్వకుర్తిలో ఓటమి చెందారు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయం చూస్తే ఆయనేమీ సినీ నటుడు కాదు. పెద్ద అందగాడు కాదు. గొప్ప వక్త అని కూడా చెప్పలేం. కానీ తాను చెప్పదలచుకున్నది ప్రజలకు అర్దం అయ్యేలా స్పష్టంగా చెబుతూ, ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ స్పీచ్ ఇస్తుంటారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో తీసుకువచ్చినన్ని సంస్కరణలు మరే సీఎం తీసుకురాలేదన్నది పచ్చి నిజం. అలాగే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి కూడా ఈయనే. ఇన్ని అభివృద్ది పనులు చేపట్టింది కూడా జగనే. వీటన్నిటి ఫలితమే ఐదేళ్ల పాలన తర్వాత స్వచ్ఛందంగా ప్రజలు ఆయనను చూడడానికి తరలివస్తున్నారు. దీనిని గమనించే చంద్రబాబు నాయుడు తాను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి మాదిరే చేస్తానని చెప్పవలసి వచ్చింది. ఒకదఫా సీఎంగా జగన్ పాలనను.. డెబ్బై ఐదేళ్ల వృద్దుడు అయిన చంద్రబాబు తాను కూడా కొనసాగిస్తానని చెప్పడమే పెద్ద విజయం కాదని ఎవరైనా అనగలరా! వలంటీర్ల మొదలు, అమ్మ ఒడి వంటి స్కీముల వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డినే చంద్రబాబు ఫాలో అయ్యే పరిస్థితి రావడమే ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుభూతి కోసం నాటకాలు ఆడవలసిన అవసరం లేదని తేటతెల్లం అవుతోంది. టీడీపీ వారు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే వారి కంగాళీతనం బయటపడుతోందన్నమాట. గత ఎన్నికల ప్రచారం సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో ఒక కత్తితో ఒక యువకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి చేశాడు. అప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు అంతకన్నా పెద్ద ప్రమాదమే తప్పిందని అనుకోవాలి. ఎందుకంటే ఎయిర్ గన్ లేదా కాట్ బాల్ పంగలకర్ర వంటి దానితో రాయి లేదా పెల్లెట్ పెట్టి కొట్టి ఉండాలి. అందువల్లే అంత పదునుగా గాయం అయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటి పై భాగాన తగిలి గాయం అయింది. అదే పొరపాటున నవరగంత వద్ద తగిలి ఉంటే ఎంత ప్రమాదమో ఊహించుకోవడమే కష్టం. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఆయన ప్రాథమిక చికిత్స తీసుకుని మళ్లీ జనానికి అభివాదం చేస్తూ వెళ్లారు. జనం ఆయన బస్ వెంట పరుగులు తీస్తూ అన్నా.. ఆరోగ్యం జాగ్రత్త.. అని చెప్పారంటేనే ఆయనపై వారిలో ఎంత ప్రేమ ఏర్పడిందో తెలుస్తుంది. అంతగా ప్రజలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి కనెక్ట్ అయ్యారని అర్దం. సానుభూతి కోసం ఎవరైనా కన్ను పోగొట్టుకుంటారా? ప్రాణం పోగొట్టుకుంటారా? ఇంత నీచంగా మాట్లాడతారా? 2003లో చంద్రబాబు నాయుడు తిరుమల వెళుతుండగా, అలిపిరి వద్ద బాంబులు పేలాయి. ఆయన అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు. అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా పరామర్శకు వెళ్లి, తిరుపతిలో ఈ దాడికి నిరసనగా దీక్ష చేశారు. ఆ రోజు ఆయన అంత హుందగా ఉంటే, ఈరోజున తెలుగుదేశం పార్టీ ఇంత ఘోరంగా వ్యవహరించింది. అప్పుడు అదంతా నక్సల్స్ పని అని పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చారు కానీ, పోలీసుల నిర్లక్ష్యం అంటూ డైవర్ట్ చేసే యత్నం చేయలేదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం కానీ, ఆ పార్టీ మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి మొత్తం నెపాన్ని పోలీసులపై నెట్టేసి, దుండగులను కాపాడే యత్నం చేయడం దుర్మార్గంగా కనిపిస్తుంది. నిజానికి ఇలాంటి ఘటనలు సృష్టించడంలో కానీ, సానుభూతి డ్రామాలు ఆడడంలో కానీ టీడీపీకి ఉన్న అనుభవం తక్కువేమీ కాదు. అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్.బి స్టేడియంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్పై మల్లెల బాబ్జి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అదంతా చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన డ్రామా అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మల్లెల బాబ్జి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అలిపిరి బ్లాస్ట్ తర్వాత చాలా రోజులు చంద్రబాబు కట్టు కట్టుకుని తిరిగే వారు. సానుభూతి వస్తుందని అనుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ క్రమంలో చంద్రబాబు ఒక్కోసారి ఒక్కో చేతికి కట్టు తగిలించుకుంటున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత రోశయ్య గమనించి, నిమ్స్ డాక్టర్లను ఉద్దేశించి చమత్కారంగా ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబుకు పొరపాటున ఒక చేతికి బదులు మరో చేతికి కట్టు తగిలిస్తున్నారని అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు కట్టు లేకుండానే తిరిగారు. ప్రజలలో అలజడి కోసం ఎలాంటి అశాంతి నైనా సృష్టించాలన్నది చంద్రబాబు విధానంగా ఉంటుందని పలువురు టీడీపీ నేతలు చెబుతుంటారు. మాజీ మంత్రి పరిటాల రవి హత్యకు గురైనప్పుడు జిల్లాలకు ఫోన్లు చేయించి బస్లు దగ్దం చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. బంద్ అంటే బస్ల అద్దాలు పగలకొట్టడమో, బస్లు దగ్ధం చేయడమో జరగకపోతే ఎలా అని.. ఈ చంద్రబాబు అంటారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో కూడా ప్రస్తావించారు. అమిత్ షా పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు నల్ల బెలూన్లు సెక్యూరిటీకి విఘాతం కలిగించేలా ఎగురవేశారు. పుంగనూరు, ఆంగళ్లు వద్ద టీడీపీ కార్యకర్తలను దాడులు చేయాలని రెచ్చగొట్టారు. టీడీపీ కార్యకర్తలు పోలీసు వ్యాన్ దహనం చేయడమే కాకుండా, రాళ్లు విసరడంతో ఒక పోలీసు కానీస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఇదంతా చంద్రబాబు నైజం అని అంతా తెలుసుకున్నారు. రాజమండ్రి, కందుకూరు, గుంటూరులలో తన వల్ల తొక్కిసలాట జరిగి అనేక మంది తెలిసినా, మొత్తం పోలీసులపై తోసేసి చంద్రబాబు తప్పించుకున్నారు. ఆయన కుట్రదారుడిగా ముద్ర పొందినా, దానిని కనిపించనివ్వకుండా, రామోజీ, రాధాకృష్ణ వంటి మీడియా ప్రముఖులు కవర్ చేసేసి చాలా పవిత్రుడుగా చూపించే యత్నం చేస్తుంటారు. అయినా కొన్నిసార్లు దొరికిపోతుంటారు. అందుకు ఉదాహరణే తాజాగా రాళ్లతో కొట్టండి.. మసి చేయండి అని అన్న చంద్రబాబు వ్యాఖ్యల వీడియోలు. సోషల్ మీడియా రాబట్టి ఈ మాత్రం అయినా ప్రజలకు తెలుస్తోంది. లేకుంటే ఎల్లో మీడియా ప్రజలను ఎప్పటికి మోసం చేస్తూనే ఉండేది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడిని పక్కదారి పట్టించడానికి టీడీపీ కూటమి ఏదైనా ప్లాన్ చేస్తుందా అన్న డౌటు కూడా చాలమందిలో ఉంది. అనుకున్నట్లే ఆదివారం సాయంత్రానికి తనపైన రాళ్లు పడ్డాయని చంద్రబాబు సీన్ సృష్టించారు. అది నిజమా? కాదా? అన్నది తేలవలసి ఉంటుంది. పవన్ కల్యాణ్పై కూడా దాడి జరిగిందని చంద్రబాబు చెప్పేశారు. తీరా చూస్తే పవన్ కల్యాణ్పై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం అయింది. దీనిని బట్టే వీరు ఎలా ప్రవర్తిస్తున్నది అర్థం కావడం లేదా! అందువల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులు అనండి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు అనండి.. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా సంయమనంతో వ్యవహరించారు. తన నొప్పిని భరిస్తూ జనంతో మమేకం అయిన తీరు అభినందనీయం. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పురంధేశ్వరి మాటల తూటాలతో.. మూడు పార్టీల్లో అయోమయం!
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఒక ప్రకటన అందరిని ఆశ్చర్యపరచింది. మూడు పార్టీలదీ ఒకటే ఎజెండా అని ఆమె అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని దించడమేనని ఆమె చెప్పారు. ఇదా ఎజెండా అంటే అని ఒరిజినల్ బీజేపీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. టిక్కెట్ల విషయంలో వ్యక్తం అవుతున్న నిరసనలు, పార్టీల మధ్య అవగాహన కుదుర్చుకోవడంలో ఒక ప్రాతిపదిక లేని వైనంపై కొందరు అసహనం చెందుతున్న తీరు కానీ పార్టీ ప్రతిష్టను బజారుకీడ్చాయి. వాటికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న పురందేశ్వరి ఎలాగోలా తాను ఎంపీగా గెలిస్తే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఛీప్ సెక్రటరీ, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు పార్టీ టిక్కెట్ల కేటాయింపుపై తెలిపిన నిరసన సహజంగానే పార్టీలోని అయోమయ పరిస్థితిని బహిర్గతం చేసింది. "ఆదోనిలో బీజేపీకి పట్టుంది. మిగిలిన ఏడు స్థానాలు ఏ ప్రాతిపదిక మీద బీజేపీకి కేటాయించారో అర్థం కావటం లేదు. ముందే అక్కడ ఎవరు బీజేపీ తరఫున పోటీ చేయాలనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయించి తర్వాత బీజేపీ కేటాయించారా అనే అనుమానం చాలామంది బీజేపీ వారికి కలుగుతున్నది." అని ఆయన అన్నారు. దీనికి పురందేశ్వరి వద్ద జవాబు ఉన్నదా? గతంలో తీవ్ర వైరం ఉన్నా, రాజకీయ పదవులపై ఉన్న ఆశతో ఇప్పుడు పురందేశ్వరి తన మరిది, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజీపడి రాజకీయం చేస్తున్నారు. దీనివల్ల ఆమె ప్రతిష్ట మసకబారుతున్నా, పట్టించుకునే దశలో లేరు. పైగా మూడు పార్టీల కూటమిని ఆమె త్రివేణి సంగమం అని అంటున్నారు. ఈ కూటమిలో ప్రధాన భాగస్వామి టీడీపీ కానీ, ఆ తర్వాత జనసేన కానీ ఈ కూటమిని పవిత్ర సంగమం అని భావించడం లేదు. తప్పనిసరి తద్దినం అని చంద్రబాబు మాటల్లో ఇప్పటికే వ్యక్తం అయింది. ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, కేసులకు ఉపయోగపడతారులే అని తప్ప వేరే లక్ష్యం లేదని ఆయన ఓపెన్ గానే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ను బీజేపీ నేతలు ఈ పొత్తు విషయంలో ఎందుకు చీవాట్లు పెట్టారో ఎవరూ వివరించలేదు. ప్రధాని మోడీ ఏపీ ప్రచార సభకు వచ్చి ఏమైనా కొత్త హామీ ఇచ్చారా అంటే అదీ లేదు. ఇష్టం లేని పెళ్లికి వచ్చినట్లు వచ్చి వెళ్లారు. కానీ పురందేశ్వరి మాత్రం ఒకటే ఎజెండా అని చెబుతున్నారు. ఏదైనా పార్టీల మధ్య పొత్తు పెట్టుకోవడానికి ఒక కామన్ ఎజెండా ఉండాలి. దానిపై ముందుగానే చర్చలు జరిపి ఒక ప్రకటన చేయాలి. అలాంటిది ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కాళ్లా, వేళ్లా పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పటికే టీడీపీ పక్షాన ఆయన సూపర్ సిక్స్ అని కొన్ని వాగ్దానాలను ప్రకటించారు. వాటన్నిటిని బీజేపీ ఆమోదిస్తుందా? అన్నది ఆమె చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటటీలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అవన్నీ ఆచరణ సాద్యం కానీ హామీలని ప్రచారం చేసింది. అలాంటిది ఏపీలో అంతకు మించి టీడీపీ హామీలు ఇచ్చింది. వాటన్నిటిని కామన్ ఎజెండాలో పెడతారా? 2014లో మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ల ఫోటోలతో కొన్ని హామీలు ఇచ్చారు. నిజానికి అవన్నీ టీడీపీ ప్రకటించినవి. కానీ కరపత్రంపై మోడీ పోటో కూడా ఉండడంతో బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి వచ్చింది. కానీ బీజేపీ నేతలు రైతు రుణమాఫీ వంటి కొన్ని హామీలు తమకు సంబంధం లేనివని ఆ తర్వాత చెప్పేవారు. ఇప్పుడు కూడా ఎన్నికల వరకు కామన్ ఎజెండా అని ప్రచారం చేసి, ఆ తర్వాత ఎవరికి వారు తమది కాదని చేతులెత్తేస్తే ఎవరు బాద్యత వహిస్తారు. అంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు ఎవరికి తోచిన హామీలు అవి ఇచ్చి తర్వాత తమకు సంబంధం లేదని ప్రజలను మోసం చేస్తారా? ప్రత్యేక హోదాపై చంద్రబాబు పలుమార్లు మాట మార్చారు. గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీపై మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఆయన హోదా విషయంలో తన తాజా వైఖరి ఏమిటో చెప్పలేదు. బహుశా ప్రత్యేక హోదా వంటి అంశాలను డిమాండ్ చేయవద్దని బీజేపీ కండిషన్ పెట్టిందేమో తెలియదు. ఎందుకంటే ఆయన దీనిపై బీజేపీని ప్రశ్నించకుండా, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిను విమర్శిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా తేలేదని చెబుతున్నారు. మరి ఈ అంశంలో బీజేపీ స్పందిస్తుంందా? రైతుల రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీకి చంద్రబాబు హామీ ఇచ్చినప్పుడు కామన్గా అంతా కలిపి ప్రచారం చేసుకున్నారు. కానీ అమలు టైమ్ వచ్చేసరికి చంద్రబాబు కేంద్రం సహకరించడం లేదని విమర్శించేవారు. అలాగే బీజేపీ తాము ఇలాంటి హామీలను సమర్ధించబోమని చెప్పేది. బీజేపీ వారు కోరితేనే తాను పొత్తు పెట్టుకున్నానని ముస్లింల సమావేశంలో చంద్రబాబు చెప్పిన విషయంపై పురందేశ్వరి ఇంతవరకు వ్యాఖ్యానించకపోవడం కూడా సహజంగానే విమర్శలకు దారి తీస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిన ముస్లిం రిజర్వేషన్ లను చంద్రబాబు కూడా కొనసాగించారు. ఇప్పుడు కూడా ముస్లింలను రక్షించింది తానే అని అంటున్నారు. దీనికి సంబందించి ఇద్దరి మద్య వైరుధ్యాలు ఉన్నాయా. ఒక కామన్ ఎజెండా పెట్టుకుంటారా. చంద్రబాబుతో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిస్తారా? గతంలో అనేక అంశాలలో బీజేపీని చంద్రబాబు తీవ్రంగా దుయ్యబట్టారు. వాటన్నిటిలో ఎవరు రాజీపడ్డారు? టీడీపీనా? లేక బీజేపీనా? త్రిబుల్ తలాఖ్ను కేంద్రం రద్దు చేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ముస్లింలను అరెస్టు చేయడానికే బీజేపీ కుట్ర అని ఆయన ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన తన వైఖరి మార్చుకున్నారా?లేక బీజేపీనే ఏపీ వరకు చంద్రబాబు కోసం తన సిద్దాంతాన్ని వదలుకుందా? ఇన్ని వైరుద్యాల మధ్య పవిత్ర పొత్తుగా బీజేపీ అధ్యక్షురాలు భావించి ఏకంగా త్రివేణి సంగమంగా అభివర్ణించడం ప్రజలను మోసం చేసే యత్నమే అని చెప్పాలి. మన దేశంలో అనేక నదులు కాలుష్యంతో నిండిపోయాయి. త్రివేణి సంగమం పరిస్థితి కూడా అంతే.అలాగే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు కూడా అనైతికం, అపవిత్రం. కేవలం అధికార కాంక్షతో, పదవీ లాలసతో ప్రజలను మోసం చేయడానికి ఈ మూడు పార్టీలు ప్రజల ముందుకు వస్తున్నాయి. వారికి చిత్తశుద్ది ఉంటే 2014లో తమ కూటమి ఏమి చెప్పింది? ఏమి చేసింది? ఎందుకు విడిపోయింది? ఎందుకు మళ్లీ ఇప్పుడు కలుస్తున్నది? పార్టీల మద్య ఉన్న వైరుద్యాలను ఏమైనా పరిష్కరించుకున్నారా?... మొదలైనవాటి గురించి స్పష్టత ఇచ్చి, ఆ తర్వాత కొత్త హామీలపై ఒక అవగాహన వచ్చామని ప్రజలకు చెప్పగలగాలి. లేకుంటే వీరికి కామన్ ఎజెండా ఏమీ లేదన్న సంగతి ప్రజలకు బాగానే అర్దం అవుతుంది. ఒకరిని దించడానికి కూటములు కట్టడం కాదు. తాము ప్రజలకు ఏమి చేస్తామో చెప్పగలిగితేనే ప్రజలు నమ్ముతారు? ఏపీలో ఏర్పడిన కూటమికి ఆ లక్షణం లేదు. పరస్పర అవసరాల కోసం ఏర్పడిన ఈ కూటమి, గతంలో మాదిరే ఎన్నికల తర్వాత ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా ప్రజలను మోసం చేయరన్న గ్యారంటీ ఏముంది? - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019